పుట:Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజుగారి దర్శనమునకు ఆహ్వానముచేత పోవుచున్నార మని తెలుపగా నాతడు వీరిబండినిమాత్రము పోనిచ్చెను.

లోనికిపోయినంతట వీ రాసీనులైరి. మొదట తాతగారిని సంస్కృతమున కగ్రగణ్యులనుగా బహూకరించుట కేర్పాట్లు జరిగియుండినవి. ఒకానొక ఆచార్యులవారికికూడ గౌరవము జరుగవలసియుండెను. ఒకవిశ్వవిద్యాలయోద్యోగస్థుడు తాతగారితో, వారు (తాతగారు) సంస్కృతాంధ్రములలో రెంటను స్థానమందగలవారనియు, ఆయాచార్యులు ఒక సంస్కృతమందే ప్రధానస్థానమునకు యోగ్యులుగాన, ఈయవకాసము పోయినమరల వారికి అవకాశముదొరకదనియు, అందుచే తాతగారు ఆంధ్రపండితులలో ప్రథానస్థానము నందుట కంగీకరింప వలయు ననియు ప్రార్థించెను. తాతగారు తమకియ్యది చాల గౌరవకరమని పలికి ఆంధ్రమందే బహుమతినందిరి.

ఎన్నిసత్కారములు జరిగినను, ఎంతద్రవ్యము వచ్చినను సముద్రమునవైచిన చక్కెరవోలె కుటుంబభరణమునకును వైద్యములు చేయించుకొనుటకును వ్యయమై పోవుచుండెను. ముసలితనములో నిబ్బందులు పడలేకగదా ముద్రాక్షరశాలను విక్రయించిరి. కాని ఇబ్బందులు వారిని వదల లేదు. ఎన్నియవాంతరములు వచ్చినను తాతగారు దైర్యము మానలేదు; దైన్యము వహింపలేదు. మరల నేదోయొకవిధముగా మంచికాలము రాక తప్పదనియే తలంచుచుండిరి.


___________