Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/552

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గౌతముడు (ధర్మసూత్రప్రణేత)

బ్రాహ్మణమున సామవేదాచార్యులుగా నల్గురు గౌతమాన్వయులు కానవచ్చుచున్నారు. (1) గాతృగౌతములు, (2) సుమంత్రబాభ్రవ గౌతములు, (3) శంకరగౌతములు, (4) రాధాగౌతములు - అని. ఇప్పటి శ్రౌత - గృహ్య సూత్రములలో గౌతముని-స్థవిర గౌతముని-అభిప్రాయములుగూడ తెల్పబడినవి. అనగా ఒకప్పుడు గౌతమ శ్రౌత గృహ్యసూత్రములుగూడ వాడుకలో నుండెనని యూహింపబడు చున్నది. గౌతముడు కృచ్ఛ్రాదులను దెలుపు 26 వ అధ్యాయమును సామవేద సంబంధియగు 8 వ బ్రాహ్మణములో ఒక సామవిధానమునుండి గ్రహించుటయు, సామవేదానుసారముగ 5 వ్యాహృతులకు చెందునట్లు సూత్రములు రచింపబడుటయునుబట్టి మన గౌతముడు సామవేదియే యని చెప్పవచ్చును. మరియు ఆపస్తంబాది సూత్రములకు పూర్వపువి అగు బోధాయన వాసిష్ఠ సూత్రములలో గౌతముడు ప్రామాణికుడుగా గ్రహింపబడుటను బట్టియు, గౌతమ ధర్మమునుండి దోధాయనాదులు ఒక యధ్యాయమునే పూర్తిగ తమ సూత్రములలోనికి స్వీకరించుటనుబట్టియు, ఈ సూత్ర గ్రంథమే అన్నిటికంటె పురాతనమైనదని ఏర్పడుచున్నది. కాని కొందరు ఆధునికులు మన కనుపలబ్ధమైన మను ధర్మసూత్రము లుండెడి వనియు - అందుచే నవి గౌతమ ధర్మసూత్రములకంటె ప్రాచీనతరమైన వనియు చెప్పెదరు గాని ఆ గౌతమునికే యిష్టమైనట్లు 21.7 సూత్రమున నతడు మనువుయొక్క అభిప్రాయము నుదాహరించుట చేత తెలియుచున్నది. అయినను, ఆ సూత్రము లనుపలబ్ధములగుటచే, లభ్యమైన సూత్రవాఙ్మయమున ఈ గ్రంథ మే ప్రప్రథమ మయినట్లు భావింపదగును.

గౌతమ ధర్మసూత్రములలో 3 ప్రశ్నములలో 28 అధ్యాయములును, 1005 సూత్రములును, 1360కి పైగా విషయములును గలవు. వాని వివరము లిట్లున్నవి :

ప్ర. అ. సూ. విషయము
1. 9 380 500
2. 9 376 520
3. 10 249 340

మన గౌతమ ధర్మసూత్రములు 'వేదోధర్మమూల'మ్మని ప్రారంభించి, 'ధర్మిణాం విశేషేణ స్వర్గం లోకం ధర్మ విదాప్నోతి జ్ఞానాభినివేశాభ్యామితి ధర్మోధర్మః' అని ముగింపును పొందుచున్నవి. సర్వధర్మములకును వేదమే మూలమని ప్రతిపాదించి, అట్టి ధర్మమును గ్రుడ్డిగా నాచరించు వారికంటె తదర్ధాశయములను తెలిసికొని శ్రద్ధతో అనుష్ఠించువారే శ్రేష్ఠులని చెప్పి ఉపసంహరింపబడినది. అనగా అట్టి ఉపక్రమోపసంహారములచేత ఇట్టి ధర్మ సూత్రముల తత్త్వమును బాగుగా తెలిసికొని ఆచరింప వలయునని భావము.

ఇందు ప్రతిపాద్యమైన ధర్మము వేదనిష్ఠమగుటచేతను, వేదాధ్యయనమే ధర్మజ్ఞానమునకు మూలాధారమగుట చేతను వేదాధ్యయన రూపమైన 'విద్యావిధాన, ప్రశంసతో ఈ గ్రంథము ప్రారంభించును. చాతుర్వర్ణ్వ విశిష్టమైన ఆర్యసంఘములో త్త్రెవర్ణికులకు - బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులనబడు ద్విజాతులకు - వేదాధ్యయనము విధింప బడినది. అది ఉపనయన మూలకమగుటచే, ప్రప్రథమమున ఉపనయన ప్రశంస గావింపబడి 'ఉపనయనం బ్రాహ్మణ స్యాష్టమే (1-6 సూ)' అని విధింపబడినది. 'ఉపనయన కాలచర్చయు, బ్రహ్మచారికి తగిన వస్త్రాది విధానమును, ఆ సందర్భముననే వస్తుశుద్ధియు, శౌచప్రక్రియయు బోధింపబడినది. తరువాత బ్రహ్మచారి గురూపసదనము, పాదోపసంగ్రహాదులు చేయు విధానములు నిర్దేశింపబడినవి. నాటి విద్యావిధానమును నేటి విద్యావిధానముతో పోల్చి చూచినయెడల, ఎంతయో వ్యత్యాసము గోచరింపగలదు. విద్యార్థులు ధర్మాచరణము ప్రధానముగా విద్య నభ్యసింపవలయునను ముఖ్యసూత్రములపై నాటి విద్యాపద్దతి నిలువద్రొక్కుకొని యున్నదని చెప్పదగును. నాటి బ్రహ్మచారులు ద్వివిధముగా నున్నారు. కొంతకాలము విద్యార్జనచేసి పిదప గృహస్థులై వ్యవహరించు వారును, యావజ్జీవము బ్రహ్మచర్య పూర్వకముగా విద్యార్జనము చేయుచునుండువారు అని.

గురుకులవాసము చేసి ముగించిన పిమ్మట గృహస్థు కాగోరువారు ఆచరింపదగు ధర్మములు తరువాత వివరింపబడి యున్నవి. “విద్యాంతే గురురర్దేననిమంత్ర్యః (1-26-54 సూ.)" అని గురుదక్షిణ యొసగి ఐకాశ్రమ్యం త్వాచార్యాః (1-3-35) అని గృహస్థాశ్రమపు ప్రాధాన్యము వివక్షింపబడి, తదుపరి తదాశ్రమ ధర్మములు

499