Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గద్వాల సంస్థానము

సంగ్రహ ఆంధ్ర

వల్లూరు: ఈ పురము కాకతి గణపతిదేవుని సామంతుడగు గంగయ సాహిణికి రాజధానిగా నుండెను. రుద్రమాంబా ప్రతాపరుద్రుల సామంతుడగు త్రిపురాంతకుడు ఈ వల్లూరు నుండియే రాచరికము నెరపినాడు. గద్వాలకు 15 మైళ్ళలో తుంగభద్రానదీ తీరమున నున్న వేణీ సోంపురమునందు శ్రీవ్యాస తత్వజ్ఞులచే నొక చెరువు నిర్మింపబడుచుండగా, అచ్చట భూమిలో దొరకిన రెండు వేణుగోపాలస్వామి విగ్రహములలో నొకటి వల్లూరులో ప్రతిష్ఠింపబడినది.

రాజవోలు : ఇచ్చట నొకకోట, అగడ్తయు, గద్వాల నగరములోవలెనే ఒక సభామంటపము (ఏడు అంగణముల సోఫాదర్బారు హాలు) ను కలవు. రాజవోలు (రాజప్రోలు) రాజులకు నిలయము.

ఐజ : గద్వాల సంస్థానపు మూలపురుషుడగు బుడ్డారెడ్డియొక్క జన్మస్థానము. ఈ గ్రామనామమునుబట్టి రాజరికమువారు “ఐజ గౌడులు" అని పేర్కొనబడినారు.

మొదలుకల్లు : ఈ గ్రామము బ్రహ్మాండపురాణమున 'ఆది శిలాక్షేత్రము'గా పేర్కొనబడినది. 'ఆదిశిల' అను పదమునకు ' మొదలుకల్లు' తెలుగు రూపము. ఇది యొక పుణ్యస్థలము.

చాగదొన : ఇచ్చట ఒక పెద్ద పరుపుబండ కలదు. దాని మీద నీటి దొన యొకటి కలదు. దాని ప్రక్కనే రామలింగేశ్వరాలయ మున్నది. ఈస్వామి అభిషేకార్థము, చ్యవనుని కోరికపై ఈ నీటి దొన ఏర్పడినదట. చ్యవనక దొన 'చాగ దొన' గా మారినట్లు తెలియుచున్నది.

బీచుపల్లి : ఇచ్చటి దేవాలయము గద్వాల సంస్థానము కంటె ప్రాచీనము. పూర్వమిది కణ్వాశ్రమమని చెప్పుదురు. ఆంజనేయక్షేత్రము ; అడవిప్రాంతము విరాగులకు, కళోపాసకులకు వసించుటకును, విహరించుటకును, ఏకాంతమైన ప్రశస్త ప్రదేశము. గద్వాల సంస్థానాధీశులు ఇచ్చట వేదోక్తముగా పూజాదికములు జరుగుటకై మాధ్వబ్రాహ్మణులను ఈనాము లిచ్చి నియమించినారు. కాని దేవుడు వెలసిననాటినుండి వాల్మీకులే (బోయవారు) అర్చన విధానాదులను జరుపుట సంప్రదాయసిద్ధముగా వచ్చుచున్నది.

శ్రీరామ అవధూత అగ్రహారము : ఇది గద్వాల నగరమునకు రెండు మైళ్ల దూరములో నున్న కృష్ణానదీ తీరమున గల యొక మఠము. రామావధూత అను కశ్చిత్ రాష్ట్రీయుడు కృష్ణానదిలోని ఎర్రగుండు మీద యోగసమాధిలో కూర్చుండి యున్నట్లు గద్వాల రాజా చిన సోమనాద్రి తెలిసికొని, అవధూతను దర్శించి, వారికోరిక ననుసరించి, ఈ మఠమును నిర్మాణము చేసెను. ఇచ్చట పెక్కు దేవాలయములు నిర్మింపబడినవి. అవధూత యొక్క మహిమలచే పునీతమైన క్షేత్ర మిది. ఇచ్చటి మఠ, దేవాలయాదుల నిర్వహణమునకై గద్వాల రాజులు బాధ్యత వహించి, సౌకర్యములు కల్పించి యున్నారు. ఇది యాతాయాతజనమునకు భోజనాది సౌకర్యములు కలిగించు మంచి మజిలీ. శ్రాద్ధాది అపర కర్మలు జరుపుటకు అనుకూలమైన ప్రశాంత ప్రదేశము.

సాహితీవికాసము : హైదరాబాదు రాష్ట్రమునందలి సంస్థానము లన్నిటిలో గద్వాలయందు సాహితీపోషణము అత్యధికముగా జరుగుచుండెడిది. ఈ సంస్థానాధీశులు బ్రాహ్మణ భక్తియు, వైష్ణవ గురుత్వమును కలిగియుండినను, వైష్ణవేతర, బ్రాహ్మణేతర, హైందవేతరులగు విద్యావేత్తల యెడలను, కళావేత్తల యెడలను నిష్పాక్షికముగ ఆదరమును ప్రకటించి, వారిని సన్మానించిరి. ఈ సంస్థానము కవులకును, కళావేత్తలకును, పండితులకును విహారరంగమై వర్ధిల్లినది. ఇచటికి వచ్చి తమ కౌశల్యమును ప్రదర్శించి సంస్థానాధీశుని వలన సన్మానమును పొందని కవి, పండితుడు, తాత్వికుడు, గాయకుడు, శాస్త్రజ్ఞుడు లేడు. 'అష్టదిగ్గజముల' కు తిక్కనవంటి కాణాదం పెద్దన సోమయాజులకు ఇది నివాసభూమి.

ఈ సంస్థానమునకు పూర్వము బోరవెల్లి రాజధానిగా ఉన్నప్పుడు దాదాపు 400 సంవత్సరముల క్రిందట ఆస్థానపండితుడుగా నుండిన అయలూరి కందాళాచార్యు లను వారు సంస్కృతమున 'అలంకార శిరోభూషణము' అను అలంకార శాస్త్రమును రచించిరి. క్రీ. శ. 1620 వ సం. న రెంటూరి రంగరాజుచే వ్రాయబడిన 'భానుమతీ పరిణయము' అను తెలుగు పద్యకావ్యమును 1929 లో రాణి లక్ష్మీదేవమ్మ తన ఆస్థానపండితుడగు యామునా చార్యునిచే పరిష్కరింపించి ముద్రణ చేయించెను. ‘దేవకీ నందన శతక 'మను తాళపత్ర ప్రతిని విక్రాల వెంకటా చార్యులను మరొక విద్వాంసునిచే పరిష్కరింపించి ప్రచు

308