మూస:కాశీమజిలీకథలు/పదవ భాగము/304-305 పుటలు

వికీసోర్స్ నుండి

ఊరికిఁ బోయివచ్చిన బిడ్డలం జూచినప్పుడే యెక్కువ ప్రహర్షము గలుగును. మృతినొందినదని నిరాశ జేసికొనిన పట్టి గనంబడినపు డెట్టి యానందము గలుగునో యది యనుభవైకవేద్యముగదా.

అవంతీశ్వరుఁడు మాచరిత్రము విని మమ్ము జాలగౌరవించుచు మాపయన మాపి యీక్రోధనుని బలపరాక్రమములు రాజ్యవైభవములు పెద్దగా నగ్గించుచు నందుబోయి యాద్వీపవిశేషములు చూచి వత్తముఁ రండని యెక్కువఁగా బట్టుపెట్టెను. క్రొత్తదేశములు చూచుటకు మనకుఁ జాలవేడుక గలిగియున్నదికదా! అతనిమాట ననుమతించి యప్పుడె బయలుదేరి యోడలమీఁదుగా మాపరివారముతోఁ బదునాలుగుదివసముల కీయూర సేరఁగలిగితిమి.

ఈరాజు తన నగరము శత్రువుల యోడలు సేరకుండ సముద్రములో యంత్రపుగనుల వైపించెనఁట. కర్ణధారు లారహస్యము నెఱింగినవారగుట నాగనులకుఁ దగులకుండ నౌకల దీరమును జేర్చిరి. మారాక విని క్రోధనుఁడు కలములకడ కెదురువచ్చి సగౌరవముగా మమ్మింటికి దోడ్కొనిపోయి యల్లుండ్రకుఁ జేయువిందులు చేయుచు యంత్రరహస్యములఁ దెలుపుచు స్థానవిశేషములఁ జూపించుచు మమ్ము విడువక సంతతము మాతోఁ దిరుగుచుండెను.

మే మెప్పటి కప్పు డింటికిఁ బోవలయునని బయనమగుచుండ నేదియో నెపము పన్ని వారింపుచు మఱి పదిదినము లాపెను. మొన్న సముద్రములోఁ బగడపుతీగెలు గలతావు దాపున నున్నదని విని యోడలెక్కి యక్కడకుఁ బోయితిమి. ఆవింత జూచి మరలివచ్చుచుండ దారిలో రాజభటు లెదురుపడి మీయౌద్ధత్యం బుగ్గడించుచు నృపతి పరాభవపరాక్రమ మంతయుం దెలియఁజేసిరి.

అప్పుడు మేము తొందరగా నింటికి వచ్చి క్రోధనుని యపజయంబు విని యతని ననునయించుచు నుదుటుగఱపి మనగుఱ్ఱము లెక్కి యిక్కడికి వచ్చితిమి. దైవకృపచే మనము గలసికొంటిమని తమవృత్తాంతమంతయు వారి కెఱింగించిరి. ఒండొరు లత్యుత్సాహముతో మాట్లాడుకొనుచుండిరి. మనవీరులు వారిం దమవెంటఁబెట్టుకొని యిక్కడికిఁ దీసికొనివచ్చుచున్నారు. రణభేరీనాదములు తూర్యనాదములుగా మారినవి. ఇంతపట్టు చూచివచ్చితిని. వా రీపాటికిఁ గోటసమీపమునకు వత్తురని యావృత్తాంతమంతయు వార్తాహరుం డెఱింగించెను.

ఆకథ విని చారుమతి క్రోధనునితో బాబా! నే జెప్పలేదా? ఇతరుల కట్టిసాహసవిక్రమము లుండవు. నీ వింక జింతింపఁబనిలేదు. వారుగూడ నల్లుండ్రేకదా యని యూరడం బలుకుచున్నంతలోఁ తూర్యనాదములు వినంబడినవి. క్రోధనుండు లేచి యటు చూచుచుండగనే యారాజకుమారు లందఱు నంతఃపురమునఁ బ్రవేశించి క్రోధనుం గాంచి నమస్కరించిరి.

హరివర్మ తమ్ములచరిత్రము క్రమ్మఱఁ గ్రోధనున కెఱింగించెను. అతండు సిగ్గుపడుచు విక్రమునిపరాక్రమ మెక్కుడుగా వినుతింపుచుఁ దత్సమయోచితముగా వారినెల్ల నభినందించెను. విక్రముండును బంధుత్వము దెలియక తాము గావించిన యవమానము మఱువవలయునని క్రోధనునిం బ్రార్థించెను.

క్రోధనుండును విషాదంబు విడిచి ప్రీతిపూర్వకముగా వారి నాదరింపుచుఁ గొన్నిదినంబులు దనయింట నుంచుకొని యనేకమహోత్సవములు గావించెను. పెక్కు సభలు జేసి వారివారిచరిత్రము లుగ్గడింపుచుఁ దదీయబలపరాక్రమము లెక్కుడుగా స్తోత్రములు సేసి లోకులకుఁ దెలియఁబఱచెను.

ఆరాజపుత్రులు క్రోధనునకుం జెప్పి తమబలంబుల నోడలమీఁద నంపుటకు నియమించి ద్వారవతిలో నిలిచియున్న బలంబుల