పుట:GanapathiMuniCharitraSamgraham.djvu/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(Offices) పనులు ముగిసిన తరువాత శిష్యు లందఱు నాయన యొద్దచేరి హోమము సల్పుచుండిరి. పిదప నాయన బోధించుటయో లేక పరస్పరముగా చర్చలో జరుగు చుండేడివి.

నాయన పరిచర్యల కొఱకు సింహాలు అను వ్యక్తి కలువఱాయి నుండి వచ్చెను. యోగ యుక్తమైన (నాయన శరీరమునకు పాల కంటె తియ్యని పండ్ల రసము ఆవశ్యకము. అప్పుడప్పుడు బత్తాయి నారింజ పండ్లను నాయనకు తెచ్చియిచ్చు చుండిరి. అవి పుల్లగా నుండునని కాబోలు నాయన వానిని ముట్టకుండెను. అందువలననే సింహాలు నాయనకు పండ్ల రసమే అక్కఱ లేదని తలంచెను. భోజనము నందు నాయనకు చిక్కని మజ్జిగ కూడ అమరకుండెను. క్రమముగా ఉష్ణ మధికమై భుజము క్రింద సెగ గడ్డవంటి యొక వ్రణము పైకి లేచెను. అప్పుడైనను అంత ఉష్ణము ఎందులకు కలిగెనని ఎవరును విచారింపకుండిరి. ఆ గడ్డ అణగిపోయిన తరువాత నాయనకు అతిమూత్ర వ్యాధి పైకివచ్చెను. "నే నిక్కడ మూడు మాసములు వుందును" అని నాయన ప్రసంగ వశమున సూర్యనారాయణతో చెప్పెను. ఆది నాయన శరీరమును వీడుటకు సూచన అని అప్పుడు ఎవ్వరికిని తోచలేదు. అట్లే నాయన సింహాలుతో ఒకనాడు 'నా దివ్య శరీరము సుఘటితమై, స్థూల బంధమునువీడి, నాకు వశమైయున్నది. సిద్ద పురుషస్థితి ప్రాప్యము కానున్నది' అని చెప్పెను.*[1] అదిఏదో యోగ రహస్య మనుకొని అతడు ఆ మాటను ఎవరికిని చెప్పలేదు.

  1. * నాయన పుట 719