రైలు ప్రయాణాలకు ఆటంకాలు కల్పించబడే పరిస్థితులలో నడిచే వెళ్ళి తీరాలనే విషయం సుస్పష్టం చేయబడింది. మన రాష్ట్రంనుండి చాలామందే వెళ్ళారు. రైలు ప్రయాణానికి చాలామందికి అడ్డంకులు కలుగజేయబడ్డాయి. అడ్డంకులు కలిగిన ప్రాంతంనుంచి కాలినడకనే మనవాళ్ళందరూ ప్రయాణాలుచేసి ఆ జెండా సత్యాగ్రహంలో పాల్గొన్నారు.
ఒక ఉదాహరణ
నాకు భమిడిపాటి సత్యన్నారాయణగారి అవస్థ ఇంకా జ్ఞాపకం ఉండిపోయింది. పెక్కు ఉద్యమాల అనంతరం ఆయన కొంతకాలంగా[1] నరసాపురంలో ప్లీడరుగా ఉంటున్నారు. ఆయన ఆరోజులలో నాగపూరు సత్యాగ్రహంలో పాల్గొనడానికి గాను, తనకు తప్పని సరిగా కావలసిన బట్టలు వగైరాలన్నీ ఒక గంపలో నెత్తిన పెట్టుకుని, మొత్తం దూరం అంతా కాలినడకనే నడచి వెళ్ళారు.
ఇతర రాష్ట్రాలుకూడా ఈ సత్యాగ్రహ సమరానికి ఇతోధికంగానే వాలంటీర్లను పంపించాయి.
అప్పట్లో అలముకొనిఉన్న నిరుత్సాహ పరిస్థితులలో కూడా నాగపూరు జెండా సత్యాగ్రహ సమరం బ్రహ్మాండంగానే సాగింది. ప్రభుత్వం వారు తమ ఓటమిని ఒప్పుకుని, దేశీయులు తమ జెండాను నిరభ్యంతరంగా ఏ అడ్డంకులూ లేకుండా ఎగుర వేసుకో వచ్చునని అనుజ్ఞ యిచ్చే పర్యంతమూ, ఈ యుద్ధకాండంతా జోరుగానే నడిచింది.
నాయకులకు, ప్రజలకూ పరస్పరం విశ్వాసం కుదిరి, నాయకులు తమ కీచులాటలను తగ్గించుకుని నడిపించగలిగిననాడు సహకార నిరాకరణ ఉద్యమంకూడా విజయవంతం అవుతుందని 1923 నాటి నాగపూరు జెండా సత్యాగ్రహ సమరం రుజువు చేసింది.
- ↑ తరవాత (1967) వకీలుగా తూర్పుగోదావరిజిల్లా రాజోలు కాపురస్థులు.