Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/564

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గ్రామవిద్యుదీకరణము

లేదు. కొంతకాలమునుండి గ్రామీణ ప్రాంతములలో విద్యుత్తు లభించుటచే ఈ పరిశ్రమ ఇప్పుడు అభ్యుదయ పథమున పురోగమించుచున్నది.

విద్యుత్తు సహాయమున గ్రామ ప్రజలకు కలుగు ప్రయోజనములలో కొన్నిటినిగూర్చి మాత్రమే పైన ముచ్చటింపబడినది.

పైన పేర్కొనినవాటికి తోడుగా గ్రామసీమలయందు స్థాపింపబడుచున్న లఘుపరిశ్రమలయందును, గృహ పరిశ్రమలయందును విద్యుచ్ఛక్తి అతి ప్రధానమైన పాత్ర వహించుచున్నది. ఉదాహరణమునకు, పీచు పరిశ్రమ, తాళ్ళ పరిశ్రమ, ఇత్తడి పాత్రలను పాలిష్‌చేయు పరిశ్రమ, కమ్మరి పరిశ్రమ, వడ్రంగి పరిశ్రమ. కుమ్మరి పరిశ్రమ ఇత్యాది పెక్కు లఘు పరిశ్రమలు విద్యుత్తు మూలమున పొదుపుతనమును (economy), సామర్థ్యమును, అధికోత్పత్తియును సాధింపగలవు. శతాబ్దముల నుండియు బండచాకిరిచేయ నలవాటుపడిన మానవున కీనాడు విద్యుత్తువలన విముక్తి చేకూరినది.

గ్రామ విద్యుదీకరణమునకు అవసరమైన పెట్టుబడిని గూర్చి విచారించినచో, అట్టి పెట్టుబడిని వెచ్చించుట లాభదాయకమైన విషయముకాదు. నగర ప్రాంతములతో పోల్చి చూచినచో, దూరప్రాంతములం దుండు గ్రామములకు విద్యుచ్ఛక్తిని అందించుట కష్టతరమైన విషయము. సాంకేతికమైనవి ఇందులకు కారణములు గలవు. అట్లని ఈ సమస్యపట్ల ఉపేక్షాభావము గాని, ఉదాసీనభావము గాని వహింపగూడదు. గ్రామ సీమల యొక్క ప్రత్యక్ష పరోక్ష ప్రయోజనములు దృష్ట్యా, ప్రజానీకముయొక్క సంక్షేమము దృష్ట్యా, విద్యుత్తును గ్రామసీమలకు వ్యాపింపజేయుట అభిలషణీయమైన అంశముగా గుర్తింపబడినది. అంతేకాని ఈ సమస్యను రూపాయలు, పైసల దృష్టితో విచారింపగూడదు. విద్యుదీకరణమువలన గ్రామీణులనుండి ప్రభుత్వమునకు ఎంత ఆదాయము వచ్చునా అను ఆలోచనయే కూడదు. ఈ దృక్పధము ననుసరించియే భారతప్రభుత్వమును, వివిధ రాష్ట్ర ప్రభుత్వములును గ్రామ విద్యుదీకరణ కార్యక్రమమునకు పూనుకొని వివిధ దశలలో దానిని అమలు జరుపుచున్నవి. ఈ ఆశయమును సాధించుటకై, పెట్టుబడి వ్యయమును తగ్గించు నుద్దేశ్యముతో గ్రామీణ పరిస్థితుల కనుగుణ్యమైన కొన్ని ఆర్థిక ప్రణాళికలను గూడ ఆచరణయం దుంచుచున్నవి. ఈ కార్యక్రమమును కొనసాగించుటకై వడ్డీ లేనట్టియు, వాయిదాల పద్ధతిపై వడ్డీ చెల్లించునట్టియు దీర్ఘకాలిక ఋణములు సేకరింపబడుచున్నవి.

ఆంధ్రరాష్ట్రములో విద్యుదీకరణ కార్యక్రమము ఎంతవరకు ముందడుగు వేసినదో విచారించుదము. మన రాష్ట్రములో 3 కోట్ల 59 లక్షలమంది ప్రజలు కలరు. రాష్ట్ర విస్తీర్ణము 1.06 లక్షల చ. మైళ్ళు; గ్రామములు 26,500. నూటికి దాదాపు 80 శాతము ప్రజలు గ్రామములలో నివసించుచున్నారు.

ప్రథమ పంచవర్షప్రణాళికాంతమునకు (1956 మార్చి) 700 గ్రామములు మాత్రమే విద్యుదీకరణము గావింప బడెను. కాని రెండవ ప్రణాళికదశయందు (1956 ఏప్రిల్ నుండి 1961 మార్చి వరకు) విద్యుదీకరణ కార్యక్రమము చాల చురుకుగా సాగుటచే, అదనముగా 2450 గ్రామములును, నగరములును విద్యుదీకరణము గావింపబడెను. రాష్ట్రమందలి జిల్లా, తాలూకా ముఖ్య కేంద్రములన్నియు విద్యుదీకరణము గావింపబడెను. ఇట్లు విద్యుదీకరణ మొనర్పబడిన గ్రామములసంఖ్య మొత్తము 3150 వరకు పెరిగెను. రెండవప్రణాళిక కాలములో ఒక్కగ్రామవిద్యుదీ కరణమునకై 19 కోట్ల రూప్యములు వ్యయపరుపబడెను. 1956 మార్చి నెలాఖరునకు వ్యవసాయదారులకు విద్యుత్తుతో సహా సరఫరా చేయబడిన పంపుసెట్లు (pumpsets) 4,300 మాత్రమే కాగా, 1961 ఏప్రిల్ మాసాంతమునకు దాదాపు అట్టి సెట్లు 18,000 సరఫరా చేయబడెను. రాష్ట్ర మంతటిలో 1961 మార్చి నెలాఖరునకు విద్యుత్తును వినియోగించెడి గ్రామీణులసంఖ్య 2,68,000 వరకు పెరిగెను. అదనముగా సంవత్సరమునకు 500 గ్రామములచొప్పున విద్యుచ్ఛక్తిని ప్రవేశ పెట్టుటకు అవకాశమేర్పడెను.

కాని ఇంతవరకు జరిగిన ఈ యభివృద్ధినిబట్టియైనను, రాష్ట్రములోగల 26,500 గ్రామములలో నూటికి 12 శాతముగల గ్రామములలో మాత్రమే విద్యుత్తు ప్రవేశపెట్టబడెను. 1961 మార్చి ఆఖరుకు తల ఒకటికి 15 యూనిట్ల విద్యుత్తు మాత్రమే వినియోగమయ్యెను. 3వ ప్రణాళికాంతమునకు (1968 మార్చి) 40 యూనిట్లవరకు

511