మన వర్గ సంబంధాలు

వికీసోర్స్ నుండి

మన వర్గ సంబంధాలు[మార్చు]

ఎం.ఎన్ రాయ్[మార్చు]

ఎం.ఎన్.రాయ్

అనువాదకుడు జి.వి కృష్ణారావు

మాటా మంతీ; మన దేశీయ భాషల్లో, ముఖ్యంగా మన తెలుగు భాషల్లో, రాజకీయ గ్రంథాల కొరత ఎక్కువగా వుంది. మనదేశం లాంటి దేశాలకు బానిసత్వంలో వున్న దేశాలకు రాజకీయ పరిజ్ఞానం విరివిగా కావాలి. ఈ ఉద్దేశ్యంతోనే మేము రాజకీయ గ్రంథాల్ని ప్రచురిస్తూ వున్నాము. ముఖ్యంగా యీ రోజుల్లో మనకు కావలిసింది గాంధీయిజమో, నేషనలిజమో, సోషలిజమో తెలుకుకోన్లేని పరిస్థితులలో మన దేశీయ వర్గ సంబంధాలు ఏ విధంగా వున్నాయో, వీటి వల్ల మనం ఏ “యిజాన్ని” అవలంభించాలో ప్రజలు తెలుసుకోవాలనే మేము ఎం.ఎన్ రాయ్ వ్రాసిన “ రిలేషన్ ఆఫ్ క్లాసస్” ను అనువదించి ప్రకటిస్తున్నాము. ఈ పుస్తకాన్ని ఎప్పటినుంచో తెలుగులో ప్రకటించాలని ఆతురతలతో వున్నాము. కాని ధనాభావం చేత యింతవరకు ఆగక తప్పినది కాదు. మాయీ ఆతురత చూచి ధనాభావాన్ని తొలగించి యీ పస్తకము వెలువడటానికి సహాయపడ్డ మిత్రులకు మా కృతజ్ఞతాపూర్వక వందనాలు. మా యీ పుస్తకాన్ని దేశం నిష్పాక్షికంగా, విమర్శనా దృష్టితో పరిశీలిస్తుందని మా నమ్మకం. ఇదే మాకు పదివేలు. 22-2-41 కూచిపూడి

                                                       ప్రచూరణకర్తలు 


మార్క్సిజం పరిణామం చెందుతూ వున్న సామాజిక జీవిత తత్వాన్ని చెబుతుంది. ఆధ్యాత్మిక వాదంలాగా ఈ సిద్దాంతాన్ని వాస్తవాన్ని భ్రాంతి అని త్రోసి వేయదు, వాస్తవంగా సమాజం ఎలాగ ఎందుకున్నదో, ఎలా మారటానికి వీలుందో ఎలా మార్చవచ్చునో స్పష్టీకరిస్తుంది. అంతేగాని, యిదే సత్యం హేతుముద్భావహం, ఎలా వున్నా నమ్ము, నమ్మితేనే విముక్తి, అని చెప్పే భక్తి యోగం కాదు. మార్క్సిజానికి సామాజిక జీవితాన్ని మార్చటమే ప్రధానం. కాని, ప్రాదుర్భావాన్ని విశదీకరించటం మాత్రం కాదు. ఇలాంటి మార్క్సిజానికి ప్రాతిపదికలు మూడు: 1) చారిత్రక భౌతిక సిద్ధాంత 2) అదనపు విలువ 3) వర్గాల పోరాటం ఈ ప్రాతిపదికల్ని అర్థం చేసుకోకుండా మార్క్సిజాన్ని అర్థం చేసుకోవడం వీల్లేదు. ఈ మూడు ప్రాతిపదికలు ఆధ్యాత్మిక వాదంలోని దేవుడు, జీవుడు, ప్రకృతి లేక మాయ అనే వాటికంటే భిన్నమైనవి. మార్క్సిజంలోని ప్రాతిపదికలకు ప్రత్యక్షమే, అంటే సమాజమే ప్రమాణం. ఆధ్యాత్మిక వాదంలోని ప్రాతిపదికలను నమ్మాలి. నమ్మక ప్రశ్నించినవాడు పౌషండుడౌతాడు. మార్క్సిజంలోని మొదట ప్రాతిపదికయైన చారిత్రక భౌతిక సిద్ధాంతం తత్వానికి సంబంధించినది. సర్ప్లస్ ఉత్పత్తి ఆర్థిక శాస్త్రానికి సంబంధించినది; వర్గాల పోరాటం రాజకీయానికి సంబంధించినది. ఉన్న ఆర్ధిక విధానాన్ని బట్టే సామాజిక వ్యవస్థ వుంటుంది. సామాజిక వ్యవస్థను బట్టి వర్గాలు, వాటి పరస్పర సంబంధాలు ఏర్పడుతాయి. ఈ వర సంబంధాలను బట్టి తేలవలసిన విప్లవ స్వభావమూ, సామాజిక జీవనంలో వచ్చే మార్పూ నిర్ణయించబడతాయి. పురుష ప్రయత్నం లేకుండా అవ్యాహతంగా సమాజంలో విప్లవం ఎప్పుడూ రాదు. కాబట్టి విప్లవం తేవాలంటే పురుష ప్రయత్నం ఉండాలి. అయితే ఈ పురుష ప్రయత్నం ఉన్న పరిస్థితుల్ని, అంటే; ఉన్న వర్గాలనూ, వాటి పరస్పర సంబంధాలను గుర్తించి మరీ సాగాలి. అప్పుడే విప్లవం నెగ్గుతుంది. వీటిని గుర్తించి తదనుగుణంగా నేల విడిచి సాము చెయ్యటం అవుతుంది. మన దేశంలో దారిద్ర్యం పిలిస్తే పలుకుతూవుంది. ఇలాంటి ఘోరదశ మన కెందుకు వచ్చింది? ఎట్లా ఈ దుర్దశ నుండి తప్పించుకోవడం? గాంధేయూలు మన దుస్థితికి సామ్రాజ్య ప్రభుత్వమూ యంత్రమూ కారణాలంటారు. సామ్రాజ్య ప్రభుత్వం కంటే గూడ యంత్రమే ముఖ్యకారణమన్నట్లు వీరు తలపోస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక సోషలిస్టులమని చెప్పుకునే వారి పంథాకూడ చెప్పవలసి వుంది. వీరు స్థూలంగా చెప్పబడ్డ వర్గాలే సర్వకాల సర్వావస్థలయందూ, దేశభేధ, ఆర్థిక భేధాలను గుర్తించకుండా వుంటాయని భావించి మార్క్సిజానికి సంకుచిత భావం కల్పిస్తున్నారు. ఎప్పుడు నోరు విప్పినా, జమీందారులు, బూర్జువాలు, పెటీబూర్జువాలు, కార్మికులు అనేపదాలు తప్ప మరొకపదం రాదు. ఈ వర్గాలు మనదేశంలో వున్నాయో, లేవో, బలాబలాలు ఎలా వున్నాయో వీరు గమనించుట లేదు. కార్మికులు తప్ప మిగతా వారంతా వీరి దృష్టిలో విప్లవద్రోహులే. అసలు జమీందారు, కాపిటలిస్టు, బూర్జువా, పెటీ బూర్జువా, కార్మికుడు, శ్రామికుడు, అంటే సరియైన అభిప్రాయం సోషలిస్టులమని రొమ్ము విరుచుకుని తిరిగే వారిలో చాలా మందికి లేదు. మన సమాజంలో ఈ వర్గాల నిష్పత్తి ఎలా వుందో అర్థం చేసుకొన్న వారి సంఖ్యచాల స్వల్పంగా వుంది. మార్క్సిజమంటే వాస్తవికత్వాన్ని గుర్తించటమే పనికూడ మర్చిపోతున్నారు. అందువల్ల స్థూలంగా చెప్పబడ్డ విషయాలను మన సమాజానికి అంటగట్టి సూక్ష్మాతి సూక్ష్మ విషయాల్లోకి పోలేక పోతున్నారు. అందువల్ల విప్లవ పంథా అంటూ ఒకటి తిన్నగా ఏర్పడ లేదు. మనదేశం సక్రమంగా అభివృద్ధి చెందక ఆగిపోయింది. దీనికి పరదేశ దండయాత్రలు ముఖ్యకారణం. ఇలా కణసరిపోయిన జమీందారీ విధానంలో ఉన్న మనదేశాన్ని ఇంగ్లీషూ జమీందారీ ఆర్థిక విధానం, సామ్రాజ్య ప్రభుత్వపు ఆర్థిక విధానం మన దేశంలో చెట్టపట్టాలు కట్టుకుని విహరిస్తున్నాయి. అందువల్ల మన సమాజంలో వర్గ సంబంధాలను అర్థం చేసుకోవటంతేలిక కాదు. ఒక ప్రక్క జమీందారులు, సామ్రాజ్యప్రభుత్వం, మరొక ప్రక్క జమీందారీ విధానం నుండి ఊడిపడ్డ బూర్జువాలు ఉన్నారు. కాపిటలిజం బయలుదేరినప్పటి యూరప్ లోని పరిస్థితులతో మన ఈ స్థితిగతాన్ని పోల్చటానికి వీల్లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో యూరప్లో ఈ యిరవయ్యోశతాబ్దపు కాపిటలిజం ప్రక్కన లేదు. పైగా ఆ రోజుల్లో లాగా ఏ దేశాన్ని తతిమ్మా ప్రపంచాన్నుంచి విడదీసి చూట్టానికి వీల్లేదు. అందువల్ల మన దేశంలో అటు పూర్తిగా అటు కాపిటలిజానికి సంబంధింపకా, వర్గాలు ఒక నూతన పంథాలో కలగాపులగంగా ఖచ్చితంగా విడదీయటానికి వీల్లేకుండా ఉన్నాయి. ఎం.ఎన్ రాయ్ వీటిని గుర్తించి ఇప్పటి మన వర్గ సంబంధాలు ఎలా వున్నాయో, విప్లవం రావడానికి వీలుందో ఎవ్వరిని ఎలా వ్యవాస్థాపించాలో చక్కగా చర్చించి చూపించాడు. స్వాతంత్ర్యం సంపాదించాలన్న ప్రతీవ్యక్తీ, విప్లవం తెచ్చి మన సమాజాన్ని బాగుపరుచుకుందామనే ప్రతి మార్క్సిస్టూ ఈ పుస్తకాన్ని చదివి తీరాలి.

                                                                                                                                                                                                                               అనువాదకుడు  
                                                                                                                                                                                                                              జి.వి. కృష్ణారావు.

వర్గ సంబంధాలు[మార్చు]

ఇప్పుడు జరగవలసిన విప్లవం యొక్క తత్వం తెలుసుకోవాలంటే, వర్గాలంటే ఏమిటో, సామ్రాజ్య ప్రభుత్వం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఈ రెండు శబ్దాల అర్థం స్పష్టపడితేనే గాని యీ వర్గసంబంధాలను గూర్చి యిదమిత్ధ మని చెప్పుకోవటానికి వీల్లేదు. ఈ రెండు శబ్ధాలను తరచూ వాడుతూనే వుంటారు. ఐతే వీటిని అర్థం చేసుకుని వాడటం లేదు. ఇవి పుస్తకాలలో కనిపిస్తున్నాయి, కాబట్టి అర్థం చేసుకోకుండానే వీటిని యదేచ్ఛగ వాడుతున్నారు. ఈ రెండు శభాలకు సరియైన అర్థం చెప్పుకోగలిగిన వారు చాల తక్కువ. వర్గాల నిర్మాణం ఇతర దేశాలలో మాదిరిగా మన దేశంలో కూడా మానవ సమాజం వర్గాలుగా విభజింపబడి వుంది. ఈ వాక్యంతోనే వర్గ సంబంధాలను తేల్చుకోవడానికి వీల్లేదు. మన దేశంలో ఈ వర్గవిభజన సరిగా లేదు. కాబట్టి మన దేశంలో వర్గ సంబంధాలను తేల్చుకోవాలంటే, మన సమాజ నిర్మాణాన్ని గూర్చి తెలుసుకోవాలి. వర్గ సంబంధాఅలు కేవలం సామాజిక నిర్మాణం మీద ఆధారపడి వుంటాయి. మన సమాజంలో ఇది ఫలానా వర్గం, ఇది ఫలానా వర్గం అని స్పష్టంగా విడదీసి చెప్పటానికి వీల్లేదు. సక్రమంగా అభివృద్ధి చెందుతూవున్న సమజంలోనే వర్గభేదాలు స్పష్టంగా కనిపిస్తాయి. సమసమాజం సక్రమమైన మార్గంలో అభివృద్ధి చెందలేదు, ఇలాంటి అసహజమైన అభివృద్ధి బ్రిటీషు ప్రభుత్వం వచ్చినప్పటినుంచి ప్రారంభం కాలేదు. ఈ సక్రమం కాని అభివృద్ధి అంతకు పూర్వమే ప్రారంభమైంది. యూరప్లో ఇప్పుడుకాని, వెనుకటి రోజుల్లో కాని, కనిపించే వర్గాలను మన సమాజంలో కూడా చూపించాలంటే, తప్పుడు త్రోవలు త్రొక్కవలసి వస్తుంది. ఇలాంటి పొరపాట్లు చాలామంది చేస్తూనే వున్నారు. ఇలాంటి పొరపాట్లు చాలామంది చేస్తూనే వున్నారు. మాట మాటకు బూర్జువా వర్గమనీ, జమీందారీ వర్గమనీ, కార్మిక వర్గమనీ వాడుతూ వుంటారు. ఈ వర్గాలన్నిచోట్ల ఒకేవిధంగా వుంటాయనీ, మార్క్సిస్టులైనవారు వర్గాలను గూర్చి మాట్లాడేటప్పుడు ఈ శబ్దాలనే వాడాలనీ నియామక మైపోయింది. ఈ వర్గాలు అసలు మన సమాజంలో వున్నాయా, లేవా అనే విషయంతో నిమిత్తం లేదు. ఇలాంటి మూఢనమ్మకాలే మార్క్సిజం అనే పేరుతో చెలామణి అవుతున్నాయి. ఇలాంటి మూఢవిశ్వాసాలతో మనకు నిమిత్తం లేదు. సమాజంలో ప్రత్యక్షంగా వున్న వర్గాలే మనకు కావాలి గాని వర్గాల పేర్లతో నిమిత్తం లేదు. అప్పుడే మనం వివిధ వర్గాలకు మధ్య వున్న సంబంభాలను సరిగా తెలుసుకోగలుగుతాము. బూర్జువా అనేపదాన్ని ఉదాహరణగా తీసుకుందాం. సాధారణంగా డబ్బున్న వాళ్ళందరినీ బూర్జువా అని పిలవటం పరిపాటైపోయింది. చిన్నపట్టణాల్లోని ధనికులను కూడా బూర్జువాయిజీగా పరిగణిస్తే చాలా ప్రమాదాలు తటస్థిస్తాయి. ప్లీడర్నైనా, డాక్టర్నైనా, జమీందార్నైనా, వర్తకుణ్ణైనా, వడ్డీ వ్యాపారం చేసే వాణ్ణైనా, డబ్బుంటే సరి, బూర్జువా అనేస్తున్నారు. వీరందరినీ ఒక వర్గంగా పరిగణించటం చాలా పొరపాటు. ఇలాంటి సంకుచిత దృష్టితో చూస్తే సమాజస్థితి బోధపడదు. ఇది కేవలం దయా దాక్షిణ్యాలను పురస్కరించుకుని చేసే పని. అంటే, భాగ్యవంతులంతా దుర్మార్గులనీ, నీతి దూరులనీ, పేదవాళ్ళంతా మంచివాళ్ళనీ చెప్పటమన్న మాట. ఇలా పేద వాళ్లని ప్రొలిటేరియట్ అనీ పీడిత ప్రజా సామాన్యమని చెప్పటం మార్క్సిస్టు దృక్పథం కాదు. ఇలా చేయటం వల్ల వర్గ భావాన్ని సంకుచితం చేసి అపార్థం కల్పించటమవుతుంది. ఇలా చేయటానికి రెండు కారణాలున్నాయి. ఒకటి; మన దేశంలో మార్క్సిజాన్ని ప్రచారం చేసే వారు కూడాఅ సరిగా అర్ధం చేసుకున్నట్టు లేదు. రెండు; వసుతః మార్క్సిజం తేలిగ్గా అర్థం చేసుకోవటానికి వీలైన సిద్ధాంతం కాదు. వర్గ భేధాలను సరిగా గుర్తించగల్గిన సమర్ధులు కూడా యిది ఈ వర్గం, యిది ఈ వర్గం అని ఖచ్చితంగా చీల్చి తేల్చి చెప్పటం కష్టసాధ్యం. ఈ పుస్తకంలో ఇక ముందు జమీందారులు ఎలా కాపిటలిస్టులయిందీ సూచించబోతున్నాను. నిజానికి వస్తే యిప్పటి మన సమాజంలో చాలామంది ఒక విధంగా చూస్తే జమీందారులుగాను, మరొక విధంగా చూస్తే కాపిటలిస్టులుగాను ఉన్నారు. స్వదేశ సంస్థానాధిపతుల్లో చాలామంది ఆధునిక పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టారు. ఐనా వారిని బూర్జువా వర్గంగా పరిగణిస్తే చాలా పొరపాట్లు వస్తాయి. హిందూ దేశంలో ఒకడే కాపిటలిస్టుగాను, బూర్జువా గాను ఉండవలసిన అగత్యత లేదు. ఒకడు బూర్జువా కావచ్చును. కాని కాపిటలిస్టు కాదు. ఇంకొకడు కాపిటలిస్తు కావచ్చును; బూర్జువా కాడు. ఈ కారణాలవల్ల పెటీ బూర్జువా అనే శభాన్ని చాలా అపార్ధం చేకుకుంటూ వున్నారు. జమీందారీవర్గం వర్గ విషయంలో వాడే పారిభాషిక శభ్దాల నిర్వచనాలను ఎత్తుకుందాము. మొదట జమీందారీ వర్గాన్ని తీసుకుందాము జమీందారీ విధానాన్ని పలువురు పలువిధాలుగా నిర్వచించారు. సమగ్రంగా చదువుకున్న మార్క్సిస్టుల్లో కూడా ఈ నిర్వచన విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఏకీభావం లేదు. సరియైన శాస్త్రీయ దృక్పథం లేకపోవటం వల్లనే ఈ అభిప్రాయ భేదాలు వచ్చాయనటానికి వీల్లేదు. ఇతర దేశాల్లోని జమీందారీ విధానం కంటే మన దేశంలోని జమీందారీ విధానాన్ని నిర్వచించటం మరీ కష్టం. ఇప్పుడు మన దేశంలో కాపిటలిజం సక్రమ మార్గంలో అభివృద్ధి చెందక ఆగినట్లే జమీందారీ విధానం కుడా, రాజపుఠానాలోని కొన్ని భాగాల్లో తప్ప క్రమంగా అభివృద్ధి చెందలేదు. ఏది ఎలావున్నా జమీందారీ విధానం మన దేశంలో శతాబ్దాలనుంచి వస్తూనే వుంది. ఇప్పటి మన సమాజం కూడా చాలా వరకు జమీందారీ విధానం లోనే వుంది. కాని మనలో చాలా మందికి ఈ జమీందారీ విధానాన్ని గూర్చి బాగా తెలియదు. మన రైతులకు జమీందారీ మనస్తత్వం వుందంటే చాలా మంది విస్తుపోతారు. కానీ రైతులుకు జమీందారీ వర్గానికి సంబంధించిన వారు అంటే తప్పు దారులు తొక్కటమవుతుంది. ఎలాంటి ఆర్ధిక విధానంలో రైతులు వుంటారో, వారి మనస్తత్వం కూడా ఆ ఆర్ధిక విధానం అమల్లో వున్న సమాజంలో వుంటారన్నప్పుడు, సమాజంలోని అందరి మనస్తత్వమూ జమీందారీ విధానానికి అనుగుణంగా వుంటుంది. జమీందారీ రైతు యొక్క మనస్తత్వం జమీందారీ యుగానికి సంబంధించినదే జమీందారి ఆదర్శాన్ని, ఇది జమీందారులది, ఇది రైతులది అని విభజించ వేరుపరచటానికి వీల్లేదు. “భూమి జమీందారులది; వారి భూమిని నేను చేస్తున్నాను. వారికి శిస్తు వగైరాలు చెల్లించి వారి అధికారాన్ని పాలించటం నా ధర్మం” అని అనుకుంటే రైతు మనస్తత్వం జమీందారీ విధానంలోనే నడుస్తున్నదన్న మాట. జమీందారు ఇచ్చే భూమి మీద కాక, వేరే స్వేచ్చగా జీవనోపాధిని సంపాదించుకోవటానికి వీల్లేనంత కాలం, అతని మనస్తత్వం జమీందారీ విధానానికి అనుగుణంగా వుంటుంది. అలాంటి జమీందారీ విధానానికి అనుగుణమైన మానసిక తత్వాన్ని బ్రహ్మణ్యం లేక మతప్రచారకులు రైతుల్లో రేకేత్తిస్తారు. మన దేశంలోని రైతుకి మతమనేది శల్య శల్యంలోనూ జీర్ణించి పోయింది. కిసాను ప్రచారాన్నలా వుంచి, రైతుతో మాట్లాడితే, భూమి జమీందారులది; జమీందారులు లేకుండా యెలా జరుగుతుంది? అంటాడు. భూస్వామి లేక దున్నుకోవటానికి భూమి వుండడు. భూమి లేక రైతు బ్రతకడు. కాబట్టి అతనికి జమీందారుతో సంబంధం లేకుండా వుండటానికి వీల్లేదనిపిస్తుంది. ఇలాంటి సిద్ధాంతము మన రైతులోకంలో రాజ్యం చేస్తూనే వుంది. ఇలా వున్న రైతుల్ని ఒక వర్గంగా పరిగణిస్తే ఈ వర్గం విప్లవకారి కాదనటంలో అసత్యం లేదు. కాని యే వర్గ ప్రాముఖ్యాన్నైనా విచారించేటప్పుడు రెండు విషయాలు గమనిచాలి. ప్రతక్షంగా చూస్తే మన కర్షక వర్గం విప్లవకరంగా వుంది. ఇప్పటి పరిస్థితుల్ని పూర్తిగా మారిస్తేనే కాని, ఇప్పటి దుర్భర స్థితిలోనుంచి బయట పడడానికి వీల్లేదు. విప్లవం తీసుకుని రావలసిన అవశ్యకతను గుర్తిస్తేనే కానీ విప్లవం తీసుకుని రావటానికి వీల్లేదు. అంటే, తన స్థితిగతులు అతిదుర్భరంగా వున్నాయని రైతు గ్రహించాలి. ఇలాంటి స్థితి గతుల్ని భగవంతుడు తెచ్చిపెట్టాడు; వీటిని మార్చెయ్యటానికి వీల్లేదు; ఇది సృష్టి ధర్మం. అందువల్ల మానవ మాత్రుడేమీ చెయ్యలేడనే మూఢ విశ్వాసం పోవాలి. ఈ దుర్భరస్థితిగతుల్ని ఎలా మార్చటానికి వీలుందో రైతు గ్రహించాలి. పైగా మార్పు తెచ్చిన స్థితిగతుల్ని బాగు చేసుకోవాలన్న ధృడసంకల్పం ముఖ్యంగా కావాలి. దీనిని పురుష ప్రయత్నం అంటారు. సర్ ప్లస్ ఉత్పత్తి అంటే ఏమిటి కర్షక వర్గం ఎలా విప్లవకారి అవుతుంది. అని తేల్చుకోవటానికి పూర్వం ఒక విషయం తేల్చుకోవాలి. దీన్ని తేల్చుకోకముందు కొన్ని శబ్దాలకు నిర్వచనం చెప్పుకోవాలి. జమీందారీ విధానమంటే అసలు ఉత్పత్తి కారకుడైన వాడికి మిగిలే ఫలసాయాన్ని (సర్ ప్లస్ ఉత్పత్తి) కొంచెంకూడా మిగలకుండా దోచుకునే ఆర్ధిక విధానం. ఈ నిర్వచనమే దాదాపు సరిపోతుంది. ఉత్పత్తి కారకుడైన వాడికి కొంచెం కూడా మిగలకుండా యెలా చేస్తారు? శిస్తుల ద్వారా? ఇతరమైన పన్నుల ద్వారానా? ప్రత్యక్షంగా జరుగుతుందా? పరోక్షంగా జరుగుతుందా? పెద్దపెద్ద వడ్డీల ద్వారా గుంజుకుంటారా? అనేదే వేరే విషయం. ఇంకా ముందుకు పోయే ముందు మిగిలే ఫలసాయం (సర్ ప్లస్ ఉత్పత్తి) అంటే ఏమిటో చెప్పుకోవాలి. సామాజిక అభివృద్ధికి కృషి, (లేబర్) మూలం. అభివృద్ధికి హేతుభూతమైన కృషి, మిగిలే ఫలసాయాన్ని, అంటే, సర్ ప్లస్ ఉత్పత్తిని కూడబెడుతుంది. సమాజంలో ప్రతివారు కేవలం తన జీవనోపాధికి కావలసినంత వరకే ఉత్పత్తి చేసుకుని వూరుకుంటాడో, ఆ సమాజం అభివృద్ధి చెందక కుళ్ళుతూ వుంటుంది. మానవులు సామానిక జీవులై కలిసి పనిచేస్తే వారి జీవనోపాధికి కావలసిన దానికంటే యెక్కువగా ఉత్పత్తి చేస్తారు. జీవితానికి కావలసిన దానికంటే యెక్కువ ఉత్పత్తి చేస్తే, ఆ మిగిలే ఫలసాయాన్ని సర్ ప్లస్ ఉత్పత్తి అంటారు. ఈ సర్ ప్లస్ ఉత్పత్తి సమిష్టి కృషి సాగిన కొందికీ అధికమవుతూ వుంటుంది. ఇలాంటి సర్ ప్లస్ ఉత్పత్తి అవిచ్చిన్నమైన అభివృద్ధికి మూలమవుతుంది. జమీందారీ సమాజంలో రైతులే ముఖ్యంగా ఉత్పత్తికి కారకులు, రైతు తనకూ తన కుటుంబానికి కావలసిన దానిని పండిస్తాడు. అంటే, పుట్టే పిల్లా జెల్లా యెదగటానికి కూడా కావలసింది యిందులోనే వుంటుంది. మానవుడు తానొక్కడే బ్రతికితే చాలదు. అతడు పనిపాటలు చేయలేక మూలన పడ్డప్పుడు, మరణించిన తరువాత, భూమిని సాగుచేయడానికి సంతానాన్ని పొంది, దాన్ని కూడా పోషించాలి. తానొక్కడే తన శరీరం పోషణ చేసుకుంటే అది పోషణ కిందికి రాదు. మానవుడు తాను బ్రతకడానికి జావి అభివృద్ధి కావడానికి కావలసిన ఆహార పదార్థాదికాన్ని ఉత్పత్తి చేయాలి. ముఖ్యంగా ప్రతిసామాజిక జీవి ఇలాంటి అవశ్యకతలకైనా తగినంత ఉత్పత్తి చేయవలసి వుంటుంది. ఈ మాత్రమైనా మానవుడు ఉత్పత్తి చేయలేక పోతే యేమీ ఉత్పత్తి చేయలేని వారికి, స్థానమే వుండదు. వర్గ యుతమైన సమాజంలో మానవుడు తన కుటుంబానికి అవసరమైనంతైనా ఉత్పత్తి చేయాలి. జమీందారీ సమాజంలో ఇలాంటి అవశ్యకతలకు సరిపోగా మించే ఫలసాయాన్నంతా రైతు దగ్గర్నుంచి జమీందారు గుంజుకుంటాడు. అంటే రైతుకీ, అతని కుటుంబానికీ, కేవలం కావలసినది తప్ప మిగిలిన ఫలసాయాన్ని (ఉత్పత్తిని) అంతా జమీందారీ వర్గం దోచుకుంటుంది. కాబట్టి జమీందారీ యుగంలో జమీందారీ రైతు అవసరం రైతు కాలక్రమేణా కొంత వెనుక వేసుకొని, యే కారణాల వల్లనైనా తన జీవితం మీద విరక్తి చెంది, భూమి విడిచిపెట్టి మరొక విధంగా జీవించగలిగేటట్లైతే, అతడు జమీందారీ రైతు కాదు. జమీందారీ ఆర్థిక విధానం ఎంతసేపటికీ రైతుకి కొంచెం కూడా మిగలకుండా చేసి, యెప్పుడూ భూమిని కనిపెట్టుకుని వుండేటట్లు చేస్తుంది. రైతు భూమిని అంటి పెట్టుకుని వుండటానికి చట్టం ఒక్కటే కారణంకాదు. జమీందారీవిధానం వుండాలంటే ఎక్కువమంది పనిచేసే వారుండాలి. అందువల్ల జమీందారీ విధానం ప్రజలను కర్షకదశలోనే వుంచుతుంది. భూమిని విడిచిపెట్టగూడదు, అని రైతుని అను శాసించే చట్టం యిలాంతి జమీందారీ ఆర్ధిక విధానాన్ని పురస్కరించుకుని వచ్చినదే.

జమీందారీ ఆర్థిక విధానం[మార్చు]

జమీందారీ ఆర్థిక విధానం సామాజిక అభివృద్ధికి ఆటంక పడుతుంది. సమాజ పోషణకు అన్ని విధాల కావలసిన దానికంటే ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి మిగిలే ఫలసాయాన్ని (సర్ ప్లస్ ఉత్పత్తి) వినియోగించనప్పుడు, ఆర్థిక విధానం కుళ్ళుతూ వుంటుంది. జమీందారు, రైతు దగ్గర్నుంచి వసూలు చేసేదాన్ని వ్యవసాయాభివృద్ధికి కావలసిన కాలువలు, ఆనకట్టలు, వగైరాలకు వినియోగిస్తూ వుంటే, సామాజిక అభివృద్ధికి పాటుపడటం అవుతుంది. కాని జమీందారీ ఆర్థిక విధానంలో ఇలాంటిది జరుగదు. ప్రతి సంవత్సరం మిగిలే ఫలసాయాన్ని వసూలు చేసి, జమీందారులు ఇంకా ఉత్పత్తి చేయడానికి వినియోగించరు. ఇలా వచ్చే ఆదాయాన్ని తామే మింగివేసి, సామాజిక అభివృద్ధిని అరికడుతూ వుంటారు. అందువల్ల ఒక దశలో జమీందారీ విధానాన్ని కూలద్రోయవలసిన అవసరం వస్తుంది. కొత్తపంథా తొక్కి ఉత్పత్తిని సాగించేటందుకూ, దాని ద్వారా సామాజికాభివృద్ధిని చేకూర్చటానికి యిలాంటి పరిస్థితి అవసరం. కేవలం రైతులకే కాక, తతిమ్మా సమాజానికి కూడా, ఇలా అభివృద్ధికి ఆటంక కరంగా వున్న జమీందారీ వర్గాన్ని కూలదోయవలసిన అవశ్యకత యేర్పడుతుంది. ఒక వర్గానికి, మరొక వర్గానికి శత్రుత్వం వున్నంత మాత్రాన రెండో వర్గం నాశనం చేయబడదు. ఒక వర్గం తతిమ్మా వర్గాల అభివృద్ధికి అడ్డుతగిలేటప్పుడు నాశనం చేయబడుతుంది. దీన్నే మరో విధంగా చెప్పాలంటే, ఒక వర్గం బీదదైనంత మాత్రానగానీ, దోచుకోబడుతున్నంత మాత్రాన గానీ విప్లవకరం కాదు. ఆ వర్గం యొక్క శేయస్సు తతిమ్మా సమాజం యొక్క శ్రేయస్సుతో ఏకమైనప్పుడే ఆ వర్గం విప్లవకరంగా వుంటుంది. ముందుండి విప్లవాన్ని కొనసాగిస్తుంది. అంటే, ఒక వర్గం, తతిమ్మా సమాజానికంతకూ దాస్య విముక్తి కలిగించి, తానుకూడా స్రాతంత్ర్యం సంపాదించుకుంటుంది. మన సమాజంలో వర్గ సంబంధాలను సరిగా తేల్చుకుంటే, ఏ వర్గం విప్లవకరంగా వుంటుందో తేల్చుకోవచ్చును. అంటే, ఏ వర్గ శ్రేయస్సు తతిమ్మా సమాజం యొక్క శ్రేయస్సుతో ఏకీభవిస్తుందో చూడాలి. దీన్ని దృష్టిలో వుంచుకొని అలాంటి వర్గం కోసం అన్వేషిద్దాము. ఇంతకుముందు జమీందారీ ఆర్థిక విధానం ఎలా వుంటుందో తేల్చుకున్నాము. దానిని బట్టి యిప్పటి మన రైతాంగం రైతువారీ విధానంలో వున్నా, జమీందారీ విధానంలో వున్నా, చాలావరకు జమీందారీ ఆర్థికవిధానంలోనే వుంది. సరే, ఒప్పుకుందాం. పంజాబులోనూ, మద్రాసు రాష్ట్రంలోనూ, మహారాష్ట్రలోనూ జమీందారులు లేరుకదా! ఇలా సగం దేశంలో జమీందారులు లేనప్పుడు, మన రైతాంగం ఇంకా జమీందారీ విధానంలోనే వున్నదనటానికి ఎలా అవకాశముంది? ఆని అడగవచ్చును. ఆయా రాష్ట్రాలలో జమీందారీ విధానానికి బదులు సామ్రాజ్యవిధానం వుంది. ఈ సామ్రాజ్యవిధానం కూడా రైతుల దగ్గరనుంచి మిగిలే ఫలసాయాన్ని (సర్ ప్లస్ ఉత్పత్తి) యావత్తూ గుంజుకుంటూ వుంది. ఇలాగే వలసరాజ్యాలను చేస్తున్నది. సామ్రాజ్య విధానం కూడా అంతర్వైరుద్ధ్యాల వల్ల సామాజికాభివృద్ధికి తోడ్పడటం లేదు. మన చర్చిస్తున విషయాలను తేల్చుకోవడానికి సామ్రాజ్యవిధానంలో వున్న అంతర్వైరుద్ధ్యాల గూర్చి కూడ తెలుసుకోవాలి. సామ్రాజ్య విధానం కాపిటలిజం అభివృద్ధి చెందిన సామ్రాజ్య విధానం వచ్చింది. ఈ కాపిటలిజం బూర్జువా విప్లవ విజయ ఫలితంగా వచ్చింది. అందువల్ల సామ్రాజ్య విధానంలో బూర్జువా విప్లవ బీజాలుంటాయి. సామ్రాజ్య ప్రభుత్వ నాగరికతతో ట్రిటన్ మన దేశాన్ని జయించింది. మన దేశాన్ని ఇంగ్లండ్ జయించిందంటే, బూర్జువా విప్లవ బీజాలు తెచ్చిపెట్టిందన్నమాట. మన దేశంలో స్థిరాస్తి విషయంలో బ్రిటీష్ ప్రభుత్వం తెచ్చిపెట్టిన మార్పులే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఐతే బ్రిటీష్ ప్రభుత్వం మన దేశంలోని జమీందారీ విధానాన్ని నాశనం చేయలేదు. రాజకీయంగా మన జమీందరులకు అధికారం లేకుండా చేసింది. ఆర్ధికంగా అలాగే వుంచింది. బ్రీటీష్ ప్రభుత్వం ఇలా చెయ్యటానికి కారణం వుంది. బ్రిటన్లో బూర్జువా విప్లవన్ కొంతవరకే జరిగింది. రాజకీయాధికారం బూర్జువాయికి సంక్రమిచిన తరువాత కూడా బ్రిటీషు జాతీయ ఆర్థిక విధానంలో జమీందారీ విధానాన్ని ఒక ముఖ్య భాగంగా అట్టి పెట్టారు. అందువల్లనే జమీందారీ పలుకుబడిని సూచించే రాచరికాన్ని ఇంకా కాపిటలిస్టు ప్రభుత్వం అట్టిపెట్టింది. అందువల్లనే ఇంగ్లండుకు రాజు ఉన్నాడు. ఏది ఎలావున్నా బ్రిటీషు సామ్రాజ్య ప్రభుత్వం మన దేశంలో బూర్జువా విప్లవ లక్షణాలను తెచ్చిపెట్టింది. అవసరమున్నప్పుడే బూర్జువా విప్లవం వల్ల వచ్చే సామాజిక రాజకీయ మార్పులు వస్తాయి. ఇది మన దేషానికి కూడా అన్వయిస్తుంది. బూర్జువా విప్లవం బయలుదేరి, తదనుగుణమైన సామాజిక రాజకీయపు మార్పులు రాబోయే సమయంలో బ్రిటీష్ ప్రభుత్వం మనదేశంలో నిలవటానికి నీడదొరికింది. అంతేకాని, క్లైవు ఫోర్జరీలవల్ల కాని, మీర్జాఫర్ చేసిన మోసం వల్ల కాని, వారన్ హేస్టింగ్సు చేసిన తంత్రం వల్ల కాని, డల్హౌసీ కున్న విశ్వాసం వల్లకాని, యిది జరగలేదు. ఇవే సరైన కారణాలైతే ఆ సేతు హిమాచలం వ్యాపించి యున్న ఇంత పెద్ద దేశం, కొన్ని వేలమైళ్ళ దూరం నుంచి వచ్చిన కొలది మంది ఇంగ్లీషు వర్తకులకు ఎలా స్వాధీనమైంది? సామానిక ఆస్కారం లేకుండా, యింతకాలం, ఎంత బలవత్తరమైన ప్రభుత్వమైనాఎలా నిలుస్తుంది? ఇండియాలో పాతుకుపోయి బ్రిటీష్ ప్రభుత్వం ఇంత కాలం నిల్చిందంటే, ప్రజా బాహుళ్యంలోని ఒక పెద్ద శాఖకూ, బ్రిటీష్ ప్రభుత్వానికీ సహకారం వుండి తీరాలి. అంటే, యీ ప్రభుత్వానికీ, ఈ శాఖకూ కలిసివచ్చిన లాభం ఒకటి వుండాలి. ఈ రోజుకి అదే కనిపిస్తున్నది. ముందుకూడా అలాంటిదే వుండవచ్చును. కాని బలాల సంబంధం మాత్రం మారుతూనే వుంది. మొదట్లో కొన్ని వర్గాల లాభాలు బ్రిటీష్ ప్రభుత్వ లాభాలతో ఏకీభవించాయి. తరువాత ఇతరవర్గాల లాభాలు బ్రిటీష్ ప్రభుత్వం లాభాలతో ఏకీభవించాయి. బ్రిటీష్ ప్రభుత్వం ఇంకా హిందూ దేశంలో నిలవాలంటే, ఏదో ఒక వర్గ సహాయం పొందాలి. బ్రిటీష్ సామ్రాజ్య ప్రభుత్వం బూర్జువా విప్లవ విజయం వల్ల ఏర్పడింది. కాబట్టి హిందూదేశంలో కూడా కొన్ని విప్లవ విధుల్ని నిర్వర్తించింది. పైగా అంతరిస్తూ వున్న జమీందారీ ఆర్థిక విధానానికి జీవం పోసి జమీందారుల మాదిరిగానే బ్రిటీష్ ప్రభుత్వం ప్రవర్తించింది. అన్ని రాష్ట్రాల్లో కంటే రైతువారీ విధానం అమల్లో వున్న బొంబాయి రాష్ట్రంలో భూమిశిస్తు ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తూవుంది. ఆ రాష్ట్రంలో, ఏయే ఉత్పత్తులెలా వున్నాయో తెలిస్తే మనకు కావలసిన విషయం సులభంగా తెలిసిపోతుంది. కానీ ఈ ఉత్పత్తిని గూర్చి మనకు స్పష్టంగా ఏమీ తెలియదు. మనకు లభించేదాన్ని బట్టి, రైతులమీద ఎక్కువపన్ను విధిస్తున్నారని మాత్రం చెప్పవచ్చును. జమీందారీ రైతుల కంటే, రైతువారీ విధానంలోని కర్షకులకు, చట్టం ప్రకారము ఎక్కువ హక్కులుండవచ్చును. ఆదాయం కూడా కొంచెం ఎక్కువే వుండవచ్చును. కాని మొత్తం మీద చెప్పవలసి వస్తే రెండు విధానాల్లోని రైతులూ, దాదాపు ఒకే విధంగా ఉన్నారు. అంతే కాని రైతు వారీ విధానంలోని కర్షకులు, జమీందారీ రైతులకంటే చెప్పుకోదగినంత మంచి స్థితిలో లేరు. రైతువారీ కర్షకుడు ఇరవై రూపాయలు సంపాదించి పద్దెనిమిది ఖర్చు పెడితే, జమీందారీ రైతు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టవచ్చును. దీన్ని బట్టి రైతు వారీ కర్షకుని పని కొంత మెరుగే. అయితే మనం ఒకటి చూడాలి. రైతువారీ కర్షకుడికి తనకూ, తన కుటుంబ పోషణకూ పోగా ఎంత మిగులుతూ వుంది? జమీందారీ రైతుకి ఎంత మిగులుతూ వుంది? పెద్దవై సారవంతాలైన ఇతర రాష్ట్రాలలో కంటే, రైతువారీ విధానం అమల్లో వున్నా బొంబాయి రాష్ట్రంలో భూమి శిస్తు మీద ఎక్కువ ఆదాయం వస్తూవుంది. అంటే, అక్కడ రైతునుంచి ఎక్కువ శిస్తు వసూలు చేస్తున్నారన్నమాట. కాబట్టి రైతువారీ కర్షకుడు కూడా, పక్కా జమీందారీ పరిస్థితుల్లో వున్నట్లే తేలుతుంది. ముఖ్యమైన ఉత్పత్తి సాధనాలు ఎవరి ఆధీనంలో వుంటాయో, దాన్ని బట్టి సామాజిక విధానాన్ని నిర్ణయించాలి. 1) చేసే పనిలో నూటికి 70 పాళ్ళు పొలంలో చేస్తున్నారు. 2) ఫలం కూడా భూమి నుంచే వస్తూవుంది. 3)ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో అధిక భాగం భూమి శిస్తునుంచే వస్తూవుంది. వీటన్నిటిని బట్టి చూస్తే, ఈ దేశంలో భూమే ముఖ్యమైన ఉత్పత్తి సాధనంగా వుంది. ఇది జమీందారీ విధానానికి లక్షణం. జమీందారీ విధానం యొక్క ముఖ్య లక్షణాలన్నీ ఈ దేశంలో కనిపిస్తున్నాయి. అయితే, కాపిటలిజం అభివృద్ధి చెందటానికి కూడా అవకాశాలున్నాయి. కాబట్టి మన దేశమంతా, మొత్తం, జమీందారీ విధానం లోనే వుంది. ఇలా చెప్పటం వల్ల, కాపిటలిజం కొంతవరకైనా అభివృద్ధి చెందలేదని అర్థం కాదు. దీన్ని బట్టి మన దేశంలో బూర్జువా విప్లవం రాగలదని తేలుతూవుంది. బూర్జువా ప్రజాస్వామిక విప్లవం అమల్లో వుంటూవున్న సామాజిక వ్యవస్థలో తీవ్రమైన మార్పు తేవటమే విప్లవం. జమీందారీ విధానాన్ని కూలద్రోసే విప్లవాన్ని బూర్జువా విప్లవమంటారు. ఇప్పుడు హిందూ దేశంలో వుంది జమీందారీ విధానం. ఈ విధానాన్ని పూర్తిగా మార్చివేయాలి. ఇలాంటి చారిత్రక అవశ్యకతే రావలసిన విప్లవ స్వభావాన్ని నిర్ణయిస్తుంది. మార్చవలసిన సామాజిక వ్యవస్థమీదనే విప్లవస్వభావం ఆధారపడి వుంటుంది. కాబట్టి, మన దేశంలో ఇప్పుడు రావలసినది బూర్జువా ప్రజస్వామిక విప్లవం. దేశంలో ఇంకా వుంటూవున్న జమీందారీ ఆర్థిక విధానంలో సామ్రాజ్యపు ఆర్థిక విధానం ఒక భాగంగా వుంది. వలస రాజ్యపు ఆర్థిక విధానం, జమీందారీ ఆర్థిక విధానం మన దేశంలో చెట్ట పట్టాలు కట్టుకొని నడుస్తూ వున్నాయి. కాబట్టి మన దేశంలో ఈ రెండు విధానాలు, ఒక దానికొకటి సహాయకారిగా వుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అర్థం లేని ప్రచారిక ‘నినాదాలు’ పనికిరావు. మార్క్సిజాన్ని గూర్చి వ్రాసిన ప్రామాణిక గ్రంథాలను అర్థం చేసుకోకుండా కార్య రంగంలోకి దిగినా ప్రయోజనం లేదు. మన దేశ పరిస్థితుల్లో వున్న ప్రత్యేకతలను శాస్త్రీయంగా అర్థం చేసుకొని విప్లవ సమస్యలను అవగతం చేసుకోవాలి. అలా చెయ్యకపోతే, విప్లవాన్ని నిర్వహించటానికి వీల్లేదు. శాస్త్రీయంగా పరిస్థితుల్ని అర్థం చేసుకుని విప్లవ సమస్యలు పరిష్కరించేటప్పుడు, మార్క్సిస్టు సిద్ధాంతాలకు మనము కొన్ని నూతన విశేషాంశాలను చేర్చగలగ వచ్చును.

                                         ఏ లక్షణాలు యెలా వుంటే ఏ వర్గమంటారో తెలుసుకుంటేనే గాని, మన దేశంలో వర్గాలను స్పష్టంగా విభజించటానికి వీల్లేదు. ఎక్కువ భూమి వుండి, దాన్ని స్వయంగా సాగుచేసుకోని వాణ్ణి భూస్వామి అంటారు. కాని, ప్రతిభూస్వామిని జమీందారుగా పరిగణించటానికి వీల్లేదు. ఉత్పత్తికి కారకము కాని భూమి వున్న వాడు, నియంతగా, జమీందారు కానక్కర్లేదు. రైతుల కష్టం మీద జీవించేవాడు జమీందారు. అంటే, రైతులకు మిగిలే ఫలసాయాన్ని (సర్ ప్లస్ ఉత్పత్తి) యావత్తు అపహరిస్తాడు. అప్పుడే జమీందారు అవుతాడు. కాబట్టి స్వయంగా సాగుచేయని భూమి ఒకడికి వుండి, సాగుచేయక రైతుల కిచ్చి వారికి అందులో మిగిలే ఫలసాయాన్ని అంతా అపహరించేవాణ్ణి జమీందారు అనవచ్చును. హిందూ దేశంలో, మార్పు చెందుతూ వున్న ఈ యుగంలో, వర్గ భేదాలు స్పష్టంగా లేక, కలగాపులగంగా వున్నాయి. ఐనా వర్గభేదాలను వివక్షిస్తూ వున్నప్పుడు, కలగాపులగంగా వున్న ఈ వర్గాలను విడదీయాలి.

బూర్జువాయిజీ[మార్చు]

జమీందారీవర్గం తరువాత బూర్జువావర్గం. ఈ బూర్జువాయిజీ అనేది ఫ్రెంచిపదం. దీనికి పట్టణవాసి అని వ్యుత్పత్యర్ధం. మొదట్లో పట్టణాలను, ఫ్రెంచి భాషలో బర్ గ్సు అనేవాళ్ళు. బర్గులో వుండే ప్రజలను బూర్జువాయిజీ అనేవాళ్ళు. అంటే, పట్టణవాసులన్న మాట. అయితే ఈ బూర్జువాయిజీ శబ్దానికీ, ఆర్థికవిధానానికి సమన్వయ మున్నదా? మాధ్యమిక యుగాల్లో ఈ పట్టణాలు కాపిటలిస్టు ఉత్పత్తికి కేమ్ద్రలుగా వుండేవి. ఇప్పుడు జమీందారీ విధానంలో వున్న హిందూదేశంలో కాపిటలిస్టు ఉత్పత్తి జరుగుతూ వున్నట్టుగానే, మాధ్యమిక యుగాల్లో జమీందరీ విధానంలో వున్న ఐరోపా దేశాల్లో కాపిటలిస్టు ఉత్పత్తి కొన్ని కేమ్ద్రాలలో బయలుదేరుతుంది. ఇలా బయలు దేరిన కేమ్ద్రాలు త్వరితంగా విజృమ్భించి జమీందారీ విధానాన్ని ధ్వంసం చేసాయి. అలాంటి పట్టణాల్లో ఆధునిక పరిశ్రమలు క్రమంగా వృద్ది చెందాయి. భూమిని వదలి ఈ నూతన ఆర్థిక ఉత్పత్తితో సంబంధమున్నవారే పట్టణాలకు చేరారు. అలాంటి సంబంధం లేకపోతే పట్టణాలకు ఆ రోజుల్లో చేరవలసిన అవసరం లేదు. పట్టణాల్లో నాటకాలు కాని, సినిమాలుకాని, ప్రభుత్వొద్యోగలు కాని, ఆ రోజుల్లో లేవు. అంటే, పరిశ్రమలతో సంబంధం వుండబట్టే చేరారు. అలా అభివృద్ధి చెందిన కేమ్ద్రాలలో ఒక నూతన ఆర్థిక విధానం బయలుదేరింది. ఈ ఆర్థిక విధానానికి భూమి ముఖ్యం కాదు. అంటే ఈ ఆర్థిక ఉత్పత్తి భూమి మీద ఆధారపడలేదు. నూతన ఉత్పత్తి విధానంతో, అంటే, కాపిటలిజంతో సంబంధం వున్న వారిని బూర్జువాయిజీ అన్నారు. ఈ విధంగా బూర్జువాయిజీ అనే శబ్దం వచ్చింది. నూతన ఉత్పత్తి విధానంతో సంబంధించిన వారు అమల్లో ఉంటున్న విధానాన్ని మార్చివేయదలిచారు. దీనికి కారణముంది. ఎలాంటి ఆటంకాలు వచ్చినా, ఈ నూతన ఉత్పత్తి విధానం అభివృద్ధి చెందింది. నానాటికి కొత్త కొత్త వస్తువులు తయారు చేయసాగారు. ఇలా తరారైన వస్తువులన్నీ పట్టణాల్లోనే అమ్ముడుపోవు. దూర ప్రదేశాలలో కూడా అమ్మవలసి వచ్చింది. అందువల్ల వాటిని అమ్ముడుపోయే దూరప్రదేశాలకు చేర్చవలసి వచ్చింది. దీని ద్వారా వ్యాపారం అభివృద్ధి చెందింది. వ్యాపారమార్గాలమీద అంతటా జమీందారులు కోటలలో పొంచి కూర్చున్నారు. చుట్టు పట్ల వున్న భూమి జమీందారులది. వ్యాపారమార్గాలు ఈ దేశాలలో గూండా పోయాయి. ఈ మార్గాలపోయే వ్యాపారులను దోచుకోకపోయినా వారి సరుకులమీద పన్నులను విధించేవారు. ఈ పద్ధతి కొంతమార్పు చెందినా, యింకా వుంది. పట్టణం చేరే ప్రతీ వస్తువుకీ, చింపిపాతకైనా, పన్ను చెల్లించవలసి వచ్చేది. ఇలాంటిది జమీందారీ విధానం. ఇలాంటి జమీందారీ విధానం సరుకులు పోకుండా కొంతవరకు అరికడుతుంది. అందువల్ల వ్యాపారానికి దెబ్బ తగులుతుంది. దీని వల్లనే వెనుకటి రోజుల్లో అమ్మకానికి తయారయ్యే సరుకుల మీద ఆధారపడిన పట్టణవాసులకు, అంటే, బూర్జువాయిజీ, జమీందారులకూ స్పర్థ వచ్చింది. పట్టణాలు పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. నానాటికి అమ్మవలసిన సరుకుల ఉత్పత్తి ఎక్కువయింది. వీటిని ఇతర ప్రదేశాల్లో తయారయ్యే సరుకులకు మార్చుకోవలసిన అవశ్యకత యెక్కువయింది. వ్యాపార మార్గాలలో అనేక ప్రదేశాలలో జమీందారులు సుంకాలు విధించడం మొదలు పెట్టారు. వ్యాపారం అభివృద్ధి చెందటం వల్ల జమీందారీ రైతులు భూమిని వదిలి ఎక్కువ లాభసాటిగా వున్న పట్టణాలకు పోవడం మొదలుపెట్టారు. రైతుల్ని, భూముల్ని వదిలిపెట్టి పోనిచ్చేటట్లైతే, జమీందారులు ఎవరి రక్తాన్ని పీల్చుకు తాగుతారు? అందువల్ల జమీందారులు, వ్యాపార పరిశ్రమలు శతవిధాల వృద్ధి కాకుండా చూస్తారు. నూతన ఉత్పత్తి విధానం నిర్విఘ్నంగా కొనసాగించాలంటే, జమీందారులు అడ్డుపడకుండా బూర్జువాయిజీ వోడించవలసి వుంటుంది. ఇలాంటి వైరుద్ధ్యం వల్ల జమీందారీ ఆర్థిక విధానాన్ని నాశనం చేయవలసిన అవశ్యకత ఏర్పడింది. సమాజం మొత్తానికంతకూ విప్లవం అవసరమైంది. ఈ అవశ్యకత ఇతరుల కంటే పట్టణ వాసులకు, అంటే, బూర్జువాయిజీకీ ముఖ్యమైపోయింది. అందువల్ల ఈ విప్లవాన్ని బూర్జువా విప్లవమన్నారు.

పెటీబూర్జువాయిజీ[మార్చు]

భూమిని వదలిపెట్టి జమీందారీ రైతులు నూతన ఉత్పత్తి సాధనాలతో పనిచేయడానికి పట్టణాలకు చేరుకున్నారు. ఉత్పత్తి సాధనాలు అంతకుముందే పట్టణాలలో నిలబడి పోయిన వారి పరంల్ వున్నాయి. అయినా కొత్తగా పట్టణాలకు చేరుకున్న జమీందారీ రైతులు కార్మికులు (ప్రొలిటేరియన్లు ) కాలేదు. వీరు కూడాఅ బూర్జువా వర్గానికి చెందినవారే. ఇది నామకా వచ్చినది కాదు. సరైన అర్థంలోనే వీరు బూర్జువా వర్గానికి చెందినవారయ్యారు. వీరికీ, బూర్జువా వర్గానికీ ఒకటే ఆదర్శం; ఒకటే భవిష్యత్తు. ఈ ఆదర్శాన్ని నిర్వహించుకోవటానికి బూర్జువా విప్లవం వీరికి అవసరమైంది. దీన్ని అర్ధం చేసుకుంటే తతిమ్మా విషయాలు తేలిగ్గా అర్థమవుతాయి. అపార్థం చేకుకోబడుతూ వున్న పెటీ బూర్జువాయిజీని గూర్చి కూడా తేల్చుకోవడానికి వీలవుతుంది. పట్టణాలకు వెళ్ళినవారు బూర్జువాలయ్యారు. అయితే వీరంతా భాగ్యవంతులు కారు. భాగ్యవంతులిదివరకే పట్టణాలలో స్థావరం ఏర్పరుచుకొని వున్నారు. ఈ భాగ్యవంతులే యిప్పటి కాపిటలిస్టులకు మూలపురుషులు కొత్తగా పట్టణాలకు చేరిన పేదలు. పొలాలలో చాకిరీ చేసుకునేవారు డొక్క నిండక పట్టణాలలో పనిచేసి బ్రతకటానికి వెళ్ళారు. ఈ పేదవారినే పెటీబూర్జువాయిజీ అన్నారు. పెటీ అనే ఫ్రెంచి శబ్దానికి చిన్నది అని అర్థం. పట్టణాలలో నివసిస్తూ కొత్తగా ఏర్పడిన వర్గంలో వీరు చిన్నవారన్నమాట. అంతా పట్టణవాసులు కావడం వల్లనూ, అందరికీ ఉత్పత్తి విధానంతో సంబంధం వుండటం వల్లనూ, చినవాళ్ళని, పెద్దవాళ్ళని, పేదల్ని భాగ్యవంతుల్ని కలిపి బూర్జువా వర్గమన్నారు. ఈ రోజున హిందూ దేశంలో పరిస్థితులిలాగే వున్నాయి. హిందూ దేశంలో బూర్జువాయిజీకీ, పెటీ బూర్జువాయిజీకీ మధ్య సంబంధాలెలా వున్నాయి? వీరిరువురికీ వున్న భేధాలు పెద్దవైతే, వీరిని రెండు వర్గాలుగా పరిగణించాలి. వీరిద్దరి ఆదర్శాలు, లాభాలు ఒకటయితే, ఇద్దరూ కలిసి బూర్జువా విప్లవం తెస్తారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందువల్ల వర్గశక్తుల సంబంధాలను విశదంగా తేల్చుకోవడం ముఖ్యం. మన దేశంలో ఇప్పుడు జరుగుతున్నదానిని, యూరప్లో జమీందారీ విధానం నుంచి కాపిటలిస్టు విధానంలోకి మారిన సంధి యుగంతో పోల్చుతున్నారు. ఇది కేవలం తప్పుడు త్రోవలకు దారితీస్తుంది. యూరప్లో సంధి నూతన యుగం వచ్చేసింది. అందువల్ల అక్కడ నూతనమైన వర్గ వైరుద్ధ్యం ఏర్పడింది. యిలా యూరప్ లో ఏర్పడిన నూతన వర్గ వైరుధ్యం హిందూ దేశాన్ని కూడా కొంత మార్చింది. మన దేశంలోని పరిస్థితులు భిన్నంగా వున్న, వెనుకబడి వున్నా, ఐరోపాలోని నూతన వర్గవైరుధ్యం కొంత మార్చింది. కాపిటలిజానికి సోషలిజానికి బూర్జువా వర్గానికి, కార్మికవర్గానికి మధ్య ఉన్న వైరుద్ధ్యాన్ని మన దేశంలో మరవటానికి వీల్లేదు. అయినా, ఈ వైరుద్ధ్యం మన దేశంలో, ఇప్పట్లో కాని, ఆద్యతన భవిష్యత్తులో కాని, జరిగే సంఘటనలకు అంత ముఖ్యమైనది కాదు. చారిత్రక దృష్టితో చూస్తే విప్లవకరంగా వున్న నేటి కార్మిక వర్గం కాపిటలిజం అభివృద్ధి చెందేటప్పుడు వున్న నేటి కార్మిక వర్గం కాపిటలిజం అభివృద్ధి చెందేటప్పుడు వున్న పెటీ బూర్జువాయిజీ నుంచి వచ్చింది. అందువల్ల వ్యవస్థా విషయంలో రెంటికీ సంబంధం వుంది. ఇవి రెండూ ఒకే వర్గం యొక్క రెండు భినదశలను తెల్పుతున్నాయి. ఈ అర్థంలో మన దేశంలో బూర్జువా విప్లవం రావాలంటే కార్మిక విప్లవం కూడా రావాలని అర్థం. కాని హిందూ దేశంలో ఈ రోజున కార్మిక విప్లవం రావటానికి వీల్లేదు. చారిత్రకంగా బూర్జువా విప్లవం రావాల్సివుంది. ఈ బూర్జువా విప్లవంలో కార్మికవర్గం కేవలం పెటీ బూర్జువా వర్గంగానే తన భూమికను నిర్వహిసుంది. జాకోబినిజం అంటే ఏమిటి? ఇప్పుడు మన దేశంలో రావలసిన విప్లవం యొక్క ఆదర్శమేమిటని ప్రశ్న వస్తుంది. జాకోబినిజం అనే పదం చాలా మంది వినేవుంటారు. ఇప్పటి ప్రొలిటేరియన్ వర్గానికి మూలపురుషులైన పెటీబూర్జువాయిజీ ప్రారంభదశలో బూర్జువాయిజీతో కలసే వున్నారు. ఆ రోజుల్లో పెటీబూర్జువాయిజీ, బూర్జువాయిజీకి మధ్య భేదం బ్రహ్మాండంగా లేదు. ఇరువురు ఒకే వర్గంగా వుండేవారు. కార్మిక వర్గానికి మూలపురుషులైన పెటీబూర్జువాయిజీ అప్పటి బూర్జువాయిజీతో కలిసి బూర్జువా విప్లవం కోసమూ, తరువాత తీసుకురావలసిన కార్మిక విప్లవం కోసం పోరాడారు. వీరి ఆదర్శం జాకోబినిజం. బూర్జువా వర్గంలో పని పాటలు చేసే శాఖ జమీందారీ అధికారాని ధ్వంసం చేసి రాజకీయ ప్రజాస్వామికాన్ని స్థాపించంటే, కార్మిక విప్లవానికి జీజాలు వేసిందన్న మాట. ఆ విప్లవానికి వైతాళిక అయిందన్నమాట. ఫ్రెంచి మహా విప్లవ సందర్భంలో పెటీబూర్జువాలు నేటి కార్మిక విప్లవానికి బీజాలు నాటారు. అదే జాకోబినిజం. కాబట్టి మార్క్సు సిద్ధాంతచ్చాయలను ముందుగా తెచ్చి పెట్టటంలోనే జాకోబినిజం యొక్క చారిత్రక ప్రాముఖ్యం ఇమిడివుంది. మార్క్సిజం దేశకాలాలకు అతీతమైనది. మార్క్సు పుట్టకముందే మార్క్సిజం వుంది. కాబట్టి ముందుగా వచ్చిన మార్క్సు సిద్ధాంతచ్చాయయే జాకోబినిజం అని చెప్పవచ్చును. బూర్జువావర్గం ఎలా ఏర్పడిందో చెపుతాను. పట్టణాలలో ఒక నూతన ఆర్థిక విధానం ఏర్పడింది. కొంత మంది పట్టణవాసులకు ఉత్పత్తి సాధనాలు ఉన్నాయి. ఇతరులకు ఏవీ లేవు. కాని అంతా కలిసి ఈ ఉత్పత్తి సాధనాలతో పనిచేశారు. ఆ కాలంలో ఉత్పత్తి సాధనాలు ఉన్నవారు కూడా పనిచేస్తూ వుండేవారు. పని చేసే వారు కూడా బూర్జువా అయినట్లే, బూర్జువాకూడా పని చేసే వాడయ్యాడు. ఆధునిక బూర్జువా వర్గ మూలపురుషులు, ఆధునిక కార్మికవర్గ మూలపురుషులు ఆరోజుల్లో పనిచేసేవారే. ఉత్పత్తి సాధనాలు తన స్వాధీనంలో ఉన్నప్పటికీ, ఆధునిక బూర్జువావర్గ మూలపురుషుడు యజమానిగా వుండేవాడు. పని నేర్పడానికి ఇంకొకణ్ణి తీసుకునేవాడు. అలా తీసుకోబడినవాడు యజమాని కోసం పనిచేయాలి. మొదటి నుంచి యజమాని కొంచెంగానో గొప్పగానో అతనినుంచి దోచుకునేవాడు. దోపిడి అంటే దొంగతనం కాదు. దోపిడి అనేది న్యాయసమ్మతమైన ఆర్థికవిధానం. ఆరోజుల్లో ఉత్పత్తిని పెంపొందించడానికి పెట్టుబడి ధనం పోగు చెయ్యడానికి వేరే మార్గం లేదు. మొదట్లో ఈ దోపిడీకి విధానం అట్టే కష్టం కలిగించలేదు. పని నేర్చుకోవటానికి చేరినవాడూ, యజమానిగా వున్న బూర్జువా, యిద్దరూ కలిసి పనిచేస్తూ ఒక యింట్లో, ఒక కుటుంబంలో, పుట్టి పెరిగినట్టు వుండేవారు. అందువల్ల ఇద్దరిమధ్య భేధాలు అట్టేలేవు. ఉత్పత్తి పెరుగుతూవున్న ఆరోజుల్లో పనినేర్చుకున్నవాడు కూడా ఒక యజమాని అయి తనక్రింద పనిచేసి నేర్చుకోవడానికి కొంతమందిని నియమించేవాడు. క్రమంగా యజమాని పనిచేయ్యటం మానేశాడు. వ్యాపారం, జమాఖర్చు చూసుకోవటంలోకి దిగాడు. కాగా, అన్ని పనులు చేయడనికి నేర్చుకునేవారిని నియమించేవాడు. ఈ విధంగా, తాను పని చేయక, తన కోసం పనిచెసేవారిని పెట్టుకున్న తరువాత, యజమాని కూలీల మధ్య భేదాలు నానాటికి యెక్కువయ్యాయి. పనినేర్చుకునేవాడు కూలివాడయ్యాడు. శాస్ర్రీయంగా చూస్తే పెటీ బూర్జువాయిజీ బూర్జువా వర్గంలో ఒక శాఖగా కనిపిస్తుంది. కాని ఆర్థికంగా మాత్రం ఇద్దరి మధ్య భేదాలున్నాయి. కాపిటలిస్టు సంఘం పక్వం కాని ప్రథమ దశలో ఈ విభేదాలు తీవ్రంగా లేవు. బూర్జువా- కాపిటలిస్టు ప్రస్తుతం మనదేశంలో బూర్జువా, పెటీ బూర్జువాల మధ్య వున్న భేదాలను ప్రస్తుతం వదిలివేద్దాం. బూర్జువా కాపిటలిస్టు కానక్కర్లేద్దు. ఇప్పుడు మరొక పదానికి నిర్వచనం చెప్పుకుందాం. కాపిటలిస్టు అంటే యెవరు? నా జేబులో పది రూపాయలున్నా, నా తలక్రింద వెయ్యి రూపాయలు పాతేసివున్నా, నేను కాపిటలిస్టును కాను. ప్రపంచంలో వున్న డబ్బంతా నా దగ్గరవున్నా, నేను కాపిటలిస్టును కాక పోవచ్చును. భాగ్యము కాపిటల్ కాదు. కాపిటల్ ఉత్పత్తికి సాధనం. జమీందారీ ఆర్ధిక విధానంలో పొలం యెలా ఉత్పత్తికి సాధనమో, కాపిటలిస్టు ఆర్ధిక విధానంలో కాపిటల్ అలాగే ఉత్పత్తికి సాధనం. రైతుకూ, అతని తన కుటుంబ పోషణకూ పోగా మిగిలిన ఫలసాయాన్నపహరించటమనేది జమీందారీ ఆర్ధిక విధానం లక్షణం. కాపిటలిస్టు ఆర్థిక విధానంలో ముఖ్యంగా ఉత్పత్తి చేసేవాడు స్వతంత్రుడుగా వుంటాడు. కాపిటలిస్టు ఆర్థిక విధానంలో కృషికి చాలా సౌకర్యాలుంటాయి. కృషివల్ల ఉత్పత్తి జరుగుతూవున్న కొలదికీ కాపిటలిజం అభివృద్ధి అవుతుంది. శ్రామిక వర్గం అభివృద్ధి కావటం కాపిటలిజానికి లాభదాయకం. కాబట్టి కాపిటలిస్టు ఆర్థికవిధానంలో శ్రామిక వర్గం అభివృద్ధి కావటం కాపిటలిజానికి లాభదాయకం. కాబట్టి కాపిటలిస్టు ఆర్థిక విధానంలో శ్రామికుడికీ మిగిలే ఫలసాయమంతా అపహరించబడదు. దీనికి మరొక కారణముంది. కాపిటలిస్టు ఆర్థికవిధానంలో అమ్మకానికే సరుకులు తయారుచేస్తారు. అందువల్ల కాపిటలిస్టు ఆర్థికవిధానానికి వ్యాపారం ముఖ్యం. జమీందారు అమ్మటానికి ఏమీ వుండదు. కాబట్టి రైతు కొనుక్కోవడానికి డబ్బు మిగులుతుందా లేదా అన్న ప్రశ్న అతనికి రాదు. కాని కాపిటలిస్టు తయారైన సరుకుల్ని అమ్ముకోవాలి. అందువల్ల జమీందారీ విధానంలో కంటే, కాపిటలిస్టు విధానంలో ఉత్వన్నమయ్యే సంపద కొంత సరసంగా పంపకం చెయ్యబడుతుంది. అందువల్ల కాపిటలిస్టులు అమ్మే సరుకుల్ని ప్రజలు కొనగలుగుతారు. అందువల్ల జమీందారీ విధానం కంటే కాపిటలిస్టు విధానం అభ్యుదయకారి. జమీందారీ దోపిడీ, కాపిటలిస్టు దోపిడీ ఒకటే ననటం చాలా పొరపాటు. జమీందారీ విధానంలో మాదిరిగానే కాపిటలిజంలో కూడా వర్గభేదాలు అలాగే వుంటాయి. రెండు విధానాలు కృషివల్ల వచ్చే ఫలసాయాన్ని దోచుకోవటం మీదనే ఆధారపడి వుంటాయి. శాస్త్రీయంగా జమీందారీ విధానంలో కంటే కాపిటలిజంలో రెక్కల కష్టం చేసుకునే వారిపని బాగుండవలసినా, నిజానికి బాగుండక పోవచ్చును.కాపిటలిజంలో శ్రామికుడు ఎక్కువ సంపాదిస్తాడు. అందువల్ల ఎక్కువ ఖర్చుపెడతాడు. శ్రామికులు ఎంత ఎక్కువ ఖర్చు పెట్టగలిగితే కాపిటలిస్టులకు అంత లాభం; కాపిటలిజం అంత విరళంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి జమీందారీ విధానంలో కంటే, కాపిటలిజంలో శ్రామికుడి స్థితిగతులు బాగుండితీరాలి. దీన్ని బట్టి బూర్జువా వర్గానికే కాకుండా శ్రామికులకు గూడా బూర్జువా విప్లవం వల్ల లాభం ఉంది. మనం ఎప్పుడూ వర్గవైరుధ్యాన్ని గూర్చి మాట్లాడుతుంటాము. వర్గ సంఘర్షణ చరిత్రయే మానవ చరిత్రయని మనం నేర్చుకున్నాము. కాని ఇంకో విషయం గమనించాలి. సమాజంలో, కలుపుగోలు శక్తి ఒకటి వుంది. ఈ శక్తి లేకపోయినట్లయితే, మానవ సమాజం ఎప్పుడో విచ్చిన్నమైపోయేది. నాగరికత, పరిమాణం అనేవి లేకుండా పోయేవి. సామాజిక శ్రేయస్సు అనేది ఒకటి అన్ని వర్గాలను బంధిస్తుంది. కృషిఫలాన్ని దోపిడీ చేస్తూనే కాపిటలిజం అభివృద్ధి చెందుతుంది. ఐనా కాపిటలిస్టు ఆర్ధికవిధానం సమాజాన్నంతనూ పైకి తీసుకొస్తుంది. దోపిడీ జరుగుతున్నా, వర్గనైరుద్ధ్యమున్నా, శ్రామికవర్గం సమాజంలో ఒక చిన్న భాగంగా వునంతకాలం, శ్రామిక వర్గానికీ, కాపిటలిస్టు వర్గానికీ దృష్టి ఒకటే. కాపిటలిస్టు విధానం ఇరువురికీ అభివృద్ది చెందాలని వుంటుంది. కాపిటల్కీ , కృషికీ మధ్యవున్న సంబంధ బాంధవ్యాలను సరిగా అర్థం చేసుకోవటం లేదు. కాపిటల్ యెక్కడనుంచి వస్తూవుంది? కాపిటల్ అంటే ఏమిటి? కాపిటల్ అంటే ధనం కాదు., ప్రోగైన సర్ప్లస్ కృషే కాపిటల్. జీవనోపాధికి మొదట్లో ఉత్పత్తిచేసేవాడు కొంత కృషి చెయ్యాలి. ప్రతివాడు తనకు కావలసినంత వరకే ఉత్పత్తి చేసి వూరుకున్నట్లైతే, మానవుడు అటవికుడుగానే వుండేవాడు. కాని సామాజిక కృషివల్ల జీవనోపాధికి ఖర్చయిపోగా మిగిలే ఫలసాయమే (సర్ప్లస్ ఉత్పత్తి) అభివృద్ధికి కారణం. జమీందారి విధానంలో సర్ప్లస్ ఉత్పత్తినంతా ఒక వర్గమే అపహరించి, సమాజం అభివృద్ధి కాకుండా తొక్కిపట్టి, తన అధికారాన్ని చెలాయించుకోవడానికి మాత్రం అవకాశమీయదు. సంపదకు హేతుభూతమైన కృషిని పొలాలందే కేఁదికరింప జేస్తుందే కాని, ఎక్కవ ఫలసాయాన్ని ఇచ్చేవాటిని చెయ్యనివ్వదు. కాపిటలిస్టు విధానంలో దీనికి సరిగా వ్యతిరేకం జరుగుతుంది. కాటిటలిజం మిగిలే ఫలసాయాన్ని ఉత్పత్తిని ఇంకా పెంపొందించటానికి వినియోగిస్తుంది. ఈ విధంగా మిగిలే ఫలసాయాన్ని ఉత్పత్తికై వినియోగించటం వల్ల కాపిటల్ ఏర్పడుతుంది. అంతేకానీ డబ్బు కాపిటల్ కాదు. ఒకడు ఆరు గంటలు పనిచేసి భోజనానికి, ఇతర అవశ్యకతలకు సరిపోయేదన్ని ఉత్పత్తి చేస్తాడనుకుందాం. ఒకడికి డబ్బుండి రెండోవాణ్ణి తనకోసం 8గంటలు పనిచేసినా, వానికి 6గంటల్లో వచ్చినదాన్ని కాపిటల్ అంటారు. కాపిటల్, కృషి అనేవాటి రెంటివల్లా కాపిటలిస్టు సమాజం ఏర్పడుతుంది. కాని కృషికిపూర్వం కాపిటల్ వుండాలి. కాబట్టి కేవలం కృషిమిదనే కాపిటలిస్టు సమాజం ఆధారపడి వుంటుంది. కాపిటలిజం రాకముందు ఉన్న సంపదకూడా కృషి వల్ల ఏర్పడ్డ సర్ప్లస్ ఉత్పత్తియే. ఈ సంపద కృషివల్లనే కాపిటల్ గా మారుతుంది. కాబట్టి కాపిటల్కి మూలం కృషి. సంపదంతా కృషే. ఈ విషయాన్ని కొంత వివరిస్తాను. నాకు కొంత డబ్బు వుంది. ఈ డబ్బుతో కొన్ని పనిముట్లు కొని కార్ఖానా పెట్టి కాపిటల్ గా మారుస్తాను. కార్ఖానా పెటినంతనే నా కాపిటల్ కి లాభం రాదు. లాభం రావటానికి పనిచేయాలి. నేనే పనిచేస్తాననుకోఁడి. ఈ రెంటివల్లా, అంటే, ఈ కొరముట్లు, నేను, కూలివాడు కలిసి పనిచేయడం వల్ల, నాకూ, కూలివాడికీ కావలసిన దానికంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తాము. ఇరువురి జీవనోపాధికి పోగా మిగిలే ఫలసాయం ఏర్పడుతుంది. పనిముట్లు నావి కావటం వల్ల మిగిలే ఫలసాయం కూడా నాదే అవుతుంది. ఇలా మిగిలే ఫలసాయాన్ని నేను జేబులో వేసుకుంటే దాన్ని కాపిటల్ అంటానికి వీల్లేదు. ఇలా కొన్ని నెల్లు మిగిలేదాన్ని పోగుచేసి ఇంకా రెండు రంపాలో లేక చిత్రికలో కొంటాననుకోఁడి ఇలా పనిముట్లు కొనకపోతే నాదగ్గర డబ్బు కాపిటల్ కాదు. పనిముట్లు నా కాపిటల్. పనిముట్లు కొనక డబ్బును డబ్బుగానే వుంచితే, కృషి ఫలాన్ని దోచుకోవటానికి వీల్లేదు. నా దగ్గరున్న డబ్బును కృషిఫలాన్ని దోచుకోవటానికి కావలసిన సాధనాల కొరకు వినియోగించితే అప్పుడు అది కాపిటల్ అవుతుంది; నేను కాపిటలిస్టును అవుతాను. అంతేకాని డబ్బున్నంత మాత్రాన్నే నేను కాపిటలిస్టును కాను. ఉన్న డబ్బును నూతన ఉత్పత్తి సాధనాలకోసం వినియోగించినప్పుడే ఎవడైనా కాపిటలిస్టు అవుతాడు. అలా కాక, ఆ డబ్బుతో పొలం కొంటే, అతడు కాపిటలిస్టు కావాలని నియమం లేదు. అతడు భూమిని వినియోగించే విధానం మీద అతని కాపిటలిస్టుతనం ఆధారపడి వుంటుంది. భూమికూడా కాపిటలిస్టు ఉత్పత్తికి సాధనం కావచ్కును. కాని అప్పుడు అది అంత ప్రధానం కాని సాధనమవుతుంది. కాబట్టి తన ధన మంతటితోనూ ఒకడు భూమిని కొంటే, వాడు కాపిటలిస్టు కాడు. జమీందారీ ఉత్పత్తి విధానానికే భూమి ముఖ్య సాధనం. కాబట్టి డబ్బుతో భూమిని కొన్నంతమాత్రాననే కాపిటలిస్టు ఉత్పత్తి విధానం అభివృద్ధి కాదు. అలా అభివృద్ధి కావటానికి గాను నూతన ఉత్పత్తి సాధనాలతో పని చేయటానికి కృషిని నియమించాలి. అంటే యంత్రాలమీద, పని చేయించాలి. అప్పుడే మిగిలే ఫలసాయం (సర్ప్లస్) కాపిటల్ అవుతుంది. ప్రాథమిక ఉత్పత్తి సాధనం భూమి కొంతవరకే పంటనిస్తుంది. అంతకు మించి పండదు. ఎక్కువ ఆదాయం రాదు. కాబట్టి భూమి ఎంత పంటనీయగలదో అంతా పండిస్తున్నారు. ఇంకా ఎక్కువ పండించటానికి ఆర్ధిక సమస్యలన్నిటికీ ఇదే కారణం. హిందూ దేశంలోని దారిద్ర్యానికి కారణం ఒకటే వుంది. దేశంలో ఉన్న ఆర్ధిక విధానం వల్ల ఇంకా ఎక్కువ పండించటానికి వీల్లేదు. ఐనా, ఈ పనికిరాని ఆర్ధికవిధానం అలాగే పండించటానికి వీలుందో, అంతా పండిస్తున్నారు. ఈ ఫలసాయం చాలటం లేదు. ఐనా ఇంకా ఇలాంటి పొలం మీదనే ఆధారపడి వుండవలసి వచ్చింది. కాబట్టి ఈ దారిద్ర్యం నుంచి తప్పించుకోవాలంటే నూతన ఉత్పత్తి సాధనాలమీద ఆధారపడాలి. అలా జరగాలంటే కొన్ని పరిస్థితులుండాలి. కాని ఈ పరిస్థితుల్ని సృష్టించుకోవటానికి దేశంలోని పనికిరాని ఆర్థికవిధానం అడ్డువస్తూ వుంది. అందువల్ల విషమ స్థితి ఏర్పడుతూ వుంది. ఇలాంతి విషమస్థితి నుంచి బయటపడటానికి విప్లవమొకటే శరణ్యం. సామాజిక పరిమాణం ఏ ఆటంకం లేకుండా, అవిచ్చిన్నంగా సాగుతున్నంత కాలం విప్లవంతో నిమిత్తం లేదు. కాని విషమస్థితి ఏర్పడినప్పుడు, అన్నీ గుడుగుడు గుంచంగా, నాలుగు స్తంభాల ఆట ఆడుతూ వున్నప్పుడుయ్, వాటిని భేధించ వలసి వుంటుంది. ఇలాంతి విషమ పరిస్థితిని భేదించటమే విప్లవం. ఇంతవరకు కాపిటలిజం అంటే ఏమిటో చెప్పుకున్నాం. అసలు మొదట బూర్జువాయిజీ ఎలా ఏర్పడిందో, పెటీ బూర్జువాయిజీ ప్రాముఖ్యమేమిటో తెలుసుకున్నాం. పట్టణవాసుల్లో చిన్న తరగతివారంతా కలిసి పెటీబూర్జువా వర్గంగా ఏర్పడింది. అందువల్ల ప్రారంభదశల్లో ఒకవిధంగా చూస్తే, సంపూర్ణమైన వర్గం కాక, మరోవిధంగా చూస్తే వర్గానికంటే పెద్దదిగా వుంది. మొదటి దశలో అది బూర్జువా వర్గంలో ఒక భాగం. పైగా కాపిటలిజంయొక్క ప్రాథమిక దశలో ఈ పెటీబూర్జువా వర్గంలో శ్రామిక వర్గం కూడా కలిసివుంది. కాపిటలిజంఅభివృద్ధి అవుతూవున్నప్పుడు తనకు సహాయకరంగా ఉండేవారిని కూడా సృష్టిస్తుంది. ఈ సహాయక వర్గంలో మతగురువులు, ప్రచారకులు, డబ్బుతీసుకుని పోరాడే సైనికులు ఉంటారు. బూర్జువా వర్గానికి సహాయపడే పరివారం ఇంకోవిధంగా వుంటుంది. వ్యాపారం అవిచ్చిన్నంగా సాగటానికి పరిపాలక యంత్రం ఉండాలి. పట్టణవాసం చేస్తున్న ప్రజల్లో కొంతమంది పరిపాలనా శాఖలో దూరతారు. వీరుకూడా నూతన బూర్జువా వర్గంలో ధనికులైనవారు క్రమేణా కాపితలిస్టులయి ఉత్పత్తి విధానంలో సన్నిహిత సంబంధము లేకుండా వుంటారు. కొంతమంది ఉత్పత్తిలో నిమగ్నులై వుంటారు. వీళ్లంతా క్రమంగా ఒక వర్గమవుతారు. ఇదే కార్మికవర్గం. కాని మొదట్లో ఈ కార్మికులు కూడా బూర్జువా వర్గానికి సహాయకారులే. వీరిని కూడా పెటీ బూర్జువా వర్గానిక్రింద పరిగణించాలి. కాపిటలిస్టు పరిశ్రమలు అభివృద్ధి చెంది, వ్యాపారం పెంపొంది, మూడోరకపు పరివారాన్ని సృష్టిస్తుంది. దీనిలో చిన్న వర్తకులుంటారు. ఈ పరివారం గ్రామాలలోని చిల్లర వర్గకుని దాకా వ్యాపించి వుంటుంది. ఈ చిల్లర వర్తకుడు భాగ్యవంతుడు కాడు. ఇతడు దోచుకునేది కూడా వుండదు. ఐనా కాపిటలిజం అనే గచ్చపొదలో ఇతడుకూడా ఒక చిన్న తీగవంటివాడు. కాపిటలిస్టు అనే పదాన్ని నిర్వచిస్తే ఈ చిల్లర వర్తకుడు కాపిటలిస్టు కాడు. ఐనా, అతడు కూడా ఒక బూర్జువాయే.

రైతులు[మార్చు]

పెటీబూర్జువా వర్గంలో నాల్గో శాఖ ఒకటి వుంది. రైతు ఈ శాఖకు చెందినవాడే. జమీందారీ సమాజంలో ఉన్నంత కాలం రైతు జమీందారీ విధానంలో ఒక భాగంగా వుంటాడు. కాపిటలిజంలో కూడా ఆహార పధార్థాలు, వీటితో పాటు పరిశ్రమకు కావలసిన ముడి సరుకులు పండించవలసి వుంటుంది. కాబట్టి కాపిటలిస్టు విధానంలో కూడా, రైతు సమాజంలో ఒక ముఖ్య భాగంగా వుంటాడు. అయితే జమీందారీ విధానపు శాఖలోనుంచి కాపిటలిస్టు ఆర్ధిక విధానపు శాఖలోకి వస్తాడు. అందువల్ల రైతు బూర్జువా వర్గ శాఖలో చేరతాడు. పట్టణం పెరుగుతుంది. పెరిగి బహిః ప్రపంచంలోకి, అంటే గ్రామాల్లోక్కూడా కాపిటలిస్టు ఆర్ధిక విధానం వ్యాపిస్తుంది. రైతు కొయ్య నాగలితో సాగు చేస్తున్నా కాపిటలిస్టు ఆర్ధిక సూత్రాలకు లోబడే పండించాలి. అందువల్ల విధానంలో రైతు ఒక భాగంగా వుంటాడు. మన దేశం ఇప్పుడు సంధి యుగంలో వుంది. అందువల్ల రైతుని కేవలం ఒక శాఖకు చెందిన వాణ్ణిగా పరిగణించటానికి వీల్లేదు. ఒక విధంగా చూస్తే చిన్న జమీందారు, మరొక విధంగా చూస్తే పెటీ బూర్జువా చట్టరీత్యా ఇప్పుడు వున్న సామాజిక నిర్మాణంలో రైతు జమీందారీ విధానంలో వుంటున్నాడు. ఉత్పత్తిని బట్టి విచారిస్తే, కొంతవరకు కాపిటలిస్టు సమాజంలో సభ్యుడుగా వున్నాడు. అతని జీవికలో కొంత భాగం జమీందారీ ఆర్ధిక సూత్రాలకు లోబడి, కొంత కాపిటలిస్టు ఆర్ధిక సూత్రాలకు లోబడి నడుస్తూ వుంది. కాబట్టి రైతులందర్నీ ఒక వర్గంగానే పరిగణించటానికి వీల్లేదు. సాధారణంగా రైతులంతా ఒకేవర్గానికి చెందినట్లు చూట్టం పరిపాటై పోయింది. కొంతమంది రైతుల్ని శ్రామికవర్గంలో చేరుస్తారు. అతివాదులైన మార్క్సిస్టులు కొందరు, రైతులు పెటీబూర్జువాయిజీ అనీ, అందువల్ల విప్లవ నిరోధకులనీ అంటారు. సామాజికంగా నిజానికి, రైతులు పెటీబూర్జువా వర్గానికి చెందినవాలళ్ళే. పెటీ బూర్జువాయిజీ గ్రామాల్లోనూ వుంటుంది. పట్టణాల్లోనూ వుంటుంది. కాపిటలిస్టు ఆర్థిక విధానంలో రైతులు పెటీబూర్జువాయిజీ అవుతారు. కాని హిందూదేశంలో రైతులు ఇంకా జమీందారీ విధానంలోనే వున్నారు. అందువల్ల రైతులు పెటీ బూర్జువా వర్గానికి చెందిన వారు కారు. అందువల్ల రైతులు బూర్జువా విప్లవకారకులే అవుతారు. రైతులు పెటీబూర్జువాలయినప్పుడు కార్మిక విప్లవానికి దోహదమిస్తారు. పెటీబూర్జువాయిజీలో మరొకభాగంగా వున్న పేద పటణాలైన వాసులు, ఈలోగా ఒక వర్గంగా తయారవుతారు. కాపిటలిస్టు ఆర్ధికవిధానం పెటీబూర్జువాయిజీ ఈ నూతన వర్గానికి లాభసాటిగా లేనప్పుడు పేదలైన పట్టణవాసులు రైతులతో సంబంధాలు ఏర్పరుచుకుంటారు. కాపిటలిజం అభివృద్ధి అవుతూ వున్నప్పుడు పెటీబూర్జువా శాఖగా వుండే రైతులు కూడా దోచుకోబడతారు. కాపిటలిజం ఇద్దరీనీ దోచుకుంటుంది. ఇతు రైతుల్ని, అటు శ్రామికుల్ని దోచుకుంటుంది. మన దేశంలో రైతులు రెండు విధుల్ని నిర్వర్తించవలసి వుంటుంది. బూర్జువా విప్లవంలోనూ, ఇప్పటి కార్మిక విప్లవ యుగం లోనూ వీరు విప్లవకరంగా పని చేస్తారు. అందువల్ల మనదేశ పరిస్థితుల్లో అందరికంటే రైతులే ఎక్కువ విప్లకారులని గ్రహించాలి. రైతులు లేకుండా అటుబూర్జువా విప్లవం కాని, యిటు కార్మిక విప్లవం కాని నెగ్గలేదు. మనం ఒకణ్ణి తిట్టాలంటే బూర్జువా అంటాము. కాని దీనికంటే గూడా పెటిబూర్జువా అనేది పెద్దతిట్టు. ఎందుకని? బూర్జువా పరివార కోటిలోని వాడు పెటీబూర్జువా అంటే, కొంచెం ఎక్కువ తక్కువగా గులాం, లేక సేవకుడు అన్నమాట. ఇంతకుముందు నాలుగు రకాల పెటీబూర్జువాలని చెప్పుకున్నాం. అవిభజన, కాలాన్ని లెక్కలోకి తీసుకోకుండా, సమాజాన్ని పరిశీలిస్తే తేలింది. మళ్ళీ కాలాన్ని లెక్కలో తీసుకోకుండా, సమాజాన్ని పరిశీలిస్తే తేలింది. మళ్ళీ కాలాన్ని లెక్కలోకి తిసుకొని అంటే, చారిత్రకంగా వభజించి చూద్దాము. మొదట్లో పెటీ బూర్జువానుంచే ఇప్పటి బూర్జువాయిజీ వచ్చింది. అంటే చిన్నచిన్న పనివాళ్ళనుంచి, యజమాజులనుంచి బూర్జువా వర్గం ఏర్పడింది. ఈ పెటీబూర్జువాల కంటే మరొక రకపు బూర్జువాలున్నారు. వీరు కాపిటలిజం వల్ల ఏర్పడ్డారు. కాపిటలిజం అభివృద్ధి చెందే కాలంలో అల్ప మేధావులూ, ఉద్యోగస్తులూ, చిన్న చిన్న వర్తకులూ, దుకాణదారులూ కలిసి బహుసంఖ్యాకమైన ఒక వర్గంగా ఏర్పడతారు. కాపిటలిజం కుళ్ళేకాలంలో మొదటి దెబ్బ ఈ వర్గానికి తగులుతుంది. కాపిటలిజం అభివృద్ధి చెందుతున్నంతకాలం ఈ వర్గం వారందరికీ ఉద్యోగాలు దొరుకుతాయి. వ్యాపారం అభివృద్ధి అవుతున్నంతకాలం దుకాణపుదారులు లాభాలు పొందుతూ ఉంటారు. వారి సంబధులకు కూడా జీవితాలు సాగుతూనే వుంటాయి. ఆర్ధిక విషమస్థితి రావడంతోనే అల్ప మేధావులకు గిట్టూబడికాదు. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఊడుతాయి. వ్యాపరం సనగిల్లటం వల్ల దుకాణపదార్లు కొట్లు కట్టివేయవలసి వస్తుంది. కాబట్టి ఆర్ధికంగా పెద్దబూర్జువాయిజీకీ, యీ రెండోరకపు పెటీబూర్జువాయిజీకి వైరుద్ధ్యం ఉండాలి. కాని యీ రెండువర్గాలను కలిపే సూత్రం ఒకటీ వుంది. అధికార గౌరవాలే ఈ సూత్రం. ఈ రెండువర్గాలూ పెద్దమనుష్యలుగా, గౌరవనీయులుగా పెరిగారు. రాజకీయంగా ఈ పెటీ బూర్జువాయిజీని కార్మికులునుగా చేసినప్పటికీ నమలేదు. కాని తమ్ము కాపాడుకోవడానికి ఈ వర్గం కార్మికులతోనూ, రైతులతోనూ, చేరక తప్పదు. కాని చేరదు. గుమాస్తా ఉన్నాడు అంటే, ఆజన్మం నిష్ఫలంగా ఉద్యోగం కోసం దేవులాడుతాడు. అతనికి కాపిటలిజంనుంచి వచ్చేదేమీ వుండదు. అయినా కాపిటలిజానికి వ్యతిరేకంగా మాట్లాడితే, ఉన్న ఉద్యోగాశాంకురాలు కూడా సమూలంగా నాశనమైపోతాయని భయపడుతాడు. ఈ ఆశే అతణ్ణి ఉద్యోగాన్నుంచి ఊడబెరికిన విధానానికే వ్రేళ్ళాడదీస్తుంది.

                                   కాని క్రమంగా, ఈ పెటీ బూర్జువా శాఖలోని సభ్యులు తమ దుస్థితిని గుర్తించి చైతన్య పూరితులై విప్లవకారులౌతారు. ఈ సంధర్బంలో పెటీబూర్జువాయిజీకీ, కార్మికులకూ ఉండే సంబంధాలనూ, పెటీ బూర్జువాయిజీ ఎలా కార్మిక నాయకత్వం క్రిందకి వచ్చేదీ చెప్పవలసి వుంది. అయితే యీ విషయాలను ముందు మరో సంధర్బంలో చెబుతాను. ప్రస్తుతం పట్నవాసం చేసే పెటీబూర్జువాయిజీ, ఇప్పుడు మన దేశంలో రావలసిన విప్లవానికి నాయకులై నడుపుతారని ఎందుకంటున్నాం? 
                     కాపిటలిస్టుఆర్ధిక విధానంలో ఒక భాగంగా ఉంటం వల్ల పెటీ బూర్జువాయిజీ లాభించింది. ఈ వర్గంవారికి కొంత చదువు లభించింది. అందువల్ల విప్లవ అవశ్యకతను ఒకసారి గ్రహించారంటే, శ్రామికులకంటే వీరు ఎక్కువగా విప్లవానికి దోహదమిస్తారు. మనదేశంలో శ్రామికులు ఇంకా విద్యాధికం లేక, చాల వెనకబడి ఉన్నారు. అందువల్ల సమాజాన్ని పూర్తిగా మార్చి మళ్ళీ నిర్మించుకోవడానికి తోడ్పడలేరు. కేవలం ఉద్రేకంతోనూ, ఇప్పటికంటే కొంత బాగుపడాలన్న ఉద్దేశ్యంతోనూ, పాటుపడతారు గాని సామాజిక సమస్యల్ని అర్ధం చేసుకుని పరిష్కరించడానికి తోడ్పడలేరు. మొదటి దశలోనైనా నాయకత్వం, మధ్యతరగతి తీసుకుంటుంది. కాని శ్రామికులకు రాదు. పట్టణ వాసులైన పెటీబూర్జువాలు ఈ నాయకత్వం వహిస్తారు. శ్రామికులు ఎంత పెటీబూర్జువాలుగా ఉన్నారో, పట్టణవాసంచేసే పెటీ బూర్జువాలుగూడా అంత శ్రామికులుగా వున్నారు. సాధారణ పరిస్థితుల్లో కాపిటలిజం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు శ్రామిక వరం కొంత లాభిస్తుంది. జీవనోపాధి పరిమాణం పెరగడం వల్ల కొంత తెలివితేటలు పెరుగుతాయి. వీరిలో బాగా ముందుకు వచ్చినవారు విప్లవ అవశ్యకతను గుర్తిస్తారు; విప్లవ చైతన్యం కలుగుతుంది. హిందూదేశంలో కాపిటలిస్టు దోపిడీకి పాల్పడి వీరు పైకి రాలేకుండా ఉన్నారు. అందువల్ల విప్లవ అవశ్యకతను, గుర్తించలేరు. అయితే వీరిలో ఇంకో శాఖవారు కూడా వున్నారు. పాలక యంత్రాన్ని నడిపించుకోవడానికి కాపిటలిజం కొందరిని నియమిస్తుంది. వీరిని గూడా కాపిటలిజం దోచుకుంటుంది. అయితే పాలకయంత్రంలో పని చేయడానికి వీరికి కొంత చదువు చెప్పించవలసి వుంటుంది. ఈ విద్య వల్ల వీరు కాపిటలిజాన్ని ఎదుర్కొంటారు. జ్ఞానం అంత శక్తిమంతం. మనమంతా ఇలాంటి పెటీబూర్జువా వర్గానికి చెందినవాళ్ళమే. హిందూదేశంలో కాపిటలిజాన్ని ఎదుర్కొనటానికి తయారు కాలేదంటే, దానికి మనపిరికి తనమే కారణం. ఆపని పూని చెయ్యక కార్మిక అవతార పురుషుడితో నోరు తెరుచుకుని కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు. పెటీబూర్జువాయిజీ కార్మిక నియంతృత్వంకోసం ఉవ్విళ్ళూరుతూవుందంటే పచ్చి పిరికి తనం చాటుతూవుందన్నమాట.

శ్రామికులు-కార్మికులు[మార్చు]

శ్రామికులు, కార్మికులు అనే పదాలను అర్థం చేసుకోవడానికి చాలా తికమకలు పడుతున్నాను. ప్రతి దేశంలోనూ, ప్రతి యుగంలోనూ శ్రామికులున్నారు. కార్మికులు కాపిటలిస్టు ఉత్పత్తి విధానంలో వుంటారు. ప్రతి కార్మికుడు శ్రామికుడే. ప్రతి శ్రామికుడు, కార్మికుడు కాదు. కార్మికుడి ముఖ్యలక్షణం ఏమిటీ? కాపిటల్ (డబ్బు మాత్రంకాదు) ఉత్పత్తి సాథనంగా వున్న ఆర్థిక విధానంలో పనిచేస్తాడు. ఇక్కడ పారిభాషిక విషయాలలోకి దిగదల్చుకోలేదు. అయినా శ్రామిక కార్మిక విభేదం మాత్రం స్పష్టంగా గ్రహించాలి. కాపిటలిస్టు ఆర్థిక విధానంలో భూమికూడా కాపిటలిస్టు ఉత్పత్తికి సాధనంగా వుంటుంది. భూమిశిస్తు కాపిటలిస్టు ఉత్పత్తికి సాధనంగా ఉంటుంది. భూమిశిస్తు కాపిటలిస్టు విధానంలో గూడ వుంటూంది. అయితే యీ శిస్తు యొక్క సామాజిక స్వభావం మారుతుంది. జమీందారీ విధానంలోని భూమిశిస్తు, కాపిటలిస్టు విధానంలోని భూమిశిస్తు ఒకటికాదు. కాబట్టి కొన్ని పరిస్థితుల్లో వ్యవసాయపుకూలీలు కార్మికవర్గంలో చేరుతారు. కార్మికులకు మరో లక్షణం వుంది. సొంత ఆస్తి లేక పోవడమేకాదు, అలాంటి సొంత ఆస్తిని తిరిగి సంపాదించుకునే అవకాశాలు గూడా ఉండకూడదు. ఒకడి సొంత ఆస్తి అపహరింపబడవచ్చును. అయితే వాడు తిరిగి సొంత ఆస్తిని సంపాదించుకోవడానికి అవకాశమున్నంత కాలం అతడు కార్మికుడు కాడు. కాబట్టి పొలం లేని రైతు కార్మికుడు కావాలనే నియమం లేదు. అతని భూమి పోవచ్చును. అతడు ఎక్కడికో వెళ్ళి ఏనాల్గు వందలో, అయిదు వందలో, వెనక వేసుకుని మళ్ళీ ఏ కుంటో, రెండుకుంటలో, భూమి కొనుక్కోవచ్చును. తిరిగి సొంతసేద్యం పెట్టుకోవచ్చును. కాబట్టి తిరిగి సొంత ఆస్తిని సంపాదించుకోవడానికి అవకాశాలు పూర్తిగా నశించనప్పుడే పొలంలేని రైతు కార్మిక వర్గంలో చేరుతాడు. అలాంటి భూస్వామ్య విధానం పూర్తిగా మారి, వ్యవసాయంగూడా పెద్దమొత్తం మీద జరిగే పరిశ్రమగా తయారై, పొలంలో చిన్న పేలిక సంపాయించినా, దానిలో చేసే వ్యవసాయం పూర్తిగా గిట్టుబాటు కాని పరిస్థితుల్లోనే జరుగుతుంది. తిరిగి పొలం సంపాయించుకోవాలనే కోరిక కూడా పొలం లేని రైతులో నశించినప్పుడే అతడు కార్మికుడవుతాడు.

                     తిరిగి సొంత ఆస్తి సంపాదించుకునే అవకాశాలు లేకపోవడం అనే లక్షణం కార్మికులకు లేకపోతే, వారు సోషలిజం కావాలంటారని చెప్పడానికి వీలులేదు. వ్యక్తిగతంగా ఉత్పత్తి సాధనాలు సంపాదించుకోవడానికి తనకు వీలులేనప్పుడే, ఒక  వర్గం ఉత్పత్తి సాధనాలు సమాజపరంగా ఉండాలంటుంది. కాబట్టి శ్రామికుడు ఒక చిన్న ఫ్యాక్టరీలో పనిచేస్తున్నంత కాలం పెటీబూర్జువాగా ఉంటాడేకాని, కార్మికుడు కాజాలడు. అతనికి అతని రెక్కల కష్టం తప్ప తనదనుకోవడానికి ఒక పూచికపుల్ల గూడా లేక పోవచ్చును. అంత మాత్రాన అతడు కార్మికుడు కాదు. బాగా అభివృద్ధి చెందిన కాపిటలిస్టు సమాజంలోనే, కృషి గూడా ఒక సరుకుగా తయారై, కూలి డబ్బులకు మారకం జరుగుతుంది. కాపిటలిస్టు ఆర్థిక విధాన ప్రాథమిక ధశలో ఈ కృషి కాపిటల్కు ఆర్థిక విధాన ప్రాథమిక దశలో ఈ కృషి కాపిటల్కు మూలం అవుతుంది. ఇప్పటి బూర్జువాయిజీ యొక్క పూర్వులంతా చాలావరకు శ్రామికులే. ఒక చిన్న  పారిశ్రామికసంస్థలో పనిచేసే శ్రామికుడు, తానుకూడా ఒకానొక రోజుకి చిన్న దుకాణం పెట్టుకోగలుగుతాననుకుంటాడు. శ్రామికుడు పెద్ద మొత్తం మీద ఉత్పత్తి జరిగే సంస్థలో కుదిరి, అలా బ్రహ్మాండంగా ఉత్పత్తి చేసే సాధనాలను తానుగానీ, ఇంకా ఏవొకడైనా గానీ సొంతం చేసుకోవడానికి వీలులేదని గ్రహించినప్పుడూ, ఆ ఉత్పత్తి సాధనాలను చిన్న చిన్న పంపిళ్ళుగా చేసికొని, వ్యక్తికంగా తీసుకోవడానికి వీలులేదని గ్రహించినప్పుడే, కార్మికుడు అవుతాడు. ఇంకా శ్రాస్త్రీయంగా నిర్వచించాలంటే, కార్మికుడు శ్రామికవర్గం వాడై ఉండాలి. ఈ శ్రామిక వర్గం సమిష్టి కృషికోరే ఉత్పత్తి సాధనాలతో సమిష్టికంగా పనిచేయాలి. సమిష్టి కృషి ఉన్నప్పుడే ఉత్పత్తి సాధనాలు, పెట్టుబడితో సహా, సమాజపరం చేయబడుతాయి. ఈ లక్షణాలను శ్రామికవర్గానికి అన్యయించి మనం నిరుత్సాహపడనవసరం లేదు. ఈ నిర్వచనం ప్రకారం దేశంలో ఇరవై లక్షలకన్నా ఎక్కువ కార్మికులు లేరు. ఈ ఇరవై లక్షల మందిని కూడా కార్మికులుంటున్నమంటే, ఒకటే కారణం వుంది. వీరు పెద్ద పెద్ద కర్మాగారాల్లో సమిష్టిగా పని చేస్తున్నారు. అంతేగాని వీరికి గ్రామాలతో సంబంధం పోలేదు. తాము సంపాదించేదాన్ని గ్రామాల్లో వున్న తమబంధువుల పోషణకు పంపించడం వుంది. ఒకవేళ యీ బంధంగూడా లేదన్నప్పటికీ, నాలుగు డబ్బులు వెనకవేసుకుని మళ్ళీ పారిశ్రామిక ఉత్పత్తి సాధనాలు, పొలం పొట్రా సంపాయించాలనే వుద్దేశ్యం ఉంటుంది. ఇంకా మళ్ళీ రైతులం అవుతామన్న ఆశ పూర్తిగా నశించలేదు. దీన్ని బట్టీ చూస్తే, సరియైన కార్మికులు రెండు లక్షలకన్నా ఎక్కువ ఉండరు. సరియైన శాస్త్రీయ దృక్పథంతో చూస్తే నేటి హిందూ దేశంలో  కార్మికుల సంఖ్య స్వల్పమనీ, దాదాపు లెక్కలోకి వచ్చేది కాదనీ తేలుతుంది. దీనికి ప్రచారకులు ఒప్పుకోకపోవచ్చును. అయినా ఇది సత్యం, నేటి హిందూ దేశ సమాజాన్ని పరిశీలించి శాస్త్రం చెప్పుతూవుంది. అయితే ప్రపంచంలో ఎంత అముఖ్యమైన దాన్నైనా త్రోసి వేయడానికి వీలులేదు అనే పక్షంలోనే యీసిద్ధాంతానికి ఆక్షేపణ రావచ్చును. నిజమే. ఉన్నదాన్ని అల్పమైనా విస్మరించగూడదు. అయితే నేటి హిందూ దేశంలోని ఇతర వర్గాలతో కార్మికుల బలాన్ని పోల్చి చెబుతూ వున్నప్పుడు ఈ విషయాన్ని తప్పకుండా నిరసించవలసిన అవసరం లేదు. 
                                               ఇంతవరకు చర్చించి తేల్చుకున్న శాస్త్రీయ విషయాలను మన సమాజానికి అన్యయిస్తే, మన సమస్య తేలిపోతుంది. పారిభాషిక పదాలకు స్పష్టమైన నిర్వచనాలను చెప్పుకున్నాం. ఇప్పటి మన సమాజాన్ని పరిశీలించిన తర్వాత, ఈ సమాజంలో వున్న వర్గాల పరస్పర సంబంధాలు ఎలా ఉన్నాయో తేల్చుకోవడం తేలిక. మొట్టమొదట కనిపించే  విషయం: మన సమాజాన్ని విభజించి, ఇది ఫలానా వర్గం, ఇది ఫలానా వర్గం అని తేల్చి చెప్పడం కష్టం. ఈ వర్గ విభేదాలు స్పష్టంగా లేవు. ఇవి ఒకదానితో ఒకటి కొంత కలుస్తున్నాయి. ప్రతి భారతీయుడు కనీసం రెండురకాల సామాజిక విధానాలకు సంబంధించి ఉంటున్నాడు. పరస్పర విరుద్ధంగా ఉన్న రండురకాల ఆర్థిక విధానాల్లో తగుల్కొన్నాడు. ఇది అభివృద్ధి అరికట్టబడిన సమాజానికి ఒక ముఖ్య లక్షణం. సమ్రాజ్య ప్రభుత్వ ఫలితంగా ఇది ప్రాప్తించింది. ఇదే సామ్రాజ్య వ్యతిరేక ఉద్యమానికి మూల బీజం. దీనివల్లనే సామ్రాజ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంయుక్తపు పోరాటాన్ని సాగించవలసిన అవశ్యకత ఏర్పడుతూ వుంది. పరస్పర వైరుద్ధ్యం ఉన్న వర్గాలే దేశంలో ఏర్పడి వుంటే, సంయుక్తపు పోరాటాన్ని సాగించటానికి వీలు ఉండేది కాదు. ఏ వర్గాన్ని, ప్రత్యేక ప్రాముఖ్యాన్ని ఇచ్చి వ్యవస్థాపిస్తూ, సంయుక్త పోరాటాన్ని సాగించాలనడంలో అర్థం లేదు. అందరూ బానిసతనంలో ఉంటం వల్ల అంతా కలిసి పోరాడవలసిన అవశ్యకత ఏర్పడుతుంది. ఇక్కడ కొంచెం భేదం వుంది. అయితే ప్రజాసామాన్యం చాలావరకు ఒకేరకపు దోపిడికి గురి అయ్యింది. వీరందరికి, సామ్రాజ్యప్రభుత్వం పోవాలి. 

ఈ దృక్పథంతో మన సమాజంలోని వివిధశాఖల వారి దృష్టులు ఎలా వున్నాయో చూడాలి. జమీందారీ వర్గానికి సామ్రాజ్య వ్యతిరేక ఉద్యమమందు ఎలాంటి సానుభూతీ ఉండదు. ఆర్థిక లాభాలు జమీందారీ వర్గాన్నికీ, సామ్రాజ్య ప్రభుత్వానికీ ఒకటే. జమీందారీ ఆర్థిక విధానం, వలస రాజ్యాల ఆర్థిక విధానం తిలదండుల న్యాయంగా, ఎలాంటి వైరుద్ధ్యం లేకుండా, కలిసి మెలిసి పోతాయి. కాబట్టి జమీందారీ వర్గం అంతా శత్రుకోటిలోనిదే. అయితే చాలామంది జమీందార్లు కాపిటలిస్టులగా ఉండటం వల్ల బూర్జువా వర్గానికి చెందుతారు. అందువల్ల వర్గరీత్యా సమ్రాజ్య ప్రభుత్వానికి వ్యతిరేకులుగా ఉండాలి. జమీందార్లు కాపిటలిస్టులుగా ఉంటే, సిద్ధాంతరీత్యా సంయుక్తపు పోరాటంలో సంస్థానాధిపతులను గూడా చేర్చుకోవలసి ఉంటుంది. అంటే, కాశ్మీర సాంస్థానాధిపతులను గూడా చేర్చుకోవలసి ఉంటుంది. అంటే, కాశ్మీర సంస్థానాధిపతి దగ్గరనుంచి బొంబాయి గుడ్డల మిల్లులో పనిచేసే శ్రమికుడి దాకా కలుపుకోవలసి ఉంటుంది. దీన్ని బట్టి జాతీయ సంయుక్తపు పోరాటం అనే సిద్ధాంతంలోని రసాధాస కన్నులకు పొడగట్టుతూనే వుంది.

                     ఇక హిందూ కాపిటలిస్టులకూ, సామ్రాజ్య ప్రభుత్వానికీ, ఉన్న సంబంధ బాంధవ్యాలను పరిశీలిద్దాము. పరిశీలించేటప్పుడు వెనక తేల్చుకున్న విషయాలను మరిచిపోకూడదు. కాపిటలిస్టు ఆర్ధిక విధానంలో పనిచేసే వాళ్ళంతా యీ వర్గంలోకి రారు. ఏదీ ఎలావున్నా, హిందూ దేశంలో కాపిటలిస్టు వర్గం చాలా స్వల్పంగా వుంది. మన దేశంలో కాపిటలిజం ఎలా అభివృద్ధి చెందిందో చూస్తే, కాపిటలిజం జమీందారీ ఆర్థిక విధానంతో తెగతెంపులు చేసుకున్న, విడవడ లేదని తేలుతుంది. నిజానికి హిందూదేశపు కాపిటలిజం జమీందారీ వర్గ సంబంధాలమీదనే అభివృద్ధి చెందింది. కాబట్టి అంతవరకూ హిందూదేశపు కాపిటలిస్టు ఆర్ధిక విధానం వలస రాజ్యపుటార్ధిక విధానంలో ఒక భాగమే అవుతుంది. జమీందారీ, వలసరాజ్య , కాపిటలిస్టు దోపిడీలు హిందూ దేశంళొ సామ్రాజ్య ప్రభుత్వం అవలంబించే ఆర్ధిక విధానంలో భాగాలుగా ఉన్నాయి. కాబట్టి హిందూ దేశంలోని కాపిటలిస్టు వర్గం కుడా శత్రుకోటిలోనిదే.

డికాలనైజేషన్[మార్చు]

చాలవరకు జమీందారీ ఆర్థిక విధానాన్ని పురస్కరించుకుని హిందూదేశంలో సామ్రాజ్య ప్రభుత్వం నిరంకుశంగా దోపిడీ సాగించగలిగింది. ఇంతకుముందు చర్చించని విషయమొకటి ఇక్కడ చూడవలసివుంది. ప్రాపంచిక ఆర్ధిక విధానాన్నుంచి హిందూ దేశపు ఆర్ధిక విధానాన్ని వేరుచేసి చూడటానికి వీలులేదు. ప్రాపంచిక ఆర్ధిక విధానంలో హిందూదేశపు ఆర్ధిక విధానం ఒక భాగమైపోయింది. కాపిటలిజానికి విషమస్థితి వచ్చిందంటే, సామ్రాజ్య విధానానికి విషమస్థితి పడటానికి సామ్రాజ్య ప్రభుత్వం వలసరాజ్యాల దోపిడీ విధానంలో మార్పుతెచ్చి, తన స్థితిని సర్దుకుంటుంది. వలస రాజ్యాలనుంచి సామ్రాజ్య ప్రభుత్వానికి ఏమి కావాలి? వలస రాజ్యాల కృషిని ఉపయోగించుకోవడమే సామ్రాజ్య ప్రభుత్వము యొక్క ముఖోద్దేశం. కృషివల్లనే అన్నీ (వాల్యూస్) ఉత్పన్నమౌతాయనే చూచాం. కృషిని దోపిడీ చేసే పద్ధతి మీదనే లాభాలు ఆధారపడి వుంటాయి. పూర్వం జమీందారీ ఆర్థిక విధానంద్వారా వ్యవహరించి హిందూదేశపు కృషివల్లనే సామ్రాజ్య ప్రభుత్వం ఎక్కువ లాభాలు సంపాదించింది. రానురాను ఇంకా లాభాలు సంపాదించింది. వచ్చాయి. కాపిటలిజం మూడుపువ్వులు ఆరు కాయలుగా వున్నప్పుడు వలస రాజ్యాలు కేవలం భవిషత్తులో లాభాల నీయగలిగి వుంటాయి. సామ్రాజ్య ప్రభుత్వం అవసరమైనప్పుడు లాభాలు తీసుకోవటానికి వీలుగా వుండే ఖజానా పెట్టెలుగా వాడుకోటానికే వలస రాజ్యాలను సంపాదిస్తుంది. మొట్టమొదటనే వలస రాజ్యాలలో నుంచి అన్ని లాభాలను ఒకేసారి రాల్చుకోదు. కొన్నిటినే తీసుకుంటుంది. దీనికి వ్యాపారం ఒకటి చాలు. వచ్చే కాపిటలిస్టు విషమపరిస్థితిని బట్టి ఇంపీరియలిజం యొక్క నిర్మాణం మారుతుంది. అలాంటి విషమ పరిస్థితుల్లో వలస రాజ్యాల్లోవున్న అవకాశాలను వాడుకుంటుంది. కాపిటలిజం యొక్క అభివృద్ధి చెందిన కాలంలో, అంటే, 19వ శతాబ్దం చివరనుండి 1914, 18 దాకా “యింపీరియలిస్టు” దేశాలనుంచి వలస రాజ్యాలను కాపిటల్ ఎగుమతి అయింది. ఇది ఆధునిక సామ్రాజ్య విధానానికి ముఖ్యలక్షణం. సామ్రాజ్య దేశాలలో లాభకరంగా పెట్టుబడి పెట్టటానికి వీలైన మొత్తం కంటే ఎక్కువ మూలధనం పోగైంది. పూర్తిగా అభివృద్ధి చెందిన కాపిటలిస్టు ఆర్ధిక విధానానికి లాభాలు తక్కువ కావటమనే అపయం తటస్థించింది. అందువల్ల ఎక్కువ లాభాలు గడించటానికి వీలుగావున్న దేశాలకు కాపిటల్ ఎగుమతి అయింది. ఇది ఆధునిక సామ్రాజ్య విధానానికి ముఖ్యలక్షణం. సామ్రజ్య దేశాలలో లాభకరంగా పెట్టుబడి పెట్టటానికి వీలైన మొత్తం కంటే ఎక్కువ మూలధనం పోగైంది. పూర్తిగా అభివృద్ధి చెందిన కాపిటలిస్టు ఆర్ధిక విధానానికి లాభాలు తక్కువ కావటమనే అపాయం తటస్థించింది. అందువల్ల ఎక్కువ లాభాలు గడించటానికి వీలుగావున్న దేశాలకు కాపిటల్ ఎగుమతి అయింది. ఈ విధంగానే ఆధునిక సామ్రాజ్య విధానం బయలుదేరింది. తరువాత ఒక్క అమెరికాలో తప్ప ఇరత దేశాల్లో కాపిటల్ క్షీణింప మొదలుపెట్టింది. దీనికి తోడు, నూతన ఉత్పత్తి సాధనాలు రావడం వల్ల పారిశ్రామిక యంత్రాలను పూర్తిగా మార్చివేయవలసి వచ్చింది. ప్రాపంచికపు మార్కెట్టులోని పోటీయే దీనికి కారణం. ఇలా జరగటం వల్ల కొత్తగా పోగైన కాపిటల్ను దేశంలోనే వినియోగించవలసి వచ్చింది. దీవిఫలితంగా వలస రాజ్యాలను ఎగుమతయ్యే కాపిటల్ ఆగిపోయింది. ప్రాపంచికపు మార్కెట్టులో ఏర్పడ్డ తీవ్రపు పోటీవల్ల లాభాలుకూడా పడిపోయాయి. కాపిటలిస్టు దేశాలలో పోగయ్యే కాపిటల్ కూడా పడిపోయింది. ఇలా జరగటం వల్లనే సామ్రాజ్య ప్రభుత్వానికి విషమస్థితి ఏర్పడింది. అందువల్ల వలస రాజ్యాలలో వున్న అవకాశాలమీద ఆధారపడవలసి వచ్చింది. వలస రాజ్యాలున్న దేశాలు ఈ విషమస్థితి నుంచి బయటపడగలిగాయి. ఎక్కువ ఉత్పత్తికరంగా వుండే పద్ధతిని, కృషిని వినియోగిస్తే వలసరాజ్యాల దోపిడి ఎక్కువ లాభకరంగా వుంటుంది. ఉత్పత్తి సాధనమై, భూమి ఇంకా ఎక్కువ లాభాలు ఈయలేక పోయింది. సామ్రజ్య ప్రభుత్వానికి విషమస్థితి ఏర్పడ్డపుడూ, కాపిటలిజం కుళ్ళిపోతున్నప్పుడూ, భూమికంటే యితరములైన ఉత్పత్తి సాధనాలను వలస రాజ్యాలలో కూడా ప్రవేశపెట్టవలసిన అవశ్యకత ఏర్పడింది. ఈ విధానాన్నే “డీకాలనైజేషన్” అంటరు

                 ఒక సారి శభ్దాన్ని సృష్టించినతరువాత దానికి అపార్ధం తేలికగా లాగుతారు. కాబట్టి డీకాలనైజేషన్ అంటే అర్థమేమిటో ఇంకా స్పష్టంగా చెప్పవలసి వుంది. భూమి ఉత్పత్తి సాధనంగా వున్న హిందూదేశపుటార్ధిక విధానాన్ని వలసరాజ్యపు టార్థికమన్నారు. భూమి ముఖ్యమైన ఉత్పత్తి సాధనం కాక, నూతనమైన ఉత్పత్తి సాధనాలను ప్రవేశపెట్టటం వల్లనే మనదేశపుటార్థిక విధానం మారింది. ఇప్పటిది, జమీందారీ సంబంధాలను పురస్కరించుకుని సాగింపబడుతూ వుంది. జాతీయ బూర్జువా వర్గానికీ, పైకివస్తూ వున్న స్వదేశ సంస్థానాధిపతులకూ లాభాలు లభించాయా, లేదా అన్నది మనకు ముఖ్యవిషయం కాదు. హిందూ దేశపుటార్ధిక నిర్మాణంలోని మార్పొక్కటే మనకు ముఖ్యం. ఈ మార్పు హిందూదేశపు కాపిటలిజానికి లాభం చేకూర్చుతుంది. నిజానికి ఈ మార్పువల్ల మొత్తంమీద హిందూదేశపు టార్ధిక విధానం చాలా వరకు మార్పుచేయబడింది. కాపిటలిజానికి వచ్చే విషమస్థితి వలసరాజ్య పుటార్ధిక విధానంలో మార్పు తెస్తుంది. అంటే, పూర్వ నుంచి వలసరాజ్యాలను దోచుకుంతూ వస్తున్న పద్ధతిని వదలి కొత్తపంథా తొక్కుతుంది. వలసరాజ్యపు టార్ధిక విధానమూ జమీందారీ ఆర్ధిక విధానమూ ఒకటేనని ఇంతకుముందు తెలుసుకున్నాం. అంటే, ఉత్పత్తికి ముఖ్యకారకుడైన వాడిననుంచి అతనికి మిగిలే ఫలసాయాన్ని, (సర్ ప్లస్ ఉత్పత్తి) యావత్తు అపహరిస్తారు. నూతన ఉత్పత్తి సాధనాలను ప్రవేశపెట్టడం వల్ల ఇది మారుతుంది. సామ్రాజ్య ప్రభుత్వ దేశాలలో ఉత్పన్నమయ్యే సరుకులకు మార్కెట్లు కావాలి. అయితే మార్కెట్లు నిలకడగా వుండవు అవి అభివృద్ధి కావాలి. వాతిని అభివృద్ధి చేయడానికి చాలా మార్గాలున్నాయి. సామ్రాజ్య విధానం కొనసాగాలంటే, వలస రాజ్యాలను పూర్తిగా బిక్కా ఫకీరులను చేయటానికి వీల్లేదు; వీటిని సరుకులను కొనగలిగే స్థితిలో ఉంచాలి; లాభాలు సమ్రాజ్య ప్రభుత్వానికి చేరుతున్నంతకాలం ఈ సరుకులు వలస రాజ్యాలలో తయారవుతున్నాయో, సామ్రాజ్య ప్రభుత్వపు దేశాలలో తయారవుతున్నాయా, అన్న ప్రశ్నలతో మనకు నిమిత్తం లేదు. 
                                ఇలా, ఈ విధానాన్ని సాగించి సామ్రాజ్య ప్రభుత్వం హిందూదేశాన్ని పూర్తిగా పారిశ్రామిక దేశంగా తయారు చేయగల్గితే, మన దేశంలో విప్లవం రావలసిన అవసరం లేదు. ఎందుకంటే, సామ్రాజ్య ప్రభుత్వమే మన దేశంలో పూర్తిగా పరిశ్రమల్ని ప్రవేశ పెట్టగలిగితే, మన విప్లవ ఆదర్శాలను ప్రవేశపెట్టవలసి వస్తుంది. కాపిటలిజం విషమస్థితి నుంచి బతికి బయట పడగలిగేటట్లయితే, విప్లవం అవసరం లేదు; కాపిటలిజం ప్రాథమిక దశలో ఉండగానే, ముందు ముందు అది కూలదోయ బడుతుందిఅని మార్క్సు చెప్పాడు. కాపిటలిజంలో అంతర్వైరుద్ధ్యలున్నాయనీ, వాటిని పరిష్కరించటానికి వీల్లేదనీ, అతడు గ్రహించాడు. తన తరువాత చాలా కాలానికి కాపిటలిజం కూలదోయ బడుతుందని కూడా అతడు ఎరుగును. ఈ విధంగానే మన సామ్రాజ్య వ్యతిరేక పోరాటాన్ని గురించి, సామ్రాజ్య ప్రభుత్వ పతనాన్ని గురించి ముందేమి జరుగుతుందో చెప్పవచ్చును. సామ్రాజ్య విధానంలో ఎలాంటి లోటుపాట్లు, కష్టనష్టాలున్నా, తన అంతర్వైరుద్ధ్యాలను కొంతవరకు సరిపెట్టుకోగలిగి, హిందూ దేశపుటర్ధిక విధానాభివృద్ధికి పాటుపడేటట్లయితే సాధారణంగా, దాన్ని కూలద్రోయటానికి వీల్లేదు. హిందూ దేశానికి లాభం కలగాలంటే, ప్రజల ఆర్ధిక  జీవనం బాగుపడాలంటే, ఉత్పత్తి శక్తులు అభివృద్ధి కావాలి. అంటే, ఉత్పత్తి విరివి కావాలి; సరుకులు ఎక్కువగా తయారు కావాలి; ఆ తయారైన సరుకులు అమ్ముడు పోవాలి. ఇక్కడ మార్కెట్తు సంగతి, ప్రజల కొనుగోలు శక్తి విషయం వస్తాయి. ఈ సమస్యలను సామ్రాజ్య ప్రభుత్వం పరిష్కరించగలిగితే, అది స్థిరపడి పోతుంది. ఇదే హిందూదేశపు టార్థిక విధానానికి వచ్చే ముఖ్యసమస్య. ఈ సమస్యను పరిష్కరించ కలిగిన విధానం ఏదైనప్పటికీ, అది జాతీయ విధానమవుతుంది. ఈ సమస్యను సామ్రాజ్య ప్రభుత్వం పరిష్కరించకల్గితే, సామ్రాజ్య వ్యతిరేకపు పోరాటానికి తావుండదు. 
                                          ప్రతి విధానానికి అనేక మార్గాలుంటాయి. సామ్రాజ్య పభుత్వాలు కూలద్రోయ బడతాయని సూచిస్తూ, మార్క్సు ఇలా చెప్పాడు: కార్మికులు 74   కార్మికులు  సామ్రాజ్య ప్రభుత్వాన్ని కూలద్రోయక ఊరుకుంటే, దానిలో ఎలాంటి అంతర్వైరుద్ధ్యాలున్నా, అవిచ్చినంగా సాగుతుంది. అంటే, పురుష ప్రయత్నముండాలి. విప్లవంలో చాలా ముఖ్యమైనది యీ పురుష ప్రయత్నమే. ఎప్పుడూ ప్రయత్నం చేయక ప్రాలు మూలుతున్నామన్నమాట. ఎన్ని విధాల పరిణమించటానికి వీలుందో, అన్ని విధాలు తెలుసుకోవాలి. ఒక విధంగా పరిణమించటనికి అవకాశాలు తక్కువగా వుండవచ్చును. అయినా, దాన్ని విడిచి పెట్టటానికి వీల్లేదు. అవకాశాలు తక్కువగ వున్నదే కొన్ని పరిస్థితుల్లో జరగటానికి వీలుండవచ్చును. సామ్రాజ్య ప్రభుత్వం హిందూదేశంలో ప్రజాస్వామిక విప్లవం తెచ్చే అవకాశాలు చాలా తక్కువగా వున్నాయి. అంత మాత్రాన సిద్ధాంతరీత్యా చర్చిస్తూ వున్నప్పుడు, దీన్ని త్రోసివేయటానికి వీల్లేదు. అంతా పురుషప్రయత్నం మీద, అంటే, సరైన రాజకీయ పక్షం బయల్దేరి పని చేసేదానిమీద ఆధారపడి వుంటుంది. అయినా, అత్యల్ప అవకాశాలున్న దాన్ని కూడ వట్టి భ్రాంతేనని నేను త్రోసివేయలేదు. పురుష ప్రయత్నం, అంటే, విప్లవ చైతన్యం కల్గి, ఏస్వల్ప అవకాశాన్నయినా పురస్కరించుకుని సామ్రాజ్య ప్రభుత్వాన్ని కూలద్రోయ కల్గిన సుశిక్షిత రాజకీయపక్షం ఏర్పడలేదు. అసలు అలాంటిది లేదన్నంత అపక్వ స్థితిలో వుంది. పురుష ప్రయత్నం లేనప్పుడు రాజకీయ పక్షాన్ని ఒక దాన్ని వ్యవస్తాపించాలి. ఇది నిర్వివాదాంశం. అయితే, ఇలాంటి పక్షంలో చేరే వారికోసం వెదకాలి. అలాంటి వారు ఎక్కడున్నారు? ఈ ప్రశ్న మనం ఇంతకు ముందు తేల్చుకున్న సమ్రాజ్య వ్యతిరేకపు పోరాటంలో పాల్గొనే వాళ్ళ దగ్గరకు తీసుకుని పోతున్నది. ఇంతకుముందే హిందూ దేశంలో సమాజం ఎలా చర్చించి తేల్చుకున్నాం. ఏ వర్గం సంపూర్ణ చైతన్యం కలిగి విప్లవ విధిని నిర్వహిస్తుంది? ఇప్పుడు మనదేశంలోని రైతులకు రెండు విప్లవాలు కావాలని చెప్పాము. పట్టణవాసం చేస్తూవున పెటీబూర్జువా వర్గాన్ని, అంటే, మనలనౌ ప్రభుత్వం సృష్టించింది. ఊడగొట్టిన నాగటిదుంప కోళ్ళనుగా చేసివేసింది. ఇలాంటి పెటీబూర్జువా వర్గమే ప్రురుష ప్రయత్నాన్ని సరఫరా చేయాలి. పెటీబూర్జువా వర్గం విప్లవానికి ముఖ్యమైన పురుష ప్రయత్నాన్ని చేకూర్చుతుందన్న నిర్ణయానికి వచ్చాం. ఈ విషయాలు మన బుద్ధికి గోచరిస్తున్నాయి కాని, బూలాభాయి దేశాయికి గాని, జిన్నాకు గానీ, వీరసావర్కరుకు గానీ గోచరించటం లేదు. దీనికి కారణం ఏమిటి? మనకూ, శ్రామికులకు సంబంధం వుంది. జన్మతః పెటీబూర్జువా వర్గానికి చెందినవారి బుద్ధికి ఈ విషయాలు గోచరిస్తాయి. నా బుద్ధి కార్మికుల నాయకత్వాన్ని ప్రకటించే సాధనంగా వుంది. అలాంటి బుద్ధిని నిరుత్సాహపరిచి కార్మిక విప్లవం కావాలనటంలో అర్థంలేదు. విప్లవానికి ముఖ్యమైన పురుష ప్రయత్నానికి కొన్ని అవసరంగ వుండాలి. అంటే, కొంత విద్య, కొంత నాగరికత వుండాలి. చైతన్యం ఏర్పడాలంటే బుద్ధి కావాలి. హిందూదేశంలో విప్లవకారులుగా వున్న కార్మిక కర్షకుల్నీ, పెటీబూర్జువాలనూ తీసుకుంటే, విప్లవానికి కావాలసిన విషయలు ఒక శాఖ వారిలోనే కనిపిస్తాయి. మనలోని ప్రతీవాడు ఈ శాఖకే చెందుతాడు. మనలోని ప్రతీవాడు సోషలిజం కోసం తీవ్రంగా పోరాడేవాడే. అయినప్పటికీ మనలో ఒక్కడైనా కార్మిక వర్గానికి చెందినవాడు లేదు. ఇది నేట నేటి హిందూ దేశపు పరిస్థితుల్లో కనిపించే ముఖ్యమైన సత్యం. దీన్ని బట్టే సామ్రాజ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరగవలసిన పోరాటంలోని వర్గ సంబంధాలను నిర్ణయించారు. 
                                                        కార్మిక – కర్షక పెటీబూర్జువాలకు వ్యతిరేకంగా మరోపక్షముంది. భూమిగాని, మిల్లులు గాని, గనులు గాని, మరెలాంటి ఉత్పత్తి సాధనాలు గాని యీ పక్షం వారి చేతుల్లోనే వున్నాయి. సామ్రాజ్య ప్రభుత్వం అవలంబించే వలస రాజ్యపుటార్ధిక విధానానికి లోబడి, యీ ఉత్పత్తి సాధనాల మీద యీ పక్షంవారు అధికారాన్ని పొందారు. అందువల్ల సామ్రాజ్య వ్యతిరేకపు పోరాటంలోని వర్గసంబంధాలను విచారిస్తే, యీ పక్షంవారు సామ్రాజ్య ప్రభుత్వంతో కలుస్తారు. ప్రజా సామాన్యంలో స్వల్ప భేదాలున్నాయి. అయినా ప్రజలు ఏకీభవిస్తారు. ఈ ఏకీభవించే శక్తి సామాజిక సంబంధాల్లో వుంది. అందువల్ల ప్రజలు ఏకీభవించే శక్తి సామాజిక సంబంధాల్లో వుంది. అందువల్ల సామ్రాజ్య వ్యతిరేకపు పోరాటంలోని వర్గసంబంధాలను విచారిస్తే, యీ పక్షం వారు సామ్రాజ్య ప్రభుత్వంతో కలుస్తారు. ప్రజా సామాన్యంలో స్వల్ప భేదాలున్నాయి. అయినా ప్రజలు ఏకీభవిస్తారు. ఈ ఏకీభవించే శక్తి సామాజిక సంబంధాల్లో వుంది. అందువల్ల ప్రజలు ఏకీభవించి సామ్రాజ్య విధానానికి వ్యతిరేకులవుతారు. కానీ వీరిలో ఉన వర్గ వైరుద్ధ్యం ఎక్కువైతే మాత్రం, ఈ ఐకమత్యం చెడి కొంతమంది శత్రుకోటిలో చేరచ్చును. కాబట్టి జమీందారీ, కాపిటలిస్టు, ఇంపీరియలిస్టు శక్తులకు వ్యతిరేకంగా జరగవలసిన పోరాటానికి ప్రజా సామాన్యంలోనే ఐకమత్యం చాలా ముఖ్యం. అందువల్ల మన ఉద్యమం ఇలాంటి దశలో ఉన్నప్పుడు, వర్గ సంఘర్షణలను ఎత్తుకోవడం, కేవలం, అనర్ధాయకం. వర్గ సంఘర్షణ అనేది కాపిటల్కీ, కృషికీ మధ్యనేకాక ఇతరత్రా కూడా వున్నదని తెలిసినప్పుడు మరీ అనర్థం కలుగుతుంది. ఒకప్రక్క శామికులకూ, పెటీబూర్జువాయిజీకీ, మరోప్రక్క వీరిద్దరికీ, కర్షకులకూ, వర్గసంఘర్షణ ఉండటానికి ఎక్కువ అవకాశాలున్నాయి. నేటి హిందూదేశంలో చాలా మంది ఇలాంటి పోరాటంలో తగుల్కొన్నారు. ఈ పోరాటాఅన్ని వృద్ధి చేయటమంటే, విప్లవదోహం చేయటమన్మమాట. 
                                                           విప్లవం కోసం మనం చేసే ప్రచారంలో అర్ధముండాలి. వర్గపోరాటానికి ప్రాముఖ్యమిస్తూ, శ్రామికులూ, కర్షకులూ ఏకం కావాలనటంలో అర్ధం లేదు. సంయుక్త పోరాటానికి, ట్రేడ్ యూనియన్లు, కిసాను సభలు ముఖ్యమంటారు. కర్షకుల లాభాలకోసం ప్రయత్నిస్తే, శ్రామికుల లాభాలు దెబ్బతింటాయి. శ్రామికుల లాభాల కోసం ప్రయత్నిస్తే, కర్షకుల లాభాలు దెబ్బతింటాయి. శ్రామికులకూ, కర్షకులకూ మధ్యవున్న వర్గవైరుద్ధ్యం తీవ్రసమస్యగా వుంది. ఈ సమస్య ఒక్క హిందూదేశంలేనే కాదు, ప్రపంచమంతటావుంది. శ్రామిక కర్షకలాభాలను సాధ్యమైనంతవరకు సన్నిహితంగా తీసుకురావటమనేది పెద్ద సమస్య. హిందూదేశంలో శ్రామికులు, కర్షకులు పేదరికంలో మునిగి తేలుతున్నారు. కర్షకులు లాభించాలంటే ధాన్యానికి ధర లేవాలి. ధాన్యానికి ధర యెక్కువయితే, ఆహారపదార్ధాలకు ధర హెచ్చుతుంది. అందువల్ల శ్రామికులకు నష్టం. శ్రామికులకు జీతాలను కర్షకులదగ్గరనుంచి వసూలుచేస్తాడు. ఇంతకూ ధాన్యానికి ధర పెంచకూడదని కాని నేను చెప్పటం లేదు. సంయుక్తపు పోరాటం సంగతి మనస్సులో ఉంచుకోవాలి.  అది అంత తేలిక సమస్య కాదు. “వర్గ పోరాటాన్ని” పెంచి తద్వారా సామ్రాజ్య ప్రభుత్వ వ్యతిరేకపోరాటాన్ని బలపరుస్తామనటంలో అర్థంలేదు. సామ్రాజ్య విధానాన్ని ఎదుర్కొనే సంయుక్త పక్షాన్ని సృష్టించాలంటే, ఐకమత్యకారక విషయాలను నొక్కిచెప్పి ప్రచారం చేయవలసి వుంటుంది. ఈ పరిస్థితుల్లో కేవలం శ్రామికులు, కర్షకులు, పెటీబూర్జువా వర్గానికి చెందిన వ్యాపారస్థులు, చిన్న చిన్న ఉద్యోగస్థులు, పనివాళ్ళు, మేధావులు కలిసి పోరాడటానికి వీలుంది. వీరిలో పటణాల్లో వుంటూ, పెటీ బూర్జువాలుగా వుంటున శ్రామికులు మాత్ర్రమే తమకు కావలసినవేమిటో తెలుసుకోగల్గుతారు. ఇప్పటి విప్లవదశలో శ్రామికులు, కేవలం పెటీ బూర్జువా వర్గంగానే నాయకత్వం వహిస్తారు. ఫ్రెంచి మహా విప్లవంలో పారిస్ నగరంలోని శ్రామిక వర్గం ఈ విధంగానే పనిచేసింది. మనదేశంలో ఇంకా బూర్జువా విప్లవం జరగాల్సి వుంది. అందువల్ల మనవర్గాలు నిర్వర్తించవలసిన బాధ్యతలు కూడా ముఖ్యంగా అలాగే వుంటాయి. మనం ఇంకా జమీందారీ సమాజంలోనే వున్నాము. ఈ స్థితి, తనకు విపత్కరంగా వుండటం వల్ల సామ్రాజ్య ప్రభుత్వం మార్చటానికి ప్రయత్నిస్తూ వుంది. జమీందారులు కూడా పరిస్థితులు నానాటికి విషమిస్తున్నాయని గ్రహించి, తమ పద్ధతిని మార్చుకోవాలని చూస్తున్నారు. కానీ యీ విధానం జమీందారులకూ సామ్రాజ్య ప్రభుత్వానికీ, లాభకరంగా వుంది. కాబట్టి దీన్ని ధ్వంసం చేయటం కానీ, ముఖ్యమైన మార్పులు ప్రవేశపెట్టి దుర్బలపరచటం కానీ, ముఖ్యమైన మార్పులు ప్రవేశపెట్టి దుర్బలపరచటం కానీ, జరగదు. అక్కడక్కడ ఈ విధానానికి కొన్ని అతుకులు అతకవచ్చును. కాని ఈ విధానాన్ని పుర్తిగా నాశనం చేయరు. శ్రామిక కర్షక పెటీబూర్జువాల ముగ్గురికీ, పెటీ బూర్జువా వర్గం ప్రతినిధిగా వుంటుంది. వీరి లాభాలే యిప్పటి జాతికంతకు లాభాలుగా వుంటాయి. ఇప్పటి మన జాతీలో  అధిక సంఖ్యాకులు పెటీ బూర్జువాలే. అందువల్ల వీరికి లాభించిందంటే, మొత్తం మీద జాతి అంతా లాభించిందన్నమాట. వీరే మన విప్లవ సైనికులు. ఈ సైనిక స్కంధారావంలో ఒక ముఠాకే ఎక్కువ చైతన్యముంది. మన మంతా యీ ముఠాలోనివారమే. రాబెన్ పెరీ, మారెట్, డాంటన్లు అంతా పెటీబూర్జువాలే. మన దేశంలో తమ కర్తవ్యాన్ని నిర్వహించటానికి ఎవరు సిగ్గుపడతారు? బూర్జువా వర్గం విప్లవాన్ని తేనప్పుడు. పెటీబూర్జువా దానిస్థాన మాక్రమించి విప్లవాన్ని నిర్వహించింది. శ్రామికులు తమవారేనని పెటీబూర్జువా వర్గం గ్రహించింది. పెటీబూర్జువా వర్గ భాగంగానే శ్రామికులు కూడా పనిచేశారు. శ్రామికులెక్కువెక్కువ జీతాలు కావాలని కోరలేదు. కేవలం తిండి కావాలని కోరారు. ఇది ఏ ఒక వర్గం కోరికా కాదు. ఇది యావత్సమాజం కోరేదే. ఇలా ఏకమైనవరిలో తెలివితేటలు, నాగరికత, ప్రజా సామాన్యానికి సాధారణంగా కావాల్సిన కోరికలను ప్రకటించగల్గిన విద్యవున్న వారే నాయకత్వం వహించటానికి వీలుంది. హిందూ దేశంలో నేడు వచ్చే విప్లవానికి నాయకత్వం వహించే గౌరవం బూర్జువాయిజీకి గానీ, కార్మికులకు గాని సంక్రమించదు; అంటే, ఇప్పుడిప్పుడే బయలుదేరుతూ వున్న కార్మికులకు ప్రథమ శ్రేణిలో  వుండి పోరాడే పెటీబూర్జువాయిజీకీ, యీవర్గంలో కేవలం అంతర్భాగంగా పనిచేసే కార్మికులకూ సంక్రమిస్తుంది. 
                                ఈ చర్చవల్ల హిందూదేశపు విప్లవానికి పురుష ప్రయత్నము ఎవరిద్వారా లభిస్తుందో స్పష్టమయింది. ఈ ప్రయత్నం మనం చేస్తాం. సామజికంగా, ఆదర్శరీత్యా మనకున్న స్థితి మనకు తెలుసు. మనం కార్మికుల మైనట్లు నటించడం వల్ల ప్రయోజనమేముంది? ఇప్పటి విప్లవాన్ని, సామాజికంగ పెటీ బూర్జువాలు గాను వున హిందూ దేశపు విప్లవ నాయకులు నిర్వర్తించక పోవచ్చును. కాని వీటన్నిటికంటే, ముఖ్యమైన విషయం ఒకటివుంది. మనమంతా మార్క్సిస్టులం. మార్క్సిజాన్ని నేటి హిందూదేశంలో కేవలం ఇరవయ్యో శతాబ్దపు జాకోబినిజంగానే ఆచరణలోకి తేవాలి. మార్క్సిజాన్ని సరిగా అర్ధం చేసుకుంటేనే, యీ విషయాన్ని గ్రహించగలుగుతాము.      అప్పుడే నేటి హిందూదేశపు సమాజంలోని వర్గ సంబంధాలను తేల్చుకుని, కర్తవ్యం నిర్ణయించుకొ గలుగుతాము.

ఇతర లంకెలు[మార్చు]

http://www.new.dli.ernet.in/handle/2015/394929