పుట:Narayana Rao Novel.djvu/325

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

324

నారాయణరావు

‘వదినగారి కంఠంలో ఉన్న శ్రుతి, ఎవరి కంఠంలో ఉంది?’

‘ఏమిలాభం?’

‘అదేమిటన్నా!’

‘ఏమీలేదు తల్లీ, ఏమీలేదు. శ్యామా! పాడు.’ అతని కంఠమున మారినది.

చటుక్కున శ్యామసుందరి లేచి ‘అన్నయ్యా! నీ ఆత్మ పరమ పవిత్రమైనది’ అని అన్నది. ఆమె కూర్చుండినది. శారద నారాయణరావుయొక్క ఉత్కృష్ట జీవితరాగానికి శ్రుతి కాలేకపోయినది కాబోలు. ఈ యువకుడు తన గంభీరహృదయంతో, మొక్కవోని మనస్సుతో తలవాల్చి ముందుకే నడుచుచున్నాడు. శారద ఈ పుణ్యచరిత్రుని బ్రేమించుట లేదా? అవును, అవును. ఆమెకు ఒక్కసారి మబ్బుచాటుననుండి వెన్నెల ప్రసరించినట్లయినది. శారద చరిత్ర ఇప్పుడొక్కసారిగా అవగతమైపోయినది. శారద నారాయణరావును బ్రేమించుటలేదు.

ఎందుకు ప్రేమించుటలేదు? అయ్యో, శారద ఎంత మూర్ఖహృదయ! ఎక్కడను ఈతడు తన రహస్య మిసుమంతయు నితరులకు దోపించక సంచరించుచున్నాడే. శారద! నీ వెంత దురదృష్టవంతురాలవు! నీ హృదయమున కర్కశత్వమున్నదా? నీ రూపమంతయు విగ్రహరూపమా? నీలోన నేమాత్రము ప్రేమలేకుండ నుండవలె. నీవు మరుభూమివా? ఏమి యీ విషాదము; ఈ విచిత్ర నాటిక. ఆమె భావములు వెలుగువలె ప్రసరించినవి. ఆపరాని దయ ఆవరించిపోయినది, అశ్రువులు తిరిగినవి. ఆమె మైమరచిపోయినది. తిన్నగ నారాయణరావుకడకు బోయినది.

ఆమె అతని తలను దనహృదయమున నదుముకొన్నది.

ఒక్కసారిగా ఇరువురకు దేహములు కంపించినవి. వార లిరువురి రక్తములు వేడియైపోయినవి. అప్రయత్నముగ నారాయణరావు శ్యామసుందరిని గవుగిలించుకొన్నాడు. వారిరువురు దృఢాలింగనాపరవశులైరి. శ్యామసుందరి నారాయణరావు మోమును దన వైపునకు ద్రిప్పి భక్తితో నాతని ఫాలమును ముద్దుగొన్నది. నారాయణుడు సర్వము మరచినాడు.

ఆమె శారదయైనట్లు గాఢలాలసుడగు నారాయణరావునకు దోచినది.

తక్షణ మా కౌగిలి సడలించి నారాయణుడు నిద్రమేల్కొన్న వాని భంగి, నిట్టూర్పు నించి ‘అయ్యో’ అనుకున్నాడు. గబగబ అచ్చటనుంచి రెండంగలలో క్రిందికి దిగిపోయినాడు. తిన్నగా తాను వెళ్లు దారితెలియక, చెమ్మటలు తుడిచికొనుచు సర్వమును మరచిన జడునిభంగి సముద్రతీరమును జేరుకొన్నాడు.

అప్రయత్నముగ ఆతనికి హాహాకారమగు శోకము కంఠమునుండి వెలువడినది. ఆతడు తలను బట్టికొని ఇసుకలో జదికిలబడినాడు.