పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

    హేమ : అదే చేసి చూపెడతాం!

    నేను : ఎక్కడి మాటలు, మీ పౌడర్లు మీరు వదలరు. మీ కులు కులు మీరు మానరు. మీ సొగసులు మీరు మరచిపోరు. మీ అలంకారాలు మీరు అవతల పారవేయరు.

    తీర్థ : అలంకారాలు అడ్డం వస్తాయా?

    నేను : రావు! రావు! అలంకారం అయ్యేవరకు అవసరాలు ఆగుతాయి కాలం నిలిచే ఉంటుంది!

    ఈ హేమ ఆ రోజున హేమ బాలికగా అల్లా అంటూంటేనే మేము మా కౌగిలింత వదలినాము. నేను హేమనెత్తి ముద్దులు కురిపించాను.

     అల్లరిపిల్లా! ఇంకో పది సంవత్సరాలు ఉండు. నీకు ఈ లాంటి కష్టాలు వస్తాయిలే అన్నాను.

    హేమ : నేను పెళ్లి చేసుకోనుగా!

    శకుంతల : వద్దే నాన్నా నీకు పెళ్లి! మీ బావవంటి మొగుడు నీకు దొరికితే ఈలాగే వేపుకు తింటాడు.


                                                                                                                         16

    అందరి జీవితంలోనూ అంతే! మూలసూత్రం ఒకటే. నదులూ పర్వతాలు, సముద్రమూ జీవితయాత్రను తమ ఇచ్చివచ్చిన దారులకు తీసుకొని పోతవి. ఒక్కొక్క నది ఒక్కొక్క రీతిగా మనుష్యులను నడుపుతుంది. కృష్ణానది శిల్పులనది. గోదావరి కవులనది అన్నారు. పెన్నా తుంగ భద్రలు విక్రమజీవన మిస్తాయట. కావేరి గాంధర్వానకు అమృత జీరలు వరమిస్తుందట. గంగానది తపస్వినియట. యమున భక్తిమాల.

    నేను కొల్లిపరకు అనతిదూరంలో కృష్ణానది ఒడ్డున శిల్పాశ్రమం నెలకొల్పాలని నిశ్చయించాను. అందు భూమి, ఆలయాలు, విహారాలు, మందిరాలు, గృహాలు నిర్మించడానికి లక్ష రూపాయలు అవుతాయనుకొన్నాను. అక్కడే మా మామగారి భూమి ఉన్నది. ఆ భూమి చక్కని తోట అవుతుంది. అలాటి ఆశ్రమం కలలు కంటున్నాను.

    కాని ఆ కల లన్నిటికి కౌస్తుభమణి నా శకుంతల. నా శకుంతల ముందు కాళిదాస శకుంతల కామధేనువు ముందు నందినీ ధేనువే! గౌరీశంకర శృగం ముందు కాంచనగంగ మాత్రమే. శకుంతలకు పదహారు సంవత్సరాలు వచ్చాయి. అమృతంలో కడిగి తుడిచిన బంగారు కమలంగా వికసించిపోయింది. ఆమె బంగారు ఛాయలో పాలసముద్రం ఛాయ కలిసిపోయింది. ఆమె కన్నుల ఆకాశంలో స్వర్గధామాలు నృత్యాలు సల్ఫినవి. ఆమె పెదవుల మందారాలలో విష్ణుహస్తాలంకారలీలా పద్మమధువులు చేరుకొన్నవి. ఆమె గానసుధలో సరస్వతీదేవ్యంగుళీ సంతతవర్తిత పల్లకీశ్రుతులు మేళవించాయి.