పెమ్మరాజు వెంకట్రావు

వికీసోర్స్ నుండి

ఎం.ఎన్.రాయ్ భావాలను తెలుగు వారికి అందించిన విజయనగరం కార్మిక నేత హేతువాది, మానవవాది. రాజకీయ సిద్ధాంతకర్త, రచయిత,, 20వ శతాబ్దపు ప్రముఖ తత్వవేత్తలలో ప్రముఖులయిన ఎం. ఎన్. రాయ్ గా ప్రసిద్ధిచెందిన మానవేంద్ర నాథ రాయ్ భావాలను తెలుగు వారికి అందించి, తెలుగు నేలపై హేతువాద భావజాలానికి పునాదులువేసిన వ్యక్తి పెమ్మరాజు వెంకటరావు. విజయనగరంలో కార్మిక ఉద్యమానికి ఊపిరి పోసి కార్మిక నేతగా ప్రజల మన్ననలు అందుకున్న వ్యక్తి వెంకటరావు. ఆంధ్రలో కార్మికోద్యమ పితామహులలో ఒకడుగా పెమ్మరాజు వెంకట్రావు చరిత్రలో నిలుస్తారు. కార్మికల బతుకుల్లో వెలుగులు నింపేందుకు నిరంతరం శ్రమించిన శ్రామికుడు ఆయన. నెల్లిమర్ల జూట్ కార్మికులను సంఘటిత పరిచి వారిని ఉధ్యమ పంధాలో నడిపించిన వ్యక్తి. ప్రపంచ రాజకీయాలను అవగాహన చేసుకొంటూ వాటికి అనుగుణంగా కార్మికుల్లో చైతన్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. ప్రపంచ రాజకీయలపట్ల అవగాహన పెంచేందుకు స్వంతంగా "కార్మిక" అనే ఒక వార పత్రిక ను నడిపారు. వి.వి.గిరి, బి.శివరావు వంటివారితో సన్నిహితంగా కృషిచేసిన ఖ్యాతి ఆయనది. విజయనగరం జిల్లా చీపురుపల్లి ప్రాంతంలో గనులు, ఇంజనీరింగ్ శాఖలో ఉద్యోగిగా పమిచేస్తూ ఈ ప్రాంతంపై ఒక అవగాహన తెచ్చుకొన్నారు. ఈ ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలను కళ్ళారా చూశారు. కార్మికుల సమస్యలను వంట పట్టించుకున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి కార్మికులందరిని సంఘటితం చేయాలని నిర్ణయించుకొని సంఘం ఏర్పాటు చేసారు. ఈయన హయాంలో రూపు దిద్దుకొన్నదే నెల్లిమర్ల కార్మిక సంఘం. సుమారు 25 ఏళ్ళు సంఘ అధ్యక్షునిగా పనిచేసి కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేశారు. అప్పుడే వరాహగిరి వెంకటగిరి, బి. శివరావులతో ఉత్తరప్రత్యుత్తరాలు నడపడం, కార్మిక రంగంలో విశేష అనుభవం గడించడం ఆయన ప్రత్యేకత. ఆ దశలో వెంకట్రావుకు ఆంధ్ర పర్యటనకు వచ్చిన ఎం.ఎన్.రాయ్ భావాలు దృష్టికి రాగా, ఆకర్షితుడయ్యాడు. ఎం.ఎన్. రాయ్ స్థాపించిన ఇండియన్ లేబర్ ఫెడరేషన్ చేరాడు. అప్పటి నుండి ఎం.ఎన్.రాయ్1954లో చనిపోయేవరకూ పెమ్మరాజు వెంకట్రావు రాడికల్ హ్యూమనిస్టు భావాలతో రచనలు చేశారు. ఆయన తరచు కవితలు కూడా రాసేవారు. భారత పునర్వికాసం, బౌద్ధ విప్లవంపై దృష్టి వుండేది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత నెల్లిమర్ల జూట్ మిల్లు కార్మిక సంఘం నుండి తన స్థానాన్ని హైదరాబాద్ కు మార్చిన వెంకటరావు, కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆ సందర్భంగా ఆవుల గోపాలకృష్ణమూర్తికి రాస్తూ, కమ్యూనిజాన్ని ఎదుర్కోడానికి కాంగ్రెసు ద్వారా కృషి చేస్తానని, రాయ్ భావాలు అమలుచేయడానికి పార్టీలో పనిచేస్తాననీ అన్నాడు. ఆ ప్రకారమే కాంగ్రెస్ పత్రిక పెట్టి రాయ్ భావాలు వ్యాసరూపంలో అందించారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా పెమ్మరాజు వెంకట్రావును అభిమానించారు. గాంధీభవన్ లో వెంకట్రావు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రపతి నామినేషన్ వలన పెమ్మరాజు వెంకట్రావు ఒక టరం శాసనమండలి సభ్యుడుగా పనిచేశారు. అప్పుడు తనవంతు కృషి కనిపించింది. 1958లో గోల్కొండ దినపత్రిక ఆగిపోగా వారపత్రికగా పెమ్మరాజు వెంకట్రావు కొంతకాలం హైదరాబాద్ లో నిర్వహించారు. కాని అదీ ఆట్టేకాలం సాగలేదు. కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత పెమ్మరాజు క్రమేణా కాంగ్రెసు రాజకీయాలకు దూరంగా జరిగారు. ప్రెస్ లు స్థాపించి నష్టపడ్డారు. 1982లో ఎన్.టి. రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కొద్దికాలం వెంకట్రావు సన్నిహితంగా వున్నారు. 1987 సెప్టెంబరులో పెమ్మరాజు వెంకట్రావు హైదరాబాద్ లో చనిపోయాడు. K S S Bapujee, Hyderabad.