వాడుకరి:Jahnavi morla/sand box/అధ్యాయం2

వికీసోర్స్ నుండి

(అస్సీరియా) సింధుతీరంలో చంద్రకళాదేవి తన జ్యోత్స్నామందహాసాలలో బిడ్డలను ఓలలాడించి, వారి జీవితాలు అమృతమయాలు ఆనందపులకితాలు చేసినది.

ఆంధ్రమాతా! నీరూపము స్నిగ్ధపూర్ణ కౌముదీస్వచ్ఛము. నీ వామహస్తాన పుండరీకాలు శ్వేతకుముదాలు లీలాపుష్పాలై విలసిల్లుతున్నవి. నువ్వు త్రిభంగమూర్తివి. నీ అమృత పయస్సులను గోదావరీ కృష్ణవేణ్ణా పినాకినీ నాగావళీ తెలివాహ నదులలో ఆస్వాదిస్తున్నారు ఆంధ్రులు. భద్రాచల వేదాద్రులు నీ ఉత్తుంగ పయోధరాలు. నీవు సదాకోటి పత్రాల స్వర్ణ పద్మాసీనవు.

ఆంధ్రదేవీ! నీ సౌందర్యము చూచి ముగ్ధుడై నీ అంకమైన శ్రీశైలమునందే వసించినాడు మల్లికార్జునుడు. ఆనందమయీ! అమృతమయీ! ఆంధ్రమాయీ! నువ్వు చంద్రకళాదేవివి అవడంచేత కళలన్నీ నీ పెదవులలో నీ భ్రూయుగ్మంలో, నీ హస్తాంగుళులలో వికసించుతున్నవి. నీ కంఠము మధురాతిమధుర గాంధర్వము! నీ దివ్యవాక్కు మహాకావ్యము “ఓ దినం సుందరీ! నీ తనయులు జగదేకసుందరులు. నీ సుతులు లోకరాధ్యులైన! ప్రజ్ఞావంతులు. కత్తిపట్టినా గంటముపట్టినా కుంచె పట్టినా గొడ్డలి పట్టినా విల్లు పట్టినా విపంచి తాల్చినా నీ పుత్రుల ఎదుట నిలువ గలిగినవారేరీ? వేద మాత నీతనయుల ముఖమందే వసిస్తూంది.

ఆంధ్రమాతా, భరతమాతకు అనుగుబిడ్డవు అపరాజితాదేవివి. అఖండ కీర్తి విశారదవు, ఓ ఆంధ్రదేవీ! నువ్వు తెలుగు తల్లివి, నీది తీయతీయని తెలుగుభాష పూర్ణవర్ణ మాలాశోభితయై వేదాన్నే మధురంగా పాడగలిగిన మంత్రభాష పరుషధ్వనులు నీచే సారళ్యమాధుర్యాలు అలవరచుకొన్నవి. ఓ ఆంధ్రమాతా! నీ కుమారుడు ఆపస్తంబుడు, బ్రహ్మర్షి సుమా! ఆతడు అతని సోదరుడు బోధాయనుడు!,

చంద్రకళాదేవి వయిన ఆంధ్రీ! శాతవాహనులు నీ అనుగు బిడ్డలు శ్వేతతారాదేవి వయిన ఓ తెలుగుతల్లీ, సిద్ధ నాగార్జునుడు నీకు గారాపు బిడ్డడు. మాధ్యమికవాదం నీయందుదయించి లోకాన్ని ఉద్ధరించింది. ఓ దివ్యసుందరీ! నీ బాలికలయిన గౌతమీ వాసిష్టదేవులు లోకైక సుందరులు. వారి బిడ్డలయిన శాతకర్ణి పులమావి చక్రవర్తులు ఆంధ్ర తేజస్సును తారాపథాని కందించినారు. త్రిలోకమోహినులైన నీ యాడుపడుచుల అందానికి, అలంకారకౌశలం పూలకు తావిలా సహజంగా అబ్బింది. ప్రసాధన శిల్పంలో సర్వస్త్రీజగత్తుకు వారిది ఆచార్యపీఠం.

ఆంధ్రదేవీ! నీ యనుగుకూతుళ్ళు పురుషులతో సమానంగా విద్యలూ, వీర వ్యవసాయ దీక్షలూ, లలితకళా కౌశలమూ నేర్చిన వీరసతులూ, వీరమాతలు. ఆనందమూర్తీ! ఆంధ్రమూర్తీ! నీ కన్నులలో లోకాల వెలిగించు వెలుగు, నీ నవ్వులో దేశాల తేలించు ఆనందము, నీ నడకలో సీమసీమల నాగరీకాలు దిద్దే ఒయ్యారమూ.

ఆంధ్రీ! నీవు కలువకంటివి, చిలుకల కొలికివి, తేనెవాతెఱదానవు తీగ చేతుల దానవు, పూబంతి గుబ్బెతవు, నీ నుదుట వెన్నెలవెలుగులు, నీ నోట కోకిలాలాపాలు, నువ్వు కులుకు మిటారివి, కటారి కత్తివి.

ఆంధ్రీ! నీ బిడ్డలు నిన్ను ప్రేమింతురు. నిన్ను పూజింతురు, నీ ఎదపై వ్రాలుదురు. నీకై తమ సర్వమూ అర్పింతురు.

తెలుగుతల్లీ! నీకు ఏటికోళ్లు.

ప్రథమ భాగం

విజయపురం

అడవి బ్రహ్మదత్తప్రభువు ఉత్తమ కవి, ఉత్తమ సేనాపతి, ఉత్తమ రాజనీతి విశారదుడు. అతనికి కవిత్వావేశం కలిగితే ఆంధ్రప్రాకృతంలో, దేవభాషలో అనర్గళంగా గాథలు, కావ్యాలు సృష్టిస్తాడు. అటువంటి సమయాల్లో అతడు తన రాజనీతిని సేనాపతిత్వాన్ని మరచిపోతాడు.

అడవి బ్రహ్మదత్తప్రభువు ఆపస్తంబ సూత్రుడు, కృష్ణయజుర్వేద శాఖాధ్యాయి, విశ్వామిత్ర అఘమర్షణ దేవరాతత్రయార్షేయ సాంఖ్యాయనస గోత్రజుడు. బ్రహ్మదత్తుని తండ్రి ధనకమహారాజ అడవి ప్రియబల మహా సేనాపతి, దేవదత్తాభిధానుడు. బ్రహ్మదత్తప్రభువు తల్లి భరద్వాజ గోత్రోద్భవ, పల్లవబుద్ధీ చంద్రప్రభువు తనయ సాంఖ్యాయనస గోత్రము కౌశిక గోత్రోద్భవము.

ఆంధ్ర శాతవాహనులు కౌశిక గోత్రోద్భవులు. విశ్వామిత్ర సంతతి వారు. కాబట్టే వారు తమతో సంబంధాలు చేయుటకని భరద్వాజులను వాసిష్టులను కాశ్యపులను మాద్గల్యులను హరితసులను కుటుంబాలుగా కృష్ణా గోదావరీ తీరాలకు తీసుకొని వచ్చినారు. వారందరు మహాంధ్రులైనారు.

కౌశికులలో రానురాను రెండు వంశాలు ఎక్కువ ప్రాముఖ్యము సముపార్జించు కొన్నవి. ఒక వంశము ఆ కాలంలోనే కృష్ణవేణ్ణకు ఎగువ అడవులు నిండి ఉన్న శ్రీపర్వత ప్రాంతాల ఆశ్రమాలు ఏర్పరచి, ఆటవిక ప్రభువుల లోబరచుకొని, ఆర్యనాగరికత వారి కలవరచి, క్షత్రియత్వమిచ్చినారు. కొందరికి శూద్రత్వ మిచ్చినారు. ఆటవికులలో మంత్ర వేత్తలకు వైశ్యత్వ మిచ్చినారు. వారి దేశము ధనకదేశము, వారు ధనకులై నారు. వారు చక్రవర్తులగు శాతవాహనులతో విడపడ్డవారు అన్న గుర్తుగా సాంఖ్యాయనగోత్రం తీసుకొన్నారు.

ఈ కౌశిక గోత్రికులు విశ్వామిత్ర వంశంనుండి సూటిగా వచ్చినవారు. తమ వంశఋషి దర్శించిన గాయత్రి మంత్రమునకున్న సాంఖ్యాయనస గోత్రమును వారు గ్రహించిరి. అడవిని సస్యశ్యామలంగా, బహుజనాకీర్ణంగా చేసినారు. గనుక ఈ సాంఖ్యాయనులకు అడవివారు అను బిరుదనామం వచ్చింది. ఆ అడవి ఫలభూమి అవడంవల్లను అక్కడ అనేక బంగారుగనులు రత్నాలగనులు ఉండడంవల్లను, అది ధనకదేశం అయింది. వీరే కృష్ణాతీరంలో ధనకటక నగరం నిర్మించారు.

శ్రీపర్వతము వీరి పర్వతము. కృష్ణవేణ్ణ ప్రవహించే ఆ లోయ అడవి వారిది. వారు ఆ సీమకంతకు ఋషులు, ప్రభువులు. ఈ అడవి సాంఖ్యాయనులే విజయపురము నిర్మించారు. వీరే శ్రీశైలమునందు మల్లికార్జునదేవుని ప్రతిష్ఠించినారు. శాతవాహన సామ్రాజ్యము స్థాపించిన ప్రథమార్య ఋషి కౌశిక గోత్రోద్భవుడైన దీపకర్ణి కుమారుడు శాతవాహనుడు. ఆ శాతవాహనులు విజృంభించి తమ ప్రథమాంధ్ర ముఖ్యపట్టణమైన శ్రీకాకుళము వదలి సాంఖ్యాయనులు శుభప్రదము కావించిన శ్రీపర్వతానికి దిగువ వారు నిర్మించిన ధాన్యకటక మహానగరమును, ధనకులకోరికమీద ముఖ్యనగరం చేసుకొన్నారు. ఆ భూమి బంగారు పంటలు పండేది. కాబట్టి ఆ నగరం ధాన్యకటక నగరం అన్న పేరు పొందింది.

శాతవాహన సామ్రాజ్యము విజృంభించిన కొలది అడవి సాంఖ్యాయనుల ప్రాబల్యము తగ్గి, శాతవాహనులకు వారు సామంతులై ధనకటకాన్ని శాతవాహనుల కర్పించినారు.

శాతవాహనులలో శ్రీముఖుడు పాటలీపుత్రపురం రాజధానిగా మగధ రాజ్యమూ, సకల భూమండలము సార్వభౌముడై ఏలిన సుశర్మ కాణ్వాయన చక్రవర్తిని ఓడించి, తాను ఆంధ్రదేశానికే కాకుండా సర్వభూమండలానికి చక్రవర్తి అయి మగధ సింహాసనం ఎక్కినాడు.

సూర్యచంద్రుల సంతతివారై కృతయుగ కాలంనుంచి మనుష్యానంద రూపులైన చక్రవర్తులు సకలభూమండలం ఏలుతూ ఉండేవారు. ప్రథమంలో ఇక్ష్వాకు వంశస్థులు అయోధ్యలో చక్రవర్తి సింహాసనం స్థాపించారు. అలా కృత త్రేతాయుగాలు గడిచి పోయినాయి. ఆ వెనుక కురువంశరాజు హస్తినాపురంలో ద్వాపర యుగంలో చక్రవర్తి సింహాసనల నెలకొల్పినారు. అభిమన్యు సుతుడు పరీక్షిత్తు తర్వాత జనమేజయుడు మొదలయిన చక్రవర్తులకు బిమ్మట చక్రవర్తిత్వం శిశునాగవంశజులయిన మహా పద్మనందులకు సంక్రమించినది. వారు పాటలీపుత్రంలో చక్రవర్తి సింహాసనం స్థాపించారు. నందుల నాశనంచేసి మౌర్యులూ, వారిని నాశనం చేసి శృంగులూ వారిని నాశనంచేసి కాణ్వాయనులూ వరుసగా చక్రవర్తు లయ్యారు.

ఈ మధ్య రెండు పర్యాయాలు కౌశాంబిలో ఉదయనుని కాలంలో చక్రవర్తిత్వం ఉదయనుడు, ఆయన కుమారుడు నరవాహన దత్తుడు అనుభవించారు. కాని సింహాసనం పాటలీపుత్రంలోనే ఉండిపోయినది.

కాణ్వాయనుల నుక్కడగించి శ్రీముఖశాతవాహనుడు జంబూద్వీప చక్రవర్తి అయిన వెనుక, ఆంధ్రక్షత్రియులలో గుప్తవంశంవారు శాతవాహనులకు రాజప్రతినిధులుగా ఉండి శాతవాహన సామ్రాజ్యం విచ్ఛిన్నం కాగానే స్వాతంత్య్రం వహించి ఉత్తర భారతీయ చక్రవర్తు లయ్యారు.

ఇప్పుడు శాతవాహన చక్రవర్తి యజ్ఞశ్రీశాతకర్ణి రాజ్యం చేస్తూ ఉన్నారు. అడవిస్కంధ విశాఖాయనక బ్రహ్మదత్త ప్రభువు తండ్రి ప్రియబల దేవదత్తుడు తపస్సు చేసుకొనుటకు శ్రీ శైలక్షేత్రాటవులకు వెడలిపోయినాడు. తల్లి భారద్వాజనియైన నాగసిరిదేవి కుమారునకు వివాహము కాగానే తానూ భర్తగారి యాశ్రమమునకు తాపసిగా పోవ సంకల్పించుకొని విజయపురమునందే ఆగిపోయినది. “నాయనా! మీ తండ్రిగారు కోరికోరి విసుగెత్తిపోయి, చివరికి వారి కోరిక నెరవేర కుండగనే, తపస్సుకు వెళ్ళిపోయినారు. ఎక్కడ ఉన్నదయ్యా మా కోడలు?”

“మీ కోడలా అమ్మా నాకేమి తెలియును? నేను గాథలు పాడుతూ కలలుకంటాను, యుద్ధంచేస్తూ కలలు కంటాను, రాజసభలో కూర్చుని కలలు కంటాను. కలలు కనేవానికి పెళ్ళి ఎందుకు?”

“కలలుకనడం అందరికీ సామాన్యమే. అందరూ పెళ్ళిళ్ళు చేసికొనడం మానివేశారా?”

“అందరూ కలలు కంటారు. అయితే నన్ను తారసిల్లే స్వప్నాలు అవేవో చిత్రంగా ఉంటాయి.”

“చిత్రంగా కలలుకాంచేవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరా?”

“అదికాదమ్మా! కలలకు పెళ్ళికి సంబంధం ఉందనికాదు, నా విషయంలో కొన్ని చిత్ర విచిత్ర భావాలు నన్ను పొదివికొని ఉన్నాయి. వానికీ నాపెళ్ళికీ సంబంధం ఉంది.”

“ఇదేమి చిత్రమైనవాడమ్మా! ఎక్కడి మనుష్యుడివి నాయనా!” అడవి బ్రహ్మదత్త ప్రభువునకు ఇరువది ఒకటవ సంవత్సరము వచ్చింది. “గృహస్థువైగాని ధనకసింహాసనం ఎక్కకు నాయనా!” అని తండ్రి ఆదేశించడంవల్ల బ్రహ్మదత్తునికి ఇంకా రాజ్యాభిషేకం జరుగలేదు. ధనకరాజ్యానికి ముఖ్యనగరం గురుదత్తపురం.

స్కంధవిశాఖాయనక బ్రహ్మదత్తుడు ఏదో ఆవేదన పడుతున్నట్లు మహాసామంతులు చూసినారు. ఆతని తండ్రి మహారాజు శాంతిమూలునికి మహామంత్రి, మహాసేనాపతి, మహాదండనాయకుడు. ఆ ప్రియబల దేవదత్త ప్రభువు శ్రీశైలం వెళ్ళిపోగానే తానే ఇక్ష్వాకు మహారాజునకు మహామంత్రి, మహాసేనాపతీ, మహాతలవరి, మహాదండనాయకుడు కావలసి వచ్చింది.

శాతవాహనులకు మహాతలవరియై, మహాదండ నాయకుడై, తాతగారు ధనక విజయశ్రీ ప్రభువు తన చిన్నతనంలో తనకు విద్యగరపుతూ “నాయనా! మా తాతగారినుండి విన్న శాతవాహన గాథలు జగదద్భుతములు. శాతవాహన సామ్రాజ్యము తూర్పు తీరంనుండి, పడమటి తీరానికి వ్యాపించి ఉండేది” అన్నారు.

“ఆ స్థితిని దాయాదులమూ, సామంతులమూ అయిన మనం సర్వదా కాపాడాలి” అన్నారు.

నాగర్జునదేవుడు విజయపురంలో నూటపది సంవత్సరాలు ఏమీ ఆరోగ్యం చెడకుండా, కృష్ణవేణ్ణకు ప్రక్కనున్న శ్రీపర్వతాశ్రమంలో ఉన్నారు. చిన్న తనంనుంచీ దేశాలు తిరిగి ఇక్కడే తపస్సుచేసి ఇక్కడే మహాసంఘారామం స్థాపించి పార్వతీయ సంప్రదాయం నెలకొల్పినారు. ఆ సంఘారామ పర్వతం ప్రక్కనే విజయపురం వెలిసింది. ఆ బోధిసత్వుని పేరనే ఆ పర్వతాలకు నాగార్జున పర్వతాలు అని పేరు వచ్చింది.

తన తాతగారు శ్రీ నాగార్జునదేవుడు శివుని అవతారమని బోధించినారు, మల్లికార్జునుడే నాగార్జునుడని వారు చెప్పుచుండేవారు. బౌద్ధులు వారిని బుద్ధావతార మంటారు. ఆ పరమ మహర్షి తనకు గురువులైనారు.