పుట:DivyaDesaPrakasika.djvu/330

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరాశర భట్టర్

తిరునక్షత్ర తనియన్:-
   మాధవే మాస్యనూ రాధా జాతం భట్టార్య దేశికమ్‌
   గోవింద తాత పాదాబ్జ భృజ్గరాజ మహంభజే||
నిత్య తనియన్:-
   శ్రీ పరాశర భట్టార్య: శ్రీ రంగేశ పురోహిత:|
   శ్రీ వత్సాంక సుతశ్శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే||

వీరు కలియుగాది 4164 వ సంవత్సరం శుభకృత్ నామ సంవత్సర వృషభ మాసమున అనూరాధా నక్షత్రమున పరాశరాంశతో అవతరించిరి.

స్వామి యెంబెరుమానారుల తర్వాత సిద్ధాంత వ్యాప్తిని చేసిన మహనీయులు పరాశరభట్టరు. వీరు కూరత్తాళ్వానుల తిరుక్కుమారులు. శ్రీరంగనాథుని అనుగ్రహమున అవతరించి శ్రీరంగనాథులచే పుత్రులుగా స్వీకరింపబడినవారు. వీరి సోదరులు వ్యాసభట్టరు. వీరి ఆచార్యులు ఎంబారు. వీరు సకల శాస్త్రములను దివ్య ప్రబంధములను తదర్థములను సాంగో పాంగముగ అదిగమించిరి.

ఎంబెరుమానారుల చివరి కాలమున మైసూరు ప్రాంతమున మాధవాచార్యులను అద్వైత వేదాంతి ఉండేవారు. ఎంబెరుమానారుల ఆజ్ఞచే భట్టరు ఆ వేదాంతిని వాదమున జయించి సంప్రదాయ ప్రవర్తకులను చేసిరి. వారే నంజీయరు.

వీరు బహుగ్రంథ కర్తలు. దివ్య ప్రబందములయందు అనేక విశేషార్థముల ననుగ్రహించిరి. వానిని పెరియ వాచ్చాంపిళ్ళై తమ వ్యాఖ్యానములందు విశదీకరించిరి.

వీరనుగ్రహించిన గ్రంథములలో శ్రీ విష్ణుసహస్రనామ భాష్యమగు "భగవద్గుణ దర్పణము" ప్రదానమైనది. పరమవైరాగ్య సంపన్నులైన వీరి వైభవము గురుపరంపరాప్రబావాది గ్రంథములలో సేవింపవచ్చును.

తిరునక్షత్రం: వృషభం - అనూరాద
ఆచార్యులు: ఎంబార్
శిష్యులు: నంజీయర్ మొదలగువారు
అనుగ్రహించిన గ్రంథములు: 1. శ్రీగుణరత్నకోశము 2. శ్రీరంగరాజస్తవము 3. అష్టశ్లోకి 4. చతుశ్లోకి.

224