ఈ విషయాలన్నీ కోనంగి తెలుసుకున్నాడు. కోనంగీ, డాక్టరు రెడ్డిగారూ కలిసి రంగయ్యంగారి వకీలయిన వరదరాజయ్యంగారితోపాటు అప్పటికి బాగా పేరుపొందిన ఆంధ్ర వకీలయిన గోపాలరావుగారిని ఏర్పరచారు.
రంగయ్యంగారు వ్రాసిన విల్లులో రంగయ్యంగారి అన్నగారి దస్కత్తులేదు. కాని కోనంగి రంగయ్యంగారి కాగితాలన్నీ వెదుకుతూవుంటే ఆయన అన్నగారు వెంకటేశయ్యం గారు వ్రాసిన ఉత్తరాలు దొరికాయి. ఆ ఉత్తరాలలో రంగయ్యంగారూ, వెంకటేశయ్యంగారూ పంచుకున్నట్లు స్పష్టంగా వొప్పుకుంటూ వున్నట్లున్నది.
వెంకటేశయ్యంగారి పెద్ద కుమారుడు అనంతకృష్ణయ్యంగారు మర్నాడు తన తమ్ముడు తనకు రాసిన ఉత్తరాలకట్ట పట్టుకువచ్చాడు. ఆ కట్టలో అనేక ఉత్తరాలలో అతడు తన తండ్రికీ పినతండ్రికీ పంపక మయిందని వప్పుకున్నట్లూ, జయలక్ష్మి ఆ భూములు అనుభవించడం వొప్పుకున్నట్లూ స్పష్టంగా వుంది.
అవన్నీనీ, ఇతర దస్తావేజులు అన్నీ చూస్తే పాలుపంపకాలున్నట్లూ, అలా భూములూ, ఇల్లూ అమలు అవుతున్నట్లూ, దానిలో రంగయ్యంగారి భాగం జయలక్ష్మికి దఖలు అయినట్టూ, ఆమే అవి అనుభవిస్తున్నట్లు స్పష్టమయిపోయింది.
చెట్టియారుగారు వేసిన వ్యాజ్యంలో రంగయ్యంగారు రాసిన విల్లు లా ప్రకారం చెల్లదనీ, అందుచేత ఆ విల్లు లేనట్లే అవుతుందనీ, అలా విల్లు లేక ఆస్తి అన్యాయంగా అనుభవించే జయలక్ష్మికి హక్కు వుండదనీ, భావంచేత వెంకటేశ అయ్యంగారి రెండవ కుమారుడైన శ్రీనివాసయ్యంగారు మొదటి ప్రతివాది హక్కు వొప్పుకొన్నట్ల, దానికి న్యాయశాస్త్ర దృష్ట్యా ఏమీ తాహతు లేదనీ వుంది.
- ఈ పనంతా కోనంగి చక్కబెడుతూ తనకున్న దస్తావేజులకు జాబితా, వానిలో వుండే సారాంశమూ రాస్తూ వుంటే, అతనికి అనంతలక్ష్మి ఎంతో సహాయం చేస్తూ వున్నది.
“మీరు ప్లీడరుగారు, నేను గుమాస్తానూ కాదూ?”
"కాదు లక్ష్మీ నేను పెద్ద వకీలును, నీవు చిన్న వకీలువు!”
“ఆమ్మో! నాకు న్యాయవాదం చదవాలని లేదండీ గురువుగారూ!”
“నాకు మాత్రం మహావున్నట్లు, న్యాయవాద విద్య నేను చదవలేదు. చదవదలచుకోలేదు.”
“మీలో ఆ శక్తి వుంది;”
“నీలో లేదా?”
“నాలో గుమాస్తా శక్తి వుంది!”
“నాలోనూ అంతే. నేను హెడ్ గుమాస్తాను, నువ్వు నా సహాయకురాలవు.”
“మీకు మావ్యాజ్యాల గొడవ ఎందుకు?”
“మా ఆవిడ వ్యాజ్యాలు నావి కావా?”
“ఏమిటి! అయితే, నేను చేసేవంటకు మీరు సహాయం చేస్తారా?”
“ఓ! భోంచేయడం!”
“అయితే నేను వంటే చేయను.”
“నువ్వు వంటచేయని భోజనం నేను ఆరగిస్తా?”
“ఎల్లాగు?”
“నిన్ను తనివార ముద్దు-”
“అఁ ఆఁ!”