పుట:Gopinatha-Ramayanamu1.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


హుండును దీర్ఘదర్శియు మహాతేజుండును బౌరజానపదప్రియుండును నిక్ష్వాకు
శ్రేష్ఠుండును యాగశీలుండును ధర్మరతుండును నియతేంద్రియుండును మహర్షి
కల్పుండును రాజర్షిముఖ్యుండును ద్రిలోకవిశ్రుతుండును బలవంతుండును జితా
మిత్రుండును సుమిత్రవంతుండును విజితేంద్రియుండును శక్రవైశ్రవణసంకాశుం
డును నై ప్రసిద్ధి వహించినవాఁడు మఱియును.

209


క.

అనిమిషపతి సురలోకం, బనువుగఁ బాలించుభంగి నన్నరపతి మే
దినిఁ బాలించుచునుండును, మను విక్ష్వాకుండువోలె మంజులఫణితిన్.

210


తే.

ఆమహారాజమౌళి కర్ధాంగు లగుచు, గరిమతో సర్వమంగళాఖ్యాతి వడసి
వరసతీత్వవిశేషవిస్ఫురణఁ బొల్తు, రెలమి మున్నూటయేఁబండ్రు జలజముఖులు.

211


తే.

మించి కౌసల్య గైక సుమిత్ర యనఁగ, హంసగతి సతీజలజాతహస్త లగ్ర
సతులు గల రందు మువ్వు రాసకలలోక, ధవున కారాజమౌళి కాదశరథునకు.

212


క.

ఆరాజవరున కభిరత, కారులు ఋత్విజులు మునులు గల రిరువురు సొం
సారఁగ వసిష్ఠుఁ డనఁగా, ధీరోదారుండు వామదేవుం డనఁగన్.

213


చ.

వినయవరు ల్వివేకగుణవిశ్రుతిధన్యులు మంత్రకోవిదుల్
జనపతికార్యసాధనవిచారసమర్థులు శత్రుమర్మభే
దనసదుపాయధుర్యు లతిధార్మికు లుత్తము లష్టమంత్రు లా
ర్యనుతులు సత్యవాదులు మహామహులుం గల రాజితారికిన్.

214


తే.

అర్థసాధకవిజయసిద్ధార్థదృష్టి, మంత్రపాలకాశోకసుమంత్రులును జ
యంతుఁ డనుపేర్ల నొప్పగునట్టివారు, ధన్యులు సునీతిపరులు ప్రధానవరులు.

215


తే.

క్రోధమున నైనఁ గామంబుకొఱకు నైన, నర్థకారణమున నైన ననృత మాడ
రన్యులం దైన స్వజనులం దైన వారి, కవిదితం బైన కార్య మింతైన లేదు.

216


తే.

సంతతముఁ జారముఖమున సర్వరాష్ట్ర
కృత్యము లెఱింగి హితశత్రువృత్తిఁ దెలిసి
పరులకలిమియు లేమియు నరసి యభయ
మొసఁగి వ్యవహారకుశలు లై యుందు రెపుడు.

217


తే.

తప్పు గలిగినవేళ నందనుల నైనఁ, గూర్మి విడిచి దండింతురు ధర్మభీతిఁ
దప్పు లేనిచో సరి నైన నొప్పు విడిచి, కడిమి దండింప రెంతయుఁ గలుషభీతి.

218


క.

సతతంబు విషయవాసులు, వ్రతశీలుర శుచుల నరసి రక్షించుచు దు
ర్మతుల వెదకి శిక్షించుచు, క్షితిపతికోశాభివృద్ధిఁ జేయుదు రెలమిన్.

219


చ.

పురుషబలాబలం బెఱిఁగి పొందు ఘటించుచు వర్ణధర్మముల్
దఱుఁగక యుండునట్లు సతతంబును బ్రోచుచు నేకబుద్ధులన్
వెరవరులం దగం బనులవెంటఁ జరింపఁగఁ బంపుచున్ మహీ
వరునకుఁ గీర్తిలాభవిభవంబులఁ దా రొనఁగూర్తు రెంతయున్.

220