Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/430

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

గుజరాతుదేశచరిత్రము

చోట మనకు కల్గును. 'లోధల్' నందు అనేక చక్కని కట్టడములు గలవు. ఇచట రాసలీలను అనగా శ్రీకృష్ణుని శృంగారచేష్టలను ఒక ఆలయ కుడ్యములపై అత్యంతాకర్షకముగా శిల్పులు చెక్కియుండిరి. జైనబౌద్ధ విగ్రహములు, ధర్మచక్రము మొదలగునవి ఎన్నియో ఇచ్చట కాననగును. “గిరినార్" అనుచోట మౌర్యుల శాసనములు గలవు. ప్రాచీనకాలపు కట్టడములు కొన్ని నేటికిని అదే దశయందున్నవి. ఆ కట్టడములవలన ఈ ప్రాంతమున నిష్ణాతులైన వాస్తుశాస్త్రజ్ఞులున్నట్లు తెలియును. అదియునుగాక మొగలుల కాలమున కట్టడములందు గుజరాతు వాస్తుశాస్త్రజ్ఞుల హస్తమే ప్రధానమైనదని చెప్పుదురు. ఇచటివారు వాస్తుశాస్త్రమునందే గాక చిత్రకళ యందు కూడ ఆరితేరినవారని చెప్పవచ్చును. వస్త్రములపైగల జరీ పనితనము చూపరులకు వింతగొల్పును. జరీ పనితనము ఇచటివారి చిత్రకళా నై పుణ్యమును తెలియజేయును. గాజుపై వీరు రంగురంగులతో చిత్ర విచిత్రము లైన ఆకృతులను చిత్రించిరి. చిత్ర సమేతములైన పింగాణీ పాత్రలు కూడ పూర్వకాలమందలివి లభ్యమైనవి. ఈ ప్రాంతమున ఒక్కొక్క కళ ఒక్కొక్క స్థాయిలో పెంపొందెను. వీరి ఉత్సవములలో 'డోలోత్సవ' మనునది ప్రసిద్ధిగాంచినట్టిది. ఈ ఉత్సవమును శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు ఎంతో వేడుకగా జరుపుకొందురు. తమ గృహాంగణమునందు ఊయెలను కట్టి దాని నత్యంత సుందరముగా నలంకరించి, అందు శ్రీకృష్ణుని విగ్రహమునుంచి, భక్తిశ్రద్ధలతో పూజించి, శ్యామలగీతములను అతి శ్రావ్యముగా పాడుచు, ఊయెల నూపుదురు. ఈ ఉత్సవమునందు ఆబాలగోపాలము పాల్గొని అమితానందమును పొందుదురు. పౌరాణిక యుగము నుండియు క్రమేణ వచ్చుచున్న కొన్ని కళలు ఆంగ్లేయ పరిపాలనా కాలమున మందగించె నని చెప్పుదురు.

ఈ ప్రాంతీయుల ముఖ్యవృత్తి అధికముగా వ్యాపారమే. వీరు సాహసచాతుర్యములు గలవారు. వ్యాపారమునందు ముందంజవేసి ఉన్నతస్థితికి వచ్చినవారు వీరేనని చెప్పవచ్చును. ఇచ్చటిరైతులు ఉదారులు ; ఉత్సాహవంతులు. ఇచ్చటివారు వ్యాపారవిషయమున ఆరితేరినవారు గావుననే, షాజహాన్ తన టంకశాకలయందు గుజరాతుశ్రేష్ఠులను నియోగించెను. వీరు లెక్కలయందు అతి నిపుణులు.

సౌరాష్ట్రము : సౌరాష్ట్రమునకు ప్రాచీననామము సురాష్ట్రము. మహాభారతమున ఈ సౌరాష్ట్రమును 'కృష్ణభూమి' యనిరి. మౌర్య, గుప్తరాజులకాలమున 'సురాష్ట్రమ' ని వ్యవహరించిరి. మహమ్మదీయుల కాలమున ఈ రాష్ట్రమును 'సోదర్ ' అనియు, మహారాష్ట్రుల కాలమున 'కఠియావాడ్' అనియు వ్యవహరించిరి. 1948 నాటికి పూర్వము ఇది చిన్న చిన్న సామంతరాజ్యములుగా విభజించబడియుండెను. 1948 సం॥ న వీనినన్నిటిని కలిపి సౌరాష్ట్రమని పేరిడిరి.

వైదికకాలమున యీ సౌరాష్ట్రముయొక్క భోగోళిక స్థితి వేరుగానుండెను. సింధునది సౌరాష్ట్రమందలి 'ఝాల్‌వాడ్' అను ప్రదేశమున ప్రవహించుచు, 'ఖండాత్ ' అఖాతమున కలియుచుండెడిది. ఐతిహాసిక కాలమందు సౌరాష్ట్ర మధ్యప్రాంతమున దట్టమైన అడవులుండెడివి. కావున జనులాప్రాంతమున నివసించలేదనియు, సాగర తీరముననే యెక్కువగ నివసించిరనియు చరిత్రకారుల ఊహ, సౌరాష్ట్రీయుల సంస్కృతికి 'సాగర సంస్కృతి' యని పేరుగూడ కలదు. కాన పౌరాణికులు సాగరతీరములందు నివసించుటచేతను, అచటనే వారి సంస్కృతికి సంబంధించిన చిహ్నములు ప్రాప్తించుటచేతను వారి సంస్కృతికి 'సాగరసంస్కృతి' యని నామకరణముచేసి యుండవచ్చును. ఆనాడు ద్వారక సామాజిక, సాంస్కృతిక, వ్యాపార కార్యకలాపములకు కేంద్రమైయుండెను.

సౌరాష్ట్రమున త్రవ్వకపు పరిశోధనలవలన బయల్పడిన వస్తుజాలము సింధు సంస్కృతికి సంబంధించినది. ప్రాచీన నవీన శిలాయుగమునకు సంబంధించిన వస్తుజాలము ఈ ప్రాంతమున అధికముగా దొరకెను. ఇచ్చట లభ్యమైన సాంస్కృతిక వస్తుజాలమునుబట్టి ఈ ప్రాంతము సంస్కృతుల సంగమస్థానమని తెలియుచున్నది. సౌరాష్ట్ర, గుజరాతు సంస్కృతులు ఇంచుమించు ఒకే సంస్కృతికి సంబంధించినవై యున్నవి. ఆదిమవాసులైన ఆర్యులు సౌరాష్ట్ర మధ్యభాగమున నున్న దుర్గమారణ్య ప్రాంతమున నివసించిరి. కాలక్రమమున ఆ యడవి ప్రదేశమున నున్నవారు ముఠాలుగా బయలుదేరి బాటసారులను

381