పుట:Kasiyatracharitr020670mbp.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాశీయాత్ర చరిత్ర

పిప్పర అనే ఊరు మజిలీలాయఖు అయినదే. దుకాణందారుల కొట్టాయీలలోనే దిగినాను. బియ్యము అతి ప్రయత్నముమీద దొరికినది. చింతపండు ఎంత ప్రయత్నము చేసినా సాధ్యమయినది కాదు. రామటెంకి మొదలు రాతివుప్పు మాత్రము దొరుకుచున్నది గనుక మెత్తగా విసిరి శాకములలో కలపవలసినది. ఈదేశములొ చింతపండుకు బదులు ఆముచూరు అనే మామిడివరుగు వాడుకొనుచున్నారు. నింమపండ్లు మాత్రము పట్టితావున దొరుకుచున్నవి. యీయూరిలో యీ రాత్రి వసించినాను.

6 తేది ఉదయాన 5 ఘంటలకులేచి యిక్కడికి నాల్గు కోసుల దూరములో నుండే తిలవారా అనే ఊరును దారిలో నర్మదా మహానది దాటి 9 ఘంటలకు ప్రవేశించినాను. ఇక్కడ 200 మంది యెక్కే పడవ ఒకటిన్ని 50 మంది యెక్కే చిన్న పడవ ఒకటిన్ని ఉన్నది. ముందు యిటువంటివి ఈ నర్మదామహానది రేవులో అనేకములుగా నుండినవి. అయితే యిటు తర్వాతను 2 సంవత్సరముల కిందట అకస్మా త్తుగా ప్రవాహము వచ్చి రేవున నున్న పడవలన్ని కొట్టుకొని పోయినందున ఇప్పుడు కుంఫిణెవారు రెండు చేయించి వేసి ఘాటు సుంకము సంవత్సరము 1 కె 30 రూపాయీలకు ఒక ఆసామీకి గుత్తకిచ్చినారు. వాడు మనిషికి ఒక పయిసా, గుర్రానికి 1 అణా ఈవంతున హాశ్శీలు తీస్తాడు.

ఈనది పశ్చిమ వాహిని సుమతి అనే పశ్చిమ సముద్రతీరపు గ్రామమువద్ద సాగరసంగమవుచున్నది. యిక్కడికి ఆ సంగమప్రదేశము రెండు నెలల ప్రయాణ మున్నది. అమరకంటక మనే ప్రదేశములో వెదురుపొద మధ్యే యీనది పుట్టినది. ఆ మహాస్థలము ఇక్కడికి 20 దినాల ప్రయాణముంచున్నది. ఈనది మహిమ యేమంటే ధృవమహారాజు యాగము చేసినప్పుడు ఋత్విక్కులుగా వచ్చిన మహాపురుషులు యాచనమీద సాంబమూర్తిని తపస్సుచేత సంతొషపెట్టి భూకిలో ఎక్కడా నదులు లేక నుండగా పశ్చిమ వాహినిగా ఒక నది కావలె నని ప్ర్రార్ధించి సాంబమూర్తియొక్క అర్ధ దేహాన్నే ప్రవహించేటట్టు చేసుకొన్నారు.