పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/726

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
దేశ సంచారులు:

వీరి వీధి నాటకాలు తోలుబొమ్మలాటలను పోలి వుంటాయి. బొమ్మలాటల్లో గందోళి గాడు బంగారక్క బొమ్మల రూపంలో హాస్యాన్ని అందిస్తే, ఈ నాటకాలలో గందోళిగాడు, బంగారక్క పాత్రలను మనుషులే ధరించి హాస్యాన్ని అందిస్తారు.

ప్రతి జట్టుకు పది మంది కళాకారు లుంటారు. ఒక కుటుంబంగా వుండి ప్రదర్శనల లిచ్చుకుంటూ ఒక వూరి నుండి మరో వూరికి పోతూ వుంటారు.

వారి ప్రదర్శనానికి అండగా హార్మోనియంను శృతిగా వాడుకుంటూ మద్దెల తాళాల సహాయంతో వేష ధారులు శ్రావ్యంగా కీర్తనలు పాడుతూ ప్రేక్షకులను ఆనంద పరుస్తారు.

నేపథ్యంలో, ఉపోద్ఘాతం:

వీరి ప్రదర్శనాల్లో ఒక పాత్ర రంగ ప్రవేశం చేసే ముందు, తెర లోనే చాల సేపటి వరకూ వుండి ఉపోధ్ఘాతం వినిపించటం వీరి సాంప్రదాయం. రంగం మీదనున్న పాత్ర ధారి ఆలపించే కీర్తనలను పునరుక్తిగా తక్కిన కళాకారులు సామూహింగా గానం చేస్తారు. కీర్తనలలోని సాహిత్యానికి అనుగుణంగా అభినయిస్తూ, ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తారు. పురుషులే స్త్రీ పాత్రలను ధరిస్తారు. వీరి ప్రదర్శనాల్లో పాత్రలు ధరించిన మునిసంపుల గ్రామానికి చెందిన రావుల కోదండం, బసవ బోయిన సవారి రాజు నాయక పాత్రల్లోనూ, మాదగాని పాపయ్య స్త్రీ పాత్రలోనూ ప్రసిద్ధులని గర్వంగా చెప్పుకుంటారు.

వీరి స్త్రీలు తట్ట నెత్తిన పెట్టుకుని, అద్దాలు, దువ్వెనలు, సబ్బులు, గాజులు, రిబ్బన్లు, పౌడర్లు, పిన్నులు మొదలైన స్త్రీలకు కావలసిన వస్తువుల్ని అమ్ముకుంటూ, కుటుంబ పోషణ భారాన్ని పంచుకుంటారు.

పూర్వం ఈ భాగవతులకు భూస్వాములు, జమీందారులు మడి మాన్యాలిచ్చి ప్రోత్సహించేవారు. ఈ నాడు ఆ మాన్యాల నన్నిటినీ పోగొట్టుకుని నూన్య హస్తాలతో దుర్భరమైన పేదరికాన్ని అనుభవిస్తున్నారని ఒక వ్యాసంలో దిలావర్ గారు ఉదహరించారు.