పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/545

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గడగడ లాడించే కాటమరాజు కొమ్ము కథలు

కాటమరాజు కథలను ఎక్కువగా కొమ్ములవారు పాడుతూ వుంటారనీ, వీరు మాదిగలలో ఒక తెగ అనీ, కథా స్థానమైన కనిగిరి సీమలో కొమ్ములవారే కాక, గొల్లలలో పూజ గొల్లలు కూడ ఈ కథను పాడుతున్నారనీ, అంతే గాక కందుకూరు తాలూకాలో పికిలివారనే వారు పాడుతున్నారని, వీరు కూడ గొల్లలేననీ,

అలాగే విశాఖపట్టణ ప్రాంతాలలో పొడపోతుల వారనే వారు, కాటమరాజు కథలను గానం చేస్తున్నారనీ వీరి కులమేదో తెలియదనీ.

అలాగే రాయలసీమ ప్రాంతంలో భట్టువారు (మాదిగలు) ఎఱ్ఱగొల్లలూ, తెలంగాణాలో ఎఱ్ఱగొల్లలూ, మందుచ్చువారూ, బీరన్నల వారూ, యాదవ కథలను చెపుతూ వుంటారనీ, కనిగిరి సీమలో కాటమరాజు కథలను పాడే పూజ గొల్లలను యాచకులు అని పిలుస్తూ వుంటారనీ వీరినే తెలంగాణాలో తెరచీరభక్తులని పిలుస్తారనీ పంపాద్రి కథను రచించిన మల్లయ్య కవి, కృత్యవతరణికలో తెరచీర భక్తులను స్మరించాడనీ కాటమరాజు కథల గ్రంథంలో 28 వ సూచికలో డా॥ తంగిరాల సుబ్బారావు, డా॥ చన్నప్రగడ తిరుపతిరావు గార్లు ఉదహరించారు.

కాటమరాజు కథా ప్రసక్తి:

కాటమరాజు కథలు, కథా ప్రసక్తి, శాసన ప్రమాణంగావుంది. కాటమరాజుకు నల్లసిద్దికీ జరిగిన యుద్ధాన్ని గూర్చి మెకన్ జి స్థానిక చరిత్రలు పద్దెనిమిదవ సంపుటంలో విపులంగా వుంది.