పుట:Narayana Rao Novel.djvu/287

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

286

నా రా య ణ రా వు

కడకు బోయి యామె పాదములపై దన మోమునుంచి కన్నీటిచే వానిని దడిపినాడు.

నిజముగ నొక బాలికతో నాతడు రెండు మూడుసారులు ఆవేశపూర్ణము, భయంకరము నగుకలయిక ననుభవించి యథోలోకమున బడినాడు. ఆమెభర్త మోటువాడు. ఆ బాలిక భర్తయెడ హృదయమున నసహ్యించుకొనుచుండియు, తెచ్చి పెట్టుకొనిన హాసముచే మోము వైవర్ణ్యము చెంద, నాతనితో కాపురము చేయుచున్నది. చిన్నతనమునుండియు బరమేశ్వరుని ప్రేమించినది. ఆమెయే పరమేశ్వరునిపై దనకు తమియున్నదని భావము ప్రకటనజేయుచుండినది. ఆ బాల చక్కని యవయవస్ఫుటత్వము కలిగి, యందముగ నుండును. పరమేశ్వరుడు పంకిలజీవితుడైనా డామెతో.

పరమేశ్వరుడు సంపూర్ణముగ నథోలోకవాసి కాకుండ నాతని రక్షించునది సౌందర్యపిపాసాపూర్ణమగు నాతని హృదయమే! అందమయిన వనిత కానిచో నాతనికి మనస్సు చలింపదు. ఆ వనిత చుట్టునున్న విషయములు నందమైనవి కావలెను. భావము నైన అపశ్రుతి కానరాగూడదు. కావుననేయాతడు ఒక్కబాలతో మాత్రము భౌతికానంద మనుభవించినాడు. ఆ సంతోషము పంకిలమైనదను అపశ్రుతియే ఆతని గలంచివేయ అచ్చటనుండి పరనారీసాంగత్యము సంపూర్ణముగ మానినాడు.

రోహిణీదేవితో నాతడు స్నేహము చేయుటకు వీలుకలిగినప్ప డా బాలికకు దనహృదయము సమర్పించుకొన్నాడు. రోహిణీదేవియు బరమేశ్వరు డన్న హృదయాంతరమున గలగిపోవునది. అతనిమాట లామెకు మైమరపు కలిగించును, హృదయములో మధురిమలు ప్రవహించును. అతని కోర్కెయు నామె కవగతమైనది. ఆమె భయమును జెందినది, పరవశయునైనది. ఇట్టి యశోవంతు డాతని ప్రేమనంతయు దన పాదములకడ ధారపోయుచున్నాడన్న మోద మామెను గరగించివేసినది. వీలయినప్పుడెల్ల నాతని నొంటిగా గలసికొనునది. అక్కగారు వైద్యవిద్యాలయమునకో, వైద్యశాలకో పోయినప్పుడు తన స్నేహితుడగు నారాయణరావు రాకుండ పరమేశ్వరుడొక్కడే వచ్చువాడు.

కాని రోహిణి ధర్మహృదయ. ఆతడు వివాహితుడు. భార్యతో సుఖముగ గాపురము సేయుచున్నాడు. తా నవివాహిత. కావున పరమేశ్వరుని గీతదాటి రానివ్వకూడదని దృఢనిశ్చయయై యానాటి నుండి నిర్మలమగు ధైర్యముతో నాతని ప్రేమయు పూజను గైకొని యానందించునది. అట్టి ప్రేమను పెరగనిచ్చినచో తా మిరువురుకూడ గీచుకున్న గీతలుదాటి, పరవశులై ఐక్యమే పోవలసివచ్చునేమో యన్న భయ మామెకు గలుగలేదు.

పరమేశ్వరునకు నామె యభిప్రాయము తెలిసి, యతిజాగ్రత్తగనే యుండెను, ఆశాప్రవాహములోనికి దా నతివేగమున లాగికొనిపోబడుచున్నాడనని యాతడు గ్రహింపలేదు.