గోలకొండ సుల్తానులు
సంగ్రహ ఆంధ్ర
భాగ్యమతి నుద్దేశించి వ్రాయబడినదని పండితులు చెప్పుచున్నారు. మహమ్మద్ కులీ స్వయముగ గొప్పకవి. ఇతడు తన ప్రియురాండ్ర నుద్దేశించి వ్రాసిన ప్రేమగీతికలు నేటికిని సహృదయుల నాకర్షించుచున్నవి. మహమ్మదీయులయొక్కయు, హిందువులయొక్కయు పండుగలపైకూడ ఇతడు కొన్ని గీతికలు రచించెను. అబ్దుల్లా కాలమునకూడ ఎన్నియో చారిత్రకగ్రంథములు రచింపబడినవి. ఈతని సోదరి ఉత్తమకవయిత్రి. గోలకొండ సుల్తానులు 'దక్కనీ ఉర్దూ' అను ఉర్దూమాండలికమును అభివృద్ధి పరచి పోషించినందున ఉర్దూ వాఙ్మయచరిత్రలో వారికి ప్రత్యేకస్థానము లభించినది. దక్కనీ ఉర్దూకూడ కావ్యరచనాస్థాయి నందకొనజాలెనని బీజాపురము, గోలకొండవారు సోదాహరణముగ నిరూపించిరి. ఈ కాలమున ప్రణయగాథా కావ్యములు, వీరగాథలు, మస్నవీ, గజల్, ద్విపద, పద్యసంకలనములు, ప్రణయగీతికలు, మర్సియా మున్నగు కావ్యప్రక్రియలకు అధికమైన ఆదరము లభించినది. కావుననే ఉర్దూ వాఙ్మయమున కిది స్వర్ణయుగమని చెప్పవచ్చును.
గోలకొండ కథలు - గాథలు : విజయనగర సామ్రాజ్య సంపదకును, తదితర రాజ్యవైభవములకును సంబంధించిన గాథలు జనబాహుళ్యమున ప్రచారము నొందినట్లే, గోలకొండకు సంబంధించిన గాథలును నేటికిని హైదరాబాదులో పెద్దలలో వ్యాప్తిలో నున్నవి. ఇట్టి గాథలలో చారిత్రికాధారములు కలవి కొన్నియు శ్రుతి ఆధారములు గలవి కొన్నియు, కేవల కల్పితములు మరికొన్నియు కలవు. ఇట్టి గాథలలో, భాగ్యమతి ప్రణయగాథ, గోలకొండ కోహినూరు వృత్తాంతము, అబ్దుల్ రజాక్ లారి వీరరసాత్మకగాథ, గోలకొండ సుల్తానులకును, ప్రధానాధి కారులకును సంబంధించిన గాధలు, చార్మినారు మక్కామసీదు, గోషామహలు, బారాదరి, మిల్క్ మహల్, పురానాపూల్ మున్నగువాటి నిర్మాణమునకు సంబంధించిన వింతగాథలు, ఆంధ్ర మంత్రులగు అక్కన్న మాదన్న వృత్తాంతములు, రాజకుమారులకు, రాణివాసములకు, రాజకుమార్తెలకు, ప్రియురాండ్రకు, మతగురువులకు సంబంధించిన చిత్రవిచిత్రములైన గాథలు ఎన్నియో కలవు.
గోలకొండ పరిపాలనా యంత్రము: గోలకొండ ప్రభువులు నిరంకుశులై వర్తించినను, తగిన అధికారవర్గమును నియమించి వారి సలహా ననుసరించి దేశమును పాలించిరి. అన్ని విషయములందును సుల్తానుల మాటయే వేదవాక్కుగా భాసిల్లెను. అయినను రాజ్యనిర్వహణమునకు సంబంధించిన ప్రధానాధికారులు కొందరుండిరి. ప్రధానమంత్రి పదవిని అలంకరించువానిని ' పేష్వా' అనుచుండిరి. ముస్తఫాఖాన్, మీర్ మోమిన్ అనువారు పేష్వాలై, సింహాసనమునకు ఎడమ వైపుననున్న గౌరవస్థానమును అలంకరించిరి. రెవిన్యూ, ఆర్థిక శాఖల ఆధిపత్యమును వహించువారిని 'మీర్ జుంలా' అనుచుండిరి. ముల్లాతఖీ, మీర్జామహమ్మద్ మున్నగువారు ఈ పదవి నలంకరించిన వారు. సైన్యాధికారిని 'ఆయిన్ ఉల్ ముల్క్' అని పేర్కొనుచుండిరి. అక్కౌంట్సు, ఆడిట్ శాఖలను నిర్వహించిన ఉపమంత్రిని 'మజుందార్ ' అనుచుండిరి. 'నాజిర్ ' అనగా ఇనస్పెక్టరు. ఇప్పటికిని విద్యాశాఖలో కొందరు నాజిర్ అను పదవిని నిర్వహించుచున్నారు. రాజకీయవ్యవహారములు, ఉత్తర ప్రత్యుత్తరములు నిర్వహించుట, శాసనములు, ఉర్దూలోను, తెలుగునందును వ్రాయించుట మున్నగు పనులు చేయువారిని 'దబీరు' అని పేర్కొనిరి. పోలీస్ కమీషనరును 'కొత్వాలు’అని పిలుచుచుండిరి. ఈ పదవికూడ మొన్న మొన్నటి వరకును అమలులో నుండెను. వీరుకాక హవల్దారు, జమేదారు మున్నగు ఇతర అధికారు లెందరో ఉండిరి. గోలకొండ ప్రధానాధికారవర్గమును గూర్చి వ్రాయునపుడు ఆంధ్రమంత్రు లగు అక్కన్న మాదన్న మహాభాగులను గూర్చియు, భద్రాచలము తహసీల్దారుగ నున్న కంచర్ల గోపన్న మహాశయుని గూర్చియు విస్మరింపజాలము. సుల్తానుల అత్యాదరణము నొంది ప్రధానాధికారులై వరలిన వీరు ఆంధ్రులై యుండుట గర్వ కారణము. వీరు తమ మేధా సంపన్నతచేతను, పరిపాలనా దక్షతచేతను, దూరదృష్టి చేతను, మహమ్మదీయ సుల్తానుల అనుగ్రహమునకు పాత్రులై, అపర యుగంధరులుగా కీర్తి నొందిరి. వీరు పారశీక వాఙ్మయమునందు పాండిత్యము కలిగి ప్రఖ్యాతులైనవారు. వీరి పాండితీ గరిమను, పరిపాలనా దక్షతను గుర్తించక అసూయాపరులై వీరిని పదవీభ్రష్టులను చేసినందున అచిరకాలముననే దేశము అన్యాక్రాంతమైనది.
488