Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/724

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చికిత్సాశాస్త్రము (వై)

సంగ్రహ ఆంధ్ర

బ్రహ్మర్షి గురుకులమునకు చెందిన చరకమునకు అగ్నివేశ సంహితయని పేరు. చరకుడు సంస్కరించిన కారణముగా చరకసంహితయని వాడుక కలిగినది. అగ్ని వేశ సంహితకు ప్రవక్త ఆత్రేయ భరద్వాజ మహర్షి. సంధాత అగ్నివేశుడు. సంస్కర్త చరకుడు. ప్రతిసంస్కర్త దృఢబలుడు. అగ్నివేశకృతమగు ఈ చరకసంహితయందు చికిత్సా శాస్త్రము సర్వాంగములతో సంపూర్ణముగ, సవిమర్శనముగ చర్చింపబడినది. ఈ సంహితయందు అగ్నివేశుడు ప్రతిజ్ఞాపూర్వకముగ ఇట్లు చెప్పెను.


శ్లో. చికిత్సా వహ్ని వేశస్య స్వస్థాతు రహితంప్రతి
    యదిహాస్థిత దన్యత్ర యన్నేహాస్థి నతత్క్వచిత్.


స్వస్థుని ఆరోగ్యరక్షణమును గురించి రోగి రోగబాధా పరిమోక్షణమును గురించి అగ్ని వేశుని సంహితయందేది. చెప్పబడినదో ఆ విధినిషేధములు, ఆయా రోగనిదాన లక్షణ చికిత్సా విశేషములు మాత్రమే దేశమంతటను కలవు. అగ్నివేశుని సంహితయందేది చెప్పక విడిచిపెట్ట బడినదో ఆ విషయము మరెచ్చటను గాని కానరాదు.

చికిత్సాశాస్త్రమునందు స్వతంత్రములు, ప్రధానములు నగు గ్రంథములు చరక, సుశ్రుతములు మాత్రమే. అష్టాంగ సంగ్రహమను ప్రసిద్ధిగల ఆయుర్వేద చికిత్సా గ్రంథము చరక, సుశ్రుతముల సంగ్రహస్వరూపము. అష్టాంగహృదయము సంగ్రహానుకరణము. ఈ రెంటిని కూడ సంహితలని వాడుచున్నారు. చరకసుశ్రుతముల పోలికలనుబట్టి శార్జధరసంహిత, యోగరత్నాకరము, భావప్రకాశ, చింతామణి, బసవరాజీయము-ఇవిఅన్నియు చికిత్సాశాస్త్ర మర్యాదను వ్యాపింపచేయునవియే. వీటిని నిబంధనగ్రంథము లనియెదరు, ఇవిగాక, కేవల యోగ గ్రంథములు, చిన్నవి, పెద్దవి చికిత్సా సంప్రదాయమున కేవల ఔషధములను మాత్రము చెప్పునవి చాల గలవు. చరకసంహితకు ప్రాచీన, అర్వాచీనములుగ చెప్పబడు అనేక గ్రంథములు లోకమునందు నామమాత్రముగా వినబడుచున్నవి. ఆయుర్వేదసూత్రము లనునవి, భరద్వాజ సూత్రము లనునవి కొన్ని గలవు. అవి ప్రాచీనములుగా గాని, అర్వాచీనములుగా గాని, భాష, విషయవిశేషములనుబట్టి కనపడవు. సర్వతోముఖ విజ్ఞాన సముచ్చయమగు ఋగ్యజుస్సామాధర్వణాత్మక మైన వేదమంతయు భారతీయుల చికిత్సాశాస్త్రము, నిత్యజీవన ప్రవృత్తమగు సద్వర్తనము (మంచి నడవడిక) హితాహితాత్మకమగు విహారాహార ఆచారవ్యవహార విధినిషేధము చెప్పి, జన్మ జరామరణ దుఃఖిత మగు మానవ జీవనమును అమృతమయముగ, మనుష్యానందమును బ్రహ్మానందమయముగ చేయ ప్రబోధించు మానవధర్మసర్వస్వము చికిత్సా శాస్త్రము.

వే. తి. వెం. రా.


చికిత్సాశాస్త్రము-(వై) :

చికిత్సాశాస్త్ర మనగా వ్యాధులకు చికిత్సచేయు విధానమని అర్థము. మొదట ఇది మిగుల శాస్త్రజ్ఞాన రహితమై యుండెను. ఒక జబ్బునకు ఒక ప్రత్యేక ఔషధము ఉపయోగకరమని చెప్పుచుండెడివారు. కాని అది ఎట్లు ప్రయోజనకరమో వారికి తెలియకుండెను. ఉదా : గుండెజబ్బునకు డిజిటాలిస్ ఉపయోగించునను నమ్మకము వారికి గలదు. అది నిజముగా చాలా విలువగలదని గ్రహించి, దానిని దరిమిలా నవీన వైద్యశాస్త్రములోనికి స్వీకరించిరి. అది పనిచేయుపద్ధతి, విషతత్వ శాస్త్రము, మోతాదు, అది పనిచేయుటకు కావలసిన లక్షణములు, సంతృప్తికరముగా ప్రమాణబద్దము చేయబడినవి. జీవరసాయన శాస్త్రమువంటి శాస్త్రములు వృద్ధిపొందినవి. అందువలన ముడివస్తువులనుండి వాస్తవముగా ప్రయోజన కరములైన ఔషధ భాగములను వేరుచేసి, ప్రమాణ బద్దము చేయజాలిరి. జంతువులమీద చేయబడు ప్రయోగములు ప్రయోజనకరములే. కాని, మానవునిపై కలుగు ఫలితములను గూర్చి అనిర్దిష్టముగా చెప్పజాలవు.

రోగనివారణ చర్యలు : ఒకరినుండి మరొకరికి, మశూచికపు టీకాలు వేసినయెడల మశూచికము రాదని ప్రాచీన చైనాదేశస్థులకు తెలిసియుండెను. 19 వ శతాబ్ది మధ్యలో జన్నరు అను నతడు, గోస్తనవ్యాధి (కౌపాక్సు) రసిని మనుష్యులకు టీకాలుగా వేసినచో మశూచికమురాదని నిర్ధారణచేసెను. టీకాలు వేయుటవలన ఎట్టి సత్ఫలితములు కలుగుచున్నవో ఈనాడు మనకెల్లరకు తెలిసినవిషయమే. గ్రుడ్డువంటి సజీవ పదార్థములలోని శరీరజన్య విషమునుండితీసిన రసి, సూదిద్వారా ఇచ్చు చున్నారు. అందువలన రసిద్వారా సంక్రమించు పోలియో

664