పుట:Narayana Rao Novel.djvu/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౧౩

ముచ్చట్లు

వివాహము మంగళాంతమైనది. ఆ నాలుగురోజులు సుబ్బారాయుడు గారు సేలం సుందరి, వెంకటస్వామి నాయుడు, టైగరు వరదాచారి, చౌడప్ప, బలరామయ్య, హరినాగభూషణం మొదలగు గొప్ప గాంధర్వ గాయకుల రప్పించినారు. ఆడుపెండ్లి వారు సంజీవరావు పిల్లనగ్రోవిపాట, సంగమేశ్వర శాస్త్రి వీణపాట పెట్టించినారు. ప్రసిద్ధి కెక్కిన భాగవతులచే రాత్రులందు విడిదికడ హరికథలు చెప్పించిరి.

సదస్యమున కాంధ్ర దేశములో పెన్న నుండి తెలివాహా నదివరకుగల ఘనపాఠులు, కావ్యవ్యాకరణ తీర్థులు, ధర్మశాస్త్ర కోవిదులు, తార్కికులు, మహాపండితు లెందఱో విచ్చేసినారు. కవులు గాయకులు విద్వత్ బృందములు క్రిక్కిరిసిపోయినారు. సుబ్బారాయుడుగారు కాసుతో మొదలిడి నూటపదహార్ల వఱకు సంభావన లిచ్చినారు. జమిందారు గారుకూడ భూరిసంభావన లిచ్చినారు. ఆ వివాహవృత్తాంతము లాంధ్రదేశ మంతట గథలుగా జెప్పికొనిరి.

రెండువందల యేబదిమంది బ్రాహ్మణులు వంటలకు, నీరు తెచ్చుటకు, వడ్డనలకు నేర్పాటు చేయబడిరి. వంట సుబ్బయ్య గారి నలభీమపాకము జగత్ప్రసిద్ధము. ఆయన స్వయముగా మహానసాధిపత్యము వహించిరి. సమస్త పాకములలో షడ్రుచులలో నాయనిది అందెవేసిన చేయి. ఆయన వంకాయ కూర వండి పోక పొత్తిలో తొమ్మిదిరోజులు నిలువయుంచి, పదవరోజున దీసినచో నప్పటికప్పుడు వండిన కూరవలె బొగ లెగయుచు రుచికరమై, చెక్కు చెదరక యుండునట. అన్నమునకు, గూరలకు చారు పులుసులకు వేఱు వేఱుశాలలు. పిండివంటల పందిరి వేఱు. పిండివంటలకు పాలఘాటు బ్రాహ్మణుల జట్టు వచ్చినది.

స్త్రీలకు, బురుషులకు వేర్వేరు భోజనశాలలు, వడ్డనకై వేరు వేరు జట్టు లుండెను. సంబారములు జతనచేయుట కిరువదిమంది జమాజెట్టీ లేర్పరుపబడి నారు. ఇదికాక ఘనబంధువులకు వేరు వేరు వంటలు విడిగా బచనము చేయబడును.

పెరుగు బానలు నిలువ చేయుటకు గొన్ని గదులు. కూరగాయలకు గొన్ని గదులు, ప్రసిద్ధులు పదునైదుగురు తమలపాకు బీడాలు కట్టుచుండిరి.

ఐదురోజులు రెండుపూటల మూడు నాల్గు పిండివంటలు, వేపుడుగూరలు, కలగల్పులు, పప్పులు, పచ్చళ్ళు, దప్పళములు– చేసిన రకములు చేయకుండ సమారాధనలు దివ్యముగ జరిగినవి.

పెండ్లికి వచ్చిన చుట్టములకు, స్నేహితులకు, బండితులకు, నాశ్రితులకు