28 కవికోకిల గ్రంథావళి [స్థలము నాలుగు
అగ్బ : అట్లేకానిమ్ము.
తాన్ : అయ్యో! మీరీ వట్టినేల యెట్లు నిద్రింతురు ?
[మూటలోని గుడ్డనుతీసి పడక వేయును.]
అగ్బ : [పడకపై కూర్చుండి] ఆహా ! యీపాంథశాల యెంత గభీర సత్యమును బోధించుచున్నది. ఉమ్రఖయ్యాము రుబాయిని తలంపునకు తెచ్చు చున్నది.
అంతములేని యీభువనమంత పురాతన పాంథశాల, వి
శ్రాంతి గృహంబు; నందు నిరుసంజలు రంగులవాకిళుల్; ధరా
క్రాంతులు పాదుషాలు, బహరాం జమిషీదులు వేనవేలుగాఁ
గొంత సుఖించి పోయిరెటకో పెఱవారికిఁ జోటొసంగుచున్.
ఇచట; నున్నంతవఱకె మనదనియెడి భ్రాంతి. తరువాత సుకృత దుష్కృతములు తప్ప వేఱొండు మనల నంటిరాదు. ఇట్లయ్యును జీవితాశ సహజముగ నుండుట వింతగదా ?
తాన్ : భగవంతుఁడు బ్రాంతియనెడు పుష్పహారముచే విశ్వసంసారమును బంధించి యున్నాఁడు.
అగ్బ : కావుననే బంధము గూడ ప్రియమైనది.
[పాంథాశాలలోని యాత్రికులు వెడలుచుందురు]
వెంకట : [తాన్సేన్ తట్టుతిరిగి] ఏమండోయ్, మీరింక సుఖంగా పండుకోవచ్చును. మేము వెళ్ళుతున్నాం.
తాన్ : అయ్యా. మీరేదేశస్థులు ?
వెంక : [స్వగతము] తస్సాదియ్యా, బాగా డాబుసరిగా చెబుతాను. [ప్రకాశముగ] నేనా ? ఆంధ్రుణ్ణి.