పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

296

గోన గన్నా రెడ్డి

వారు తనకు సహాయం చేయడానికి వీలులేదు. భోజనసామగ్రి అయిపోయినది. లక్షలకొలది క్షతగాత్రులైన బలగాలతో ఈ రాక్షసి ఆంధ్ర మూకలతో పోరాడుట ఎట్లు?

కవుల మాటలు అన్నీ పొగడ్తలే! తనకు భయపడి, ఆంధ్రులు ఆడదాన్ని సింహాసనం ఎక్కించారట. ఆడదాన్ని తానేమీ చేయనని వారికి ధైర్యమట! ఆలాంటివాడు తాను ఆడదానిమీదకే మహావీరుణ్ణని వెళ్ళినాడే! అబ్బ! రాజ్యతృష్ణ! రుద్రమ్మ ఆడదా? బ్రహ్మరాక్షసి! మహామారి! కాళరాత్రి! చీల్చిచెండాడి వెంట తరుముకు వచ్చింది ఆంధ్ర రుద్రమ్మ! ఏమి యుద్ధం! ఏమి పరాక్రమం! ఎంత నిర్వహణశక్తి! ఎంత వ్యూహరచనా చమత్కృతి! తన బలగాలు నాశనం కాకూడదు. విరోధి బలగాలు నుగ్గయి పోవాలి. చాలు; ఇక తనకు బుద్ధి వచ్చినది. కందిరీగలపుట్ట, ఆంధ్రులకు కోపం తెప్పించకు తండ్రి! అని తండ్రి చెప్పితే తాను విన్నాడా? వినక, తెచ్చుకున్నదీ విపరీతమయిన పరాభవం. ఇంతవరకు ఎన్నడైనా తాను కూర్చుకొని వెళ్ళిన మహాసేనలవంటి సేన కూర్చుకొని ఎత్తిపోయిన వీరులున్నారా?

తాను రుద్రమ్మ కెదురుపడక తనసైన్యాలతో ఏకొండలలోకో వెళ్ళిపోతే తనంటే ప్రజలకు గౌరవమూ, భక్తీ పూర్తిగా నశించిపోవును. మరి రెండు మూడు దినాల ప్రయతించుద మనుకుంటే, ఇంకా కొన్ని వేలమంది నాశనం అయిపోతారు.

మహాదేవరాజునకు మతిపోయినది; గౌరవం నాశనమయింది. పదిమందిలో తలయెత్తుకోలేడు, అందుకు తగినట్లు తాను రుద్రమదేవికి లోబడిపోతే ఇంకా తన్ను ఆమె ఏలాటి అగౌరవాలకు లోనుచేస్తుందో?

ఆయన, తనకు నమ్మకమయిన భవానీభట్టును, రుద్రదేవి సకలసేనాపతి అయిన చాళుక్య వీరభద్రునికడకు పంపినాడు.

ఆ రాయబారితో కలసి శ్రీ చాళుక్య వీరభద్రమహారాజు రుద్రదేవచక్రవర్తి దర్శనము చేసినారు. రాయబారి భవానీభట్టు మహాదేవరాజు ప్రతినిధిగా ఆంధ్ర చక్రవర్తియెదుట మోకరిల్లి “మహారాజాధిరాజా! మహాదేవప్రభువు తమ తప్పునకు విచారిస్తున్నాడు. విధిదుర్విపాకంవల్ల కన్ను గానక, ఆంధ్ర మహాసామ్రాజ్యము ఇట్టె వశమయిపోతుందనే ఆశతో, పెద్ద ఎత్తుగా జైత్రయాత్రకు వచ్చినారు. తమ పాదాల వ్రాలిక్షమార్పణ వేడి, శిక్షవిధించమని కోరుతున్నారు” అని మనవిచేసినాడు.

రుద్ర: భవానీభట్టుమంత్రీ! పాములను, దుష్టజంతువులను, రాక్షసులను క్షమించి లాభంలేదు. ఎప్పటికప్పుడు నాశనం చేయవలసిందే! అయినా తోటి దేశపాలకుడు, మా తండ్రిగారికి మిత్రుడయిన కృష్ణభూపతి కొమరుడు - అందుకని మేము మీరాజును ప్రాణంతో విడుస్తున్నాము.

భవానీ: చక్రవర్తీ! మేమందరము మహాప్రభువులకు యెంతోకృతజ్ఞులము.