పుట:Gopinatha-Ramayanamu1.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

రయంబునం జని పురోహితుఁ డగువసిష్ఠుని వేదపారగు లైనసుయజ్ఞవామ
దేవజాబాలికాశ్యపులను మఱియుం దక్కినబ్రాహ్మణోత్తముల రాజప్రియ
చికీర్షుల రాజసకాశంబునకుం దోడ్కొని వచ్చిన నద్దశరథుం డమ్మహాత్ముల
నుచితసత్కారంబులఁ బ్రీతులం జేసి మృదుపూర్వకంబుగా ధర్మార్థసహితం బగు
వాక్యంబున ని ట్లనియె.

229

దశరథుండు పుత్రార్థ మశ్వమేధచికీర్షుఁడై వసిష్ఠాదులతో నాలోచించుట

తే.

వరసుతార్థము పెక్కుసువ్రతము లేను
జాలఁ జేసియు వడయంగఁ జాల నైతి
ననఘమతులార యిపుడు మీయనుమతమునఁ
బూని హయమేధ మొనరింప బుద్ధి వొడమె.

230


క.

కావున హయమేధం బేఁ, గావించెద శాస్త్రదృష్టకర్మంబున నా
కేవిధిఁ దనయుని వడయం, గా వలనగు నట్టితెఱఁగు ఘటియింపుఁ డిఁకన్.

231


చ.

అని జనభర్త పల్కుటయు నమ్మునినాథులు తన్ముఖేరితం
బును బరమార్థసాధన మమూల్యము నైనతదుక్తిఁ గౌశలం
బును విని కౌతుకంబు ముదముం జెలువార బహూకరించుచున్
మనుజవరేణ్యుతో సనిరి మానుగ వెండియు మంజులోక్తులన్.

232


చ.

క్షితివర నీతలంపు పరికింపఁగ మంచిది దీన నీదువాం
ఛితము ఫలించు నిక్కముగఁ జెప్పెడి దే మిఁకఁ దత్ప్రయత్నముం
జతురతఁ జేయు మశ్వమును సత్వరత న్విడిపింపు మాప్తసం
యుతముగ యజ్ఞశాల సరయూత్తరమందు రచింపు మింపుగన్.

233


చ.

అన విని భూమిభర్త ముద మంది యమాత్యులఁ జూచి వారి కి
ట్లను గురువాక్యపద్ధతి మఖాశ్వము నుగ్రబలాన్వితంబుగా
నొనరిచి చెచ్చెర న్విడువుఁ డొప్పుగ నాసరయూతటంబునన్
ఘనతరశాస్త్రసమ్మతముగా రచియింపుఁడు యజ్ఞవాటికన్.

234


వ.

మఱియుఁ గల్పోక్తప్రకారంబున యథాశాస్త్రంబుగా యజ్ఞవిఘ్ననివారకకర్మం
బులు నిర్వహింపుఁ డీయజ్ఞంబునందు మంత్రలోపక్రియాలోపాద్యపరాధంబులు
గలుగకుండెనేని యీయజ్ఞంబు సర్వమహీపతులచేతఁ బ్రాపించుటకు శక్యం బై
యుండు విద్వాంసులు బ్రహ్మమునుంబోలె విద్వాంసు లగు బ్రహ్మరాక్షసు లిందు
ఛిద్రం బన్వేషించుచుండుదురు వారివలన యజ్ఞంబు నిహతం బయ్యె నేని
యజ్ఞకర్త నశించు మీరు సమర్థులరు గావున నట్టివిఘ్నంబు లెవ్వియుఁ గలుగ
కుండుశాస్త్రదృష్టవిధానంబున యజ్ఞంబుఁ బరిసమాప్తి నొందించునట్టి
భారంబుఁ బూనవలయు నని పలికిన నయ్యమాత్యులు మహీరమణుని వచ
నంబుల కలరి దేవా భవత్ప్రసాదంబున నెల్లపనులు గొఱంత పడకుండ నిర్వ