ప్రసార ప్రముఖులు/విశాఖపట్టణం

వికీసోర్స్ నుండి

విశాఖపట్టణం

ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం 1963 జూన్ లో రిలే కేంద్రంగా డా. బెజవాడ గోపాలరెడ్డి పవిత్రహస్తాల మీదుగా ప్రారంభమైంది. బాలారిష్టాలు దాటుకొని 1974లో మూడు ప్రసారాలు ప్రారంభించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం వంటి ప్రముఖ విద్యా సంస్థ ఈ కేంద్రానికి ఊపిరి. తొలినాళ్ళలో A.S.N.మూర్తి, N. రమణమ్మ డైరక్టర్లుగా పనిచేశారు.

ఉత్తరప్రదేశ్ కు చెందిన రతన్ సింగ్, వోరీన్ నక్వీ ఈ కేంద్రం డైరక్టర్లుగా పనిచేసిన ఔత్తరాహులు. శ్రీమతి విజయలక్ష్మీ సౌందరరాజన్, దేవళ్ళ బాలకృష్ణ, దుర్గాభాస్కర్ ఈ కేంద్రం అభివృద్ధికి కృషి చేశారు. డి. ప్రసాదరావు 1994లో కేంద్రనిర్దేశకులయ్యారు.

ఇక్కడ ప్రవచనశాఖ ప్రయోక్తగా ఒక దశాబ్ది పనిచేసిన పి. విజయ భూషణశర్మ సంస్కృతాంధ్రాలలో నిష్ణాతులు. కాటూరి వెంకటేశ్వరరావు కుమారులు విజయసారథి యిక్కడే అకౌంటెంట్ గా పని చేశారు. ఆయన చక్కని రచయిత. ఆయన 1996 నవంబరులో పరమపదించారు.

ఇక్కడ ఒకదశాబ్దికాలం కె. ఆర్. భూషణరావు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. సూర్యనారాయణ నాటక ప్రయోక్తగా జాతీయ స్థాయిలో బహుమతులందుకొన్నారు.

వందకిలోవాట్ల ప్రసారశక్తితో శ్రీకాకుళం మొదలు రాజమండ్రి వరకు ఈ కేంద్ర ప్రసారాలు శ్రోతల్ని అలరిస్తున్నాయి. నేదునూరి కృష్ణమూర్తి, అరుంధతీ సర్కార్ వంటి సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు ఈ కేంద్రం నుండి సంగీత కార్యక్రమాలు అందిస్తున్నారు. ఇవటూరి విజయేశ్వరరావు ఈ కేంద్రంలో సంగీత విభాగంలో పనిచేశారు.

వ్యవసాయ కార్యక్రమాలను సుసంపన్నం చేసిన వ్యక్తులలో Y. గంగిరెడ్డి ప్రముఖంగా చెప్పుకోదగినవారు.

విశాఖపట్టణ కేంద్రంలో రెండు దశాబ్దాలు పైగా కార్యక్రమ నిర్వహణలో సామర్ధ్యం చూపిన వ్యక్తి సలాది కనకారావు. కార్యక్రమ నిర్వాహకులుగా ఈయన పేరు తెచ్చుకొన్నారు. విజయవాడ కేంద్రంలో అతిచిన్న పదవిలో చేరి కార్యక్రమ నిర్వాహకుడుగా 1994లో పదవీ విరమణ చేశాడు. కార్మికులకార్యక్రమ నిర్వాహకులుగా ఈయన పేరు గడించారు. వీరిని ఆమెరికాలో సన్మానించారు. కవి, రచయిత అయిన సలాది విశాఖపట్టణంలో స్థిరపడ్డారు. ' ఆరవి ' గా పేరు పొందిన ఆచంట సూర్యనారాయణమూర్తిగా ఈ కేంద్ర డైరక్టరుగా చక్కటి కార్యక్రమాల రూపకల్పనకు నాందీ ప్రవచనం చేశారు.

ఆచంట సూర్యనారాయణమూర్తిగారు ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా హైదరాబాదులో పనిచేసి అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్ గా విశాఖపట్టణం వెళ్ళారు. అక్కడే డైరక్టరుగా పనిచేశారు. తర్వాత హైదరాబాదు వాణిజ్య ప్రసార కేంద్రం డైరక్టరుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం హైదరాబాదులోని థియోసాఫికల్ సొసైటీ సంస్థ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నారు. వీరు చక్కని రచయిత.

విశాఖపట్టణం కేంద్ర సంగీత విభాగంలో మృదంగ విద్వాంసులు శ్రీ వంకాయల నరసింహం, కొమండూరి కృష్ణమాచార్యులు, శ్రీమతి ఇందిరా కామేశ్వరరావు ప్రసిద్ధులు.

మదరాసు కేంద్రం

1927 జులై 23న బొంబాయిలో అప్పటి వైస్రాయి లార్డ్ ఇర్విన్ ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీకి చెందిన తొలి రేడియో కేంద్రాన్ని ప్రారంభించారు. గత 70 సంవత్సరాలలో రేడియోప్రసారాలు విరాట్ స్వరూపాన్ని పొందాయి. 1936లో ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ 'ఆల్ ఇండియా రేడియో ' గా నామాంతరం పొందింది. మైసూరులొ రేడియో ప్రసారాలు 'ఆకాశవాణి ' గా పేర్కొనబడేవి అదే పేరు "ఆల్ యిండియా రేడియో ' స్వీకరించింది.

ఆకాశవాణి నుండి తొలితెలుగు ప్రసారాలు మదరాసు కేంద్రం నుండి 1938 జూన్ 1 నుండి ఆరంభమయ్యాయి. తొలి తెలుగు అనౌన్సర్ మల్లంపల్లి ఉమామహేశ్వరరావు. ఆయన సుప్రసిద్ధ చారిత్రక పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖర శర్మ సోదరులు. మదరాసు కేంద్రం సాంస్కృతిక వారదిగా వ్యవహరించేది. అప్పట్లో సుప్రసిద్దులెందరో కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేశారు. సర్వశ్రీ సూరినారాయణమూర్తి, డా.అయ్యగరి వీరభద్రరావు, ఆచంట జానకీరాం, డా. బాలాంత్రపు రజనీకాంతరావు, బుచ్చిబాబు, ప్రయాగ, జలరుక్, జాషువా మొ||