Jump to content

పుట:Womeninthesmrtis026349mbp.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అష్టమాధ్యాయము

145

(మిక్కిలి కల్యాణమును కోరునట్టి తండ్రి, సోదరుడు, భర్త, మఱది స్త్రీలను పూజించి వారి కలంకారాదికములనిచ్చు చుండవలెను. తో బుట్టువులు పూజింపబడనివారై యేయింటిని శపింతురో యాయిల్లు శక్తిచే కొట్టబడినదానివలె నశించును. కాన నైశ్వర్యమును కోరువారెల్లపుడును భూషణములతోను, వస్త్రములతోను, చక్కని భోజనములతోను శుభకార్యములలోను నుత్సవదినములలోను స్త్రీలను పూజింపవలెను.)

ఈవిధముగ వచ్చు నలంకారాదులన్నియు స్త్రీ ధనమగును. స్త్రీలకు భర్త్రాదులవలన వచ్చు కాన్క లనేకవిధములు గలవు. వివాహములో వరుడు కన్యాదాతకు శుల్కము నిచ్చుటకాక కన్యకే కొంతధనము నిచ్చుట కలదు. దానిని కన్యతలిదండ్రు లనుభవింపరు. అది పూర్తిగ కన్యకే చెందును.

    యాసాంనాదదతే శుల్కంజ్ఞాతయో ననవిక్రయః
    అర్హణం తత్కుమారీణా మానృశంస్యంచ కేవలం
(మను. 3-54)

వివాహమునకు పూర్వముగూడ తల్లి తండ్రి సోదరుడు ననువారు కన్యకు భూషణముల నిచ్చుట స్మృతులవలన తెలియుచున్నది. కన్య స్వయముగ వరుని కోరుకొని యాతని వివాహమాడిననే తప్ప యాసొమ్ము శాశ్వతముగ నామెదే యగును.