పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

త్వరలోనే గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేలో నెలకు రు.250/- జీతంగల ఉద్యోగంలో చేరారు. పాతికేళ్ల ప్రాయంలోనే ఆయన భార్య గతించింది. ఆ కారణంగా ఐహిక సుఖాలపట్ల ఆయనకు విరక్తి కలిగింది. తన జీవితాన్ని దేశానికి అంకితం చేయాలని నిశ్చయించారు.

గాంధీజీ సబర్మతీ ఆశ్రమం నుండి జాతీయోద్యమ శంఖారావం పూరించారు. బాపూజీ పిలుపు విన్న పొట్టి శ్రీరాములు 1927లో తన ఉద్యోగానికి రాజీనామా యిచ్చారు. తన ఆస్తిపాస్తులను తల్లికి అన్నదమ్ములకు పంచి పెట్టారు. సబర్మతీ ఆశ్రమం చేరారు. గాంధీజీ శిష్యులుగా నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొనసాగారు. మూడు సార్లు రాజకీయ నిర్భందితులుగా కారాగార వాసంచేశారు. సత్యాగ్రహం, శాసనోల్లంఘనం వంటి ఉద్యమాల్లో అగ్రగామిగా వుంటూ గాంధీజీ ప్రశంసలందుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలోను, వివిధ ప్రాంతాల్లోనూ, మన రాష్ట్ర మందలి కొమరవోలులోను నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొని గొప్ప సేవచేశారు. 1941-1942 సంవత్సరాల సత్యాగ్రహం, 'క్విట్ ఇండియా' ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. 1944లో నెల్లూరు కార్యక్షేత్రంగా ఖద్దరు ఉత్పత్తి, వ్యాప్తి కార్యక్రమాల్లో తీవ్రంగా కృషి చేశారు.

1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశంకోసం నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆయన దీక్ష ఫలితంగా హరిజనులు ఆలయంలో ప్రవేశింపగలిగారు. ఆ సంవత్సరంలోనే మద్రాసు ప్రభుత్వంచే హరిజనుల ఆలయప్రవేశం, హరిజనోద్ధరణకు సంబంధించిన రెండు శాసనాలను ఆమోదింప చేసేందుకు 23 రోజుల నిరశన దీక్ష చేశారు. ఆయన వజ్ర సంకల్పం ఫలించింది. మూడో మారు వార్థాలో 1948లో నిరాహార దీక్ష 29 రోజులు సాగించారు.

ఆయన పదవులకోసం, కీర్తి ప్రతిష్ఠల కోసం ఏనాడూ పోరాడలేదు. గాంధీజీ బోధించిన సత్యాహింసలు, హరిజనోద్ధరణ ఆయన జీవితాశయాలు. మిత్రుల వత్తిడిని కాదనలేక కొంత కాలం ఆంధ్రరాష్ట్ర గాంధీ స్మారక సంఘ కార్యదర్శిగా పనిచేశారు.

శ్రీరాములుగారు జీవితపు చివరి దశలో నెల్లూరులో వుంటూ హరిజనోద్ధరణకు నిర్విరామంగా పనిచేశారు. హరిజనోద్ధరణకు అందరూ పూనుకోవాలని వ్రాసిన అట్టలను మెడకు, వీపుకు తగిలించుకుని ప్రచారం చేసేవారు. త్యాగమే ధనంగా పెరిగిన ఆయన ముతక ఖద్దరు దుస్తులు ధరించి, నెల్లూరు పట్టణ వీధుల్లో దయగలవారు పెట్టిన ఆహారంతో బ్రతికారు. కాళ్లకు చెప్పులుగాని, తలపై గొడుగుగాని లేకుండా మండుటెండల్లో తిరుగుతూ జాతీయ ఉద్యమ ప్రచారం చేసేవారు. ఆ దేశభక్తుణ్ణి సామాన్యులు "పిచ్చి శ్రీరాములు" అనేవారు. అవును దేశాభ్యుదయమనే పిచ్చి ఆయనకు పట్టింది.

మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతం పట్ల ప్రదర్శిస్తున్న సవతి తల్లి దృష్టిని ఆయన గమనించారు. మద్రాసు నగరంపై ఆంధ్రులకు హక్కు వున్నదని, ప్రత్యేక