10. అర్జునుండు పుత్త్రఘాతి యగు నశ్వత్థామ నవమానించుట

వికీసోర్స్ నుండి

వ. అని పలికి, రాజర్షియైన పరీక్షిన్మహారాజు జన్మకర్మముక్తులును, బాండవుల మహాప్రస్థానంబును, గృష్ణకథోదయంబును జెప్పెద. కౌరవ దృష్టద్యుమ్నాదుల యుద్ధంబున వీరులయినవారలు స్వర్గమునకుం జనిన వెనుక, భీము గదాఘాతంబున దుర్యోధనుండు తొడలు విఱిగి కూలిన నశ్వత్థామ దుర్యోధనునకుం బ్రియంబు సేయువాఁడై నిదురవోవు ద్రౌపదీపుత్త్రుల శిరంబులు ఖండించి తెచ్చి సమర్పించె. అది క్రూరకర్మంబని లోకులు నిందింతురు. (1-140)


ఉ. బాలుర చావు కర్మములఁ బడ్డఁ గలంగి యలంగి యోరువం

జాలక బాష్పతోయ కణజాలము చెక్కుల రాల నేడ్చి పాం

చాల తనూజ నేలఁ బడి జాలిబడం గని యెత్తి మంజు వా

చాలతఁ జూపుచుం జికుర జాలము దువ్వుచుఁ గ్రీడి యిట్లనెన్. (1-141)


మ. ధరణీశాత్మజ వీవు నీకు వగవన్ ధర్మంబె ? తద్ద్రౌణి ని

ష్కరుణుండై విదళించె బాలకుల ; మద్గాండీవ నిర్ముక్త భీ

కర బాణంబుల నేఁడు వాని శిరంబున్ ఖండించి నేఁ దెత్తుఁ ద

చ్ఛిరముం ద్రొక్కి జలంబులాడు మిచటన్ శీతాంశు బింబాననా ! (1-142)


వ. అని యొడంబఱచి తనకు మిత్త్రుండును సారథియు నైన హరి మేలనుచుండం గవచంబు దొడిగి గాండీవంబు ధరించి కపిధ్వజుండై గురుసుతుని వెంట రథంబుఁ దోలించిన. (1-143)


శా. తన్నుం జంపెద నంచు వచ్చు విజయున్ దర్శించి తద్ద్రౌణి యా

పన్నుండై శిశుహంత గావున నిజ ప్రాణేచ్ఛఁ బాఱెన్ వడిన్

మున్నా బ్రహ్మ మృగాకృతిం దనయకున్ మోహించి క్రీడింప నా

సన్నుండౌ హరుఁ జూచి పాఱు పగిదిన్ సర్వేంద్రియ భ్రాంతితోన్. (1-144)


వ. ఇట్లోపినంత దూరంబునుం బరువిడి వెనుకఁ జూచి రథ తురంగంబు లలయుటఁ దెలిసి, నిలిచి ప్రాణ రక్షణంబునకు నొండుపాయంబు లేదని నిశ్చయించి, జలంబుల వార్చి, ద్రోణనందనుండు సమాహిత చిత్తుండై, ప్రయోగంబ కాని యుపసంహారంబు నేఱకయుం బ్రాణ సంరక్షణార్థంబునకై పార్థుని మీఁద బ్రహ్మశిరోనామకాస్త్రంబుఁ బ్రయోగించిన నది ప్రచండ తేజంబున దిగంతరాళంబులు నిండి ప్రాణ భయంకరంబై తోఁచిన హరికి నర్జునుం డిట్లనియె. (1-145)


సీ. పద్మలోచన ! కృష్ణ ! భక్తాభయప్రద ! వినుము సంసారాగ్ని వేఁగుచున్న

జనుల సంసారంబు సంహరింపఁగ నీవు, దక్క నన్యులు లేరు తలఁచి చూడ

సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు, ప్రకృతిపరుండవు పరమపురుష !

నీ ప్రబోధము చేత నీ మాయ నంతయు, నణఁతువు ని:శ్రేయసాత్మ యందు

ఆ.వె. మాయయందు మునిఁగి మనువారలకుఁ గృపఁ , జేసి ధర్మ ముఖ్యచిహ్నమైన

శుభము సేయుచుందు సుజనుల నవనిలోఁ , గావఁ బుట్టుదువు జగన్నివాస ! (1-146)


కం. ఇది యొక తేజము, భూమియుఁ , జదలును దిక్కులును నిండి సర్వంకషమై

యెదురై వచ్చుచు నున్నది, విదితముగా నెఱుగఁ జెప్పవే దేవేశా ! (1-147)


వ. అనిన హరి యిట్లనియె. (1-148)


శా. జిహ్మత్వంబునఁ బాఱి ద్రోణజుఁడు దుశ్శీలుండు ప్రాణేచ్ఛువై

బ్రహ్మాస్త్రంబదె యేయ వచ్చె ; నిదె తద్బాణాగ్ని బీభత్స ! నీ

బ్రహ్మాస్త్రంబునఁ గాని దీని మఱలింపన్ రాదు ; సంహార మీ

బ్రహ్మాపత్య మెఱుంగఁ ; డేయుము వడిన్ బ్రహ్మాస్త్రమున్ దీనిపై. (1-149)


వ. అనిన నర్జునుండు జలంబులు వార్చి హరికిం బ్రదక్షిణంబు వచ్చి ద్రోణనందనుం డేసిన బ్రహ్మశిరోనామకాస్త్రంబు మీఁదఁ దన బ్రహ్మాస్త్రంబుఁ బ్రయోగించిన. (1-150)


మ. అవని వ్యోమములందు నిండి తమలో నా రెండు బ్రహ్మాస్త్రముల్

రవి వహ్నిద్యుతిఁ బోరుచుం ద్రిభువన త్రాసంబుఁ గావింపఁగా

వివశ భ్రాంతి యుగాంతమో యని ప్రజల్ వీక్షింప నా వేళ మా

ధవు నాజ్ఞన్ విజయుండు సేసె విశిఖద్వంద్వోపసంహారమున్. (1-151)


వ. ఇ ట్లస్త్రద్వయంబు నుపసంహరించి ధనంజయుండు ద్రోణనందనుం గూడ నరిగి తఱిమి పట్టుకొని రోషారుణిత లోచనుండై యాజ్ఞికుండు రజ్జువునం బశువుం గట్టిన చందంబున బంధించి శిబిరంబు కడకుం గొని చని హింసింతునని తిగిచినం జూచి హరి ఇట్లనియె. (1-152)


ఉ. మాఱు పడంగలేని యసమర్థుల సుప్తుల నస్త్రవిద్యలం

దేఱని పిన్నపాఁపల వధించె నిశీథమునందుఁ గ్రూరుఁడై ;

పాఱుఁడె వీఁడు ? పాతకుఁడు ! ప్రాణభయంబున వెచ్చ నూర్చుచుం

బాఱెడి వీనిఁ గావకు కృపామతి నర్జున ! పాపవర్జనా ! (1-153)


చం. వెఱచినవాని, దైన్యమున వేఁదుఱు నొందినవాని, నిద్ర మై

మఱచినవాని, సౌఖ్యముగ మద్యముఁ ద్రావినవాని, భగ్నుఁడై

పఱచినవాని, సాధు జడభావము వానినిఁ , గావుమంచు వా

చఱచినవానిఁ , గామినులఁ జంపుట ధర్మము గాదు ఫల్గునా ! (1-154)


శా. స్వప్రాణంబుల నెవ్వఁడేనిఁ గరుణా సంగంబు సాలించి య

న్య ప్రాణంబులచేత రక్షణము సేయున్, వాఁ డధోలోక దు:

ఖ ప్రాప్తుండగు ; రాజదండమున సత్కల్యాణుఁ డౌ నైన నీ

విప్రున్ దండితుఁ జేయుమేటికి మహా విభ్రాంతితో నుండఁగన్ ? (1-155)


వ. అని యివ్విధంబునఁ గృష్ణుఁ డానతిచ్చిన బ్రాహ్మణుండు (కృతాపరాధుండైనను) వధ్యుండు గాఁడను ధర్మంబుఁ దలఁచి చంపక ద్రుపదరాజ పుత్త్రికిఁ దన చేసిన ప్రతిజ్ఞం దలంచి బద్ధుండైన గురునందనుం దోడ్కొని కృష్ణుండు సారథ్యంబు సేయ శిబిరంబు కడకు వచ్చి, (1-156)


కం. సురరాజ సుతుఁడు సూపెను, దురవధి సుతశోక యుతకు ద్రుపదుని సుతకున్

బరిచలితాంగ శ్రేణిం, బరుష మహాపాశ బద్ధ పాణిన్ ద్రౌణిన్. (1-157)


వ. ఇట్లర్జునుండు తెచ్చి చూపిన బాలవధజనిత లజ్జాపరాఙ్ముఖుండైన గురుని కొడుకుం జూచి మ్రొక్కి (సుస్వభావ) యగు ద్రౌపది యిట్లనియె. (1-158)


మ. పరఁగన్ మా మగవారలందఱును మున్ బాణ ప్రయోగోప సం

హరణాద్యాయుధ విద్యలన్నియును ద్రోణాచార్యుచే నభ్యసిం

చిరి ; పుత్త్రాకృతి నున్న ద్రోణుఁడవు ; నీ చిత్తంబులో లేశమున్

గరుణాసంగము లేక శిష్యసుతులన్ ఖండింపఁగాఁ బాడియే ? (1-159)


కం. భూసురుఁడవు బుద్ధి దయా, భాసురుఁడవు శుద్ధవీర భట సందోహా

గ్రేసరుఁడవు శిశుమారణ, మాసుర కృత్యంబు ధర్మమగునే తండ్రీ ! (1-160)


శా. ఉద్రేకంబున రారు శస్త్రధరులై, యుద్ధావనిన్ లేరు, కిం

చిద్ ద్రోహంబును నీకుఁ జేయరు, బలోత్సేకంబుతోఁ జీఁకటిన్

భద్రాకారులఁ జిన్నిపాఁపల రణప్రౌఢక్రియాహీనులన్

నిద్రాసక్తుల సంహరింప నకటా ! నీ చేతు లెట్లాడెనో ? (1-161)


ఉ. అక్కట ! పుత్త్రశోకజనితాకులభావ విషణ్ణచిత్తనై

పొక్కుచు నున్న భంగి నినుఁ బోరఁ గిరీటి నిబద్ధుఁ జేసి నేఁ

డిక్కడ కీడ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేఁ

డెక్కడ నిట్టి శోకమున నే క్రియ నేడ్చుచుఁ బొక్కుచున్నదో ? (1-162)


వ. అని కృష్ణార్జునులం జూచి యిట్లనియె. (1-163)


ఉ. ద్రోణునితో శిఖిం బడక ద్రోణ కుటుంబిని యున్నదింట, న

క్షీణ తనూజ శోక వివశీకృతనై విలపించు భంగి నీ

ద్రౌణిఁ దెరల్చి తెచ్చుటకు దైన్యము నొందుచు నెంత పొక్కునో

ప్రాణ వియుక్తుఁడైన నతిపాపము ; బ్రాహ్మణహింస మానరే ? (1-164)


కం. భూపాలకులకు విప్రులఁ , గోపింపఁగఁ జేయఁదగదు, కోపించినఁ ద

త్కోపానలంబు మొదలికి, భూపాలాటవులఁ గాల్చు భూకంపముగాన్. (1-165)


వ. అని యిట్లు ధర్మ్యంబును సకరుణంబును నిర్‌వ్యళీకంబును సమంజసంబును శ్లాఘ్యంబునుంగా ద్రౌపది పలుకు పలుకులకు ధర్మనందనుండు సంతసిల్లె. నకుల సహదేవ సాత్యకి ధనంజయ కృష్ణులు సమ్మతించిరి. సమ్మతింపక భీముం డిట్లనియె. (1-166)


చం. కొడుకులఁ బట్టి చంపెనని కోపము నొందదు, బాలఘాతుకున్

విడువు మటంచుఁ జెప్పెడిని, వెఱ్ఱిది ద్రౌపది, వీఁడు విప్రుఁడే ?

విడువఁగ నేల ? చంపుఁడిటు వీనిని మీరలు, చంపరేని నా

పిడికిటి పోటునన్ శిరము భిన్నము సేసెదఁ , జూడుఁ డిందఱున్. (1-167)


వ. అని పలికిన నశ్వత్థామకు ద్రౌపది యడ్డంబు వచ్చె. భీముని సంరంభంబు సూచి హరి చతుర్భుజుండై రెండు చేతుల భీముని వారించి కడమ రెండు చేతుల ద్రుపదపుత్త్రికను దలంగంద్రొబ్బి, నగుచు భీమునికిట్లనియె. (1-168)


ఉ. అవ్యుఁడు గాఁడు వీఁడు ; శిశుహంత దురాత్మకుఁ డాతతాయి హం

తవ్యుఁడు బ్రహ్మబంధుఁ డగుఁ దప్పదు నిక్కము ; "బ్రాహ్మణో న హం

తవ్య" యటంచు వేదవిదితంబగుఁ ; గావున ధర్మదృష్టిఁ గ

ర్తవ్యము వీనిఁ గాచుట యథాస్థితిఁ జూడుము పాండవోత్తమా ! (1-169)


వ. అని సరసాలాపంబులాడి పవన నందను నొడంబఱచి యర్జునుం జూచి "ద్రౌపదికి నాకు భీమసేనునకును సమ్మతంబుగ మున్ను నీ చేసిన ప్రతిజ్ఞయు సిద్ధించునట్లు నా పంపు సేయు"మని నారాయణుం డానతిచ్చిన నర్జునుండు తదనుమతంబున, (1-170)


శా. విశ్వస్తుత్యుఁడు శక్రసూనుఁడు మహా వీరుండు ఘోరాసిచే

నశ్వత్థామ శిరోజముల్ దఱిఁగి చూడాంతర్ మహారత్నమున్

శశ్వత్‌కీర్తి వెలుంగఁ బుచ్చుకొని పాశవ్రాత బంధంబులన్

విశ్వాసంబున నూడ్చి ద్రొబ్బె శిబిరోర్వీ భాగముం బాసిపోన్. (1-171)


కం. నిబ్బరపు బాలహంతయు, గొబ్బునఁ దేజంబు మఱియుఁ గోల్పడి నతుఁడై

ప్రబ్బిన చింతన్ విప్రుఁడు, సిబ్బితితో నొడలి గబ్బు సెడి వడిఁ జనియెన్. (1-172)


ఆ.వె. ధనముఁ గొనుట యొండె తల గొఱుగుట యొండె, యాలయంబు వెడల నడచుటొండె

కాని చంపఁదగినయట్టి కర్మంబు సేసినఁ , జంపఁదగదు విప్రజాతిఁ బతికి. (1-173)


అధ్యాయము-8


వ. ఇ ట్లశ్వత్థామం బ్రాణావశిష్టుం జేసి వెడలనడచి పాండవులు పాంచాలీసహితులై పుత్త్రులకు శోకించి మృతులైన బంధువులకెల్ల దహనాది కృత్యంబులు జేసి జలప్రదానంబు సేయు కొఱకు స్త్రీల ముందల నిడుకొని గోవిందుండునుం దారును గంగకుం జని తిలోదకంబులు సేసి క్రమ్మఱ విలపించి హరిపాద పద్మజాత పవిత్రంబులైన భాగీరథీ జలంబుల స్నాతులై యున్నయెడం బుత్త్రశోకాతురులైన గాంధారీ డృతరాష్ట్రులను గుంతీద్రౌపదులను జూచి మాధవుండు మునీంద్రులుం దానునుం బంధుమరణ శోకాతురులైన వారల వగపు మానిచి మన్నించె, నివ్విధంబున, (1-174)


శా. పాంచాలీ కబరీ వికర్షణ మహాపాప క్షతాయుష్కులం

జంచద్‌గర్వుల ధార్తరాష్ట్రుల ననిం జంపించి గోవిందుఁ డి

ప్పించెన్ రాజ్యము, ధర్మపుత్త్రునకుఁ గల్పించెన్ మహాఖ్యాతిఁ, జే

యించెన్ మూఁడు తురంగమేధములు దేవేంద్ర ప్రభావంబునన్. (1-175)