Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

కౌటిల్యుడు (అర్థశాస్త్రము)

యోక్తి లేదు. ఆయన రచించిన ఆర్థశాస్త్రము బ్రహ్మాండమైన గ్రంథమేగాక, అమూల్యమైన విజ్ఞాన సర్వస్వమని చెప్పవచ్చును. ఆ గ్రంథమువలన భారతీయులకు ఆనాడే విశిష్టమైన ఒక స్వతంత్ర అర్థశాస్త్రము ఉండియుండెనని స్పష్టమగుచున్నది. అంతేగాక దేశములోని ఆనాటి పరిస్థితులను గూడ ఈ మహాగ్రంథము మనకు స్పష్టపరచు చున్నది. ఇది క్రీ. పూ. 300 వ సం.లో వ్రాయబడినది. ఈ గ్రంథమునకు పూర్వమును, అనంతరమును రచించబడిన గ్రంథములు దీనియెదుట దివిటీముందు దీపములవలె నుండుననుటయే ఈ గ్రంథముయొక్క ప్రశస్తికి గల ప్రబల నిదర్శనము. అసంఖ్యాకములైన అంశములను గూర్చి చర్చించిన ఈమహాగ్రంథములోని విషయ వైవిధ్యము అచ్చెరువు కొలుపుచుండును.

ఈ గ్రంథ రచయితయయిన కౌటిల్యునిగూర్చి రెండు విషయములు వివాద గ్రస్తములైనవి. అందు మొదటి విషయము : కౌటిల్యుడను వ్యక్తి యొకడు ఉండి యుండెనా యనునది. మెగస్తనీసు తన “ఇండికా”యను గ్రంథమున ఇతని ప్రసక్తి తేకుండుటయే ఇందులకు కారణము. రెండవ విషయము ఏమనగా! ఉండి యున్నచో, అతడెచ్చటివాడు ? తక్షశిలా నివాసియా ? ద్రవిడుడా ? లేక కొందరు భావించునట్లు ఆంధ్రుడా ? అనునది ఇందు మొదటి సందేహమునకు నేడు విలువలేదు. రెండవది ఇంకను వివాదగ్రస్తముగనే యున్నది. ఇతడు యూరోపియన్ రాజ్యాంగ తత్త్వవేత్తయగు అరిస్టాటిల్ నకు సమకాలికుడు. తక్షశిలా విశ్వవిద్యాలయ విద్యార్థి. రాజకీయ విషయములలో కోరినపని సాధించుటకు, కుట్రలుపన్ను సామర్థ్యమునకు ఇతనిపేరు మారు పేరని చెప్పవచ్చును. ఇతని విజ్ఞానము అపారమైనది. ధర్మశాస్త్రవేత్తలు అంగీకరించని వివాహ బంధనము, వితంతు వివాహము మొదలగు సంస్కరణములను తన గ్రంథములో ప్రతిపాదించిన సంస్కరణాభిలాషి ఈతడు. ఈ ప్రతిభాశాలిని గూర్చి దండి, భవభూతి, దమనకుడు మున్నగువారు ప్రస్తావించి యున్నారు.

కౌటిల్యార్థశాస్త్రము కొంతకాలము మరుగునపడి పోయినది. ఇది కౌటిల్యుడనే వ్యక్తి అసలు ఉండెనా యను సందేహమునకు బలము చేకూర్చినది. కాని ఈ శతాబ్ది మొదటలో డాక్టర్ శ్యామశాస్త్రిగారి కృషిఫలితముగా ఆ గ్రంథము బయటికి వచ్చెను. వారీ గ్రంథమందలి కొన్ని భాగములను ఆంగ్లములోనికి అనువదించిరి. యూరోపియను పండితులు ముఖ్యముగా, జర్మను పండితులు బహుశ్రద్ధతో ఈ గ్రంథమును అధ్యయనముచేయ నారంభించిరి. ఇందువలన ఒకవంక ప్రాచీన భారతీయ రాజ్యశాస్త్రమునకును మరొకవంక చరిత్రమునకును కూడ మేలు సమకూరెను.

అర్థశాస్త్ర రచనములో కౌటిల్యుని ఆశయములు మూడు. గ్రీకుల దండయాత్రవలన కలుషితమై, బౌద్ధ జైన మతముల తాకిడివల్ల శిథిలపరిస్థితికి వచ్చిన వైదిక మతముయొక్క పునరుద్ధరణము మొదటి ఆశయము. చిన్న చిన్న రాజ్యములతో, అసమర్థులైన పాలకులతో, ఛిన్నా భిన్నముగానున్న నాటిరాజకీయ వ్యవస్థతో కల్లోలముగా నున్న ఆ పరిస్థితులలో బలీయమైన మౌర్య సామ్రాజ్యమును స్థాపించి, విస్తరింపజేసి, తద్వారా విశాల ఐక్యరాజకీయ వ్యవస్థను స్థాపించుట రెండవ ఆశయము. అట్టి వ్యవస్థకు సమర్థుడగు రాజు కావలెను, అట్టి రాజు, తాను అనుభవించుటకు హక్కులేగాక నిర్వర్తింప వలసిన విధులుకూడ కలవని గుర్తెరిగి యుండవలెను. ఇట్టి ఉన్నతాదర్శములు రాజుల విధులలో అంతర్భాగముగ కౌటిల్యుడు చేసియుండెను. అర్థశాస్త్రమును ధర్మశాస్త్ర బంధములనుండి తప్పించుట అతని మూడవ ఆశయము.

కౌటిల్యుని గ్రంథము సూత్రశైలిలో వ్రాయబడినది. ఆ గ్రంథము రచించుటయందతడు అవలంబించిన ప్రాతిపదిక సూత్రములు మిక్కిలి ప్రధానమైనవి. అవి ఆ గ్రంథమునకు చక్కని వాస్తవికదృష్టిని, ఆచరణయోగ్యతను చేకూర్చినవి. అవియే మరొకవంక అతనిని ధర్మశాస్త్రవేత్తల దూషణతిరస్కారములకును గురిచేసినవి. ఈ గ్రంథ రచనలో కౌటిల్యుడు అవలంబించిన ప్రధాన సూత్రములు మూడు.

1. అర్థశాస్త్రమును ధర్మశాస్త్రపు సంకెళ్ళనుండి విడదీసి దానికి ప్రత్యేకస్థానము నిచ్చెను. అందువలన అనవసర సిద్ధాంత చర్చలను విడనాడుటకును, వాస్తవిక దృక్పథము నవలంబించుటకు వీలుచిక్కెను. ఇతడు సిద్దాంతములను రచించుటచేతనే తృప్తిచెందెడువాడు కాడు;

119