సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఆసియా నృత్యరీతులు
ఆసియా నృత్యరీతులు సింహళద్వీపము, బర్మా, జావా, బలి, తాయిలాండు, కంబోడియా, చైనా, టిబెట్టు, జపాను మొదలగు తూర్పు దేశములలోని నృత్యరీతులు ముఖ్యముగా మువ్విధముల పెంపొందినవి. (1) ఆరాధన నృత్యములు, (2) దర్బారు నృత్యములు, (3) ప్రజానృత్యములు.
1. ఆరాధన నృత్యములు : ఆలయ నర్తకులు ప్రత్యేకముగా ఆలయ నృత్యములందు మాత్రమే పాల్గొందురు. వీరి నాట్యకళను పూర్వకాలమున మన ఆలయములందు దేవదాసీలచే చేయబడుచుండెడి ఆరాధన కళతో పోల్చవచ్చును. కాని నాటి దేవదాసీలు ఒక ప్రత్యేకమగు తెగకు చెందినవారు. ఈ ప్రాంతములం దట్లుగాక అన్ని జాతులకు చెందిన వారును నృత్యకళను అభ్యసించి ఆలయ
నృత్యములంచు పాల్గొందురు. సామాన్య ప్రజలు ఆలయములోని భగవంతు నెంత భక్తితో గౌరవింతురో, అట్లే నృత్యపూజతొ భగవంతు నారాధించు దేవదాసీలను ప్రత్యక్ష దేవతలనుగా నెంచి, పూజించెదరు. ఈ నర్తకీ మణులు ఇతర వినోదములందు గానీ, దర్బారు నృత్యము లందు గాని, పాల్గొనరు. అట్లు ఒకవేళ పాల్గొనుటకు నిశ్చయించు కొనినచో వారు ఆలయ నృత్యమునుండి విరమించుకొందురు. ఇట్టి పూజానృత్యములందు, 'సాంగ్ యాంగ్ ' బలిద్వీపపు 'దానిఆట' ముఖ్యముగా పేర్కొనతగినది.
2. దర్బారు నృత్యములు :నర్తకులు రాజులచే, మహారాజులచే, జమీందారులచే పోషింపబడు నాట్యమేళములకు చెందినవారు. ఈ బృందములందు సాధారణముగా స్త్రీలు మాత్రమే నృత్యము చేయుదురు. వీరు రాజ దర్భారులందే నృత్యమాడుదురు. సామాన్యప్రజల ముందు వీరి నృత్యములు ప్రదర్శింపబడుట గాని, ఆ ప్రదర్శనము లను వారు చూచి ఆనందించుట గాని ఎన్నడును జరుగకపోవుటచే ఆ నృత్యములెట్టివో, వాటి స్వరూపమెట్టిదో ప్రభువులు తప్ప ప్రజలు ఎరుగరు. ఈ నాట్యమేళములందు పాల్గొనువారిని—సకలశాస్త్రములందు పాండిత్యముగల్గి. నాట్యాభినయములందు ఆరితేరి మన ప్రాచీన రాజాస్థానముల నలంకరించిన గణికలతో పోల్చవచ్చును. కాని ఒక ముఖ్య భేద మేమనగా మన ప్రాచీన రాజాస్థానములకు చెందిన గణికల నృత్యములు రాజుల కొరకును తదాస్థానస్థుల కొరకును ఉద్దిష్టములైనను సామాన్యప్రజలు కూడా చూచుటకు వీలుండునట్టి ప్రదేశములందు ఆ నృత్య ప్రదర్శనములు జరుగుచుండెడివి. అందుచేత ఆ శాస్త్రీయకళను చూచి ఆనందించెడు భాగ్యము సామాన్య ప్రజలకుకూడ కల్గెడిది. కాని ఈ దేశముల వారి విద్య మాత్రము ధనిక వర్గమునకు చెందినట్టిదే. అది వారి విలాసార్థమై వారి అభిరుచుల ననుసరించి కూర్పబడినట్టిది. అట్టి నృత్య రీతులలో జావా లోని 'సిరియంపి' - బలి ద్వీపములోని 'కెబియార్', 'కపంగ్' - కంబోడియాలోని 'కిన్నెర' మొదలగునవి ముఖ్యమైనవి.
3. ప్రజా నృత్యములు : మన దేశమునందలి భాగవత మేళములతో ఈ ప్రజా నృత్యము లొనర్చువారి మేళము లను పోల్చవచ్చును. వీరు పల్లెలందు పట్టణములందు జట్టులుగా తిరుగుచు నృత్య ప్రదర్శనములను కావింతురు. సాధారణముగా పురాణ గాథలను వీరు నృత్యముచే ప్రదర్శింతురు. ఈ నృత్యరీతు లందరికిని అందుబాటులో నుండునట్టివి.
తూర్పుదేశము లండలి నృత్యకళపై భారతీయ సంప్రదాయము యొక్క ప్రభావ మధికముగా నున్నను, వీరు తమ జాతీయభావముల ననుసరించి, తమ కళ కొక ప్రత్యేకత నేర్పరచుకొన్నారు. ఆంధ్ర, తమిళ, కేరళ, వంగదేశముల నృత్యకళ వీరియొక్క నృత్యముల కాధార మైనట్లు తొచును. ముఖ్యముగా ఈ దేశీయులు ప్రదర్శించెడు 'వాయంగ్ ' అను తోలుబొమ్మలాట ఆంధ్రదేశమునుండి వెడలిన విద్యయేనట. వీరి నృత్యకళ ఆంధ్రుల భాగవత కళ యొక్క అనుకరణమేమైనను, ఆంధ్ర నర్తకులవలె సాధారణముగా వీరు నాట్యమాడునపుడు సంగీతము పాడుచు అభినయించరు. కథ నడుపు విధానము 'కథకళి' ని పోలినను ముద్రాభినయము, రసాభినయము మాత్రము కొంతవరకు “మణిపురి' ని పోలియుండును. నాట్యమాడు నప్పుడు వీరు ముఖముతో హావభావములను ప్రదర్శింపరు. శాస్త్రీయ నాట్యమందు అట్లు రసాభినయము ప్రదర్శించుట తగదనియు, కేవల రసాభినయవిశిష్టమైన నాట్యము నీచ నాట్యమనియు కొన్ని సంప్రదాయముల వారి అభిప్రాయము. ఆహార్యము అజంతా గుహలలోని అలంకరణమునకు అనుకరణముగా మండును. కొన్ని నృత్యములందు వీరు ముఖములకు తొడుగులను ధరించు చున్నారు. వీరికి నృత్యములందు సహకరించెడు వాద్య, సంగీత బృందమునకు 'గమ్మేళనము' అని వేరు. సాధారణముగా గమ్మేళనమే వీరి నృత్య కథను నడుపు చుండును. పాడబడుచున్న పాట ననుసరించియు, మ్రోగుచున్న వాద్యముల సంగీతము ననుసరించియు నాట్యమును నర్తకులు ప్రదర్శించు ఆచారము కలదు.
వీరి నాట్యకళయందలి నృత్య, నృత్త, అభినయములనుగూర్చిన వివరములు :
నాట్యము : రామనాటకము, మహాభారతము మొదలైన భారతీయ పురాణకథలను వీరు నృత్యనాటకములుగా ప్రదర్శింతురు. ఇందు ఆయా గాథల ననుసరించి అనేక పాత్రధారులు రంగస్థలమున ప్రవేశించి నాట్య మాడుదురు. వీరు నాటకములను నడుపు పద్ధతి మన పురాతన సంస్కృత నాటకములను నడుపు పద్ధతిని పోలియుండును. మన నాంది, భరతవాక్యము, నటి సూత్రధారుల ప్రవేశము మొదలయిన పద్ధతులన్నియు వీరి నృత్యములందు కాననగును. మరియు భాగవతములందువలె ఒక హాస్యగానిపాత్రనుగూడ వీరు నాట్యములందు ప్రవేశ పెట్టుదురు. ఆ పాత్రప్రవేశము కథాప్రవృత్తికివి కథా రామణీయకమునకును తోడ్పడును.
నృత్యము : మన నాట్యరీతులందువలె పశుపక్ష్యాదులను, నదులను, దేవతలు మొదలయినవారిని చూపుటకు వివిధములైన హస్తములు వీరికి లేవు. పదార్థాభినయము, విశేషాభినయము వీరికంతగా తెలియవు. అనుకరణమును గూడ కొంతవరకుమాత్రమే వీరు ప్రదర్శింపగలుగుదురు. వీరి ముద్రలు సహజములు. మణిపుర నృత్యములందువలె వీరినృత్యములందు అల్పసంఖ్యాకములయిన ముద్రలున్నవి. లయతోగూడిన అంగవిన్యాసము మాత్రము వీరు చక్కగా• ప్రదర్శింపగలరు. భరతశాస్త్రములోని శాస్త్రీయానుకరణములు - సర్పిత, నాగాపసర్పిత. విద్యుద్బ్రాంత, భ్రమర, ఏక పాద భ్రమరాదులు తరచు వీరి నృత్యములందు కాననగును. నృత్యనాటకములందు, దేవతా పాత్రానుకరణ – నృత్యములతోబాటు - లేడి, వానరము, మొదలగు జంతుపుల యొక్కయు, మయూరము, కోకిల మొదలైన పక్షుల యొక్కయు అనుకరణ నృత్యముగూడ వీరు ప్రదర్శింప నేర్తురు. అట్టి సమయములందు వీరి ఆహార్యము ఆయా జంతువుల రూపానుగుణముగ నుండును.
నృత్తము : వీరి నాట్యకళయంతయు వృత్తప్రధానమైనది. లయ, తాళములతో గూడిన అంగవిన్యాసమును ముఖ్యముగా వీ రారాధింతురు. వికట, విషమ, సృత్తరీతులను వీరు ప్రత్యేకముగా శ్రద్ధవహించి అభ్యసించి ప్రదర్శింతురు. లఘువిధానము వీరి నృత్యమందు మచ్చునకయినను కానము.
అభినయము : ఈ దేశముల నృత్యము అన్నింటికిని భరతశాస్త్రమే ఆధారమైనను వాటి విషయమున మన కును వారికిని ఒక ముఖ్యమైసభేదము కనబడుచున్నది. అదేమనగా - ఏ భావాభినయమును రసాభినయమును, మనము ప్రధానములుగా తలంచెదమో, అవి వారి కళ యందు కనబడవు. కొన్ని ప్రాంతములందు అశాస్త్రీయ మను భావమునుబట్టి రసాభినయము విడనాడబడినది. వారిట్టి అభిప్రాయము కలిగి యుండుటచే వారి ప్రదర్శనములు భావహీనములైన నృత్త నృత్యములతో ముగియు చుండును, జపాను దేశమునందలి 'గెయిషా' అను నాట్యమునందు కొంతవరకు భావప్రకటనమున్నది. కాని అది ప్రేక్షకులను వినోదపరచుటకు చేయబడు భావప్రకటనమేగాని సాత్విక సంచారుల ప్రకటనముతోగూడిన శాస్త్రీయాభినయము కాదు.
తాండవలాస్యములు : సింహళద్వీపములోని కండియను నర్తకులు ప్రదర్శించేడు నాట్యరీతులు పూర్తిగా తాండవ పద్ధతికి చెందినట్టివి, 'కథకళి' లోని గంభీరత వీరి నృత్యములందు కాంచనగును. వీరు హస్తములను పట్టుతీరు, విన్యా సము, అడవులను ప్రదర్శించుతీరు, ముగింపు, ప్రారంభ క్రమము - సర్వము కథకళియందు వలెనే యుండును. లామాల నృత్యములు, చైనీయుల శాస్త్రీయనృత్యములు తాండవపద్ధతికి చెందినట్టివే. కంబోడియా, జావా, బలి ప్రాంతములలో 'శుద్ధలాస్యము శుద్ధతాండవము ప్రత్యేకముగా ప్రదర్శించు నృత్యరీతులు కొన్ని కలవు. ఇట్టి సంప్రదాయములు మన దేశమందు అరుదుగా నున్నవి. శుద్ధలాస్యము ప్రత్యేకముగా జావాలో దర్బారు నృత్యమగు 'సిరియంపి' యందు కాంచనగును.
వివరములు : టిబెట్టుదేశ నృత్యరీతులు-టిబెట్టు దేశీయులకు మంత్రతంత్రములందును, భూత ప్రేతపిశాచము లందును విశ్వాసము మెండు. అందుచే వీరు చేయు నృత్యము లన్నియు ఆరాధన నృత్యరీతులై, ఆ క్షుద్రదేవతలను, మహాపురుషులను సంతృప్తి పరచుటకై ఉపయోగపడు చున్నవి. వీరు నృత్యమాడునపుడు ముఖములకు తొడుగులను ధరింతురు. సుమారు పది అడుగుల పొడవుకల బాకా వాద్యములు, గంటలు, డోళ్ళవంటి గంభీర నాదముల నొనర్చు చర్మవాద్యములు వీరి నృత్యములందు ఉపయోగింపబడును. గానము ప్రత్యేకముగా వీరి నృత్యములందు కనిపించదు. కాని నృత్యములకు పూర్వమందును, అంతమందును మతసంబంధమైన మంత్రములు లామాలచే పఠింపబడును. అటుపై వాద్యముల ఆలాపములో నృత్యములు ప్రారంభింపబడును. వీరి నృత్యకళ మతముతో సంబంధము కలదగుటచే కేవలము సుందరసుకుమారములైన అంగవిన్యాసములు లేనిదై అటవికుల నృత్యకళను పోలియుండును.
చైనాదేశ నృత్యకళ : వీరి కళకును, టిబెట్టీయుల కళకును పెక్కు పోలికలున్నవి. ఉభయదేశీయుల నృత్యము లును మతసంబంధముకలవే. ఉభయదేశీయులును బుద్ధ దేవునికి భక్తులే. అందుచే వీరి నృత్యములు ఒకేరీతిగా నుండును. కానీ చైనీయుల వినోద నృత్యములు భరత శాస్త్రమునందలి వికట, విషమ రీతులను పోలియుండును. భీతినిగొల్పు హాస్యమును బుట్టించు రంగురంగుల ఆభరణములను, వస్త్రములను ముఖములకు తొడుగులను ధరించి, కసరత్తులందువలె మొగ్గలు వేయుచు, గాలిలోనికి ఎగురుచు,భూమిపై గొబ్బున పడుచు, త్వరితగతిని పరుగులిడుచు.... ఒక కాలు గాలిలోనికి విసరి, భూమిపై రెండవకాలు మోపి, గిఱ్ఱున తిరుగుచు పెక్కు చిత్రవిచిత్రమైన సాములను ప్రదర్శించుచు వారు నృత్యమాడుదురు. ఇట్టి రీతులన్నియు భరతశాస్త్రములో నున్నవి. ఇవన్నియు మన నర్తకులు - నృత్యకళాఖ్యాస దశలో తమ శరీరావయవములను నృత్యకళకు అనుగుణములుగా చేసికొనుటకై అభ్యసింతురు. ప్రదర్శనములందు వీటిలో కొన్ని మాత్రమే ప్రయోగింపబడును. సాముగరిడీలందును, దొమ్మరివారు ప్రదర్శించెడు ఇట్టి విద్యయందును ఇట్టి అంగవిన్యాసముల నెక్కువగా జూచెదము. అభినయము వీరి కళయందు లేదు. అంగీకాభినయ ప్రధానములయిన నృత్యనృత్తములే వీరి కళలో విశిష్టములైనవి. జపాను దేశీయుల కళ చాలవరకు ప్రాచీన సంప్రదాయములను విడనాడి - పాశ్చాత్య సంప్రదాయములను అలవరచుకోనినది 'గెయిషా' నర్తకులు కొంతవరకు అభినయవిద్య నభివృద్ధిపరచిరి. వీరు పాటపాడుచు అభినయించెడు విధానమును అభ్యాసము చేయుదురు. 'గెయిషా' నృత్యములు లాస్యపద్ధతికి చెందినట్టివి. జపానీయులు నృత్య రీతులలో రంగాలంకరణ విషయమున ప్రత్యేకశ్రద్ధను వహించెదరు. వీరి నృత్యము రెండువిధముల నున్నవి. (1) కథననుసరించి చేయబడునట్టిది (2) ఒక ప్రత్యేక గీతమునందలి హావభావములను ప్రదర్శించునట్టిది :
కంబోడియా దేశములోని నృత్యకళ : కంబోడియా దేశస్థుల నృత్యరీతులకును భారతీయుల నృత్యరీతులకును చాల సన్నిహిత సంబంధమున్నది. వీరి పూజావిధానములు, ఆరాధనరీతులు భారతీయ సంప్రదాయముల ననుసరించు చున్నవి. వీరు రామాయణ, మహాభారత, భాగవత కథలను నృత్య మాడుదురు. ఏక పాత్ర నృత్యములు, ద్వంద్వ నృత్యములు, బృంద నృత్యములు - ఇట్లు వీరి నృత్యములు పెక్కురీతుల నున్నవి. భరతనృత్యమునందు వలె వీరు రసాభినయమును కొంతవరకు ప్రదర్శించేదరు వీరి అభ్యాసపద్ధతులు, అంగవిన్యాసములు, లయతాళ విన్యాసములు చాలవరకు భరతశాస్త్ర సమ్మతములుగా నుండును. దేవకన్యా నృత్యము, కిన్నెర నృత్యము, హనుమన్నృత్యము, దాసనృత్యము, మంచనృత్యము - ఇవి వీరికి ముఖ్యమైన నృత్యములు. మనకు భరతనాట్యము, కథక్ మొదలైన సంప్రదాయము లున్నట్లే పూర్వోక్త నృత్యములందును ప్రత్యేక కరణములు, తాళగతులు, అంగవిన్యాసములు, హస్తాభినయములు భ్రమరవిన్యాసములు, చారీహస్తములు కలవు. అశాస్త్రీయసంప్రదాయములను అనుసరించియే వీరు ఆ నృత్యములందు శిక్షణ పొందుదురు.
బలి, జావా ద్వీపములందలి నృత్యకళ : ఆగ్నేయఆసియా నృత్యరీతు లన్నింటిలో బలిద్వీపపు నృత్యరీతులు ప్రఖ్యాతి నొందినట్టివి. బలిద్వీపవాసు లందరును హిందువులే. మరియొక విశేష మేమనగా ఆంధ్రులకును ఆ దేశ ప్రజలకును చాల సన్నిహితత్వము కనబడుచున్నది. అందుచే వారు ప్రదర్శించు నాటకముల ఇతివృత్తములు కూడ రామాయణ మహాభారతకథలనుండి గ్రహింపబడినవే.
ఈ ప్రాంతమునందలి ప్రజల నృత్య నాటకముల భాషకు 'కవి' అని పేరు. ఈ 'కవి' అను భాషకును, నేటికాలములో ప్రజలు మాట్లాడు భాషకును విశేష భేద మున్నది. 'కవి' యందు సంస్కృత పదజాలము మెండుగా నుండును. వీరి నాట్యకళ ఆదర్శ ప్రాచీన భారతీయ నృత్య సంప్రదాయములపై ఆధారపడి పెంపొందినట్టిది. రామాయణ, మహాభారత, భాగవత గాథలు గీతములుగా రచింపబడి, తాళలయల ననుసరించి 'గమ్మేళన' సంగీతముయొక్క సహాయముతో ప్రదర్శింపబడును. అర్జునుడు వారి ఆదర్శ పురుషుడు. అవతారమూర్తి యగు శ్రీకృష్ణ భగవానుడు హిందువులలో విశేషముగా వైష్ణవులకు ఆరాధ్యుడై నట్లు ఈ ప్రాంత ప్రజలకు అర్జును డారాధ్యుడు. కనుకనే మనకు కృష్ణరహితముగా రసాభినయము లేనట్లు, అర్జున రహితముగా నృత్య నాటకము వీరికిని లేదు. మన పురాణేతి హాసగాథలనే వీరు నృత్యముతో ప్రదర్శించినను, తమ దేశ సంప్రదాయములను అభిరుచులను అనుసరించి వీరు పెక్కు మార్పులను మూలమునందు చేసి ప్రదర్శింతురు.వీరి నృత్యమందలి హస్తాభినయము ద్వివిధము.
(1) గమ్మేళనము : ఇది వీరు పాడునట్టి పాట యొక్క అర్థమును తెల్సునట్టి ముద్రాభినయము. ఇది కధాగమనము
ననుసరించియుండును.
(2) సహజము : ఇది కథలోని భావము ననుసరించి, గమ్మేళన సంగీతమునకు అనుగుణముగ ప్రదర్శింపబడు అంగవిన్యాసము.
గమ్మేళనము వీరి నృత్యములందు ప్రాముఖ్యమును వహించును. కథను నడుపునపుడు ఆయా ఘట్టముల ననుస రించి రసభావములను పోషించుచు వారు గానము చేయుదురు, మన నృత్యములందువలె వీరి నృత్యములందు గూడ కొన్ని వేళలందు నర్తకులు పొడుచు నృత్యము చేసినను, వారి గానమునకును, నృత్యమందు వారు ప్రదర్శించెడు హావ భావములకును సన్నిహితత్వ మంతగా కనిపించదు. నడుమునకు బిగించికట్టిన సుందరమైన దట్టి యొక్క పొడుగైన కొన లను చేతులతోపట్టుకొని, వాటిని గాలిలో ఎగురవేయుచు వివిధగతులలో కదలించుచు నృత్యమాడుట వీరి యొక్క విశిష్టత. వీరి నృత్యము లన్నియు విలంబితలయలో నుండును. యుద్ధనృత్యమందుమాత్రము వీరు లయను పెంచి ఉద్దత పద్ధతిని అవలంబించి నృత్తమాడుదురు.
వీరి నృత్యకళయు, బొమ్మలాటయు, తోలుబొమ్మల భాగవతముల ననుసరించి అభివృద్ధి చెందినట్టివని ఈ దేశములో పండితుల యొక్కయు, శాస్త్రకారుల యొక్కయు అభిప్రాయము. ఈ తోలుబొమ్మల భాగవతము ప్రథమములో ఆంధ్ర దేశమునుండియే ఈ ప్రాంతములకు ప్రాకినదని చరిత్రకారుల అభిప్రాయము. కనుకనే ఆంధ్ర దేశస్థ నృత్యకళకును ఈ ప్రాంతీయుల నృత్యకళకును అత్యంత సన్నిహితత్వము కనబడును. దేశకాల పరిస్థితుల ననుసరించి మన కళలో మార్పులు ఏర్పడినవి. వారు మాత్రము ప్రాచీనసంప్రదాయములనే, నేటికిని అనుసరించుచున్నారు. అచ్చటచ్చట మార్పులు చేయబడి దేశీయమగుటచే, వారి నృత్యకథ మన నృత్యకళకంటే భిన్నముగా నుండును.
మృత్యుప్రదర్శనము వీరి కళయందు నిషిద్ధము. కావున వీరి నృత్యము లన్నియు సుఖాంతములుగా నుండును. యుద్ధఘట్టముల నభినయించునప్పుడు ఒక ప్రత్యేక పద్ధతిని వీరనుసరింతురు. ఓడిపోవునట్టి జట్టువా రెప్పుడును రంగస్థలమునకు ఎడమప్రక్కను, గెలుపునొందునట్టి జట్టువారు కుడి ప్రక్కను ఉందురు. వీరి ప్రవేశ నిష్క్రమణములు కూడ క్రమముగా ఎడమ కుడి ప్రక్కలనుండి జరుగును. ఎడమప్రక్కగా నున్న పాత్రల పరాజయమును ప్రదర్శించు నప్పుడు గమ్మేళనమునకు ఎడమభాగమున నున్న పాటకులు జాలిగొల్పునట్టి విషాద గీతములను విలంబితలయలో ఆలపించ నారంభింతురు. నర్తకులు తమ నాట్యమందలి గభీరతను తగ్గించి, కరుణారస మొప్పించుటకై విలంబితమై, మృదువైన అంగచలనమును ప్రదర్శింతురు. నాట్య ప్రదర్శనము నందు ఒకేనర్తకి లేక నర్తకుడు రంగస్థలము పై ఎన్నిసార్లు ప్రవేశించినను, నిష్క్రమించినను, ప్రతిప్రవేశమునందును నిష్క్రమణమునందును ప్రేక్షకులకు నమస్కరించుచునే యుండును. ఇది వారి ఆచారమునందలి ప్రత్యేకత. అంతియేగాదు. నృత్యపద్ధతిలో రమణీయముగా నమస్కారముచేయుట కూడ బలిద్వీప నర్తకుల సొమ్మనవచ్చును.
బలిద్వీప నాట్యములలో విదూషక పాత్రమునకు ప్రాముఖ్యము కలదు. విదూషకుడు లేని నాటకము వారికి అసంపూర్ణముగా భాసించును. మన సంస్కృత నాటకములందువలె వారి నాటకములందును వర్ణక్రమము ననుసరించి పాత్రములుండును. విదూషకుడు ముఖ్యముగ హాస్యరసమును పోషించు పాత్రముగాన అతని అభినయము ప్రదర్శన నియమములకు కట్టుబడి యుండదు. విదూషకుడు నాటకములోని గంభీరతను తగ్గించి వినోదమును గలిగించునట్టి పాత్ర, జావాలో నాటకమునందలి సూత్రఛారుడు శివస్వరూపుడుగా నెంచబడును. శివుడు (నట రాజు) సృష్టి యొక్క లయకర్తయగుటచే ప్రాధాన్యము కలవాడు. అట్లే నాటకమునందు ప్రధానుడగు సూత్రధారుని వారు శివస్వరూపునిగా భావించుదురు.
బలిద్వీపములోని దేవదాసీలు ప్రత్యేకముగా పేర్కొనదగిన నట్టువరాండ్రు. వీరు నృత్య గీతములతో భగవంతుని ఆరాధించు భక్తురాండ్రు. వీరి జీవితములు పవిత్రములైనవి. పవిత్రముగా జీవితములు గడుపగల్గినంత కాలమే వీరు ఆలయమున స్వామి పాదముల వద్ద నుంచబడు బంగారు కిరీటములను ధరించి నాట్యమాడుదురు. మనస్సు ఆధ్యాత్మిక దృష్టినుండి మరలిననాటినుండి నాట్యమును మానివేయుదురు. వీరు భక్త్యావేశముతో నాట్యము చేయు నపుడు ప్రేక్షకులు భక్త్యావేశపరవశు లగుదురు.
సింహళద్వీస నృత్యములు : ఈ నృత్యకళ చాలవరకు తమిళ దేశపు కళ యొక్క అనుకరణముగా నుండును. సింహళ ద్వీప శాస్త్రీయ నృత్యకళకు 'కండియన్' నృత్యమని పేరు. మనదేశమందు కూచిపూడి నృత్యము, తంజావూరు నృత్యము, మణిపుర నృత్యము అని ఇట్లు ఆయా ప్రాంతముల పేర్లతో దేశీయ కళలు పిలువబడినట్లు, వీరి కళ - కండియన్ నృత్యమని పిలువబడుచున్నది. ఈ నృత్య కళయందలి హస్త పాద విన్యాసములు, ప్రదర్శన క్రమములు అన్నియు తంజావూరు నృత్యకళా పద్ధతిని చాల వరకు పోలియుండును. వీరు నాట్యాచార్యుని కూడ 'నట్టువ' అని పిలుతురు. వీరు ప్రదర్శించెడు 'కుత్తు' నాటకములందు ప్రాచీన తమిళ పద్ధతిలో రాగములను పాడుదురు. తమిళ, సింహళ, మణిప్రవాళములందు నర్తకులు మాట్లాడుచు, నాట్యమాడుచు రంగస్థల ప్రవేశ నిష్క్రమణముల నొనర్తురు. మన భాగవతములందు వలెనే ఈ నాట్యములందును పురుషులు పాల్గొందురు. కాని వీరి నృత్యమందు ప్రత్యేకముగా పాడువారుండరు. నర్తకులే పాడుచు నాట్యమాడుదురు. మార్దంగికుడు మాత్రము నర్తకుల నృత్యము ననుసరించును. సింహళీయులు చేయు కొన్ని నృత్యములు నాట్య సమయములందు సర్తకులు తమ చేతులందు ధరించు అస్త్ర శస్త్రముల పేర్లు గలవిగా నుండును. అట్టివే 'వన్ తేరు' - 'ఉడక్కి' అను నృత్యములు. పన్ తేరునందు - నర్తకులు చేతులతో తాళములు లేదా తంబురలు పట్టుకొని నృత్య మొనర్తురు. ఉడక్కి నాట్యమందు చిన్న చిన్న మృదంగములను నర్తకులు లయబద్ధముగా వాయించుచు నృత్యము ప్రదర్శింతురు. ఆగస్టు మాసమునందు వీరు జరిపెడు 'పిరహార' ఉత్సవమునందు నృత్య కళకు ప్రాముఖ్య మొసగబడును. ఈ ఉత్సవము బుద్ధుని దంతము పూజింపబడు ఆలయమునకు విష్ణ్వాలయములకు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయమునకు సంబంధించినట్టిది. ఈ ఉత్సవమునకు సంబంధించిన ఊరేగింపు లందు నర్తకీమణులు తమ తలలపై 'కలశము'లను ధరించి నృత్యమాడుచు, ఎడనెడ ఆ కుండలను కొంచెముగా పై కెగుర వేయుచు నడచెదరు.
శాంతికుత్తు, బలి నృత్యములు : ఇవి ఆరాధన నృత్యములు. దేవతలను, క్షుద్ర దేవతలను శాంతి పరచుటకు ఈ నృత్యములు చేయబడును. దేవతా విగ్రహములకు పూజలు చేసి మంత్రములను జదివి, అటుపై, మృదంగ వాద్య సహాయముతో నృత్యము చేయుదురు. మన దేశమునందలి అమ్మవారి కొలువులవంటివి ఈ నృత్యములు. ఇవికాక మన భరత శాస్త్రమునందలి నృత్య రీతుల ననుసరించి వీరు కొన్ని నృత్యములను అభివృద్ధి పరచిరి. వానిలో 'వన్నము' అనునది మన నృత్యము నందలి 'వర్ణము'ను బోలిన నృత్యము. 'సౌదము' లేదా 'వందమాన' అనునది మన 'సలామ్ జతు' లను బోలిన శబ్దము. వర్ణము అనునది నృత్య నృత్త అభినయములు ప్రదర్శించుటకు వీలుగా నుండునట్టి సంగీత రచన. ఇది భరత నాట్యమందు ముఖ్యముగా చూడదగిన ప్రత్యేక నృత్యము. ఈరచనకు పల్లవి, అనుపల్లవి, చరణములు ఉండును. పల్లవి, అనుపల్లవులకు అభినయమును, ముక్తాయి స్వరములకు, చరణము లందలి సాహిత్యమునకు నృత్త నృత్యములును ప్రదర్శింపబడును. శబ్దములు వీనికే సలాము జతులనియు పేరు. ఇందు మృదంగ జతులు, తీర్మానములు, పాటలు ఉండును. పాటలు రాజులకుగాని, దేవతలకుగాని వందనము అర్పించుటతో ముగియును. కనుకనే వీటికి 'సలామ్' లేక 'జోహార్ ' జతులని పేరువచ్చినది. పాటయంతయు వర్ణనములతో నిండియుండి, తుదిని, 'పద్మనాభ స్వామి జోహార్ అనియో లేక 'ప్రతాపసింహ సలామ్ ' అనియో ఉండును. ఇట్టి నృత్యములను సింహళదేశీయులు గూడ విరివిగా ప్రదర్శింతురు. ముఖ్యముగా 18 రకము లైన 'పన్నములు' సింహళదేశ నృత్యములందు ప్రదర్శింప బడును. ప్రతి ‘వన్నము' ఒక ప్రత్యేక తాళములో, గతిలో, జతి, తానము, అడవులు, 'కన్మీరా' అను వాటిని కలిగి యుండును. 'కనీ తీరా' అనగా మన నృత్యములందు ప్రదర్శించెడు తీర్మానము.
వారు ప్రదర్శించెడు 18- వన్నముల పేర్లు : (1) గజగ, (2) నయియాది, (3) కిరశ, (4) ఇరాది, (5) ఉదర, (6) సింహరాజ, (7) హనుమ. (8) గణపతి, (9) సవుల, (10) గహక, (11) వై రోది, (12) మయూర, (13) తురగ, (14) సురపతి, (15) ముసలాడి, (16) ఉకుస, (17) ఉరగ, (18) అసాద్రస- అనునవి.
ఈ వన్నము అన్నింటికిని వారి నృత్యమందలి కథలను, భావములను అనుసరించి పేర్లి య్యబడినవి.
ఉదా : గణపతి వన్నమందు గణపతి యొక్క వర్ణన ముండును. 'తురగ' అనునది అశ్వగతిని దెల్పునట్టిది. ఈ వన్నములు ఆయా పాత్రల నృత్యములందు ప్రదర్శింపబడును.
ప్రారంభ శబ్దములు లేక తాళము :
- దోం దోం గణిను జిగత
తానము : తతు తతు తనకు తనెన
- నతు తతు తనతు
- త నెన త త్తతు తనతు
- తనెన తాన తన తనెన తన
- తనెనేన తనెనతు తనతు తందనతు
- తందనాన.
తీర్మానము క్రుబాగజితు కస్తీరము క్రుతగజి క్రుతగజితు జిత క్రుచాన్
పై జెప్పబడిన శబ్దకట్టు పేరు 'తురగవన్నము'- దీనికే 'తురగగతి' యని, మన శాస్త్రములందు పేరు. ఈ గతిని మృదంగముపై పలికించినప్పుడు అచ్చముగా తురగము పరుగెత్తుచున్నట్లు మనకు తోచును. అశ్వగతిని నృత్యమందు ప్రదర్శింపవలసినప్పుడు వీరు ఈగతి ననుసరించి పాద విన్యాసము చూపుదురు.
న. రా.