పుట:Narayana Rao Novel.djvu/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

228

నా రా య ణ రా వు

‘ఆ ఏమిటి! తర్వాత తర్వాత.’

‘తర్వాత నీ కొర కొక సిద్దీ కబురు తెచ్చాడు. రహస్యమార్గాల వెంట నువ్వు కోటలోకి వెళ్ళావు. ఒక సిద్దీ బానిసబాలిక నిన్నో మందిరంలోకి తీసుకు వెడితే, అక్కడ ఒక చక్కనిచుక్క పరిశియాబాలిక, అందం ఒలికిపోతూ ఉన్న దేహాన్ని పట్టియిచ్చేడక్కా వస్త్రాన్ని కట్టుకొని, ఒరగిలి, ఒయారంగా పడుకొనిఉంటే, నువ్వు చూసి ఆనందమూర్తివై ఆమె పాదాలకడ వాలావుట. ఆమె తన దానిమ్మపువ్వులాంటి పెదవుల్ని విరుచుకొని, గబుక్కున లేచి, ఎవరు నువ్వు, ఇక్కడకు ఎందుకువచ్చావు అని చప్పట్లు చరిచిందిరా.’

‘కథలు చెప్పటంలో మా నాన్నగారి తర్వాత నువ్వేరా! నన్ను గురించిన కథ వినడానికి నాకే ముచ్చటగా ఉంది. తర్వాత చెప్పమరి, మొండి తేలు కుట్టుకుండా ఉండాలంటే.’

‘చప్పట్లు కొట్టిందో లేదో, ఎక్కణ్ణుంచి వచ్చారో యమభటుల్లాంటి వాళ్ళిద్దరు సిద్దీలు–నాలుగు బెత్తల వెడల్పు ఉన్న కరవాలాలు పుచ్చుకొని. నువ్వు గజగజలాడావు.’

‘అమ్మయ్యా!’

‘వీణ్ణి లాక్కెళ్ళి పాతాళగృహంలో ఇనపకొట్టులో వెయ్యండి అందామె. నిన్ను తీసుకొనిపోయి అల్లాగే ఇనపకొట్టులో పడేశారు.’

‘ఆ అవతారములో కూడ ఖైదే మనకు?’

‘ఆ! ఇంకా ఎన్ని అవతారాలలో ఖైదో. ఇనపకొట్టులో వేసి నీళ్ళు, రొట్టీమాత్రం ఇస్తూఉండేవారు. నాలుగోరోజున రాత్రి పన్నెండు గంటలకు నవాబుయొక్క నాలుగువందల ఒకటోరాణి కావడానికి చూస్తూఉన్న ఆబాల, కటకటాల తలుపులు తీసి, లోపలికివచ్చి, నిన్ను కౌగలించుకొని ముద్దు పెట్టుకొంది. నువ్వు తెల్లపోయి సంతోషంతో ఒళ్ళు మరిచావు. భోజనం అదీ దిట్టంగా పెట్తూఉండేది, రాత్రిళ్లు నీ కొట్టులోకి వచ్చేది, లేదా తన శయన మందిరానికే తీసుకొనిపొయ్యేది. ఒకరోజున నవాబుకు ఈ సంగతి తెలిసింది. మహానుభావుడు కాబట్టి తన కక్కర లేదని ఇద్దర్నీ...’

‘నరికించేశాడా!’

‘అంతేనా మరి? ఏనుగులచేత తొక్కించడానికి ఆజ్ఞ యిచ్చాడు. తర్వాత నవాబుకు పాంచాలంలో రాజులు తిరగబడ్డారని వార్త వచ్చింది. మీ ఇద్దరి గొడవా మరచిపోయి సైన్యాలతో వెళ్ళాడు. కాపలాఉన్న వాళ్ళకు లంచాలిచ్చి మీ రిద్దరూ దక్షిణదేశాలకు పారిపోయి కృష్ణదేవరాయల కొలువులో చేరారుట.’

‘మంచి కథరా!’

‘ఢిల్లీ నుండి బయలుదేరి మధుర, బృందావనము, ఇంద్రప్రస్థము, కురుక్షేత్రము, హస్థినాపురము మొదలగు దివ్యక్షేత్రములన్నియు జూచినారు.