Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/459

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుహావాస్తువు

సంగ్రహ ఆంధ్ర

చిత్రము - 106

పటము - 1 చంద్రయక్షిణి - బార్హూత్

నున్నవి. ఇచ్చట మొత్తము ఏడు గుహలు కలవు. ఇవన్నియు క్రీ. పూ. 250 సంవత్సరముల ప్రాంతమున, 40 సంవత్సరముల కాలము లోపలనే నిర్మింపబడినట్టివి. వీటిలో ఆరింటిపై ప్రాచీన పాళీభాషలో చెక్కబడిన శాసనములున్నవి. శాసనము చెక్కబడిన ఏడవ గుహకు 'లోమకఋషి గుహ ' అని పేరుకలదు. ఈ గుహయొక్క వెలుపలి భాగముమాత్రమే దివ్యమైన వాస్తు శిల్పము గోచరించుచున్నది. ఈ గుహా సముదాయములో నాగార్జున గుహయే మిగులపెద్దది. ఇది 46 అడుగుల పొడవును, 19 అ. 5 అం. వెడల్పును కలిగి వర్తులాకృతిగల అగ్రములతో నొప్పుచున్నది. ఆంధ్రప్రభువులైన శార్దూలావర్మ, అనంతవర్మఅనువారు 'లోమక' గుహను బ్రాహ్మణ మత గుహగా మార్చివేసి, దానిపై పూర్వము పాళీ భాషలో గల శాసనమును తుడిపించివేసి, తమ స్వంత శాసనముతో దానిని అలంకరించినట్టు లున్నది. ఈ గుహ యొక్క ముఖభాగము కళాత్మకమై తోరణముతో, జాలకముతో లోపలి తోరణ వక్రరేఖపై చెక్కబడిన ఏనుగుల చిత్రములతో శోభిల్లుచున్నది.

మగధ దేశమునకు రాజధాని యైన 'రాజగృహము' నకు సమీపమున అతిప్రాచీనమయిన రెండు గుహలు కలవు. అవి 'సోన్‌భండార్' అనుపేర బరుగుచున్నవి. వీటి నిడివి 34 అడుగులు, వెడల్పు 17 అడుగులు వీటి గోడలు 6 అడుగుల 9 అంగుళముల ఎత్తు కలిగి. కేవలము నిరాడంబరముగ నుండును. ఈ గోడల పైభాగము నుండి నడుమ శిఖాంతములైన తోరణము నిర్మితమైనది. ఈ తోరణముయొక్క మధ్యగా నేర్పడిన పైన పేర్కొనిన శిఖాంతభాగము భూమిపైనుండి 11 అ. 6 అం. ఎత్తున కలదు. 6:5 నిష్పత్తిలో ద్వారము గడప వద్ద ఎక్కువ వెడల్పుగను, ద్వారబంధములపైని బల్ల రాళ్లు (lintels) వద్ద ఎక్కువ ఇరుకుగాను ఉండును. అన్ని గుహావాస్తు శిల్పములలో ఇదియొక విశేషము. ద్వారమునకు జవాబుగా మరియొక చివర ప్రతి ముఖమున దాదాపు మూడు చతురపు టడుగుల గవాక్ష మొకటి యుండును. భారతదేశమునందలి గుహలలో ఇట్టి గవాక్షములు చాల అరుదుగా మాత్రమే కలవు. ఈ గుహలకు వరండా లుండును. వరాండాలు బల్లకూర్పుతో కప్పబడియుండును. వరాండా ఎత్తు 8 అడుగు లుండును. ఈ బల్లలు దూర్చబడిన రంధ్రము లీనాటికిని కనిపించుచున్నవి.

బౌద్ధమతగుహలు చైత్యము లనియు, విహారములనియు ద్వివిధముగ విభజింపబడియున్నవి. చైత్య మనునది ఒక పూజాస్థానము. దీనియందు సాధారణముగా దగోబాయో (ధాతుగర్భమో), బుద్ధ విగ్రహమో ఒకటి సంస్థాపితమై యుండును. ఇందు ప్రదక్షిణపథములు

410