22. కలిపురుషుండు ధర్మదేవతను దన్నుట

వికీసోర్స్ నుండి
          అధ్యాయము --- 17

శా. కైలాసాచల సనీభంబగు మహాగంభీర గోరాజమున్

గాలక్రోధుఁడు దండహస్తుఁడు నృపాకారుండు గ్రూరుండు జం

ఘాలుం డొక్కఁడు శూద్రుఁ డాసురగతిం గారుణ్య నిర్ముక్తుఁడై

నేలం గూలఁగదన్నెఁ బంచితిలఁగా నిర్ఘాతపాదాహతిన్ . (409)


శా. ఆలోలాంగక, నశ్రుతోయకణ జాలాక్షిన్, మహాంభారవన్

బాలారూఢ తృణవళీకబళ లోభవ్యాప్త జిహ్వాగ్ర, నాం

దోళస్వాంత సజీవవత్స, నుదయ ద్దుఃఖాన్వితన్, ఘర్మ కీ

లాలాపూర్ణ శరీర నా మొదవు నులంఘించి తన్నెన్ వడిన్ .(410)


వ. ఇట్లా ధేనువృషభంబుల రెంటినిం గంటకుండై తన్నుచున్న రాజలక్షణ ముద్రితుండైన శూద్రునిం జూచి, సువర్ణ పరికర స్యందనారూఢుం డగ నభిమన్యునంద నుండు గోదండంబు సగుణంబు శేసి మేఘగంభీర వచనంబుల నిట్లనియె. (411)


శా. నిన్నుం గొమ్ములఁ జిమ్మెనో ? నిర్భీతివై గోవులం

దన్నం గారణమేమి ? మ ద్భుజ సనాథ క్షోణి నే వేళలం

దు న్నేరంబులు శెయురా దెఱుఁగవా ? ధూర్తత్వమున్ భూమిభృ

త్సన్నాహంబు నొనర్చె దెవ్వఁడవు ? నిన్ శాపించెదన్ దుర్మతీ ! (412)


క. గాండీవియుఁ జక్ర్రియు భూ, మండలి నెడఁబాసి చనిన మదమత్తుఁడవై

దండింపఁ దగనివారల, దండించెదు నీవ తగదు దండనమునకున్. (413)


వ. అని వృషభంబు నుద్దేశించి యిట్లనియె . (414)


మ. కురుధాత్రీశ్వర బాహు వప్రతుగళీ గుప్త క్షమామండలిన్

బరికింపన్ భవదీయ నేత్రజనితాంభః శ్రేణి దక్కన్ జనల్

దొరుఁగం జూడ రధర్మసంజనిత జంతుశ్రేణి బాష్పంబులన్

గురుభక్తిన్ విసళింతుఁ జూడు మితనిన్ గోమూర్తి దేవోత్తమా ! (415)


క. జాలిఁ బడనేల ? నాశర,జాలంబుపాలు సేసి చంఓద వీనిన్

భూలోకంబున నిను నే, నాలుగుపాదముల నిపుడ నడిపింఁతు జుమీ ! (416)


ఉ. వాచవియైన గడ్డి దిని వాహినులందు జలంబుఁ ద్రావఁగా

నీచరణంబు లెవ్వఁ నిర్దశితంబుగఁజేసె, వాఁడు దా

ఖేచరుఁడై న వాని మణి కిఇలిత భూషణయుక్త బాహులన్

వేచని త్రుంచివైతు వినువీథికి నేఁగిన నేల డాఁగినన్ . (417)


వ. అని మఱియు గోరూపయైన బూదేవితో నిట్లనియె . (418)


చ. అగణిత వైభవుండగు మురాంతకుఁ డెక్కడఁ బోయె ? నంచు నె

వ్వగల నశించి నేత్రముల వారికణంబులు దేకుమమ్మ ! లో

బెగడకుమమ్మ ! మద్విశిఖబృందమునన్ వృషలున్ వధింతునా

మగఁటిమిఁ జూడు నీ వెఱపు మానఁగదమ్మ ! శుభప్రదాయినీ ! (419)


క. సాధువులగ జంతువులకు, బాధలు గావించు ఖలుల భంజింపని రా

జాధము నాయు స్స్వర్గ, శ్రీ ధనములు వీటివోవు సిద్ధము తల్లీ ! (420)


క. దుష్టజన నిగ్రహంబును, శిష్టజనానుగ్రహంబుఁ జేయఁగ నృపులన్

స్రష్ట విదించెఁ బురాణ, ద్రష్టలు సెప్పుదురు వరమధర్మము సాధ్వీ ! (421)


వ. అనిన ధర్మనందనపౌత్రునకు వృషధమూర్తి నున్న ధర్మదేవుం డిట్లనియె .( 422)


ఉ. క్రూరులఁ జంపి సాధువులకున్ విజయం బొనరించునట్టి యా

పౌరదవంశ జాతుఁడవు భాగ్యసమేతుఁడ వౌదు తొల్లి మీ

వా రిటువంటివా రవుట వారిజనేత్రుఁడు మెచ్చి దౌత్య సం

చారము సేసెఁ గాదె ! నృపసత్తమ ! భక్తి లతానుబద్ధుడై . (423)


వ. నరేంద్రా ! మేము ప్రాణులకు దుఃఖహేతువులము గాము. మావలన దుఃఖంబు నొందెడు పురుశుండులేఁడు. వాదివాక్యభేదంబుల యోగీశ్వరులు మోహితులై, భేదంబు నాచ్చాదించి, తమకు నాత్మ సుఖదుఃఖంబుల నిచ్చు ప్రభువని చెప్పుదురు. దైవజ్ఞులు గ్రహదేవతాదులకుఁ ప్రభుత్వంబు సంపాదింతురు. మీమాంసకులు గర్మంబునకుం బ్రాభవంబు ప్రకటింతురు. లోకాయతికులు స్వభావంబునకుఁ భభుత్వంబు సంపాదింతురు. ఇందెవ్వరికి సుఖదుఃఖప్రదానంబు సేయ విభుత్వంబు లేదు. పరులవలన దుఃఖంబువచ్చిన నధర్మంబు పరులు చేసిరని విచారింపవలదు. తర్కింపను నిర్దేశింపను రాని పరమేశ్వరునివలన సర్వము నగుచుండు. అనిన ధర్మదేవునికి ధర్మనందనపౌత్రుఁ డిట్లనియె. (424)


ఆ. ధర్మమూర్తి నయ్య ! ధర్మజ్ఞ ! వృషరూప ! పరమధర్ము వీవు పలుకు త్రోవ

పాపకర్మి సేయు పాపంబు సూచింపఁ, బాపకర్ముఁ డేగు పథకము వచ్చు. (425)


వ. మఱియు దేవమాయవలన భూతంబుల వాజ్మనంబులకు పథ్యఘాతుక లక్షణ వృత్తి సులభంబునం దెలియరాదు. నీవు ధర్మదేవతవు. కృతయుగమునం దపశ్శౌచదయా సత్యంబులు నాలుగును నీకుం పాదంబు లని చెప్పుదురు. ( త్రేతాయుగంబునఁ బూర్వోక్త పాదచతుష్కంబునఁ గ్రామంబునం దప శ్శౌచ దయా సత్యంబులం దురీయపాదంబు క్షీణంబయ్యె. ద్వాపరంబునం బాదద్వయంబు నశించె. కలి యుగంబునందు నివ్వడువునన యిప్పుడు నీకుఁ ) బాదద్వయంబు భగ్నంబయ్యె. అవశిష్టంబుగు భగదీయ చతుర్థపాదంబు నధర్మంబు గల్యంతమున నిగ్రహింప గమనించుచున్నది విను మదియునుంగాక . (426)


మ. ధర్మముం బాపి రమావిభుండు గరుణం బాదంబులం ద్రొక్కఁగా

స్థిరమై వేడుక నింతకాలము సుఖశ్రీ నొంది భూదేవి త

చ్చరణస్పర్శము లేమి శూద్రకులజుల్ శాసింతు రంచు న్నిరం

తర శోకంబున నీరు గన్నుల నిడెన్ ధర్మజ్ఞ ! వీక్షించితే ? (427)


                                                              "సమాప్తము"