మన కంటికి ఆముదపు దీపం మంచిదా? విద్యుత్‌ దీపం మంచిదా?

వికీసోర్స్ నుండి

మన పెద్దవాళ్ళంటారు, "ఈ ఎలట్రీ దీపాలు వచ్చాకనే కళ్ళజోళ్ళు ఎక్కువయాయి" అని. ఆముదపు దీపాల రోజులల్లో కళ్ళ జోళ్ళ వాడకం లేనేలేదని వాళ్ళ వాదం. మరికొంతమంది "ఏమిట్రా, ఆ గుడ్డి దీపం దగ్గర చదువుతావు, కళ్ళు పాడైపోగలవు జాగ్రత్త" అంటారు. ఈ నమ్మకాలలో నిజం ఎంత?

ఆముదపు దీపం అంటే వెలుగు తక్కువ ఇచ్చేదీపం అని అన్వయం చెప్పుకుంటే, వెలుగు తక్కువగా ఉన్న ఏ దీపం దగ్గర చదివినా కంటికేమీ నష్టం లేదు. ప్రమిదలో ఆముదం పోసినా, ఆవు నెయ్యి పోసినా, కిరసనాయిలు పోసినా ఆ దీపం నుండి వచ్చే పొగలో తేడా ఉండొచ్చు కానీ ఆ దీపపు వెలుగులో ఆరోగ్యానికి సంబంధించిన తేడాలు ఉండడానికి వీలు లేదు. కిరసనాయిలు దీపపు పొగకి కళ్ళు మండుతాయి కనుక కిరసనాయిలు దీపం కంటె ఆముదపు దీపం మంచిది కావచ్చు.

వెలుతురు తక్కువగా ఉన్న చోట చదివితే కంటికి నష్టం కాదా? వెలుతురు తక్కువగా ఉన్న చోట ఫోటో తీస్తే కెమేరా పాడవుతుందా? పాడవదే. అలాగే వెలుతురు తక్కువగా ఉన్న చోట చదవడానికి కొంచెం ఇబ్బంది కావచ్చు కాని, కన్ను పాడవడానికి అవకాశం లేదు. చీకటికి అలవాటు పడిపోయిన తర్వాత మన కళ్ళు చీకటిలో కూడ బాగానే చూడకలవు. అలాగే విద్యుత్‌ దీపాల వెలుగు కంటికి హాని చేస్తుందనుకోవడానికి నాకు తెలుసున్నంత వరకు దాఖలాలు ఏమీ లేవు.

మరి పూర్వపు రోజుల కంటె ఇప్పుడు కళ్ళజోళ్ళ వాడకం ఎందుకు పెరిగింది? పూర్వం కళ్ళ పరీక్షలకి సదుపాయాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఆ సదుపాయాలు పెరగడంతో చిన్న పిల్లలకి కూడా కళ్ళ పరిక్షలు చేసి కళ్ళజోళ్ళు తొడిగెస్తున్నారు తప్ప కళ్ళ జబ్బులు ఎక్కువ అయి ఏమీ కాదు.