ఏకాదశగాథ
శివదేవయ్య
1
వచ్చిపడ్డాడు మహాదేవుడు. అతని ముట్టడి వేళకు ముహూర్తము కట్టి శివదేవయ్య విప్పారిన మోముతో, చిరునవ్వుతో తల పంకించాడు. శివదేవయ్య విశ్వేశ్వర శంభువునకు శిష్యుడు. గణపతి రుద్రదేవ చక్రవర్తి కూడా విశ్వేశ్వర శంభువునకు శిష్యుడు. విశ్వేశ్వర శంభువు గోళకీ మఠాధిపతి. వంగదేశమందలి దక్షిణ రాధామండలంలోని పూర్వగ్రామ నివాసి. విశ్వేశ్వరశంభువు గోళకీ మఠాధిపతులలో నేడవవాడు. గోళకీమఠము లకులేశ్వర సంప్రదాయానికి చెందిన మఠము. లకులేశ్వరుడు మాళవుడు. ఆంధ్ర శైవాగమవేత్త అయిన అమరేశ్వరుని శిష్యుడు. అమరేశ్వరుడు క్రీస్తుశకారంభమునందు ధాన్యకటకమునకు అనతిదూరంలో కృష్ణా తీరంలో ఉన్న అమరేశ్వర మహాక్షేత్ర నివాసి, వీ రిరువురు సాక్షాత్తు శివుని అపరావతారులనే ప్రతీతి.
అమరేశ్వరము నిర్మించినది దూర్వాసమహర్షి యట. ఆ మహర్షి పాశుపతము, కాలాముఖము అని పేరు పొందిన అతి పురాతన శైవసంప్రదాయము ఆంధ్రదేశము నందు నిర్మించెను. ఈ సంప్రదాయము సింధునదీ తీరాన క్రీస్తుపూర్వం ఆరువేల సంవత్సరములపై నుండి వర్ధిల్లి ఉన్నది. ఆది వేదములంత ప్రాచీనమని మహర్షులంటారు. సింధుతీరవాసులు కృష్ణా గోదావరీ తీరాలకు వలసవచ్చినప్పుడు తమతో ఈ శైవసంప్రదాయాన్ని కూడా తీసుకొనివచ్చి కడలిపురంలో, కృష్ణపురంలో, కురంగపురంలో, శ్రీశైలంలో, అమరేశ్వరంలో, ద్రాక్షారామంలో, మంత్రకాళేశ్వరంలో పట్టీస్వరంలో మఠాలు ఏర్పాటుచేసిరి.
ఆలాంటి మహోత్తమ సంప్రదాయానికి చెంది, గోళకీ మఠాచార్యుడైన శివదేవయ్యమంత్రి ఆంధ్రారాధ్య నియోగి బ్రాహ్మణుడు. ఈ గోళకీమఠం మొదట స్థాపించినది సద్భావశంభువు. ఈయన శిష్యుడు సోమశంభువు. ఈ మహాశైవుడు అనేక గ్రంథాలు రచించి ప్రఖ్యాతి కన్నాడు. ఈ యన శిష్యుడు వామశంభువు. ఆయన శిష్యుడు శక్తిశంభువు. శక్తిశంభువు శిష్యుడు కీర్తిశంభువు. వీరి శిష్యుడు విమలశంభుడు. ఆయన శిష్యుడు ధర్మశంభువు. ధర్మశంభువు శిష్యుడు విశ్వేశ్వర శంభువు.
ఈ గోళకీ సంప్రదాయానికి మొదట మఠము హిమాలయ పాదమైన గోమతీతీర త్రిపురి మహానగరము. ఈ మఠము త్రిపురికి దాపుననున్న గోళకి