శివపురాణము/పార్వతీ ఖండము/జగన్మంగళకరమైన కల్యాణ ఘడియలు

వికీసోర్స్ నుండి

సమస్త లోకాలూ ఎదురు చూస్తున్న వివాహవేళ రానే వచ్చింది.

గర్గమహాముని ఆచార్యత్వంలో వివాహవేడుక లారంభమయ్యాయి.

సుముహూర్తవేళ..

మంగళ స్వరాలు, మంగళ స్వరాల మధ్య కన్యాదానం జరుగుతోంది. తంతు ప్రకారం ఈశ్వరుడి ప్రవర చెప్పించాల్సి ఉంది.

హిమవంతుడు ఈశ్వరుని ప్రవర అడగ్గా, వినీ విననట్లూరుకున్నాడు అతడు.

ఆ మౌనం బైటపడనీయకుండా, నారద మహర్షి అదేపనిగా వీణ మీటసాగాడు. ఎవరు చెప్పినా నారదుడు ఆపలేదు. చివరకు కన్యాదాత జోక్యంతో వీణానాదం ఆపిన నారదుడు ఇలా అన్నాడు.

"ఓ మంచుకొండల రేడా! బ్రహ్మ - విష్ణువులకే అంతుపట్టని రుద్రుడి కుల గోత్రాలతో ప్రవర చెప్పడం మనతరమా? ఎవరు పర బ్రహ్మమో, ఎవరు నిర్గుణులో, ఎవరు నిరాకారులో, ఎవరు ప్రకృతికి అతీతులో, ఎవరు సమస్తమూ తానే అయినవారో ఆయన పేరూ - గోత్రమూ - ప్రవరా కావాలా? మీ పుణ్యవశాన అల్లుడైన ఆ జగన్మంగళ మూర్తిని అడగాల్సిన మాటా ఇది?" అని హిమవంతునికి బుద్ధిగరపి "అయినప్పటికీ చెప్తున్నాను - విను! నాదం శివమయం. శివుడు నాదమయుడు. ఇక నాదానికి కులం గోత్రం ఏం వుంటాయ్ ? కనుకనే నీ ప్రశ్నకు జవాబుగా నేను వీణావాదన సూచ్యంగా చేశాను. అది నీకు అర్థం కాలేదు. ఇప్పుడిలా వాచ్యంగా చెప్పాల్సివచ్చింది" అనడంతో అందరికీ శివతత్వం కాస్త అవగతమైంది. పూర్తిగా అర్ధమయిందని ఎవరైనా అనుకుంటే, అది మళ్లీ పొరపాటే అవుతుంది.

కన్యాదానం జరిగిన వెంటనే మిగతా తంతులన్నీ మహావెడుకగా జరిపించాడు బ్రహ్మ.

తదనంతరం భవానీ భర్గులిద్దరూ భక్తి భావంతో బ్రహ్మాసనా సీనుడైన పితామహునికి ప్రణామాలు ఆచరించారు. వధూవరులపై అమృతాక్షతలు చల్లి ఆశీస్సులందజేశాడు ఆయన.