వల్లభాయి పటేల్/బాధితులకు సహాయము

వికీసోర్స్ నుండి

బాధితులకు సహాయము

1927 లోఁ బ్రళయము వచ్చినట్లు గుజరాతు వఱదల మయమైపోయెను. పటేలు పెక్కుమందివాలంటీర్లను సమీకరించి ధన ధాన్యాలను సంపాదించి, పీడితులకు బహువిధముల సహాయము చేసి ప్రజలవల్లనేగాక ప్రభుత్వమువారిచేఁగూడఁ బ్రశంసింపఁబడెను.

బార్డోలీ సత్యాగ్రహము

"భూమిని దున్ని యితరుల ప్రాణములను బోషించునట్టి సాధనములను గల్పించువారిని దిండి లేకుండ మాడ్చి చంపివేయునట్టి చావుకళ నిప్పటి రాజకీయవేత్తలు తమ యద్భుత రాజనీతిలోఁ గనిపెట్టిరి."

-"రూ సో"

వల్లభాయి కార్యక్రమ మంతయు స్థానికముగనే యుండెను. బార్డోలీ సత్యాగ్రహముకూడ స్థానికమేగాని దీని వల్లనే యాయనపేరు భారతదేశమందంతట విఖ్యాతమైనది. ఈ సందర్భములో నాయనకు మహాత్ముఁడు 'సర్దారు' అను బిరుదము నిచ్చెను.

అనేకులకు బిరుదు లీయఁబడినవికాని యాయనకంటె నర్హతతో బిరుద మార్జించినవా రరుదు. సర్దారు బార్డోలీలో నఖండవిజయము గాంచుట కాయనకు రైతుల యెడఁ గల యద్వితీయానురాగమే కారణము.