Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చిన్నయసూరి

వికీసోర్స్ నుండి

చిన్నయసూరి పరవస్తు :

ఆధునికాంధ్ర గ్రాంథిక భాషా ప్రపంచమునకు మూలస్తంభ మనదగినవాడు పరవస్తు చిన్నయసూరి. పరవస్తు
పరవస్తు చిన్నయసూరి
వారి యింటి పేరు. 'సూరి' అతని బిరుదము. 'చిన్నయ'

యనునది ఆతని పేరు. చిన్నయసూరి మదరాను రాష్ట్రము నందలి చెంగల్పట్టు జిల్లాలో శ్రీ పెరుంబుదూరు గ్రామ మున క్రీ. శ. 1808 వ సంవత్సరమున జన్మిం చెను. చిన్నయసూరి తండ్రి పరవస్తు వేంకటరంగయ్య, తల్లి శ్రీనివాసాంబ. వీరు తమిళదేశమున స్థిరనివాసము కల ఆంధ్రులు. పరవస్తువారు చాత్తాద (సాతాని) వైష్ణవులు.

చిన్నయసూరి బాల్యమున విద్యాభ్యాసమునందు కొంతకాలము శ్రద్ధలేక అల్లరిచిల్లరగా తిరిగినను, తరు వాత అమిత శ్రద్ధాసంక్తులతో తన తండ్రియొద్దను, శ్రీ కంచి రామానుజాచార్యుల యొద్దను, శ్రీ రామ శాస్త్రులను విద్వాంసునికడను విద్యాభ్యాసము గావించి, వ్యాకరణ, తర్క, మీమాంసాలంకారాది శాస్త్రము వేదమునందును చక్కని పరిచయమును సంపాదించెను. సంస్కృతాంధ్ర ప్రాకృతములందును, అరవమునందును చిన్నయ గొప్ప పరిశ్రమగావించి, వాని యందు చక్కని పాండిత్యము సంపాదించుకొ నెను. ఇంతేకాక చిన్నయసూరి, తరువాతి కాలమున ఆంగ్ల భాషను గూడ కొంత నేర్చికొనియెను. చిన్నయసూరి చిరుతవయసుననే మంచి పాండిత్యమును సంపాదించు కొనుటయే కాక, హయగ్రీవ మంత్రోపాసకుడై దైవ బలమును గూడ సంపాదించెను.

చిన్నయసూరి తండ్రిగారు చెన్నపురిలో అప్పటి ప్రభు త్వముచేత న్యాయాధికారులుగా నియమింపబడినం దున, సూరియు వారితోపాటుగా మదరాసు చేరుకొనెను. కొంత కాలమునకు సూరిగారి జనకులు మరణించిరి. అప్పుడు చిన్నయసూరి ఉద్యోగమునకయి వెదుక నారం భించెను. మొదట నాతనికి చెన్నపురిలో అప్పను మిషన్ పాఠశాలయందు కొలదిపాటి వేతనముగల యొక చిన్న యుపాధ్యాయ పదవి లభించెను. మరియొక వైపు సూరి తనకున్న కొలదిపాటి యాంగ్లభాషా పరిచయముతో తెలుగు భాషను బోధించు క్రిష్టియను మిషనరీలకు చుండెను. ఇంకొకవైపు పండితపరీక్షలకు వెళ్ళు వారికి వేరుగా భాషా విషయములను బోధించుచుండెను. తరువాత కొన్ని నాళ్ళకు సూరి పచ్చయప్ప పాఠశాల నియమింపబడి యెను. అప్పటి యందు పండితుడుగా

కాలేదు. కింకను మదరాసు విశ్వవిద్యాలయము స్థాపితము కా ఆ పిదప పది సంవత్సరములకు మదరాసు విశ్వవిద్యా లయమును, దానితోపాటుగా నేటి మదరాసు ప్రెసిడెన్సీ కళాశాలయు అవతరించెను. చిన్నయసూరి ఆ కళాశాల యందు పండితులుగా నియమింపబడి, 1861 వ సంవత్స రము వరకును అచటనే ఆ యుద్యోగమున నుండిరి. ప్రెసిడెన్సీ కళాశాలయే మదరాసు విశ్వవిద్యాలయము నకు ముఖ్య కళాశాల కనుక, చిన్నయసూరియే మద రాసు విశ్వవిద్యాలయ ప్రధాన పండితులుగా పరిగణింప బడుచుండిరి. ఆ నాడు మొదట ప్రెసిడెన్సీ కళాశాలకు అధ్యక్షుడుగను, తరువాత మదరాసు విశ్వవిద్యాలయ కార్యదర్శిగను నుండిన ఏ. జే. ఆర్బత్ ్నట్ దొరయే చిన్నయ పాండిత్య విశేషములు కలరి యను బిరుదమును, తత్సూచకమగు సువర్ణ పతక మును బహూకరించిరట ! నాడు మొదలు చిన్నయ 'చిన్నయ సూరి' యయ్యెను. 1861 సం.న రాచపుండు పుట్టి సూరి కళాశాలోద్యోగమును పదలివేయవలసివచ్చెను. ఆ మరు సటి సంవత్సరమే యాతడు జీవయాత్ర చాలించెను ఇది యాతని సంగ్రహ జీవితము. ఇక చిన్నయసూరి రచన ములను గూర్చి పరిశీలింతము. వారికి 'సూరి'

చిన్నయసూరి పేరు తలచినంతనే, మనకు స్ఫురించు నవి ఆతని 'బాలవ్యాకరణము, నీతిచంద్రికలు ' సూరి బాలవ్యాకరణము 1858 వ సం. మొదటి మారుగా ముద్రితమయి ప్రక టింపబడియెను. నీతి చంద్రిక యంతకు ముందే 1853 వ సం.న రచితమయి ప్రకటింపబడినది. చిన్నయసూరి కీర్తిని ఆంధ్రవాఙ్మయ చరిత్రమున శాశ్వ తముగా నిలుపునవి పై రెండు గ్రంథములే యనుటలో సందేహము లేకపోయినను, సూరి రచించిన ఉత్తమ గ్రంథము లింకను బెక్కులుగలవు. చింతామణి వృత్తి, పద్యాంధ్రవ్యాకరణము, సంస్కృతసూత్రాంధ్ర వ్యాక ర ణము, శబ్దలక్షణ సంగ్రహము, విభక్తి బోధిని, ఆంధ్ర ధాతుమాల, అక్షరగుచ్ఛము, ఆంధ్రశబ్దశాసపము, బాల వ్యాకరణము, బాలవ్యాకరణ శేషము, ఆంధ్ర కౌముది యనునవి సూరి వ్యాకరణ రచన అయినట్లు తెలియు చున్నది. ఇదికాక ఆదిపర్వవచనము, నీతి చంద్రిక, ఆంధ్ర కాదంబరి, ఇంగ్లీషు లా చట్టములు భాషాంతరీక రణము, మున్నగు వచనరచనలును, విశ్వనిఘంటు టీక, అకారాది నిఘంటువు మున్నగు నై ఘంటిక రచనలును, పచ్చయప్ప నృపయళోమండనము, చాటుపద్యములు మున్నగు పద్య రచనలును చిన్నయసూరి వెలయించెను. వీటిలో కొన్ని సగములో నే విడువబడిన రచనలు ; మరికొన్ని సంకలన గ్రంథములు; కొన్ని యాంధ్రీకరణములు. ఇవియన్ని యును కాక సూరి 'సుజన రంజని' యను నొక సాహిత్య పత్రికను గూడ స్థాపించి కొంత కాలము నడి పెనట. సూరి వ్రాయనారంభించిన ఈ గ్రంథము లన్నియు పూర్తి యయియున్నచో, ఆంధ్రభాషకు అవి అమూల్యాలం కా రములయి యుండుననుటలో సందేహము లేదు.

చిన్నయసూరి రచనలలో వ్యాకరణమును గురించిన వే యెక్కువ. కొలదిగానున్న అతని పద్యములను పరిశీలించి సూరి మహాకావ్య నిర్మాణము నొకదానిని చేసి యుండిన, ఆతని కదియును గొప్ప కీర్తిని కలిగించియుండు ననిపించును. సూరి సంస్కృతాంధ్రములు రెంటను రసవ త్కవిత వ్రాయగల నేర్పరి. అంతేకాదు, సూరి యెందు లకోగాని, తాను వ్రాయదలచుకొన్న సూత్రాంధ్ర వ్యాక ర ణమును సై తము సంస్కృతములోనే ఆరంభించినాడు.

ఈ సూత్రాంధ్ర వ్యాకరణమును, బాలవ్యాకరణము నకు పూర్వమే సూరి రచించెను. అయినను ఇది విద్యార్థి జనులకు భాషా లక్షణమును సులభముగా తెలుపజాలనిదని భావించి, సూరి అందలి సూత్రములనే కొన్నింటిని తెనిగించి బాలోపయోగముగా బాలవ్యాకరణమును ముందుగా ప్రకటించెనట. ఈ విషయమును చిన్నయసూరి, “మును మదుపజ్ఞం బగుచుం దనరిన వ్యాకృతిని సూత్రతతి యొక కొంతం నుంచి యిది ఘటించితి ననయము బాలావబోధమగు భంగి దగన్." అని బాలవ్యాకరణము చివర వచించెను. సూత్రాంధ్ర వ్యాకరణమును ఆతడు పూర్తిచేసి ప్రకటనానుకూలముగ సిద్ధము చేసినట్లు కానరాదు. ఇందు బాలవ్యాకరణ సూత్ర ములకు మూలము లయిన సూత్రము లనేకములు కలవు. ఇందుగల కొన్ని సూత్రములకు బాలవ్యాకరణమునం దనువాదములు కనుపింపవు. కొన్ని సూత్రములు ప్రౌఢ వ్యాకరణ సూత్రములకు మూలములా ? అనదగినవిగా గనుపట్టుచున్నవి. ఇందు గ్రంథారంభమున సూరి “శాసన మిదం దిగ్భ్రాదర్శకమ్" అని సూత్రించి, "అజ్ఞాత దిశం దేశం జిగమిషోః పార్థస్య మార్గం పృచ్ఛతః పురుషేణ కేన చి దేవం యా హాతి హస నిర్దేశన దిశో దర్శనవ దం శాసనమధి జిగమిషూణాం ప్రథమ ప్రవృత్తా వుపకారకం. భవతీత్యర్థః" అని దానిని వివరించినాడు. అనగా శాస్త్రము దిష్ప్రదర్శనమే కాని సమగ్రముగా శాసకము కాదనుట. ఇందు సూత్రములు, సూత్ర వివరణములు కొన్ని యెడల నుదాహరణములు మాత్రమే కాక, అక్కడక్కడ కొన్ని శ్లోక రూప కారికలును గలవు. సూరిరచిత వ్యాకరణము లలో మరియొక విస్తృత ప్రణాళికగల గ్రంథము ఆంధ్ర శబ్దానుశాసనము.

ఆంధ్రశబ్దానుశాసనమునందు సంజ్ఞ, సంధి, తత్సమ, ప్రకీర్ణక క్రియా, తద్భవ పరిచ్ఛేదములు కలవు. ఇది చింతామణి సంప్రదాయములను బాలవ్యాకరణము కంటె ఎక్కువగా పాటించి రచించిన వ్యాకరణము. ఇందు యశ్రుతియును, గ్రామ్యముతోగూడ భాషకు చతుర్విధత్వమును. హలంత శబ్దములలో గుణవదాన్య గుణవదాది విభజనమును గాననగును. సూత్రాంధ్ర వ్యాకరణములోని సూత్రములకు అనువాద సూత్రము లును, చింతామణి సూత్రానువాదములును ఇందు గలవు.. అయినను ఇందు కొంత స్వతంత్రత లేకపోలేదు. కొన్ని సూత్రములు బాలవ్యాకరణ సూత్రములను పోలియే యున్నవి. కాని వాటికి బాలవ్యాకరణ సూత్రముల కున్నంత బిగువు కానరాదు. ఆ బిగువును సాధించుటకు చిన్నయసూరి కావించు ప్రయత్న మిందు కాననగును. అయినను

చిన్నయసూరి మరియొక పద్యాంధ్ర వ్యాకరణమును రచించెను. దీనిలో నలువది యెనిమిది పద్యములు గలవు. ఇది అసమగ్రము. మొత్తముమీద బాల వ్యాకరణము కా ఇతడు ఎనిమిది తొమ్మిది వ్యాకరణములను అంతకుముందు రచించినట్లు తెలియుచున్నది. ఇట్లెంతో కాలము వ్యాకరణరచనమునకు తన శక్తిని వినియో- గించినవా డగుటచేత నే, చిన్నయసూరి బాలవ్యాకరణ మును అంత చక్కగా రచింపగలైనట. బాలవ్యాకరణ రచన మే చిన్నయసూరికి ఆంధ్ర వ్యాక ర్తలలో ప్రముఖస్థానము నొసంగి, ఆతనిని లాక్షణిక సార్వభౌముని గావించినది. నేడాంధ్రవ్యాకరణ గ్రంథ ములలో దేనికిని బాలవ్యాకరణమున కున్నంత ప్రచా రము లేదు. దానిపై వ్రాయబడినన్ని వ్యాఖ్యలు తెనుగు వ్యాక రణములలో ఏ యితర గ్రంథములపైనను వ్రాయ బడ లేదనినచో, దాని వైశిష్ట్యము కొంత తెలియును. ప్రాచీనాంధ్ర వ్యాకరణముల యందు ఆంధ్రశబ్ద చింతా మణి ఇతర వ్యాకరణముల ప్రచారమును తగ్గింప జేసినట్లే, బాల వ్యాకరణము తనకు ముందు ప్రచారమున నున్న వాని నొక్కమారుగా వెనుకకు నెట్టివేసినది. అంతే కాదు. ఆనాడు మొదలు చిన్నయసూరి యొప్పుకొన్న పదమే సాధువుగను, ఆత డనుశాసింపని రూపము అసాధువుగను భావింపబడజొచ్చినది. అయినను బాల వ్యాకరణ విరుద్ధము లయిన ప్రాచీన ప్రయోగములు లేకపోలేదు. సత్యము నకు, బాల వ్యాకరణకర్త ఆంధ్రభాషా సర్వస్వమును తన వ్యాకరణమునకు లొంగిపోవలె నని యాశింపను లేదు.

"దిక్రదర్శనముగఁ దెలిపెద నిందు ల క్షణముగానఁ బూర్వకవుల లక్ష్య ములను లాఁతి లక్ష్యముల గాంచి తక్కు ల క్షణ మెఱింగికొనుఁడు చతురమతులు"

అని చిన్నయసూరి తన గ్రంథము భాషా సామాన్యపు స్వరూపమును మాత్రమే చూపగలదనియు, ప్రయోగ విశేషముల సాధనమునకు ఇది యుద్దేశింపబడ లేదనియు, అట్టి వాని నెరుగగోరువారు ఇతర గ్రంథముల నరయ వలయుననియు వచించియున్నాడు. బాల వ్యాకరణము, దాని పేరును బట్టియే విద్యార్థులకు సులభముగా భాషా నియమములను దెలిపి సలక్షణమయిన వచనరచనమును అలవడ జేయుటకు ఉద్దేశింపబడినదని యెరుగనగును. ఈ విషయమునే చిన్నయసూరియును బాల వ్యాకరణ వీఠిక యందు స్పష్టముగా జెప్పియున్నాడు. విద్యార్థులకు సులభ ముగా బోధించుటయే గ్రంథకర్త లక్ష్యము గనుక తదను గుణముగనే చిన్నయసూరి ఈ బాల వ్యాకరణ రచనము సాగిపోయినది.

తనకున్న సంస్కృతాంధ్ర వ్యాకరణములందలి పాండి త్యమును, రచనానై పుణిని ఉపయోగించుకొని, చిన్నయ

సూరి బాల వ్యాకరణములోని సూత్రములను మిక్కిలి చక్కగా రచించెను. అంతేకాక, సంస్కృతమున భట్టోజీ దీక్షితులు కూర్చిన సిద్ధాంత కౌముది పద్దతి ననుసరించి సూత్రములును, సూత్ర వివరణములును, ఉదాహరణము లును క్రమముగా నుండునట్లు రచనము సాగించెను. అక్క డక్కడ సంస్కృత వ్యాకరణ మర్యాదలను ప్రవేశ పెట్టెను. సంజ్ఞాది పరిచ్ఛేదములుగా గ్రంథమును విభజించెను. తాను పూర్వము రచించిన వ్యాకరణములనుండియు, అంతకుపూర్వమే రచింపబడి ప్రచారమందుండిన అనేక ఇతర ఆంధ్ర వ్యాకరణములనుండియు తనకు వలసిన విషయములను గ్రహించెను. తన ప్రణాళికకు అనుగుణ ములు గాని వానిని వదలివేసెను. ఇవియన్నియు కలిసి బాలవ్యాకరణమున కొక విశిష్ట స్వరూపము నొసగి, దాని బహుళ ప్రచారమునకు కారణమయ్యెను. ఇది యంతయు సూరి తన ప్రతిభచే సాధించిన విజయమేకాని అన్యము కాదు .

సూరి బాల వ్యాకరణము, హరికారికలకు అనువాద మను నొక వాదము కొంతకాలము క్రింద కొందరిచే ప్రచా రము చేయబడెను. కాని వీరేశలింగము మొదలగువారు ఆ వాదమును ఖండించి, హరికారికలే బాల వ్యాకరణ సూత్రములకు సంస్కృతీకరణము లని సహేతుక ముగా ఏమయినను ఈనాటి గ్రాంథి నిరూపించియున్నారు. కాంధ్ర భాషాస్వరూపమును తీర్చిదిద్దిన ఘనత బాల వ్యాకరణ కర్త దనుట యథార్థము.

లక్షణకర్తగా చిన్నయసూరికి ఘనమయిన యశస్సు నొసగినది బాలవ్యాక రణము కాగా, రచయితగా, ఆతని కీర్తిచంద్రికలను వ్యాపింపజేసినది 'నీతిచంద్రిక'.

నీతిచంద్రిక సంస్కృత పంచతంత్ర, హితోపదేశము వెలసిన లాధారముగా తెలుగు భాషలో గ్రంథము. ఆంధ్రవచనము ఎంత బిగువుగా నడవగలదో రుచి చూపిన యు త్తమ రచన యది. సంస్కృతములోని హితోప దేశమునకుగాని, పంచతంత్రమునకుగాని రచనమునం దింత బిగువు కానరాదు. ఆ విధానము వేరు; ఈ విధానము వేరు. చిన్నయసూరి నీతిచంద్రికలోని వచన రచనమును ఆంగ్ల భాషయందు వ్యాసకర్తగా సుప్రసిద్ధుడయిన బేకన్ మహాశయుని ఆంగ్లవచనముతో పోల్చవచ్చును. బేకన్ మహాశయుని రచనయందు చిన్నచిన్న వాక్య ములు కానవచ్చును. ఆ చిన్న వాక్యములందే ఎంతో లోకానుభవమును, జ్ఞానమును నిండియున్నవిగా గను పట్టును. అందులోని భాష ప్రాచీనతను బ్రకటించును. ఒక్కొక్క వాక్యమొక నీతివచనమయి, లోకో క్తిగా బ్రయోగింప దగియుండును. మధ్యమధ్య లాటిను వాక్యములు, లాటిను పదవిధులును పానకములోని మిరియములవలె వచ్చుచుండును. తెనుగున చిన్నయసూరి వచనరచనయు నిట్టిదే. చిన్న చిన్న వాక్యములు, ఒక్కొక్క వాక్య మొక్క లోకోక్తిగా నుండుట, మధ్యమధ్య క్తిగా నుండుట, మధ్యమధ్య సంస్కృత వాక్యములు, సంస్కృత పదముల పలుకు బడులు, భాషలో ప్రాచీనత - ఇవి యన్నియు కలిసి చిన్నయసూరి వచనమున కొక విశిష్టత నొసంగినవి. నీతిచంద్రిక లో నివాక్యములలో సూత్రకర్తయయిన చిన్నయసూరి గోచరించుచుండును.

చిన్నయసూరి నిత్యజీవితము మిక్కిలి నిరాడంబర మయిన దయ్యును, మిక్కిలి నియమబద్ధ మయినదని విందుము. ఆతడు స్ఫురద్రూపిగానుం డెనట ! కలువలపల్లి ౦డెనట! రంగనాథశాస్త్రిగారను సుప్రసిద్ధ పండిత న్యాయమూ ర్తుల యింట చిన్నయసూరి యుద్ధండ పండితులముందు నిలచి, పూర్వసంసిద్ధత లేకుండగనే అలంకారశాస్త్రమును గురించి ఒక నాడు గంటల తరబడి శ్రుతి రంజనముగా నుపన్యసించెనట! ఆ వినువారు సాయం కాలమయినను, భోజన సమయమయినను, కాలమునే మరచిపోయి సూరి గారి ఉపన్యాసమున మునిగిపోయిరట ! ఇది ఈ తరము వారికి వినికిడి వలన నెరుగదగినదే కాని, నీతిచంద్రిక వచన రచన చూచినచో అట్టిది చిన్నయసూరికి సహజమేయని తోచకమానదు. సూరి నీతిచంద్రికలో మిత్రలాభ, మిత్రభేదములను రెండు ప్రకరణములనే రచించెను. కడమ వానిని కందుకూరి వీరేశలింగముగారును, కొక్కొండ వేంకటరత్నము పంతులుగారును వేరువేరుగా రచించి పూరించిరి. ఆంధ్రభాష యున్నంతకాలము నిలిచియుండగల కీర్తిమూర్తి చిన్నయసూరి.

అ. రా. శ.