పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దశమగాథ

యాదవులు

1

యాదవమహారాజు తనసైన్యంతో పది గవ్యూతులన్నా ప్రతిష్ఠాన నగరం దాటి రాలేకపోతున్నాడు. గోన గన్నారెడ్డి, మహాదేవరాజు ఆరు లక్షల సైన్యాన్ని అడుగు కదలనీయడు. అంతగా శత్రువుల ఒత్తిడి ఎక్కువైతే పదిఅడుగులు వెనక్కు వేస్తాడు. ఇరువాగులవారికి ఒక్క గౌతమీదేవి కాపుకాస్తున్నది. అన్నీ కొండలు, గుట్టలు, అరణ్యాలూ, ప్రతిగుట్టా, ప్రతికొండా, ప్రతిసెలయేరూ, ప్రతిఅడవీ గన్నారెడ్డికి కాపుదలగా ఉన్నవి. జగన్నాథరథంలా సాగిపోవలసిన యాదవసైన్యం అడుగడుక్కు విఘ్నం. అయ్యో చేసేదేమిరా అన్నట్లుగా ఉన్నది.

మహాదేవరాజు కోపం మిన్నుముట్టుతూవుంది. తా నిలా జైత్రయాత్ర సాగిస్తే ఎన్నాళ్ళకు ఓరుగల్లుపోవడం? యుద్ధవ్యూహాధ్యక్షుడు, సేనను చొప్పించుకు పోయే మగటిమి కలవాడు, ఎదిరించే శత్రువు మనస్సు తెలిసికొని యుద్ధం నడిపే భయాంకర ప్రతిభాశాలి అతడు. కాని అతన్ని ప్రతివిద్యలోనూ త్రోసి రాజనిపించ గల గండరగండడు గోన గన్నారెడ్డి అతని మహాసైన్య పురోగమనానికి ఆనకట్ట అయిపోయినాడు.

కొండలమీదనుంచి రాళ్లు దొర్లుకువచ్చి లోయలలోపోయే సైన్యాలు నాశనం అవుతూవుంటాయి. ఎంత నెమ్మదిగా నడచినా ఆశ్వికసైన్యాలుపైకి సాధారణ భూమివలె కనబడే సమతలముపై నడుచుచుండగా చటుక్కున గోతులలో పడిపోవుచుండెను. సెలయేరులలో నీరు తాగినవారు మత్తుచే పడిపోవుచుండిరి. నిర్జనంగా కనబడే చిట్టడవిని సమీపించే సైన్యాలమీద అఖండ బాణవర్షం కురిసి వేలకొలది సైనికులు ప్రాణరహితులై పడిపోవుచుండిరి.

గ్రామములలో జనంలేరు. పంటలులేవు. పశువులులేవు. పాలులేవు. గ్రామాలు మొండిగోడలతో, పళ్ళులేని చెట్లతో నిండివున్నాయి.

మహాదేవరాజుకు, అతని సేనానాయకులకు, మంత్రులకు ఈ విచిత్రయాత్ర అర్థమగుటలేదు.

మూడుసారులు గన్నారెడ్డి మహాదేవరాజు సైన్యాలకు వెనుకభాగములో వచ్చి తాకినాడు. సైన్యాలు నిలబడి యుద్ధం చేసేసరికి గన్నారెడ్డి సైన్యాలతో