Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

కోపర్నికస్

4. క్రీ. శ. 1122 నాటివి. బూదపూరు, నెక్కొండ శాసనములు. వీటిలో కుమార తైలపదేవుడు కోడూరు పురము నేలుచున్నట్లు కలదు.

5. క్రీ. శ. 1162 నాటిది జడచర్ల శాసనము. ఇందు ...శ్రీ మన్మహామండలేశ్వర కందూరి ఉదయన చోడ మహారాజు వక్కాణింపబడినాడు. ఇతడు కోడూరి స్వయంభు సోమనాథదేవరకు ధర్మము చేసినట్లు కలదు. ఈ దానమునకు "కోడూరి గోకర్ణసింగ రూకలు" ఇచ్చినట్లు చెప్పబడినది. కావున గోకర్ణునకు కోడూరుతో సంబంధము క లదనియు, ఆతని పేర నాణెములు ముద్రింపబడుచుండెననియు ఆ నాణెములకు “కోడూరి గోకర్ణ సింగ రూకలు" అను పేరున్నట్లును తేలుచున్నది.

ఈ విధముగా కోడూరు పురవరమును గూర్చి శాసన లేఖనములు కలవు. అయితే ఈ రాజులు కోడూరుపురమును విడచి కందూరును రాజధానిగా చేసికొనినట్లు ఆలవానిపల్లి, జడచర్ల శాసనములు వెల్లడిచేయుచున్నవి. తెలుగు చోడుల చరిత్రలో కందూరుపురము ప్రసిద్ధి వహించినది. కోడూరును వదలినను వారు కోడూరుపుర వరేశ్వరుల మనియే చెప్పుకొనుచు వచ్చినారు. కోడూరును ఏల వదలవలసి వచ్చినదో తెలియదు. కాని కొంత ఊహించవచ్చును.

ఇప్పటి కోడూరుగ్రామ మధ్యమందు "చాళుక్య కాంతలు అగ్నిగుండము చొచ్చినతావు" అను ప్రదేశము కలదు. దానిని "బిందెము" అందురు. బిందు అనగా రక్త బిందువు. పూర్వము అమ్మవార్ల యెదుట 'బిందించెడు' వారు. అనగా జంతువులను బలియిచ్చి రక్త బిందువులు పడునట్లు చేసెడివారు. కావున బిందెము అనగా రక్తబిందువు పడినచోటు - అనగా బలి యయిన చోటని భావము. అది తుముల యుద్ధము జరిగినచోటయి యుండును. ఈ ప్రదేశమున రాతితో ఎత్తగు అరుగు కట్టినారు. పైని వీరవిగ్రహములను నెలకొల్పినారు. ఈ ఉదంతమునుబట్టి అచ్చట ప్రళయమువంటి ఘోర మహా సంగ్రామము దాపరిల్లినట్లు తోచును. ఈ సంగ్రామము ఎప్పుడు జరిగినదో, ఎందుకు జరిగినదో, వీర ప్రతివీరు లెవ్వరో తెలియదు. అయితే ఆ కాలములో పల్లవులకు, రాష్ట్రకూటులకు, చోళులకు, పశ్చిమ చాళుక్యులకు, పూర్వ చాళుక్యులకు తరచు యుద్ధములు ప్రవర్తిల్లు చుండెను. మహబూబు నగరంజిల్లా, నల్లగొండ జిల్లా యుద్ధరంగములుగా నుండుచుండెను. శత్రుపురములను దహించుటయే అప్పటి యుద్ధనీతియై యుండెను. ఆ సేనా నివహములు కోడూరు మార్గమున నడచు చుండెడివి. అట్టి యుద్ధ ప్రస్థానములందు కోడూరుపురము దారుణాఘాతమునకు గురియై యుండునని భావించినచో అది సత్యమునకు దూరముగా నుండజాలదు. ఈ సంగ్రామముల ఫలితముగా కోడూరుపురము రాజధాని గౌరవమును గోల్పోయినట్లు కనబడుచున్నది.

ఈ కోడూరు ప్రాచీన నగరమని విశ్వసించుటకు ఇచ్చట కోటలు, దిబ్బలు మొదలయినవాటి శిథిలావశేషములు కనిపించుచున్నవి. పురాతత్వ శాఖవారి దృష్ట్యా కోడూరు గ్రామము ప్రాముఖ్యము వహించియున్నది. ఇచ్చట చరిత్ర కందని శిలాయుగమునాటి ప్రాచీనజనుల శిలానిర్మితసమాధులు, వలయాకారముగ నమర్చిన గుండ్లు కోడూరుయొక్క ప్రాచీనతను వెల్లడిచేయుచున్నవి.

ఆ. వీ.


కోపర్నికస్ (1473-1543) :

నికొలస్ కోపర్నికస్ అనునతడు పోలెండు దేశపు ఖగోళ శాస్త్రవేత్త. అతడు ప్రష్యన్ పోలెండులో థారన్ అనుచోట క్రీ. శ. 1473 వ సంత్సరము ఫిబ్రవరి 19వ తేదీన జన్మించెను. 'క్రాకో' పౌరుడయిన అతని తండ్రి టోకు వ్యాపారస్థుడుగా నుండెడివాడు. నికొలస్ తన మేనమామయైన లూకాస్ వాట్జెల్‌రోడ్ అను నాతనికి దత్తుడు. వాట్జెల్‌రోడ్ అనంతరము ఎర్మిలెండ్ బిషప్పు అయ్యెను. క్రాకో విశ్వవిద్యాలయములో గణితశాస్త్రమభ్యసించి, నికొలస్ యధాలాపముగా చిత్రకళ యందుకూడ కొంత నేర్పరి యయ్యెను. నికొలస్ తన 23 వ ఏట బొలానాకు పోయి మతగురు న్యాయశాస్త్రములను జదువుచు, అచట 'డొమెనికోమేరియా నొవారా' యొక్క ఖగోళ శాస్త్రోపన్యాసములు వినెను. రోము నగరమున 1500వ సంవత్సరములో తానే స్వయముగా ఉపన్యాసము లిచ్చి మెప్పు బడసెను. 1497 వ సంవత్సరమున అతడు ఫ్రాన్‌బర్గు క్రైస్తవ దేవాలయమున మత గురువుగా నియమింపబడి, సెలవు తీసికొని, 1501వ సంవ

107