ప్రజ్ఞా ప్రభాకరము/బండిపాటు

వికీసోర్స్ నుండి

౧౨

బండిపాటు

మాయూరి కాఱుమైళ్ళు దూరమున అవనిగడ్డయని గ్రామము గలదు. అది తాలుకా ప్రధాన స్ధానము. మాయన్నగా రక్కడ పోస్టుమాస్టరు. వారి కుటుంబమును జుచుటకై నే నాయూరికి వెళ్ళి తిరిగి వచ్చుచుంటిని. మాయూరివారే, మహనీయులు, గొప్ప వేదవేదాంగ వేత్తలు, నాపై నమితవాత్సల్యము గలవారు,వృద్ధులు యత్త గారితో బండిమిఁ ద అవనిగడ్డ నుండి యే మాయూరికి విచ్చేయుచు నన్నుఁ గూడ బండిలోఁ గూర్చుండ నిర్భంధించిరి. నేనేవేవో మద్రాసు పుస్తకసాలలోని గ్రంధములఁ గూర్చి ముచ్చటించుచు వారిని వినోదపఱచుచుంటిని. బండి యొకటిన్నర మైలు సాగి వచ్చెను.

అవనిగడ్డకు మాయూరికి నడుమ కృష్ణానది కలదు. అది వేసగి కనుక పాటిఱేవు గలదే. బండి దానిలో నుండి సాగి పోవచ్చును. కాని గట్టుననుండి యేటిలోనికి కొన్ని నిలువుల లోతు దిగవలెను. బండి యట్లు దిగుచుండెను. బండి తోలుచున్న రైతు (మాయూరివాఁ డే ) చుట్ట కాల్చు కొనుట కంతకు ముందే బండి దిగెను. గట్టున నుండి పల్లమునాకు బండి గాడిలోనుండి వడిగా దిగజాఱునాసమయ మునకు సరిగా నాతఁ డు మూత్రోత్సర్గమునకుఁ బోయి వెనుక బడెను. బండిచక్ర మొకటి బండి గాడిపల్ల పుజాలులో నుండఁ గా మఱొక చక్రము గట్టుమిఁ ది కెక్కెను. ఉపక్రమమున నా యెగుడుదిగుడు కొంచెముగానే యుండెను. కాని రెండు మూఁ డు గజములు సాగునప్పటి కొడ్డగెడవుగా నయ్యెను. ఎడ్లు వడిగా దిగిపోవుచుండెను. బండి కడయంచున నేను గూర్చుంటిని. ఇఁ క నొక క్షణములో నా జీవిత మటో యిటో ఏదో ఆగుదశ దాపు రించినది సుమా యనుకొనుట నే నెఱుఁగుదును. ఈ యెఱుక బండితుదిపట్టున నుండి యెడ్లదిగుడు దూకుడును, చక్రముల యొడ్డగెడవును - వెలుపలికి చూడ్కి పాఱుచున్నది గాన- నేను గుర్తించితిని గాని బండి లోతట్టున గూడులో నొదిగి యున్న యాయిర్వురు నంతగా గిర్తింప రయిరి. ఇహలోక ప్రజ్ఞ యీ శరీరమున నుండుటో, ఊడుటో - ఈ లోకముతో సంబంధము తీరనున్న దేమో అన్న తలఁపు నాలో కలిగినక్షణమే యెఱుఁ గుదును గాని తర్వాత నన్నెఱుఁ గను. నా యునికి నెఱుఁ గను.

ఈ స్థితిలో కొన్ని క్షణములో నిమిషము లొకటి రెండో కడచి యుండఁ బోలును!' చండాలుడా ! లక్షరూపాయల విలువ చేసే మనిషిని చంపి వేస్తివిరా! చండాలుడా!' అన్న యవధాను కుగారి యేడ్పుటఱపుతో ప్రజ్ఞగాంచితిని.' బ్రతికిఉన్నానండీబాబూ! యేడ్వకండీ' అంటిని. అప్పావ ధానులుగారు నాయెదుట నిరపాయముగా నిలిచియుండిరి. నా కైహికప్రజ్ఞ కలిగినందుకు, అప్పావధానులు గారు నిరపాయులుగా నున్నందుకు తనిసి ' సోమి దేవమ్మగా (వారి యత్తగారు) రేమైరండీ' అంటిని.' బ్రతికున్నవా నాయనా' అనుచు నామె పర్వెత్తి వచ్చెను.' మా కిద్దఱికీ మొండి ఘటాలకి ఏమి దెబ్బ తగుల లేదు. నాయనా! నీ చెయ్యియి దేమిటి?' అని ఆమె యేడ్వసాగెను.అప్పుడు నేను నా చేతులను జూచుకొంటిని. కానీ అందాఁక నేను బాధ నెఱుఁగను. నా దక్షిణ బాహుమూలము నా కడుపు మిఁ ద వ్రేలాడుచుండెను. ఆ వికృతి చూడఁ గా నాకు వాంతి, మైకము, కంపము కలుగఁ జొచ్చెను. ఇంకేమేమి యంగ వికృతి కలిగెనో, ముం దేమగునో అన్న కంగారుతో అవధానులు గారి నిట్లు ప్రార్దించితిని.' నా పూర్వకర్మానుభవమేదో నేన నుభవించుచున్నాను. నాస్థితి యేమగునో! మా తల్లిదండ్రులకు నెమ్మదిగా నా స్థితి తెలుపండి. ఈ ప్రాణమున్నా, పోయినా వీనిని నన్నుగా భావించి కాపాడండి! కానీ నిందాదులు చేయకండి. దప్పి, దప్పి' యనుచు మైమఱుపాటు చెందితిని.

కొంత సేపటికి చల్లని మంచినీరు, మజ్జిగ దగ్గఱి క్రొత్తపేట బ్రాహ్మలు తెచ్చి యీయఁ గా, చన్నీటి గుడ్డతో మొగము తుడిచి, ప్రజ్ఞ రప్పించి యిచ్చిరి. మాయూరి కారణముగారు, మానాయనగారి బాల్యమిత్రము శ్రీ కొడాలి వెంకయ్యగా రింతలో నక్కడికి బండి మిఁద నెక్కించి నన్ను వెనుకకు అవనిగడ్డ కే- ఆస్పత్రి కలదు గాన, మా యన్నగారు కలరు గాన- త్రిప్పి పంపి నాకొక మిత్రుని తోడిచ్చి, బోల్తాకొట్టిన బండిని లేవనెత్తి, దాని మీద నా బండిలోని వారిని గూడ జేర్చుకొని కళ్ళేపల్లికి వెళ్ళిరి. బండి నెమ్మదిగా నడచినను జాఱిపోయి వ్రేలాడుచేతితో వికార గ్రస్తుఁ డ నయి యున్నన న్నవనిగడ్డ చేర్చిరి.

నాటిఁరాత్రి - ఆస్పత్రి అసిస్టెంటు ఊర లేఁ డు గాన కంఫౌండరే ఒక సాహెబు నా చేతిని సరిదిద్దఁ జొచ్చెను. క్లోరోఫారం ఇయ్య లేదు. చంకక్రింద గుడ్డ మడత బెట్టి దిండుగానుంచి ఇంకొక తుండుగుడ్డ చంకక్రింద దూర్చి యొకరు తల దగ్గఱ నుండి లాగుట, ఇంకొక నా చేతిని కాళ్ళ దిగువనుండి లాగుట సాగించిరి. జబ్బు మజుల్సు చిఱుగుచున్నట్లయ్యెను.గగ్గోలు పెట్టితిని . అయినను విడువక లాగిరి.డమ్మని మ్రోఁత మ్రోగెను. చేయి స్వస్థానము చేరే నని చెప్పి కంఫౌండరు కట్టుకట్టెను. మార్నాడు ఆస్పత్రి అసిస్టెంటు వచ్చెను. నాకు చేయి రుబ్బురోలువలె వాచెను. తీవ్రజ్వరము వచ్చెను. నాల్గయిదు రోజు లుంటిని. వాపు తీసినదిగాని చేయి లేవదు. ఆస్పత్రి అసిస్టెంటు ఉద్యోగమునకు, జీవితమునకుఁ గూడ తుది దశలోనున్నవాఁడు (కొలది రోజులకే రిటైరగుట,స్వర్గస్థుడగుట జరగెను. అతిమూత్ర వ్యాధిగ్రస్తుడు) నన్ను బాధించుట తప్ప సరిదిద్ద లేక పోయెను.

ఇంటికి వచ్చి, అక్కడ నుండి బందరు వచ్చి శ్రీవల్లూరి సూర్యనారాయణరావుగారిని తోడఁ బిలుచుకొని ఆస్పత్రికి వెళ్ళితిని. సుబ్బయ్యర్ అను సర్జన్ ఉండెను, సూర్య నారాయణరావుగారి మాట విని వెంటనే క్లోరోఫారం ఇచ్చి చేయి సరిదిద్ది కట్టుకట్టెను. మర్నాడట నుండి ధన తృష్ణతో నన్ను పీడింప సాగెను.

వెంటనే మద్రాసు వచ్చి నాకు పరిచితు లయిన డాక్టరు నంజుండ రావుగారికి చూపితిని. వారు ' ఇప్పటికే చేతి సంధిబంములు చాలా శిధిల మయి యున్నవి. డాక్టర్లు కిక చూపవద్దు.ఘ్రుతదధిప్లు తముగా భోజనము చేయుచు జబ్బుకు కొబ్బరి నూనె, వెన్న, నేయి వగైరా స్నేహద్రవ్యములు రాచి, చన్నీటి కొళాయి క్రింది ధారగా నీరు పడునట్లు హెచ్చుసేపు కూర్చుంటి వేని క్రమక్రమముగా చక్కబడగల ' దని చెప్పిరి, అట్లే చేయుచుంటిని, కానీ బోర్డు మిఁద సీమసున్న ముతో నే దేని వ్రాయుటకు రెండవ చేతి తోడ్పాటుతో గాని చేతి నెత్తి పట్టి యుంచ లేక పోవుచుంటిని . మంచినీటి చెంబును కొన్ని గజముల దూరమేని మోసితేఁ జాలకుంటిని. కామక్రమముగా నంజుండ రావుగారు చెప్పినట్టు చేయుచుండుటచే కొంత సుగుణము కలుగుటో, అసౌకర్య సహనమున కలవాటు పడుటో యయ్యెను, కాని యది యేలో నానాఁటికి మనసు నిరుత్సాహగ్రస్తము కాఁజొచ్చెను.

స్వజనము నా స్థితికి వగచుచు ' పెండ్లాడిన తర్వాత వీనిస్థితి వికృతి చెందు చున్నది. ఈ వువాహము వీనికి శుభ ప్రదముగా లేదు' అని పరోక్షముగా,సనసన్నగా ప్రత్యక్ష ముగాను గూడ మాటాడఁ జొచ్చెను. నా కది దుశ్శ్రవ మయ్యెను.' ఇది దైవనినిర్ణీతము ఇందు మంచినే గుర్తించవలెను గాని చెడుగులను వెదకి పట్టుచు మనసును చిదుక కొట్టుకొన రా దని నే నెదురాడితిని. అభము శుభము నెఱుఁగాని పదియేండ్లకుబాలికను గూర్చి గర్హణ నాకు చీకాకు గొల్పెను.అమాయిక యయిన యా బాలిక యెడ నా కమితాను రాగ మేర్పడెను. ఆ బాలిక వల్ల నేను మేలే పొందఁ తొణకిసలాడుచుండిన తలఁపు.


--- ---