పుట:Narayana Rao Novel.djvu/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

290

నా రా య ణ రా వు

షించుకున్నారు. తాత్కాలికంగా కనబడిన ఆ పరిస్థితులకు పునాది యేది? అమెరికా అప్పుయివ్వడం మానివేసింది. కోటీశ్వరుల కోట్లు కరిగిపోయాయి. ఆ కరగడం మహావేగంతో జరుగుతోంది. వర్తకాలు హుళక్కి అవడం మొదలుపెట్టాయి. ఇంక వచ్చేది ఏముంది? ప్రపంచంలో ఉన్న షాహుకార్లందరికీ దివాలా వచ్చేటట్టు ఉంది.

‘సరే, కూలివారు పైకివచ్చి రాజ్యాలు ఆక్రమిద్దాము అనుకున్నారు, ఇటలీ, జర్మనీ, ఇంగ్లాండుదేశాలలో. కాని ఇంక ఎక్కడా కూలివారిలో కట్టులేదు. కూలీలూ, సామాన్యప్రజలూ లేవడం చూచారు. ధనవంతులు హడలిపోయారు. కోటీశ్వరుడు దగ్గరనుంచి కొద్దో గొప్పో కలవాళ్ళంతా భాయి భాయి అని ఏకమయ్యారు. ఫాసిజమ్ అని కట్టుకట్టి ఒక సర్వాధికారితో రాజ్యం ఏర్పరిచారు. దానికి జాతీయ సాంఘికవాదమన్నారు. ఇక ముందు అన్ని రాజ్యాలు అల్లాగే అవుతాయి.’

‘అసలు ప్రపంచానికి వచ్చిన చిక్కేమిటో చూడు, కావలసినంత తిండి తయారు అవుతోంది. అంతా పంచితే అందరికీ పూర్తిగా ఆకలి తీరుతుంది. కాని ఎన్నికోట్లమంది ప్రజలు మలమల మాడిపోవుటలేదు? ఏమిటి ఆలోటు? తయారైన పదార్థాలని పంచేమార్గం సరిగా లేదు. ధనికవర్గం ఆ పని యేనాటికీ చేయలేదు.’

శ్యామ: పనిలేని కూలీ లెన్నికోట్లున్నారు వివిధదేశాల్లో? ఎలాగు వీరందరికీ తిండి పెట్టడం?

రోహి: మన ఆంధ్రదేశంలో జమీందారీ రైతులపని మహా అన్యాయంగా ఉన్నది కాదూ?

పర: అవునమ్మా, ఉన్నది. అన్ని జమీందారీలు అల్లా ఉన్నవా? కొన్ని జమీలు హృదయం తరుక్కుపోయేటట్టున్నవి.

నారా: 1908 సంవత్సరమునకు పూర్వమే రైతులను బలవంతం చేసి యెక్కువ శిస్తు ఏర్పరచుకొని ముచ్చిలికాలు వ్రాయించుకొన్నారు. కొన్ని కొన్ని చోట్ల ముప్పదిరూపాయల శిస్తు నేను ఎరుగుదును. ఎన్ని వేలమంది రైతులు దివాళాలు తీశారు? మా అత్తగారి మేనల్లుడొక జమీందారు. ఆయన జమీ ఎంత కంగాళిగా ఉండాలో అంతయిదిగా ఉన్నది. ఎంతమందో రైతులు బాకీలు చెల్లించలేక జైళ్ళలో ఉన్నారు. కొందరి భూములాఖరయ్యాయి. కొందరు దివాళాలు దాఖలు చేసినారు. చెంతనే ఉన్న రైతువారీ గ్రామాలస్థితి యింతకంటే నయం. ఈ జమీందారుల పూర్వీకుల కాలంలో శిస్తులు యింత అన్యాయముగా ఉండేవికావు.

పర: కొన్ని జమీందారీలలో, ఈనాం, మొఖాసా గ్రామాలలో (అసలు మొఖాసాదార్లు, ఈనాందార్లు మాయమైపోయారు) పంటలు పండనిరోజులలో,