పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1913 ఆగష్టులో అప్పుశాస్త్రియభ్యర్థమున నాయన సికింద్రాబాదునకు చేరెను. అక్కడ అనేకులు ఆయనవలన మంత్ర దీక్షలను పొందిరి. వారి మూలమున పెక్కుసభలలో ఉపన్యసించుచు ఆయన మహర్షియుపదేశమును ప్రసరింపజేసెను. తండ్రియొక్క సాంవత్సరికములకు ఆయన కలువఱాయికి పోయి, అక్కడ నుండి డిసెంబరు మూడవవారములో తిరువణ్ణామలై చేరెను. అక్కడ అరుణాచలశాస్త్రి అను పండితునితో రమణుని సమక్షమున 29-12-1913 తేది నాయన వాదించి ఆయన ప్రతి పాదనములను ఖండించి ఇట్లు ఉద్ఘాటించెను. "శాస్త్రీయమైన సత్యాసత్యముల చర్చయొక్కటియే ముక్తిని ఈయజాలదు. ముక్తికి ఉపాసనము ముఖ్యసాధనము. స్వరూపనిశ్చయమే నిజమైన జ్ఞానము. ఆత్మజ్ఞానమునకు సాధనమైన యోగము కోర్కెలను కూడ సాధింపగలదు. కోరిక కొఱకు యోగ మారంభించి మధ్యలో జ్ఞానసిద్ధిని పొందినచో మొదటి కోర్కె కూడ సిద్ధించును. కాని జ్ఞానికి దానియందు అపేక్ష యుండదు.

గురునియొద్ద ఇంచుమించుగా ఒక పక్షము దినము లుండి నాయన 1914 జనవరిలో సికింద్రాబాదునకు చేరి దానికి సమీపమున 'కర్కేళి' గ్రామమున నాలుగు మాసములు తపస్సు చేసెను. తరువాత అమ్మ యభిలాషను తీర్చుటకై నాయన ఉత్తరదేశ యాత్రలకు బయలు దేరెను. భువనేశ్వరము నందు అమ్మ నాలుగు నెలలు భువనేశ్వరీ మంత్రమును జపించి హస్తమున పాక మహిమను అక్షయత్వ సిద్ధిని పొందెను. అక్కడ నుండి నాయన తల్లి యొక్క అబ్దికము కొఱకు మందసాకు వచ్చెను. అప్పుడాశ్రాద్ధ