విజ్ఞానకోశము - 3
చంద్రగుప్త చక్రవర్తి
చంద్రగుప్తుడు చేసిన మరియొక తప్పిదమును బౌద్ధ గ్రంథములు తెలుపుచున్నవి. చంద్రగుప్తుడు సరిహద్దుల మీద దాడులు సాగించి మార్గము వెంటనున్న పెక్కు రాష్ట్రములను, జనపదములను జయించెనట! కాని తన విజయములను సుస్థిరపరచుకొనుటకు భద్రతా సైన్యమును ఆయా స్థలములందు నిలుపలేదు. అందుచే వెంటవచ్చు సైన్యములకు వెన్నుపోటు తగిలెనట! అప్పుడు సరియైన పద్ధతి ఏదో ఆతనికి గోచరించినది. చంద్రగుప్తుడు పాటలీపుత్రమును ముట్టడించి ధననందుని వధించెను. మగధరాజ్యముపై చేసిన ఈ యుద్ధములో మాగధు లెందరో హతులైరి.
నందరాజవంశ నిర్మూలన మను మహా నాటకమున చంద్రగుప్తునికంటె చాణక్యు డను నామాంతరముగల కౌటిల్యుడే ప్రధానపాత్ర వహించినాడని ఒక అభిప్రాయము కలదు. ముద్రారాక్షస నాటకమునందు అత్యంత ప్రతిభాన్వితుడు, సమధికార శక్తిమంతుడును అయిన చాణక్యునిముందు చంద్రగుప్తుడు దివిటీముందరి దీపము వలె నుండును. ముద్రారాక్షస కథయంతయు నిజమయినను కాకపోయినను, చంద్రగుప్తుని శౌర్య, పరాక్రమ, యుద్ధచాతుర్యములకంటె చాణక్యుని నిపుణబుద్ధియు, రాజనీతి నేతృత్వమును కార్యసాధనమున ప్రబలసహాయ కారిగా నుండెనని చెప్పనొప్పును. నందరాజు అయోగ్యుడు. ప్రజ లాతనిని అసహ్యించుకొనుచుండిరి. ప్రజలను పీడించి, వారి సొమ్ము దోచుకొని, తన ధనాగారమును నింపుకొనుచు అత్యంత ధనవంతు డయ్యెను. నందరాజు తన నాశనమును తానే తెచ్చి పెట్టుకొనెను.
చంద్రగుప్తుడు తన సామ్రాజ్యమును కట్టుదిట్టములు చేయుచు బలపడుచుండగా, సెల్యూకస్ అను గ్రీకురాజు చంద్రగుప్తునితో యుద్ధమునకు తలపడెను. కాని యుద్ధ పర్యవసానము సెల్యూకసునకు ప్రతికూలముకాగా, ఆతడు హెరాట్, కందహార్, కాబూల్, బెలూచిస్థానములో కొంత భాగమును చంద్రగుప్తునికి కానుకగా నొసగి ఆతనితో సంధిచేసికొనెను. దీనికి బదులుగా చంద్రగుప్తుడు 500 ఏనుగులను సెల్యూకసునకు బహుమతిగా నొసగెను. సంధి షరతులనుబట్టి చూచినచో, చంద్రగుప్తుని చేతులలో గ్రీకువారు నిర్వీర్యులయిరని తోచగలదు. అంతేకాదు. ఈ సంధికి బలకరముగా ఈ ఉభయుల నడుమ వై వాహిక సంబంధ మేర్పడినట్లు తెలియుచున్నది. ఈ వివాహోదంతమునుబట్టి సెల్యూకసు కుమార్తెను చంద్రగుప్తుడు వివాహ మాడినట్లు తలంచుచున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. తరువాత సెల్యూకను చంద్రగుప్తుని యెడ మైత్రీభావము వహించుటయేగాక తన పక్షమున మెగస్తనీసు అను నాతనిని రాయబారిగా నియమించి పంపెను. ఈ రాయబారి పాటలీపుత్రములో నివసించుచు, భారతదేశమును గూర్చి ఒక గ్రంథముకూడ రచించి యున్నాడు.
చంద్రగుప్తుని అనంతర జీవిత విధానమునుగూర్చి అంతగా తెలియదు. ఆతని సామ్రాజ్యము అత్యంత విశాలమైన దగుటచే, ఆతడు తన జీవితమంతయు యుద్ధ ప్రస్థానములందే గడపియుండవచ్చును. ఈ విషయమున వివరములు తెలియవు. జైనుల కథనము ప్రకారము చంద్రగుప్తుడు చరమ జీవితకాలమందు ఐహిక విషయములను పరిత్యజించి, భద్రబాహువెంట బయలుదేరిన జైన సమూహముతో మైసూరు ప్రాంతములో శ్రవణ బెళగోళ అను ప్రదేశమునకు వెడలినట్లు తెలియుచున్నది. అచ్చట భద్రబాహు, చంద్రగుప్తుడు సాధుపుంగవులుగా కలిసి జీవితములు గడపినట్లు శ్రవణ బెళగోళా యందలి శాసనములు తెలియజేయు చున్నవి. చరిత్రయందు వారి నామములు చిరస్థాయిగా నిలిచిపోయినవి. చంద్రగుప్తుడు నివసించిన పర్వతమును 'చంద్రగిరి' గా ఇప్పటికిని పిలుచుచున్నారు. చంద్రగుప్త బస్తి యను పేరుతో అతడు నిర్మించిన ఒక దేవాలయము ఇంకను నిలిచి యున్నది.
సామ్రాజ్య విస్తీర్ణము : చంద్రగుప్తుడు నిస్సందేహముగా ఒక విశాల సామ్రాజ్యమున కధిపతి. ఇతడు ఆరు లక్షల సైన్య సమేతుడయి, భరతఖండము నంతను జయించి లోబరచుకొనినట్లు ప్లూటార్కు పండితుడు వ్రాసి యున్నాడు. ఈ విషయమును రుజువు పరచుటకు పెక్కు పరోక్ష సాక్ష్యాధారములు కూడ కలవు. అశోకుని శాసనములను బట్టి అత డొక కళింగదేశ విజేతగనే స్ఫురించు చున్నది. అయితే అతని శాసనములు దేశవ్యాప్తిని గాంచినచో, మరియు వాటి అంతస్సాక్ష్యములను పర్యాలోచించినచో, ఆతని సామ్రాజ్యము దక్షిణమున మైసూరు వరకును, భారత భూభాగమునకు అవతల వాయవ్య దిశ
569