5. పరీక్షిత్తుఁడు శుకునిఁ బ్రపంచోద్భవాదికం బడుగుట

వికీసోర్స్ నుండి

అధ్యాయము - ౮[మార్చు]

సీ. విను శుకయోగికి మనుజేశుఁ డిట్లను మునినాధ! దేవదర్శనము గలుగఁ

నారదమునికిఁ బంకేరుహభవుఁ డెఱింగించిన తెఱఁగు సత్కృప దలిర్ప

గణుతింప సత్త్వాది గుణశూన్యుఁ డగు హరి కమలాక్షు లోకమంగళము లైన


కధలు నా కెఱింగింపఁ గైకొని నిస్సంగ మైన నా హృదయాబ్జమందుఁ గృష్ణు


తే.భవ్యచరితుని నాద్యంత భావశూన్యూఁ, జిన్మయాకారు ననఘు లక్మ్షీసమేతు

నిలిపి యస్థిర విభవంబు నిఖిల హేయ భాజనం బైన యీ కళేబరము విడుతు. (217)


వ.అదియునుంగాక యెవ్వండు శ్రద్ధా భక్తి యుక్తుండై కృష్ణు గుణకీర్తనంబులు వినుంచు బలుకుచుండునట్టివాని హృదయపద్మంబుసందుఁ గర్ణ రంధ్రమార్గంబునఁ బ్రవేశించి, కృష్ణుండు విశ్రమించి,సలిలగతం బైన కలుషంబును శరత్కాలంబు నివారించు చందంబున నాత్మగతంబయిన మాలిన్యంబు నపకర్షించుఁ గావున. (218)


మ.భరితోదగ్ర నిదాఘతప్తుఁ డగు న ప్పాంధుం డరణ్యాది సం

చరణ క్లేశ సముద్బవం బగు పిపాసం జెంది యాత్మీయ మం

దిరముం జేరి గతశ్రముం డగుచు నెందేనిం జనం బోని భం

గి రమాధీశు పదారవింద యుగ సంగీభూతుఁడై మానునే! (219)


వ.అదియునుం గాక సకల భూతసంసర్గ శూన్యంబైన యాత్మకు భూతసంగమం

బే ప్రకారంబునం గలిగె? అది నిర్ణి మిత్తంబునం జేసియో, కర్మంబునం జేసియో యా క్రమంబు నా కెఱిఁగింపుము. (220)


సీ.ఎవ్వని నాభియం దెల్ల లోకాంగ సంస్దాన కారణ పంకజంబు వొడమె

నం దుదయించి సర్వావయవ స్పూర్తిఁ దనరారునట్టి పితామహుండు

గణఁగి యెవ్వని యనుగ్రహమున నిఖిల భూతముల సృజించె నుత్కంఠతోడ

నట్టి విధాత యే యనువున సర్వేశు రూపంబు గనుఁగొనె రుచిర భంగి


తే.నా పరంజ్యోతియైన పద్మాక్షునకును, నళినజునకుఁ బ్రతీక విన్యాస భావ

గతులవలనను భేదంబు గలదె చపుమ?, యతి దయాసాంద్ర! యోగికు లాబ్ధిచంద్ర! (221)


వ.మఱియును భూతేశ్వరుం డైన సర్వేశ్వరుం డుత్పత్తిస్దితి లయ కారణం బైన తన మాయను విడిచి మాయా నియామకుండై యేయే ప్రదేశంబుల శయనంబు సేసె (నదియునుం గాక

పురుషావయవంబులచేఁ బూర్వకాలంబున లోకపాల సమేతంబులైన లోకంబులు గల్పితంబులయ్యె ననియు లోకంబులు పురుషావయవంబు లనియుఁ జెప్పం బడియె). అదియునుంగాక

మహాకల్పంబులును నవాంతర కల్పంబులును *భూత భవిష్య ద్వర్తమాన కాలంబులును) స్ధూల దేహాభిమానులై జనియించిన దేవ పితృ మనుష్యాదులకుం గలుగు నాయుః ప్రమాణంబును,

(బృహత్సూక్ష్మ) కాలానువర్తనంబును నే యే కర్మంబులం జేసి జీవు లే యే లోకంబుల నొందుదురు? మఱియు నే యే కర్మంబులం జేసి దేవాది శరీరంబులం బ్రాపింతురు? అట్టి కర్మమార్గ

ప్రకారంబున, (సత్త్వాది గుణంబుల) పరిణామంబులగు దేవాది రూపంబులఁగోరు జీవులకు నేయే కర్మసముదాయం బేట్టు సేయందగు? ఎవ్వనికి నర్పింపం దగు? అవి యెవ్వనిచేత గ్రహింపంబడు?

భూ పాతాళ కకు బ్వ్యోమ గ్రహ నక్షత్ర పర్వతంబులను,సరి త్సముద్ర ద్వీపంబులను, నే ప్రకారంబున సంభవించె? ఆ యా స్థానంబులం గల వారి సంభవంబు లేలాటివి? బాహ్యాభ్యంతరంబులం గలుగు

బ్రహ్మాండ ప్రమాణం బెంత? మహాత్ముల చరిత్రంబులెట్టివి? వర్ణాశ్రమ వినిశ్చయంబులును, యుగంబులును, యుగప్రమాణంబులును, యుగధర్మంబులును, ప్రతియుగమందును మనుష్యుల కే యే

ధర్మంబు లాచరణీయంబు (లగు నట్టి) సాధారణ ధర్మంబులునుఁ, జాతివిశేష ధర్మంబులును, రాజర్షి ధర్మంబులును ఆపత్కాల జీవన ఆధ్న భూతంబు లగు ధర్మంబులును, మహదాది తత్వంబుల

సంఖ్యయును, సంఖ్యా లక్షణంబును, ఆ తత్వంబులకు హేతుభూత లక్షణంబులును, భగవ త్సమారాధన విధంబును, అష్టాంగ యోగ క్రమంబును, యోగీశ్వరుల యణిమా ద్యైశ్వర్య ప్రకారంబును,

వారల యర్చిరాది గతులును, లింగ శరీర విలయంబును, ఋ గ్యజు స్సామాధర్వ వేదంబులును, ఉపవేదంబు లయిన యాయుర్వేదాదులును, ధర్మశాస్త్రంబులును, నితిహాస పురాణంబుల

సంభవంబును, సర్వభూతంబుల యవాంతర ప్రళయంబును, స్థితి మహాప్రళయంబులును, నిష్టాపూర్తంబు లను యాగాది వైదిక కర్మజాలంబును, వాపీకూప తటాక దేవాలయాది నిర్మాణంబు

లన్నదానం బారామప్రతిష్ఠ మొదలగు స్మార్తకర్మంబులును, కామ్యంబులైన యగ్ని హోత్రంబుల యనుష్ఠాన ప్రకారంబును, జీవసృష్టియను, ధర్మార్ధకామంబులనియెడు త్రివర్గాచరణ ప్రకారంబును,

మలినోపాధికపాషండ సంభవంబును, జీవాత్మ బంధ మోక్ష ప్రకారంబును, స్వరూపావస్థాన విధంబును, సర్వ స్వతంత్రుండైన యీశ్వరుం డాత్మమాయం జేసి సర్వ కర్మ సాక్షి యై క్రీడించుటయును,

మఱియు మాయ నెడఁబాసి యుదాసీనగతి విభుండై క్రీడించు తెఱంగు మొదలగు సమస్తము క్రమంబున నాపన్నుండ నైన నాకు నెఱింగింపుము. బ్రాహ్మణ శాపంబున జేసి, శోక వ్యాకులిత

చిత్తుండవై యనశనవ్రతుండ వైన నీవు వినుట యెట్లని సందేహింప వలవదు. త్వదీయ ముఖారవింద వినిస్స్రుతనారాయణ కథామృతపాన కుతూహలి నైన నాకు నింద్రియంబులు వశంబులైయుండు.

అది గావున నే నడిగిన ప్రశ్నంబులకు నుత్తరంబులు సవిస్తరంబులుగా నానతిచ్చి కృతార్ధునిఁ జేయఁ బరమేష్ఠితుల్యుండ వగు నీవపూర్వ సంప్రదాయానురోధంబున నర్హుండ వగుదు వని

విష్ణురాతుండైన పరీక్షిన్నరేంద్రుడు బ్రహ్మరాతుండైన శుకయోగి నడిగిన నతండు బ్రహ్మ నారద సంవాదంబును, నేక సంప్రదాయానుగతంబును, గతానుగతిక ప్రకారంబునునై తొల్లి సర్వేశ్వరుండు

బ్రహ్మకల్పంబున బ్రహ్మ కుపదేశించిన భాగవత పురాణంబు వేదతుల్యంబు నీ కెఱింగింతు విను మని చెప్పెనని సూతుండు శౌనకాది మునులకుంజెప్పినట్లు శుక యోగీంద్రుండు పరీక్షి నారేంద్రున

కిట్లనియె. ( 222 )

                                                                           అధ్యాయము - ౯

సీ. భూపాళకోత్తమ! భూతహితుండు సుజ్ఞాన స్వరూపకుం డైన యట్టి

ప్రాణికి దేహసంబంధ మెట్లగు నన్న మహి నొప్పు నీశ్వర మాయలేక

కలుగదు, నిద్రవోఁ గలలోనఁ దోఁచిన దేహబంధంబుల తెఱఁగు వలెను

హరి యోగమాయా మహత్త్వంబునం బాంచభౌతిక దేహ సంభంధుఁ డగుచు


తే. నట్టి మాయాగుణంబుల నాత్మ యోలి, బాల్య కౌమార యౌవన భావములనుఁ

నర సుపర్వాది మూర్తులఁ బొరసి యేను, నాయ దిది యను సంసార మాయదగిలి. (223)


వ. వర్తింపు చిట్లున్న జీవునికి భగవ ద్భక్తియోగంబున ముక్తి సంభవించుట యెట్లన్న నెప్పుడేని జీవుండు ప్రకృతి పురుషాతీత మయిన బ్రహ్మస్వరూపంబు నందు మహిత ధ్యాననిష్టుం డగు నప్పుడు

విగత మోహుండై యహంకార మమకారాత్మ కంబైన సంసరణంబు దొఱంగి ముక్తుండై యుండు. మఱియు జీవేశ్వరులకు దేహసంబంధంబులు గానంబడుచుండు. అట్టి దేహధారియైన

భగవంతునందు భక్తిం జేసి జీవుని ముక్తి యే తఱంగునం గలుగు నని యడిగితివి. జీవుం డవిద్యా మహిమంజేసి కర్మానుగతం బైన మిధ్యారూప దేహసంబంధుండు. భగవంతుండు నిజ

యోగమాయా మహిమంజేసి స్వేచ్ఛా పరికల్పిత చిద్ఘన లీలా విగ్రహుండు. కావున భగవంతుండైన యీశ్వరుండు స్వ భజనంబు ముక్తిసాధన జ్ఞానార్దంబు కల్పితం బని చతుర్ముఖునకుఁ దదీయ

నిష్కపట తపశ్చర్యాది సేవితుండై నిజజ్ఞానానందఘనమైన స్వరూపంబు సూపుచు నానతిచ్చె. అది గావున జీవునికి భగవద్భక్తి మోక్ష ప్రదాయకం బగు. ఇందుల కొక యితిహాసంబు గల దెఱింగింతు.

ఆకర్ణింపుము. దాన భవదీయ సంశయ నివృత్తి యయ్యెడు నని శుకయోగీంద్రుడు రాజేంద్రున కిట్లనియె. (224)


నష్కపట