పుట:Parama yaugi vilaasamu (1928).pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము.

251


గట్టించి శ్రీరంగఘనునకుఁ దనదు
పట్టికి సకలసంపదలు నర్చించి
పరమవిజ్ఞానసంపదఁ జెంది భక్తి
పరతం ద త్పాదతాత్పర్యుఁ డైయుండెఁ
బరమమైయొప్పు నీపద్మినీకన్య
చరితంబు ధరలోన జను లెవ్వరేని
వినిన వ్రాసినఁ జదివినఁ బేరుకొన్న
నెనలేనివేడ్క నభీష్టంబు లొదవు
ననుపమం బగు సమ్మహానగరమున
వనజాతనేత్రు శ్రీవత్సాంశ మెంతె
ప్రచురవైష్ణవకులపాధోధిశీత
రుచినాఁగ కార్తికరోహిణీతార
జనియించి కవియోగి సన్నుతుం డగుచు
ననఘుఁడై తిరుపాణుఁ డనుపేరుగలిగి
యుదయ మొందిననాఁటనుండి రంగేశు
పదచింతనామృతపానంబు సేసి
తలఁపులోఁ బ్రకృతిరోదనము నోదనము
సలుపక కొలుపక జలజాక్షుభక్తి
సరవిధారకముఁ బోషకమునుగాఁగఁ
బరమయోగానంద భరితుఁ డైయుండె