బారిష్టరు పార్వతీశం - ప్రథమ భాగము/అధ్యాయము 6

వికీసోర్స్ నుండి

6


లా ఎంతసేపున్నానో నాకు తెలియదు. ఒక మనిషి వచ్చి నా బుజముమీద చెయ్యి వేశాడు. నిద్రలోనుంచి లేచినట్లు ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూశాను. ఒక పక్క ఒక దొర ఏమిటీ చిన్నతన మన్నట్టుగా నా కేసి చూస్తున్నాడు. ఇంకో వైపున ఒక దొరా దొరసానీ, నా దుఃఖము గ్రహించినట్టుగా, నాకేసి జాలిగా చూశారు. నా బుజము మీద చెయ్యివేసిన అతను తన తోటి కూడారమ్మని సంజ్ఞ చేశాడు. ఎందుకో తెలియకుండా కండ్లు తుడుచుకుని అతని వెంబడే వెళ్లాను. రెండంతస్థులు మెట్లుదింపి అడుగున ఒక హాలులోనుంచి ఒక చిన్నగదిలోకి తీసుకువెళ్లి నా సామానుకేసి చూపించాడు. ఇదే నే నుండవలసిన గది కాబోలు ననుకున్నాను. గది చాలా చిన్నది. అందులో ఒక పక్కను ఒక దానిమీద రెండు మూడు పొడుగాటి బల్లలున్నాయి. వాట్లపైన పరుపులు పరిచివున్నాయి. ఒక పక్క గోడకి చిన్న పింగాణీ బూర్లె మూకుడూ అందులోకి కుళాయి వున్నవి. పక్కనే ఒక సబ్బుపెట్టి వున్నది. ఇంకోపక్క రెండు తువాళ్లు వున్నాయి. నా తలాపు దిక్కు నున్న గోడకి గుండ్రని రంధ్రముమూ, దానికో గాజుతలుపూ వున్నది. అదే మాగది కిటికీ. అందులోనుంచి సముద్రము చక్కగా కనపడుతుండేది. పై బల్లలమీది కెక్కడాని కొక చిన్న నిచ్చెన వున్నది. నేను గదిలోకి వచ్చేసరికే పై రెండు బల్లలమీదా ఇద్దరు చైనా కుర్రవాళ్లు కూచుని తమ సామాను సవిరించుకుంటున్నారు. నేనూ నాపెట్టీ అదీ మంచము కిందికి తోసివేసి సముద్రము కేసి చూస్తూ కూచున్నాను.

చీకటి పడ్డది. గదిలో మొన్నటిస్టీమరులో మల్లేనే ఎలక్ ట్రిక్ దీపాలు వెలిగించారు. నాకు తొడుక్కున్న సూటు బిగువుగా వుండడము మూలాన్ని విప్పేస్తే బాగుంటుందని తోచింది. నిమ్మళంగా విడిచి ఇంటి దగ్గిరనుంచి తెచ్చిన మల్లుపంచె పెట్టెలో నుంచి తీసి కట్టుకుని షర్టుతోటే కూచున్నాను. పై కుర్రాళ్లిద్దరూ తెల్లబోయి నాకేసి చూస్తున్నారు. ఎవళ్ళు చూస్తే నాకేం?

ఇంక రాత్రి భోజనము సంగతేమిటా అనుకున్నాను. భోజనము స్టీమరు వాళ్ళు పెడతారో, ఎలాంటి భోజనము పెడతారో ఎంత పుచ్చుకుంటారో, కంపెనీ వాళ్లను అడగడము మరచి పోయాను. మొన్నరాత్రి స్టీమరు వాళ్లు నా దగ్గిరేమీ డబ్బు పుచ్చుకోలేదు. నన్ను వాళ్లడగడమే మరిచిపోయారో, లేకపోతే పాపము ఏమీ తినలేదనే విడిచిపెట్టారో, ఏ సంగతీ దిగిరావడము హడావిడిలో అడగడము మరిచిపోయాను. ఇంతకూ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకొన్న గోధుమపిండి మరపొయ్యీ వగైరా వున్నాయి కదా రొట్టెలు చేసుకుందాము అని పెట్టెతీసి సామాను ఒక్కొక్కటే బయట పెడుతున్నాను. ఇంతటిలోకే ఒక గంట వినబడ్డది. పైనున్న కుర్రవాళ్లిద్దరూ కిందకు దిగి నన్ను కూడా రమ్మన్నారు. రమ్మన్నారేమోనని వాళ్ల సంజ్ఞలవల్ల నేను గ్రహించాను. వాళ్లు మాట్లాడిన భాషేమిటో నా కర్థము కాలేదు. ఎక్కడో చూద్దామని వాళ్లతోటి వెళ్ళాను. మా గది ముందున్న హాలులో బల్లమీద తెల్లని గుడ్డపరచి మామూలు పింగాణీపళ్లాలూ, కత్తులూ, కఠార్లూ అన్నీ అమర్చి వున్నవి. అది చూసేసరికి కొంత ధైర్యము వచ్చింది. సరే మనకు స్వహస్తపాకము తప్పిపోయింది కదా అనుకుని పైకి తీసిన సామగ్రి పెట్టెలో పెట్టి నేనూ పంక్తి భోజనానికి తయారయ్యాను.

మొత్తము ముప్ఫై నలభై మంది దొరలున్నారు. పది పదిహేనుగురు దొరసానులున్నారు. అంతా కులాసాగా మాట్లాడుకోవడము ఆరంభించారు. వాళ్లు ఏభాష మాట్లాడుతున్నదీ నాకు తెలియలేదు. ఫ్రెంచి స్టీమరన్నారు గనుక ఫ్రెంచేమో ననుకున్నాను. అంతా నన్నూ నా వేషమూ చూసి లోపలేమనుకున్నారో కాని వాళ్ళ భాషలో నన్నేదో అడిగారు. నేను ఇంగ్లీషున సమాధానము చెప్పాను, వాళ్ళ భాష నాకు తెలియదని వాళ్ళంతా వెర్రిమొగాలు వేసుకుని నా కేసిచూశారు పోనీ తెనుగున చెపుదామా అనుకున్నాను. అయినా వీళ్ల మొహము ఇంగ్లీషే తెలియని వాళ్లకు తెలుగేమి తెలుస్తుందనుకున్నాను. ఇక లాభము లేదనుకుని వాళ్ల ధోరణ్ణి వాళ్లు కబుర్లు చెప్పుకుంటున్నారు. నాకుమట్టుకు కొంచెము భయము వేసింది. స్టీమర్లో ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు లేనట్టున్నారు, మనతోటి మాట్లాడే వాళ్లయినా ఎవళ్లూ ఉండరు కాబోలు, కాలము ఎలా గడుస్తుందా అనుకున్నాను.

ఇంకో క్షణానికల్లా వడ్డన ఆరంభమైంది. ఈ వడ్డన పద్ధతి తమాషాగానే ఉంది. ఒక మనిషి ప్రతివాళ్ళదగ్గిరికీ తీసుకురావడము, ఎవళ్ళకు కావలసినంత వాళ్ళు తీసుకుని వాళ్లు వాళ్ళ కంచాల్లో పెట్టుకొనడము.

తెచ్చిన పదార్ధము దాని ఆకారమువల్లా వాసనవల్లా బ్రాహ్మణులు ముట్టుకో తగ్గది కాదనుకున్నాను. మనదేశములో మాంసము తినేవాళ్ళయినా, కూరల్లే వండుకుని అన్నములో వేసుకొని తింటారనుకున్నాను. వీళ్ళు అన్నము లేకుండా వట్టిమాంసమే తింటున్నారు. ఆ గిన్నె తీసుకుని నాదగ్గిరికి వచ్చాడు. నాకక్కరలేదన్నాను. వాడాశ్చర్యపోయి నాకేసి చూశాడు. ఏదో అన్నాడు. నాకర్థముకాలేదు. ఏమిటా దిక్కు మాలినభాష, స్వచ్ఛమైన ఇంగ్లీషులో మాట్లాడరాదా అన్నాను. వాడికి చెపితే నేమి గోడకు చెపితేనేమి? నేనన్నది వాడికి తెలిసి ఏడిస్తేగా!

ఇంక మనకర్మము విశ్వస్తలాగ అర్థరాత్రివేళ రొట్టెలు కాల్చుకోవలసిందే కాబోలు అనుకున్నాను. లేచి వెళ్ళబోతూ వుంటే వాడు కూచోమని సంజ్ఞ చేసి వెళ్ళి యింకో దొరను తీసుకువచ్చాడు. ఆ వచ్చినాయనా ఏదోభాషలో మాట్లాడడము మొదలు పెట్టాడు. నాకు కోపము వచ్చింది. మొదటివాడివంక చూచి యీ అఘోరానికి వాణ్ణికూడా తీసుకు వచ్చావెందుకు? నీ వఘోరించావుకాదా అన్నాను తెలుగున. అవును, వాడి కర్థము కానప్పుడు ఏభాషైతే నేమి, తెలుగైతేనేం? కొత్తగా వచ్చినవాడికి ఒకముక్కో ముక్కన్నరో యింగ్లీషు వచ్చునని తోస్తుంది. సంజ్ఞలవల్ల నైతేనేమి, వాడికీ నాకూ అర్థము కాని యింగ్లీషు భాష వల్ల నైతేనేమి, భోజనము చెయ్యవా? అని ప్రశ్నించాడు. చెయ్యను అన్నాను. ఏం అన్నాడు. నేను మాంసము తినను అన్నాను. అనేటప్పటికి నా అవస్థవాడు గ్రహించుకుని కూర్చొమని సంజ్ఞ చేసి వడ్డన మనిషిని తీసుకు వెళ్ళీ చక్కగా కాల్చిన కల్లురొట్టెలు రొండూ మరికాస్త వెన్న, కాసిని వుడకేసిన బంగాళా దుంపలు పంపించాడు. కడుపునిండడానికి కేదైతేనేమి, అవే తిన్నాను. అది పూర్తి అయ్యేటప్పటికి అందరికీకూడా సగ్గుబియ్యము క్షీరాన్నము తీసుకువచ్చాడు. సరే యిదీ బాగుందనుకుని, నాకిష్టము కూడా నేమో, మరికాస్త పుచ్చుకున్నాను. రోజూ యిలా వుంటే చాలు ననుకున్నాను. నలుగురితోటి పాటూ లేచి నా గదిలోకి వచ్చాను. స్టీమరు వాళ్లే పరుపులూ అవీ వేసి వుంచడము మూలాన్ని నా మంచమూ బొంతా తీయవలసిన అవసరము లేకపోయింది. ఆ పరుపుమీదనే పడుకుని చీకట్లో ఈ మహాసముద్రములో స్టీమరుకు దారి ఎలా తెలుస్తుందా అని ఆలోచిస్తూ నిద్రపోయాను. తెల్లవారుజామున మెళుకవవచ్చింది. లఘుశంకకు వెళ్లవలసిన అనుమానంగావున్నది. ఎక్కడికి వెళ్లడానికీ తోచలేదు. ఎవళ్లను అడుగుదామన్నా ఎవళ్ళూ కనపడరు. నా గదిలో కుర్రాళ్ళను లేపి అడుగుదామా అంటే నా భాష వాళ్ళకు తెలియదు. ఏం చెయ్యడానికీ తోచలేదు. అలాగే బలవంతాన బిగబట్టుకుని ఎప్పుడు తెల్లవారుతుందా అని కనిపెట్టుకు కూర్చున్నాను. నిద్రపోదామంటే నిద్ర పట్టదు. నిమిష మొక యుగముగా వుంది.

ఎలాగైతే నేమి తెల్లవారింది. లేచి హాలులోకి వచ్చాను. అక్కడున్న ఒక దొరదగ్గిరికి వెళ్లి దొడ్డి ఎక్కడుంది అని ఇంగ్లీషున అడిగాను. వాడి కర్ధము కాలేదు నా భాష. వాడి భాషలో ఎలా చెప్పాలో నాకు తెలియదు. ఇలా నలుగురైదుగురిని అడిగి చూశాను. ఎవళ్లూ నన్ను గ్రహించుకో లేక పోయారు. నా బాధ చెప్ప శక్యము గాకుండా ఉంది. ఇంకో క్షణముంటే పొట్ట బద్దలవుతుందేమోని భయము వేసింది. పోనీ సంజ్ఞ చేద్దామా అంటే ఎలాగూ సంజ్ఞ చేయడము? సంజ్ఞ చేయడానికి మట్టుకు వాళ్ళకు ఏ సంజ్ఞ చేస్తే తెలుస్తుందో? అక్కడికే మన దేశాచారాన్ని బట్టి ఒక వేలు చూపించాను. ఎవళ్ళకూ తెలియలేదు. రెండు వేళ్లూ చూపించాను. దానికీ సమాధానము రాలేదు. వాళ్ళ దేశములో మూడువేళ్లు చూపిస్తారేమో ననుకుని మూడు వేళ్లూ చూపించాను. అదీ అర్ధము చేసు కోలేదు. ఒళ్లు మండి ఐదువేళ్లూ చూపించాను. అదీ లాభించలేదు. ఆఖరుకు ఏమి సంజ్ఞ చేశానో ఎలా వాండ్లకు తెలియ పరిచానో నా అవస్థ నాకే తెలియదు. పర్యవసానము మాత్రము ఒకడు తీసుకు వెళ్లి దొడ్డి చూపించాడు. పక్క గది తలుపు తీసి అది స్నానాలగదని కూడా చెప్పాడు. నేను అడక్కుండాను. స్నానము మాట దేవుడెరుగునని ముందు తొందరగా దొడ్లోకి పరుగెత్తి బాధ తీర్చుకుని మళ్లీ నా గదిలోకి వచ్చి దంతధావనము చేసుకుని స్నానాల గదిలోకి వెళ్లి స్నానము చేశాను.

స్నానము చేసి వచ్చేసరికి భోజనాలకి అన్నీ సిద్ధముగా అమర్చిపెట్టారు. అందరికీ కోడిగుడ్లూ, చేపలూ వడ్డించారు. నాకుమాత్ర మేదో జావా, రొట్టీ, వెన్నా ఇచ్చారు.

ప్రతిరోజూ ఇదే పద్ధతి, ప్రొద్దున్నే లేవడము, కాలకృత్యములు తీర్చుకోవటము, కాస్సేపు ఇటూ అటూ తిరగడమూ, మధ్యాహ్నము భోజనము, కాస్సేపు నిద్రపోవడమూ, టీ పుచ్చుకోవడము, ఎప్పుడు సాయంత్ర మవుతుందా అని కనిపెట్టుకు కూర్చోవడము, భోజనము చేయడము పడుకోవడము--ఇదీ కార్యక్రమము. నాల్గు దినాలు ఇలా గడచినవి. ఓడ అస్తమానమూ ఊగిసలాడడమువల్లనో, భోజనము తిన్నగా లేకపోవడము వల్లనో నాకెప్పుడూ వికారముగానూ తల నొప్పిగానూ ఉండేది. అన్న హితవు బొత్తిగా తప్పిపోయింది. అన్నహితవంటే రొట్టె హితవని అర్ధము. కొలంబోలో బయలుదేరిన తరువాత ఇంకా అన్నము కళ్ళ బడలేదు.

ఇలా నాలుగు రోజులు గడిచినవి. అయిదో రోజు ఉదయము అహర్నిశాదులూ పరిగెడుతున్న స్టీమ రాగి పోయింది. ఎందు చేతనా అని కిటికీలోనుంచి తొంగిచూచేసరికి ఊరు కనిపించింది. నాకు భోజనము సప్లై చేస్తున్న మనిషివచ్చి స్టీమరు సాయంత్రము దాకా ఆగుతుందనీ ఊళ్ళోకి వెళ్ళి చూసి రావచ్చుననీ చెప్పాడు. వాడు చెప్పడమంటే చెప్పాడు కాని తీరా ఊళ్లోకి వెళ్ళిన తరువాత హఠాత్తుగా స్టీమరు బయలుదేరి వెళ్ళిపోతేనో! అయినా ఈ నాలుగు రోజులనుంచీ నీటిమీద ప్రయాణము చేసిన మీదట భూమి కనబడగానే ఏదో ప్రాణములేచి వచ్చినట్టుంది. నాగదిలో ఉన్న చైనా కుర్ర వాళ్ళిద్దరూ దుస్తులు వేసుకుంటూ నన్ను కూడా రమ్మని సైగచేశారు. నాకూ వెళ్ళవలెనని సరదా పుట్టింది. నేనూ సూటు వేసుకొని కొలంబోలో కొన్న టోపీ పెట్టుకుని దొరగారిలాగ బయలుదేరాను. ఊరంతా ఎక్కడుందో తెలియదుగాని సముద్రపు టొడ్డునే ఒక పెద్దషాపూ ఒక హోటలూ వున్నవి. దూరాన్ని నల్లని శరీరమూ ముద్ద పెదవులూ కోతి మొహాలూ గొర్రె బొచ్చులాగ పొట్టిగా ఉంగరాలు తిరిగిన బిరుసువెంట్రుకలూ కలిగి మొలచుట్టూ పొడుగాటి ఆకులు కట్టుకుని చేతుల్లో బల్లాలు పుచ్చుకుని తిరుగుతున్న ఒకళ్లిద్దరు మనుష్యులు కనబడ్డారు. వాళ్లను చూసి పూర్వము చదివిన భూగోళ శాస్త్రము స్మృతికి దెచ్చుకుని ఇది ఆఫ్రికాదేశమై ఉంటుందని ఊహించాను. కాస్సేపు అక్కడే ఇటూ అటూ తిరిగి అక్కడున్న హోటలులో భోజనము చేసి మధ్యాహ్నము మూడుగంట లయ్యేసరికి మళ్లీ స్టీమరు మీదకి వచ్చాను. సాయంత్రము ఆరు గంటలకు బయలుదేరింది.

నా పేరు స్టీమరుమీద నున్న వాళ్లెవళ్లూ నోట పట్టలేక పోయారు. నేను కొలంబోలో ఎక్కాను గనక నన్ను కొలంబో గారు అని పిలవడము మొదలు పెట్టారు. నా తోటి మాట్లాడే వాళ్లె వరూ లేక పోవడమువల్లా, మామూలుగా వాళ్లు తినే తిండి తినక పోవడమువల్లా, వాళ్ళు తాగే కల్లు నేను తాగకపోవడమువల్లా, నాకూ లోపల ఏలాగో ఉండేది. తక్కినవాళ్లందరికీ కూడా నా అవస్థ చూసి జాలివేసిందని తోస్తుంది. ఎవళ్లో ఒకళ్లు అస్తమానం నాదగ్గిర కూర్చోడము, నాతోటి ఏదో మాట్లాడవలెనని ప్రయత్నించడమూ మొదలు పెట్టారు. ఈసారి బయలుదేరిన తరువాత నాకు వికారమూ తలనొప్పి ఎక్కువ అయింది భోజనముదగ్గిరకు వెళ్లడానికి కూడా ఓపికలేకపోయింది. నాగదిలోకే ఏ పాలో జావో తీసుకువచ్చి ఇస్తూండేవారు. ఒకరోజు మరీ వికారంగా ఉండి రాత్రి యేమీ నిద్రపట్టలేదు. తల బద్దలేస్తోంది, ఇంటిసంగతి జ్ఞాపకంవచ్చింది. కాస్త శొంఠి కొమ్మయినా లేకపోయింది గదా అనుకున్నాను. ఉంటేమట్టుకు మనకు గంధంతీసి ఇచ్చేవారెవరు? కళ్ళెంబడి నీళ్ళు వచ్చినవి. కళ్ళు తుడుచుకుని యెదురు గుండా చూచేటప్పటికి చెన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ గోడకు తగిలించి ఉంది. అపరిమితమైన కోపం వచ్చింది. దాన్ని అవతల పారేస్తే తలనొప్పేమన్నా తగ్గుతుందేమో ననుకున్నాను. అంత బాధతోనూలేచి ఆ టోపీ తీసి వుండకింద నలిపి కిటికీలోనుంచి అవతల పారవేశాను.

వచ్చి పడుకున్న తర్వాత కొంచెం కలత నిద్రపట్టింది. తెల్ల వారింది. తలనొప్పి యేమీ తగ్గలేదు. కొంచెం పులకరం తగిలినట్టుకూడా ఉంది. కిందటిరేవులోనుంచి స్టీమరు బయలు దేరిన మూడోరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు దొర వచ్చి అందరినీ డాక్టరు పరీక్ష చేయవలసి వుంటుందనీ, డ్రస్సు వేసుకుని సిద్ధంగా వుండమనీ చెప్పి వెళ్ళాడు. మధ్యాహ్నం మూడుగంటలకి ఘంట కొట్టారు. మా గదిలో కుర్రవాళ్ళు నన్ను రమ్మని సంజ్ఞ చేశారు. కదలడానికైనా వోపిక లేకపోయి నప్పటికీ నెమ్మదిగా హాలులోకి వచ్చాను. అందర్నీ వరసగా నిలబడమన్నారు. ఒక డాక్టరు వచ్చి ఒక్కొక్కరినే పేర్లు పిలచి కొంచెం పరీక్షచేసి పొమ్మనడం మొదలు పెట్టాడు. కొంతసేపయిన తరువాత మిస్టరు కొలంబో అని పిలిచాడు. నాపేరు వీళ్ళకు తెలియక డాక్టర్ తోటి కూడా యీ పేరే చెప్పారనుకొని స్కూల్లో అట్టెండెన్సు పిలిచేటప్పుడు చెప్పే అలవాటు చొప్పున చటుక్కున ప్రెజంటు సార్ అన్నాను. అంతా పక్కున నవ్వారు. డాక్టరు నిన్ను కాదన్నాడు. ఇంకొక యనభై సంవత్సరముల ముసలి దొర ముందరికి వచ్చాడు. ఆయన కాబోలు కొలంబో అనుకున్నాను.

డాక్టరు వెళ్ళిపోయిన తరువాత నాకు భోజనము పెట్టే దొరను పిలిచి యేమిటీగోలంతా అని అడిగాను. వాడు స్టీమరు సూయజు దగ్గిరికి వచ్చిందనీ, ఇక్కడ వైద్యుడలా పరీక్ష చేయడము మామూలనీ, జబ్బుగా వున్న వాళ్లందరినీ ఇక్కడ దింపేస్తారనీ చెప్పాడు. సూయజు అంటే సూయజు కెనాలేమో అని అడిగినాను. ఇంకో పావుగంటకు, సూయజు కెనాల్లో ప్రవేశిస్తాము, కావలిస్తే పైకివెళ్ళి చూడవచ్చును, అని చెప్పాడు. నా గదిలో కుర్రవాణ్ని సహాయం తీసుకొని నెమ్మదిగా పైకెక్కాను. కొలంబోలో బయలుదేరిన తరువాత మొదటిసారి ఇదే టాపుమీదికి రావడము, చల్లని సముద్రపు గాలి తగిలేటప్పటికి ప్రాణంలేచి వచ్చినట్లుంది. దీపాలు పెట్టేవరకూ అక్కడే సూయజు కెనాలు చూస్తూ కూచున్నాను. చిన్నప్పుడు సూయజు కెనాలంటే ఏమిటో అనుకునే వాణ్ని. ఇదీ మామూలు పడవల కాలవగానే వుంది. ఎటొచ్చీ కొంచము వెడల్పూ లోతూ ఎక్కువ. ఒడ్డుని మన వేపుకు మల్లెనే ఈతచెట్లూ అవీ వున్నాయి. అందులో కొన్ని ఖర్జూరపు చెట్లని చెప్పారు. ఒంటెలు చాలా కనబడ్డాయి. చూడ్డానికి అంతా చాలా చక్కగా వుంది. దీపాలు పెట్టగానే మళ్ళీ నాగదిలోకి వచ్చి పడుకున్నాను. తెల్లవారే టప్పటికి పోర్టు సెడ్డు వచ్చామన్నారు.

మాగదిలో కుర్రాళ్ళు డ్రస్సు వేసుకుంటూ వున్నారు, నన్ను కూడా వూళ్లో కి వెళుదాము రమ్మని సంజ్ఞ చేశారు. సరే ఇక్కడ కూర్చుని చేసేదేమిటి, ఏదో ఓపిక చేసుకొని కాస్సేపు తిరిగి వద్దామని నేనూ డ్రస్సు వేసుకుని బయలుదేరినాను.

ఆ వూరు బాగా పెద్దదే. చక్కని షాపులూ అవీ చాలా వున్నాయి. కాని అక్కడి సంగతులు చూస్తే దుర్మార్గము ఎక్కువవున్నట్టు తోచింది. అక్కడా ట్రాముకార్లున్నాయి. కాని విశేషము ఏమిటంటే వాటంతట అవి నడవలేవు. గుర్రాలు లాగుతాయి. అది నాకు వింతగా కనపడ్డది. బజార్లంబడి తిరుగుతుండగా ఒక చోట ధామస్ కుక్ వాళ్ళ కంపెనీ కనబడ్డది. అది చూసేటప్పటికి స్నేహితుణ్ణి చూచినట్టుగా వుంది. దర్జాగా లోపలికి వెళ్ళాను. అక్కడ గుమాస్తా నన్ను చూసి, ఏం కావాలన్నాడు. ఏమీ అక్కరలేదన్నాను.

'మరి అయితే ఎందుకు వచ్చావు?'

'నేను మీ పేసెంజరును.'

'ఏ మయితే?'

'ఏమీ లేదు. ఇక్కడ మీ కంపెనీ ఎలావుందో చూసి వెళదామని వచ్చా' నన్నాను. వాడు మాట్లాడలేదు. నేనొక మాటిటూ అటూ చూసి మళ్ళీ వీధిలోకి వచ్చాను. దగ్గిరలోనే పోస్టాఫీసు కనపడ్డది. అందులోకి వెళ్ళి ఒక కార్డుకొని నేను క్షేమంగా వున్నానని ఇంటికి ఒక వుత్తరం రాసి పోస్టులోవేసి బయటకు వచ్చాను. అక్కడ ఒక షాపులో వున్నితోటి తయారుచేసిన రెండుజానల వెడల్పుగల చక్కని మెడపట్టీలు లాంటివి కనపడ్డాయి. వెళ్ళేది చలిదేశం గదా! ఇది ఒకటి కొనుక్కుంటే, చెవులకు చుట్టుకున్నా మెడకి చుట్టుకున్నా వెచ్చగా వుంటుంది. చూడ్డానికి కూడా చాలా చక్కగా వున్నాయి అని ఒక్కటి కొన్నాను. అక్కడ ఒక కాఫీహోటలు కనబడితే వెళ్ళి కాస్త ఫలహారము చేసి నిమ్మళముగా మళ్ళీ స్టీమరు చేరుకున్నాను. సాయంత్రం ఏడు గంటలకి స్టీమరు బయలుదేరింది. ఆ రాత్రి అంతా కులాసాగానే వుంది. కాని పొద్దుటి నుంచీ ఆరంభించింది నావస్థ. అది వికారముగాదు. అవి వాంతులుగావు. లోపలినుంచి డోకు వస్తూన్నట్టుండడమే గాని పైకి ఏమీ కాకపోవడము. కొలంబోలో బయలుదేరిన తరువాత ఇంత బాధ ఎప్పుడూ పడలేదు. ఇన్నాళ్ళనుంచీ కులాసాగా తిరుగుతోన్న నా గదిలో కుర్రాళ్ళు కూడా పడకలేశారు. నేను మూసిన కన్ను తెరవలేదు. తిండిలేదు సరికదా పచ్చి మంచినీళ్ళైనా ఎరగను. అలా ఎన్నాళ్ళు పడుకున్నానో తెలియదు. కాస్త గాలి అయినా రాకుండా గది కిటికీ తలుపులు మేకులు వేసి బిగించారు. ఏమిటి అలాచేస్తున్నారంటే తుఫాను వుంది. కిటికీ తలుపులు తీసి వుంటే నీళ్ళు లోపలికి వస్తాయన్నారు.

ఇలా సుమారు వారం రోజులు రాత్రింబగళ్ళు కూడా తెలియకుండా బాధపడ్డాను ఏమీ తోచక గడియారము చూస్తూవుంటే కొంత కాలక్షేపం అవుతుందని, గడియారము తలక్రింద పెట్తుకుని అస్తమానమూ చూచుకుంటూ వుండేవాడిని. మొదటి రోజు లలో బాగానే వుండేది. మంచి గడియారమేనని సంతోషించాను. కాని పోను పోను, పగలంతా బాగా వుండి రాత్రి దానికేమి వచ్చేదో కాని తెల్లవారే సరికి రోజూ పావుగంట తక్కువ తిరిగేది. ఇలా వాతం కమ్ముకు రావడానికి తగ్గ కారణం ఏమీ కనుపించదు. పోనీ ఒకరోజైతే అనుకోవచ్చును. అనుదినమూ ఇలా వెనుకంజ వెయ్యడముచూసి నాకు ఒళ్ళుమండుకొచ్చింది. ఆయన రెండున్నరా దూటబిళ్ళలులాటివి తీసుకుని ఇలాటి గడియారము నాకిచ్చాడేమా అనుకున్నాను. దొరలుకూడ వీలైనప్పుడు మోసం చెయ్యడానికి వెనుదీయరని తేలింది. ఈ వెధవ గడియరం కూడా తీసుకువెళ్ళడ మెందు కనుకున్నాను. చూసి చూసి పారెయ్యడానికి ప్రాణం ఒప్పలేదు. సరే ఏదో పోనీ ఒక అరగంట యించుమించుగా తిరుగుతోందిగదా, అసలు లేని బావకంటె గుడ్డిబావైనా మేలనుకుని పారవేయడము మానేసి పెట్టిలో పెట్టాను.

తరువాత ఒకనాడు తెల్లవారేసరికి ఈ సముద్రపు హడావిడి తగ్గింది. దొర చీకటితోటే వచ్చి నన్ను లేపి, ఇవ్వాళే దిగిపోవడము. బెంగెట్టుకోకు. ఇంకో గంటకో రెండు గంటలకో దరి చేరుతాము. భూమి కనబడుతోంది. లేచి కాస్త ఫలహారముచేసి పైకి వెళ్ళి చూడమని ఎంతో ఆదరంగా చెప్పాడు. ఈ నాలుగైదు రోజులూ తిండిలేకపోవడము మూలాన్ని చిక్కి శల్యమైపోయాను. ఒంట్లో చాలా నీరసంగా వుంది. లేస్తే కాళ్లు దడ దడ లాడుతున్నాయి. అలాగే లేచి దంత ధావనము చేసుకొని చొక్కాలు తొడుగుకుంటూవుంటే, ఆ దొర నాగదిలోకే ఫలహారము పంపించాడు. కాస్తంత తిని నిమ్మళంగా పైకెక్కాను. సుమారు ఎనిమిది గంటలవుతుంది. ఆకాశం నిర్మలముగా వుంది. సముద్రము ఎంతో చక్కగా వుంది. సూర్యు డప్పుడే ఉదయించినట్లున్నాడు. తరుణ కిరణములప్పుడే తరంగములమీద నాట్యముచేస్తూ రత్నప్రభను కల్పించాయి. దూరాన్ని తెరదీసినట్టు మంచువిడిపోతూ, ఒడ్డునవున్న పర్వతములు మొదలైనవి కొంచెము కొంచెము కనిపిస్తున్నాయి. అన్నిటికంటె స్పష్టంగా ఒక పర్వతము మీది దేవాలయ శిఖరముమీద సువర్ణవిగ్రహము ఒకటి సూర్యకాంతిలో దేదీప్యమానముగా కనపడ్డది. అంత కంతకు దరి జేరుతున్నాము. అక్కడ హార్బరులో ఎన్ని వందల స్టీమర్లున్నాయో లెక్క లేదు. ప్రపంచములోవుండే స్టీమర్లు అన్నీ ఒక్కసారి ఇక్కడకు వచ్చాయేమో అనుకున్నాను. ఇదంతా చూస్తే లోపల ఒక విధమైన భయము కలిగింది. నామనస్సు మనస్సులో లేదు. ఏదో ఆలోచిస్తూ ముందు మనగతి ఏమవుతుందా అని తెలుసుకోడానికి ప్రయత్నిస్తూ అలా నిలబడ్డాను. సుమారు పదకొండు గంటలు అయ్యేసరికి మార్సేల్సు చేరాము.