పుట:2015.386124.adhiqs-eipa-shatakamulu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేంకటకవి

కోలంక మదనగోపాలశతకము

పోలిపెద్ది వేంకటరాయకవి సమకాలికులలో వంకాయలపాటి వేంకటకవి పేర్కొనదగినవాడు. ఈతడు రచించిన మదనగోపాలశతకము అనుకరణప్రధానమైనను కొన్ని విశిష్ట లక్షణములు కలది. బహుళ ప్రచారము నొందిన శతకములలో ఇది ఒకటి. వావిళ్ళవారు 1928లో ప్రకటించిన ఈ శతకములో 88 పద్యములు మాత్రమే కలవు. వేంకటకవి నియోగి బ్రాహ్మణుడు. గౌతమగోత్రుడు. పంచాక్షరీమంత్రోపాసకుడు. గోదావరి మండలము నందలి కోలంకనివాసి. పందొమ్మిదవ శతాబ్ది ఉత్తరార్ధములో జీవించినట్లు శతకమునందలి వస్తువు ననుసరించి తదితరాధారముల ననుసరించి ఊహింపవచ్చును.

భక్తి, నీతి, శృంగార భావములు — సజ్జన దుర్జన లక్షణములు — రాజుల క్రూరవర్తనము — దుష్టచిత్తవృత్తి — కలియుగధర్మములు — సాంసారికజీవనము — కవుల మనస్తత్వము మున్నగు ఆంశము లీశతకమున అధిక్షేపధోరణిలో వ్యక్తీకరింపబడినవి. వ్యక్తీకరణవిధానము కూడ కొంతవరకు విశిష్టమైనది.

ప్రభువులకు అధికారులకు వ్యక్తులకు వారి దుర్వృత్తిని ఈ కవి ఆక్షేపించిన రీతుని పరిశీలించినపుడు ఆతడు వ్యక్తిగతముగ కొందరి వలన అనాదరము నొంది యుండునని అనుమానము కలుగును. వేంకటకవి ఎచటను ఆ వ్యక్తులను పేర్కొనలేదు. వారి దుశ్చర్యలను మాత్రమే సామాన్యీకరించి శతకము రచించెను.

సామాన్యనీతులను, సజ్జన లక్షణములకు వివరించు పట్ల కవి భక్తిభావముల నుద్బోధించెను. కోలంక మదనగోపాలుని అనుగ్రహము లభించిన